తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 26
- Pandranki Subramani
- May 1
- 9 min read
Updated: May 8
#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 26 - New Telugu Web Series
Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 01/05/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 26 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇండియా వచ్చిన నరసింహ మూర్తికి శంకరం గురించి తెలుస్తుంది. మాధవి, శంకరాల వివాహం జరుగుతుంది.
నరసింహమూర్తి చేసే కాల్స్ కి రెస్పాండ్ కాదు సుజాత. అమెరికా వెళ్లిన నరసింహ మూర్తిని సుజాత కాంప్ ఫైర్ కు తీసుకొని వెళ్తుంది. అక్కడ తన కోపానికి కారణం చెబుతుంది. ట్రైనింగ్ సమయంలో నరసింహ మూర్తిని అతని ట్రైనీ మేట్స్ అయిన ఇద్దరు విదేశీ యువతులు ముద్దు పెట్టుకుంటారు. ఆ విషయంగా అతన్ని నిలదీస్తుంది సుజాత.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 26 చదవండి..
ఆమె మళ్ళీ చెప్పసాగింది- “చచ్చి స్వర్గాన ఉన్న మా బామ్మ అంటుండేది- మగాళ్ళపైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోకని- పెట్టుకుని నిరాశకు లోనుకాకని. మనసార- కడుపార ఎంత ఆప్యాయంగా వడ్డించు— వాళ్లు మరొక గిన్నె వేపు చూస్తారని. కాని నాకున్న బాధల్లా ఒకటే— ఇంతలోనే అంతవేగిరి పాటా! భూషణంగారింటి అబ్బాయికి ఇది తగునా! అందరిలా అతడు కూడా మామూలు మనిషేనా! ”
అతడు మాట్లాడలేదు. లేచి నిల్చున్నాడు; ఊపిరి దీర్ఘంగా తీసుకుని వదుల్తూ. “నాకు గుర్తున్నంత మేర నా జీవితంలో నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు. అబద్ధం ఎందుకు ఆడతారు? ఎప్పుడారతారు? ఎదుటి వారిని మభ్య పెట్టడానికి. ఆ అవసరం నాకు కలగలేదు. అందులో నేను హృదయ పూర్వకంగా ప్రేమించిన అమ్మాయితో నేనెందుకు అబద్ధం ఆడతాను? పరిస్థితులను బట్టి వశం తప్పి ఆలా ప్రవర్తించి ఉండవచ్చు. ఇంత సేపూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఒక వాస్తవాన్ని గుర్తించడానికి నువ్వు ప్రయత్నించనే లేదు- నిప్పు ప్రక్కన దూదిపింజెను ఉంచకూడదన్నది; అలా దూదిపింజెను ఉంచిన వాళ్ళదే తప్పని.
ఇక పోతే అసలు వాస్తవం యేమంటే— పుత్తడి బొమ్మలా నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి మంగళకరంగా కళ్ళ ముందు ఉండగా— నేనెందుకు మరొక భామామణి కోసం వెంపర్లాడుతాను? నిజానికి చెప్పాలంటే- ఆ యిద్దరు తెల్ల అమ్మాయిలూ మంచి వాళ్ళే- కామ తృష్ణతో బరితెగించే వాళ్లలా నాకు కనిపించలేదు. త్వరగా ఆవేశానికి లోనయే వాళ్లలా ఉన్నారు. అంతే! బట్— ఇక్కడి ఆచారాలు అలవాట్లు ఆనవాయితీల గురించి నాకంతగా తెలియదు.
యురోపియన్లు లాటిన్ అమెరికన్లు స్త్రీ పురుష సంబంధాల విషయంలో అక్కడి వాళ్ళలా కాకుండా కాస్తంత ఓపెన్ గా ఉంటారని విన్నాను కాని- ఒక భారతీయుడి పట్ల అంతటి వ్యామోహానికి లోనవు తారని నేననుకోలేదు. అందునా కొన్నాళ్ళ పరిచయంలోనే ఒక మగాడి పట్ల ఇంతటి మానసికోద్రేకానికి లోనవడమా! నిజంగా నేనలా అవుతుందని అనుకోలేదు. ఇక వాస్తవం చెప్పాలంటే- బిందువంతటి పదంలో సింధువంతట వాస్తవం అన్నట్టు- పాల పొంగువంటి క్యాథరిన్ లిమండ్ నాన్సీల చేరువ నుండి దూరంగా తొలగి ఉండలేక పోయాను.
