top of page

దైవ శక్తి

#DaivaSakthi , #దైవశక్తి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Daiva Sakthi - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 02/05/2025

దైవ శక్తి - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


 ఎవరూ లేని అనాథ అని సుబ్బమ్మ పసి బాలుడిని తీసుకు వచ్చి 'సత్తిబాబు ' అని పేరు పెట్టి పెంచసాగింది.


సత్తిబాబు లోకజ్ఞానం లేకుండా అమాయకంగా పెరుగగుతూ ఎవరేది చెబితే అదే నిజమని నమ్మేస్తుంటాడు. అందువల్ల తోటి పిల్లలు ఏవో అబద్దాలు చెప్పి వాడి అమాయకత్వంతో

ఆటలాడుతుంటారు. ఆకాశంలో మబ్బుల్ని చూపించి దేవుడు అన్నం వండుతుంటే పొగలు వస్తున్నాయని నమ్మించేవారు.


వాడి అవ్వ కూడా కట్టెల మీద బువ్వ వండుతుంటే అలాంటి పొగే రావడం చూసి, ఐతే దేవుడు కూడా ఆకాశం మీద బువ్వ చేసుకుంటున్నాడు కాబోలని మనసులో అనుకునేవాడు.


వయసు వచ్చినా లోకజ్ఞానం లేకుండా ఉన్న అమాయకుడైన సత్తిబాబును చూసి ‘వీడు తను లేకపోతే ఎలా బతుకు తాడో’నని బెంగ పడుతుంటుంది.


ఒకరోజు వాళ్ల గుడిసె ముందు ముసలి కుక్క పడుకుంటే దాని వంకర తోక చూసి పాము కరిస్తే అలా తోక వంకర పోతుందని వాడి మిత్రులు అనడం విని కర్రతో దాని తోక

మీద కొట్టడం చేస్తున్నాడు. ఆ ముసలి కుక్క పరుగెత్త లేక బాధతో మొరగడం మొదలు పెట్టింది. 


దాని అరుపులు విన్న సుబ్బమ్మ బయటకు వచ్చి ఎందుకు దాని తోక మీద కర్రతో బాదుతున్నావంటే, పామును చంపుతున్నానని అమాయకంగా జవాబు చెప్పాడు. వాడి భోళాతనానికి బాధ పడసాగింది.


ఒకసారి రాత్రి ఏదో చిల్లర పని చేసాడని సుబ్బమ్మ కట్టెతో కొట్టబోతే గుడిసె నుంచి బయటకు పరుగుతీసాడు సత్తిబాబు.


అప్పటికే బాగా చీకటి పడింది. గుడిసె కెల్తే ముసల్ది కొడుతుందని తిన్నగా ఊరిలోని ఆంజనేయ స్వామి గుడికి చేరుకున్నాడు. రాత్రయినందున గుడిలో దీపం పెట్టి తలుపులేసిపోయారు అయ్యవారు.


బాగా ఆకలి వేస్తోంది.తినడానికి ఏమైనా ఉంటుందేమోనని హనుమాన్ విగ్రహం దగ్గర కెళ్లి చూస్తే అరటి పళ్లు, కొబ్బరి చిప్ప కనిపించాయి. తిందామని ముందుకెళ్లి, స్వామి ఇంకా పళ్లు తినలేదని తలిచి అక్కడ ఉన్నవాటిలో సగం సగం చేసి తను కొంత తిన్నాడు.


ఈ తతంగమంతా ఆంజనేయ స్వామి చూస్తున్నాడు. 'ఇంత నిజాయితీ పరులు ఇంకా మనుషుల్లో ఉన్నారా? అని ఆశ్చర్య పోయాడు. దేవుడి పేరు చెప్పి డబ్బులు

దోచుకునే వారే కాని దేవుడి ఆకలి పట్టించుకునే వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నా ' అనుకున్నాడు.


అక్కడ ముసలి సుబ్బమ్మ, సత్తిబాబు గుడిసెకి తిరిగి రాకపోయేసరికి ఈ వెర్రి బాగులోడు ఎటుపోయాడని దిగులు పడుతు చుట్టు పట్ల ఎవరిని అడిగినా ఏడ పోయాడో మేము చూడలేదని చెప్పేరు.చీకట్లో వెతికి వెతికి ఉదయం వాడే వస్తాడని మనసు కుదుట

పర్చుకుంది.


ఇక్కడ ఆంజనేయస్వామి గుడిలో సగం ప్రసాదంతో కడుపు నింపుకున్న సత్తిబాబు అక్కడే అరుగు మీద కునుకు తీసాడు. కాసేపు తర్వాత తొంగి చూస్తే స్వామి

దగ్గర మిగిల్చిన ప్రసాదం అలాగే వుంది.


"ఓహో, హనుమానులోరికి గుడి సాములు తినిపిస్తారు కాబోలనుకుని, ఈ సారి నేను నా చేత్తో పెడతానని అరటి పండు తొక్క తీసి స్వామి నోటికి అందించాడు.

