భలే బుల్లోడు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 8
- 4 min read
#BhaleBullodu, #భలేబుల్లోడు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Bhale Bullodu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 08/05/2025
భలే బుల్లోడు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కూలి పనులు చేసి బతికే రాములమ్మకు పెనిమిటి పాముకాటుతో చనిపోతే పదేళ్ల కొడుకు గోవిందుని టీ కొట్టు నర్సమ్మ దగ్గర వదిలి పనులకు పోతుంది.
గోవిందు టీ కొట్టు వద్ద ప్లేట్లు, టీ గ్లాసులు కడుగుతూ నర్సమ్మ పెట్టే టిఫిన్ తిని అక్కడే సాయంకాలం వరకు గడిపేవాడు. టిఫిన్ కొట్టు దగ్గర పని లేనప్పుడు రచ్చబండ
వద్ద తన తోటి పిల్లగాళ్లతో గోలీలాడుతుంటాడు.
ఒకరోజు గోలీలాడుతుంటే గోవిందు గోలీ, తుప్పల దగ్గరున్న రంధ్రంలో పడింది. దాన్ని పైకి తియ్యడం కోసం రంధ్రంలో చెయ్యి పెడితే ఏదో కుట్టింది. చెయ్యి మంటగా జరజర
లాడుతుంటే 'అమ్మో' అంటూ ఏడవడం మొదలెట్టాడు.
గోవిందు ఏడుపు విన్న నర్సమ్మ "ఏమైందిరా" అంటూ వచ్చి వాడి చెయ్యిని చూస్తే ఏదో విషపురుగు కుట్టిందని అనుమానం వచ్చి ఊరి వైద్యుడు ఆచారి గారి దగ్గరకు
తీసుకెళ్లి చూపెడితే, ఆయన గోవిందు చేతిని పరిక్షించి మండ్రతేలు కరిచిందని నిర్దారణ చేసి బియ్యం కడుగుతో చింతపిక్క అరగదీసి తేలు కుట్టిన చోట రాసి కొండపూతిక
చీపురుపుల్లతో పైకి కిందకు రాపిడి చేస్తే కొంత సమయానికి గోవిందుకి బాధ తగ్గింది.
అప్పటినుంచి గోవిందుకి తను కూడా ఆచారి డాక్టరుగారిలా వైద్యం నేర్చుకోవాలని కోరిక పుట్టింది. ఆ మాటే వాడు అమ్మ దగ్గరంటే "ఊరుకోర, బుల్లోడా! డాటరీ
మనబోటోళ్లకు రాదు. అది చదువుకున్న పెద్దోళ్లకే వత్తాది. ఒల్లకుండి నర్సమ్మ టీ బడ్డీలో పనులు చేసుకో" అని కసిరింది.
అప్పటినుంచి గోవిందు నర్సమ్మ టిఫిన్ దుకాణంలో పని చేస్తున్నాడే కాని మనసంతా ఆచారి గారి దగ్గర వైద్యం నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉండేది.
రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆచారి డాక్టరు గారు మూలికలు, పసరు ఆకుల కోసం వూరెళ్తూ
నర్సమ్మ టీ బడ్డీ దగ్గర ఆగేరు. అదే అదునుగా గోవిందు వినయంగా ఆచారి గారికి దండం పెట్టి
తన మనసులోని మాట చెప్పేడు. "సరేలే " నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆలోచిస్తానన్నారు.
కొద్ది రోజుల తర్వాత ఆచారి గారు రాములమ్మను పిలిచి గోవిందు ఉత్సాహం, తెలివిని మెచ్చుకుని తన దగ్గరకు పంపమన్నారు.
"బాబూ, కూలీనాలీ సేసుకుని బతికే మాబోటోళ్లకు ఈ ఇద్దెలెందుకు. కొద్ది రోజులు పోనాక ఆడిని కూడ నా ఎంట కూలిపనికి తోలుకు పోతా"నంది రాములమ్మ.
"చూడు, రాములమ్మా! అన్నిటికీ చదువే అక్కర లేదు. తెలివుండి కష్టపడితే కడుపుకి తిండి అదే పుడతాది. నీ కొడుకు చురుకైన కుర్రాడు. కష్టపడే తత్వం వాడిది. నా దగ్గరకు పంపు. వాడికి తిండి మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను" అని నచ్చచెబితే 'సరే' నంది రాములమ్మ.
అప్పటి నుంచి గోవిందు ఆచారి గారి ఇంటి దగ్గర తింటూ ఆయన చెప్పినట్టు మూలికలు నూరుతూ ఆకుల పసర్లు, కషాయాలు, గుళికలు తయారుచేస్తూ సహాయంగా
ఉంటున్నాడు.
అగ్రహారం గ్రామం అంతా నిరక్షరాస్యులు. కాయకష్టం చేసుకుని బతికేవారు. ఎంత పెద్ద రోగమైనా పట్నం వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేని నిరుపేదలు.
ఊళ్లో రంగాచారి గారు గుళ్లో పూజారిగా దైవసేవ చేసుకుంటూ తాతల నాటినుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యం ఉచితంగా చేస్తూ వస్తున్నారు.
వారసులు లేనందున తన తదనంతరం ఈ విద్య అంతరించిపోతుందని బాధ పడుతుంటారు.