ఒకసారి కాదు- రెండు సార్లు వాళ్ళతో అలా జరిగింది. నాకు వశం తప్పి- అలా వాళ్లముందు చతికిల బడటానికి మరొక కారణమూ ఉంది. నాకు స్త్రీల శరీరాల నుండి వచ్చే వింతైన సువాసల హోరు నన్నింత వరకూ తాకలేదు.. ఇక నా వ్యక్తిగత వ్యవహారాలపైన వ్యాఖ్యానం చేసావు గనుక- ఐ షుడ్ బి గివన్ ది రైట్ టూ డిఫెండ్ మైసెల్ఫ్. నువ్వు నమ్మూ నమ్మకపో— నాకంటూ కొన్ని విలువలున్నాయి.
మా కుటుంబానికీ కొన్ని సత్సాంప్రదాయాలున్నాయి. వాటిలో ఒకటి- పసుపుతాడు ఓ ఆడదాని మెడన కట్టకుండా చెంత చేరే సాహసం చేయకూడదన్నది. కాగా- ఇంతవరకూ విషయం వచ్చింది కాబట్టి నువ్వు అడిగినా అడక్కపోయినా నాకు నేనుగా మరొక విషయాన్ని తేల్చి చెప్పాలి. నాకు అవకాశం దొరికింది కదానని వాళ్లతో పడక పంచుకోలేదు”
ఈసారి సుజాత కలుగ చేసుకుంది- “ఇంత వరకూ విషయాన్ని రానిచ్చి అప్పుడంతటి నిగ్రహం చూపించడం ఎందుకో! ”
“కారణం ఉంది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముఖం నా కళ్లముందు మెదిలింది. ఇక విషయాన్నిమరీ సాగదీతకు లోను కానివ్వకుండా నీదగ్గరకే వస్తాను. నీ నమ్మకాన్ని కోల్పోయాను. ఇక నేనేమి చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. ఇంత వరకూ వచ్చింతర్వాత నీ చెలిమి కోసం ఆరాటపడటమూ సముచితం కానేరదు. కాబట్టి—” అంటూ అక్కడతడు చట్టున ఆగిపోయాడు.
“కాబట్టి --” సుజాత అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ రెట్టించిందా మాటను.
“నన్ను మీ యింట్లో దిగబెట్టేయి. మీ అమ్మానాన్నలకు క్షమాపణలు చెప్పుకుని ఇండియా వెళ్ళిపోతాను- మా ఇంట్లో వాళ్ళు ఇక్కడకు ప్రయాణమవకముందే--”
అంతులేని హృదయవేదనతో ఆ మాటలన్నాడేమో— నరసింహమూర్తికి తెలియకుండానే కళ్ళనిండా కన్నీరు ఉబికింది.
సుజాత లోని సున్నితమైన మనసు ద్రవించింది. ప్రేమకు కారణాలతోనో ఆధారాలతోనో నిమిత్తం ఉండదు. అన్నిటికీ అతీ తంగా గంగాప్రవాహంలా ప్రవహిస్తూ సాగిపోతుంది. ఆమె మౌనంగా లేచి అతణ్ణి సమీపించి తన చేతి గుడ్డతో అతడి కళ్లు తుడిచింది. అప్పుడు ఇద్దరి మనసులూ ఆర్ద్రతతో దగ్గరకు చేరాయి. అప్పుడేమో పసందైన పరిచయాలు-- ఇప్పుడేమో- కన్నీటి చుక్కలూ పెనవేసుకుని వాళ్ళను దగ్గరకు చేర్చాయి.
“ఇటు చూడండి. ఈ రోజు నేనెందుకు ఇంతగా డేషింగ్ గా టెంప్టింగ్గా తయారయి వచ్చానో తెలుసా?”
అతడు తలతిప్పి ఆమె కళ్ళలోకి చూసాడు అయోమయంగా.