ఆంజనేయస్వామి ఆశ్చర్య పోయారు.ఇతడెవరో అమాయకుడిలా ఉన్నాడనుకుని నోరు తెరిచి అరటిపండు తినసాగారు. అలా ఒకటి ఒకటీ మొత్తం ఫలాహారం చేయించాడు సత్తిబాబు.


హమ్మయ్య, ఇంక నిమ్మళంగా పడుకోవచ్చని తలిచి అరుగు మీద కునుకు తీసాడు. నిద్ర రావడం లేదు. గుడిసెలో అవ్వ నేను లేకపోతే ఎట్టా ఉంటాదో ఏటో

అని ఆలోచనలతో దొర్లుతున్నాడు.


కొద్ది సేపటి తర్వాత ఇద్దరు దొంగలు గుడి వెనక వైపు నుంచి గోడ దూకి లోపలికి వచ్చారు. అప్పటికి ప్రమిదలో నూని లేక దీపం ఆరిపోయింది. అంతా మసకగా ఉంది.

దొంగలు స్వామి వారి హుండీ పగల గొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ చప్పుడికి లేచిన సత్తిబాబు

ఎవుర్రా, మీరని వారిని అడ్డుకోబోయాడు. దొంగలు వారి వద్ద ఉన్న ఇనుప గడ్డతో సత్తిబాబు నెత్తి మీద కొట్టి పారిపోయారు.


సత్తిబాబు తల పగిలి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ దృశ్యం చూసిన ఆంజనేయ స్వామి గబుక్కున వచ్చి అచేతనంగా ఉన్న సత్తిబాబు తలను తన తొడ మీద ఉంచి నిమర సాగేరు. తన నొసటి సింధూరం తిలకం పెట్టేరు. కొంతసేపటికి రక్తస్రావం ఆగిపోయింది. అలాగే స్వామి తొడ మీద తల ఉంచి నిద్రపోయాడు.


తెల్లవారింది.ఆంజనేయ స్వామి సత్తిబాబును అలాగే కింద పడుకోబెట్టి తన స్థానానికి వెళిపోయాడు.


స్వాములు రోజు మాదిరి ఫల పూజా ద్రవ్యాలతో గుడికి వచ్చి చూస్తే స్వామి వారి హుండీ పగల

గొట్ట పడింది కాని అందులో ద్రవ్యం అలాగే వుంది. కొద్ది దూరంలో సత్తిబాబు గాఢ నిద్ర లో పడుకొని ఉన్నాడు. తల దగ్గర నేల మీద రక్తం గడ్డ కట్టి ఉంది.


స్వాములు సత్తిబాబును తట్టి లేపి కూర్చో బెట్టారు. నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావని నిలదీసారు.


సత్తిబాబు రాత్రి అవ్వతో జరిగిన వివాదం చెప్పి అలిగి గుడికి రాగా, అక్కడ జరిగిన సంగతంతా

వివరంగా చెప్పాడు.


"ఏమిటీ, ఆంజనేయస్వామి నీ చేత ఫలహారం తిన్నారా?" అంటూ స్వామి విగ్రహం వైపు చూస్తే నిజంగానే నోటి దగ్గర, వారి ఉత్తరీయం మీద మరకల గుర్తులు కనిపించాయి.


'ఇన్ని సంవత్సరాల నుంచి మేము స్వామికి పూజలు, హారతులు ఇస్తున్నాం కాని స్వామి నిజ దర్శనానికి నోచుకోలేక పోయామని' వాపోయారు.


ఇంతలో సత్తిబాబు ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్నాడని తెలిసి పరుగున వచ్చిన సుబ్బమ్మకు సాములోరి ద్వారా జరిగిన విషయం తెల్సి విస్మయమైంది.


"నా సత్తిబాబుకు హనుమాను స్వామి కనబడ్డరా" అని ఛాతీకి హత్తుకుంది.


 ఆంజనేయస్వామి దైవ బలంతో ఒక్క రాత్రిలో సత్తిబాబులో అనేక అద్భుత శక్తులు వచ్చాయి. సత్తిబాబు నడవడిక మాటతీరు మారిపోయాయి. వెర్రి వెంగళాయిగా అందరిలో హేళనకు గురయే సత్తిబాబు 'సత్యబాబాగా' మారి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. 


గెడ్డాలు మీసాలు తల శిఖపాయతో కాషాయ వస్త్రాలతో నుదుటున సింధూరంతో 'జై శ్రీరామ్" అంటూ హనుమాన్ చాలీసా, రామ భజనలతో దైవాంశ సంభూతుడిగా మొహంలో

తేజస్సుతో ఆధ్యాత్మికవేత్తగా మారిపోయాడు.


ఆంజనేయస్వామి గుడినే తన నివాసంగా మార్చాడు. ఊళ్లో అందరూ వినయవిధేయతలతో గౌరవం చూబెడుతున్నారు.


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page