గోవిందు శ్రద్ధగా రంగాచారి వైద్యులు చెప్పినట్టు చేస్తూ ఆయుర్వేదంలో అనుభవం సంపాదిస్తున్నాడు. సాధారణంగా పాము, తేలు, జెర్రి వంటి విష కీటకాల కాట్లతో పాటు సంధి జ్వరాలు, విరోచనాలు, వాంతులు, ఎముకలు విరగడం వంటి వాటికి వైద్యం చేస్తుంటారు ఆచారి గారు. ఆయనే ఊరికి వైద్యుడు. ప్రాణం పోసే దేవుడు.
ఇప్పుడు గోవిందు రంగాచారి గారి ఆధ్వర్యంలో ఊళ్లో వారికి ఆయుర్వేద వైద్యం చేస్తూ పెరిగి పెద్దవాడయాడు. ఒక్కొక్కప్పుడు ఆచారి గారు పని మీద ఎటైనా వెళితే
గోవిందే వైద్యం చేసే స్థాయికి ఎదిగాడు.
ఒకసారి రంగాచారి గారు బంధువుల ఇంట్లో చావు జరిగితే వేరే ఊరు వెళ్లవలసి వచ్చింది. అదే సమయంలో ఒక ముసలితాతకి రాత్రి నిద్రలో కిరోసిన్ దీపం బుడ్డి
మంచం మీద పడి ఒళ్లంతా కాలింది.
ఉదయం ఆ ముసలితాతను ఆచారి గారింటికి తీసుకువచ్చారు. గోవిందు ఒక్కడే ఉన్నాడు. తాతకి ఎలా వైద్యం చెయ్యాలా అని తర్జనభర్జన పడుతున్నాడు.ఇప్పటి వరకూ
ఇటువంటి శరీరం కాలిన రోగులు రాలేదు. తన సమయస్ఫూర్తిని ఉపయోగించాడు.
వెంటనే లేత అరిటాకులు తెప్పించి తడపల మంచం మీద ఎండుగడ్డి పరిచి తాతను దాని మీద పడుకోపెట్టించాడు. ఈగలు, ముసరకుండా మంచం చుట్టూ చేపల వల ఏర్పాటు
చేసాడు. దేవుడి గుడిలో ఉండే ముద్ద కర్పూరం నూరించి కొబ్బరి నూనెలో కలిపి దూదితో ఒళ్లంతా పూయించాడు.
అలాగే పెరుగు వెన్న తీయించి సమయానుకూలంగా ఒంటికి రాస్తూ లేత అరటిఆకులు మారుస్తూ నోటి ద్వారా సూపులు, కొబ్బరి నీళ్లు తాగించడం మొదలెట్టాడు. ఇన్ఫెక్షన్ సోకకుండా
నోటికి చేతి రుమాలు చుట్టుకుని వైద్యం చేసాడు.
ఊరి నుంచి తిరిగి వచ్చిన రంగాచారి గారు విషయం తెల్సి గోవిందు సమయస్ఫూర్తి వైద్యానికి ఆశ్చర్యపోయారు. తన తర్వాత ఊరికి గోవిందు ఆయుర్వేద వైద్యం అందించ గలడని నమ్మకం ఏర్పడింది. తనకి తెల్సిన అన్ని ఆయుర్వేద వైద్య విద్యలు నేర్పేరు.
కొద్ది రోజుల తర్వాత ఆప్రాంత యం.ఎల్.ఎ గారు ఏదో కార్యక్రమం నిమిత్తం అగ్రహారం గ్రామం రావల్సి వచ్చింది. కార్యక్రమం అయిన తర్వాత మూత్ర విసర్జన కోసం పక్కన తుప్పల వైపు వెళ్లేరు.
అక్కడ ఆయన కాలి మీద పాము కాటేసింది. ఆయన సిబ్బంది వెంటనే రంగాచారి గారి వద్దకు తీసుకువచ్చారు. రంగాచారి పాము కాటును పరిక్షించి ఇది కట్లపాము
కాటని నిర్ధారణ చేసారు.
కట్లపాము కుడితే మనిషి వెంటనే చనిపోరు కాని దాని విషప్రభావంతో కుట్టిన భాగం నుంచి శరీరం కుళ్లుతుందని చెప్పేరు.
వెంటనే స్పందించిన గోవిందు పాము కరిచిన భాగాన్ని పసుపుతో రుద్ది శుభ్రం చేసి సర్పగంధ మూలిక గంధం తీసి పైపూతగా వేసాడు. లేత కొబ్బరి నీటిలో పచ్చి
అరటికాయ రసం కలిపి తాగించాడు.
ఇదంతా చూసిన రంగాచారి గారు అబ్బురపడ్డారు. పట్నం చేరిన యం.యల్.ఎ గారు అక్కడ పెద్ద హాస్పిటల్లో పాము కాటుకు ఇంగ్లీష్ వైద్యం చేయించుకోగా ఆయన కోలుకున్నారు.
పాము కాటుకు వెంటనే మూలికా వైద్యం అందించినందున పాము విష ప్రభావం తగ్గి ప్రాణాపాయం తప్పినందుకు సంతోషించి యం.యల్.ఎ గారు గ్రామంలో ఆయుర్వేద
హాస్పిటల్ కి కావల్సిన ఏర్పాట్లు కలిగించి నిస్వార్థంగా ఊరి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న రంగాచారి గారి పేరు పెట్టేరు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
స్ఫూర్తి దాయకమైన కథ. ఆసక్తివల్ల ఆలోచన, ఆలోచన వల్ల సమయస్ఫూర్తి సిద్ధిస్తాయి. ఇదే విజ్ఞాన సము పార్జనకుదారి. రచయితకు అభినందనలు