“మీరు వేగిరపాటులో ఉన్నారేమోనని, నాకు దూరమయి పోతారేమోనని నన్ను నేను మీకర్పించుకోవడానికి ఇలా మోడ్రన్ గా ఒంపు సొంపులు వెల్లి విరిసేలా తయారయి వచ్చాను. రేపటి మాట తరవాత చూద్దాం. నన్ను అందుకోండి”
అతడు తల అడ్డంగా ఆడించాడు. “నిన్నాదృష్టితో నేనెప్పుడూ చూడలేదు. నిన్ను కాబోయే జీవన చరిగా- నాకు కాబోయే బిడ్డల తల్లిగానే చూసాను. ఇప్పుడు నన్నేమి చేయమంటావు?”
“భళేవారే! మిమ్మల్ని కాదనడానికైతే మీకోసం ఇంత ఇదిగా ఎందుకు తాపత్రయపడతాను? ఇంత దూరం ఎందుకు మిమ్మల్ని తీసుకొస్తానూ! నిజంగా నాకు మన అనుబంధం వద్దనుకుంటే నాకామాట చెప్పడానికి ఫోన్ కాల్ ఒక్కటి చాలదూ! ప్రేమ హృదయానికి లాజిక్ గా తర్కించడం తెలియదండీ. దానికి చిన్నపిల్లలా మారాం చేయడమే వచ్చు. మౌనంగా రోదించడమే వచ్చు”
ఆ ఒక్కమాటకూ అతడు తీవ్రమై ఉద్నిగ్నతకు లోనయాడు. అనంతమైన బాధతో మెలికలు తిరిగాడు. ఎటువంటి స్త్రీని తను బాధ పెట్టేసాడు!
ఆమెను ఎదురుగా కూర్చుండబెట్టి తనకు తాను దేవీ ఉపాసకుడిలా మారి మోకాళ్లపైన వంగాడు- “నిన్ను బాధ పెట్టినందుకు నన్నుక్షమించు సుజాతా! ” అంటూ ఆమె రెండుపాదాలనూ పెదవులతో స్పృశించాడు.
ఆ ఒక్క చర్యలోనూ ఆమెకు ఉన్నతమైన పరిపూర్ణమైన మగటిమి కనిపించింది. ఉదాత్తమైన హృదయరాగం వినిపించింది. ఆమె క్రిందకు వంగి అతణ్ణి రెండుచేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది.
ఆశ్చర్యం! అంత వరకూ ఆక్రోశం చూపించిన సుజాత ఇప్పుడు ఏక ధారగా కన్నీరు కారుస్తూంది. దు:ఖం కలిగినా సంతోషం కలిగినా స్త్రికి కన్నీరు పొంగడం ఆకాశం చిమ్మినంత సహజ గుణమేనేమో!
------------------------------------------------------------------------------------
అనుకున్న ప్రకారం శ్రీరామ్ దంపతులు క్యారీ సిటీ ఆవల నున్న వేంకటేశ్వరాలయ ప్రధాన అర్చక స్వాములవారి ఆదేశానుసారం నిశ్చితార్థానికి ముందు ఇంట్లో సత్యన్నారాయణ వ్రతం జరిపించారు. అదే ఊపున కూతురు చేత చాముండీశ్వరీ నోము కూడా చేపించారు. పిమ్మట సర్పదోష నివారణ, సర్వదోష నివారణ కార్యక్రమం సంపూర్ణంగా ముగించారు.
-------------------------------------------
నిశ్చితార్థ కార్యానికి ఇండియా నుండి భూషణం దంపతులు డాక్టర్ నరసింహులు దంపతులూ కొత్త వధూవరులైన శంకరం మాధవీ క్యారీ సిటీ చేరారు. అదే రోజు కాబోయే వియ్యంకుల కోసం శ్రీరామ్ విందు భోజనం ఏర్పాటు చేసాడు.
నిశ్చితార్థం కార్యానికి నరసింహమూర్తి మరచిపోకుండా రాజమండ్రి పూర్వీకులకు చెందిన ముంతల సూర్య క్రిస్టోఫర్ కుటుంబాన్ని-ట్రైనింగ్ ప్రోగ్రాము ఇన్ చార్జి రస్సెల్ గిల్ బర్ట్ కుటుంబాన్ని ఎయిర్ బస్ లో పరిచయమైన లేడీ గ్రేసీ వాళ్ల కుటుంబాన్నీ విందు భోజనానికి ఆహ్వానించాడు.
అంతా సవ్యంగా జరిగింది. శ్రీరామ్ కుటుంబమంతా దగ్గరుండి చూసుకున్నారు;వాళ్ళ కంపెనీ సిబ్బంది తోడ్పాటుతో.
మరునాడు సుజాతా వాళ్ల విశాలమైన పెరడు తోటనూ రకరకాల పళ్లవృక్షాలనూ చూసివచ్చిన వర్థనమ్మ దంపతులకూ కూతురు మాధవికీ నమ్మలేని ఆశ్చర్యం ఎదురైంది. సుగాత్రమ్మ అత్తగారైన దివంగత రఁవణమ్మగారి చిత్రపటాన్ని చూపిస్తున్న ప్పుడు అక్కడికి ఎడంగా కుడివేపున డాక్టర్ నరసింహులుగారి చిత్ర పటమూ వ్రేలాడుతుండటం చూసి అవాక్కయారు వాళ్ళు- అప్పుడు శ్రీలక్ష్మణ్ కలుగచేసుకుని ఆనాడు రాజమండ్రి ఆస్పత్రిలో తమ తల్లికి ఎదురైన ఇక్కట్ల గురించి సర్జన్ గా పని చేస్తూన్న నరసింహులు చేసిన సహాయం గురించీ వివరించి- గతకాల జ్ఞాపకాల వీచికలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయాడు. ఆ దృష్యానికి ఉద్విగ్నుడయిన నరసింహలు శ్రీలక్ష్మణ్ ని కౌగలించుకున్నాడు.
“సుమారు మూడు దశాబ్లాల క్రితం జరిగినది. నన్నిప్పటికీ మరచి పోకుండా ఉన్నారెంటే మీది ఎంతటి ఉదాత్త గుణం! ”
ఆయన చెప్పింది నిజమే మరి. ఏదైనా దొరు కుతుంది- ఎంతైనా దొరుకుతుంది- కాని ఈ రోజుల్లో కృతజ్ఞతా భావం యెక్కడుంటుందని-- ఆ లోపల అక్కడకు చేరిన భూషణంగారు తమ్ముడి భుజాన్ని చరిచాడు. “నువ్వు గ్రేట్ రా తమ్ముడూ! మన అమ్మానాన్నలు గాని బ్రతికుంటే నిన్నీపాటికి ఆకాశానికి ఎత్తేసేవారనుకో”
వదిన మంచాలమ్మ మరది దగ్గరకు వచ్చి అతడి ముఖాన్ని దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది. “మన వంశ ప్రతిష్ఠను దూర తీరాల తావున ఇనుమడింప చేసావు మరదీ! ” అంటూ.
అప్పుడు అదను చూసి మోహన చెణకు విసురుతూ అక్కయ్య చెవుల్లో గుసగులాడింది- “గొప్ప మామగారింటికి కోడలు పిల్లగా వెళ్లబోతున్నావు. బుధ్ధిగా మెసలుకో. పెద్దమ్మకూ మాకూ ఇబ్బందులు తేబోకు. సరేనా! ”
అందర్నీ ఊరంతా తిప్పుకు వచ్చిన మూడవ రోజు పెళ్లి ముహూర్తం గురించి చర్చించి వచ్చేనెల శుభముహూర్తం ఉంద ని తిరుపతిలో పెళ్ళ జరిపించాలని తీర్మానించారు. అందరూ ఆ తీర్మానానికి ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఏడవరోజు శ్రీరామ్ దంపతులు- ఎంతవద్దన్నా వినిపించుకోకుండా ఇండియానుండి వచ్చినవారందరికీ కానుకలు అందించారు; ముఖ్యంగా నూతన వధూవరులు శంకరానికీ మాధవికీ ప్రత్యేకంగా కొత్త బట్టలూ ఇంటికి కావలసిన ఎలక్ట్రోనిక్ సామగ్రీ ఇచ్చారు.
మరుసటి రోజు నరసింహమూర్తితో బాటు అందరూ ఇండియాకి ప్రయాణమయ్యారు; మళ్లీ తిరుపతిలో అందరూ ఒక్కటవుదామని చెప్పుకుంటూ-- కొంటె కోణంగి మోహన మాత్రం నరసింహమూర్తిని వదలకుండా ప్రక్కకు తీసుకెళ్లి చెవిలో గిలిగింతలు పెట్టింది- “మరీ దిగులు పడిపోతూ మా అక్కయ్యను అంతలా కళ్ళు పెద్దవి చేసుకుని చూడకు రాజమండ్రి బావా! తమను చూస్తుంటే దానిని ఇప్పటికిప్పుడే మీ ఇంటికి తీసుకెళ్లిపోయేటట్టున్నావు. కొంచెం ఆగండి మరి! ”
“మీ అక్కయ్య సంగతీ నా సంగతీ తరవాత చూద్దువు గాని- పెళ్లికి మూడు రోజులు ముందే వచ్చేయి. లేక పోతే నీ పెళ్లికి మేము రాము తెలుసు కదూ! ”
అలాగాలే- అన్నట్టు తలూపి బావగారికి దారిచ్చింది కారు వేపు సాగనంపుతూ.
------------------------------------------------------------------------------
పరిస్థితులు అనుకున్నట్టు అనుకూలంగా జరగవన్నట్టు నరసింహమూర్తి అందర్నీ పెళ్లి ముహూర్తానికి మూడు రోజలు ముందే తిరుపతి చేరుకొమ్మని పురమాయించేడే గాని- అతడు మాత్రం కొండ చేరుకోలేదు. పులిమీద పుట్రలా హెడ్ ఆఫ్ దిడిపా ర్టుమెంటు ఇన్స్పెక్షనూ- విజిలిన్స్ ప్రివెంటివ్ ఇన్సెక్షన్నూ ఒకేసారి ఢీకొన్నాయి- ఒకటి మీద మరొకటిగా-- ఆ కారణాన అతడు ఆఫీసునుంచి కదల్లేక పోయాడు.
ఆ లోపల అతడి పేరు తదుపరి ప్రమాషన్ లిస్టులో ఉందన్న వార్త కూడా గుప్పుమంది. పై అధికారులెవరూ అతణ్ణి మూడు రోజుల ముందు వెళ్ళకని అడ్డు చెప్పకపోయినా తనే అక్కడుండి ఇన్స్పెక్షన్ టీములు రెండూ డబు ల్ బారెల్ గన్నులా లేవదీసిన క్వరీలన్నిటినీ క్లియర్ చేస్తూ ఉండిపోయాడు. అంతేకాక- రాత్రికి రాత్రి కొన్ని అర్జంట్ ఫైల్సుని ఇంటికి తీసుకు వచ్చి అప్ డేట్ చేసి ఇచ్చాడు.
అతడు వాళ్ళు లేవదీసిన క్వరీలను అలా సెన్సిటివ్ కా తీసుకోవడానికి కచ్చితమైన కారణాలు లేకపోలేదు. లేవదీయబడ్డ విజిలెన్స్ క్వరీల గురంచి— ప్రస్తావించబడ్డ ఆడిట్ అబ్జర్వేషన్ ల గురించి ఇక్కడికిక్కడ ఇన్స్పెక్షన్ టీము వాళ్లతో చర్చిస్తే నిగ్గు తేలిస్తే రెండు సానుకూలమైనవి జరగడానికి అవకాశం ఉంది. మొదటిది- కొన్నిఆక్షేపనీయ అంశాలను వాళ్ళు అక్కడికక్కడే తీసివేసే సానుకూలత ఉంది. లేదా- కనీసం లేవదీసిన క్వరీలలోని సీరియస్ ని తగ్గించగలిగే అవకాశమూ ఉంది.
అంతే కాదు- కార్యాలయంలో ఐతే- అటువంటి వాటిని నిదానంగా తీసివేసేందకు సావకాశమూ మెండుగా ఉంటుంది; అందుబాటులో ఉన్న దస్త్రాల రిఫెరెన్సుతో. -- కాని ఒకసారి క్వరీలు ఇన్స్పెక్షన్ రిపోర్టులో పేరాలుగా ముద్రితమై కేంద్ర సచివాల యానికి వెళ్తే— అటు తరవాత దానిని డ్రాప్ చేయించడం భగీరథునికి సహితం సాధ్యం కాకపోవచ్చు.
అంతెందుకు- కొన్ని క్వరీలు సంవత్సరాల తరబడి వెంటాడవచ్చు కూడాను. ఇవి ఎంతటి తీవ్రంగా బురద జలగల్లా తగులుకుంటాయంటే- కొన్నిటిని డ్రాప్ చేయించలే కుండా ఉద్యోగ విరమణ దశకు చేరుకున్న కొందరు సీనియర్ ఆఫీసర్లు, రిటైర్మెంటు రోజున వాళ్ళకు చేరవలసిన గ్రాడ్యుటీ చేర కుండానే దు:ఖ భాజితులై పరాజితుల్లా క్రుంగిన భుజాలతో గృహాభిముఖలై వెళ్ళవలసిన సందర్భాలు కూడా పెక్కు ఉన్నాయి.
ఐతే— అంతటి పనిరద్దీలోనూ సమీక్షా సమావేశాలలోనూ తలమునకలవుతూనే అతడు తన స్వకార్యం మాత్రం మరచి పోలేదు. తన ప్రియ సఖి సుజాత కంగారు పడకుండా ఉండటానికి అతడు వీలు చిక్కినప్పుడల్లా ఫోను చేస్తూనే ఉన్నాడు;పెళ్ళి ముహూర్తానికి ముందే సరైన సమయానికి రావడం ఖాయమన్న భరోసా ఇస్తూ.
ఆమె ఒకసారి ఒక్కటి మాత్రం అడిగింది- “మీ పై అధికారులందరికీ మన వివాహ ఆహ్వాన పత్రిక ముందే ఇచ్చారు కదా! మరి ఇది తెలిసి కూడా మిమ్మల్నెందుకు డిటైన్ చేస్తున్నారు?”
“నిజం చెప్పేదా ప్రియ బాంధవీ?”
ఉఁ-అందామె.
“నన్నెవరూ ఉండమనలేదు. నాకు నేనుగా నాకోసం నేనుగా ఉంటున్నాను. అవి ముఖ్య కార్యాలయ వ్యవహారాలు. కొన్ని పైకి చెప్పలేని రాచకార్యాలు. అవన్నీ తరవాత చెప్తాలే--”
ఎట్టకేలకు ముహూర్తానికి అరపూట ముందు తిరుపతి వచ్చి చేరాడు నరసింహమూర్తి. ఆ వార్త విని పెళ్లి కూతురి విడిది వారు ఊపిరి పీల్చుకున్నారు. అత్తామామలకు ఫోనులోనే క్షమాపణలు చెప్పి స్నాన క్రియలు అయింతర్వాత— దైవ విగ్రహం ముందు పురోహితులు వల్లించిన మంత్రోఛ్చరణలు పఠించి హోమాది కర్మలు ముగించి లేచేటప్పటికి బామ్మర్దులు శంకరం రామ్ మోహన రాబర్ట్ ఇద్దరూ వచ్చి అతణ్ణి తోడుకొని పెళ్ళి పందిరి వేపు నడపించుకు వెళ్ళారు.
అడ్డంగా ఉన్న తెరవెనుక కుదురుగా కూర్చున్న సుజాతను ఓరకంట చూసాడు నరసింహమూర్తి.
వెండి రంగు అంచుతో తెల్లచీర కట్టుకుని, నుదుట సింధూరం కుంకుమతో కలిపిన కళ్యాణ తిలకంతో— మంగళకరంగా సింగారించుకుని ఒద్దికగా కూర్చుంది సుజాత. ఒక స్ర్తీకి అందం అలరారాలంటే- సొగసు చేకూరాలంటే వట్టి యవ్వన పొంగు ఉంటే మాత్రం చాలదు. ఇంకేదో ఉండాలి. అప్పుడే అందం ఇనుమడిస్తుంది. అప్పుడే విచ్చుకున్న మల్లె మొగ్గలా కన్నెతనం పరిమళి స్తుంది. సున్నిత స్త్రీత్వం కమల పుష్పంలా వికసిస్తుంది. దానిని నిండుదనం అనలా లేక నిష్కల్మష పవిత్ర ముఖ భావమనాలా!
పవిత్ర మంత్రోఛ్ఛరణల మధ్య అగ్ని గుండం ముందు నలువైపులా రాలుతూన్న అక్షింతల రాశుల మధ్య నరసింహ మూర్తి సుజాతకు మూడు ముళ్ళూ వేసాడు. ఆమెతో ఏడడుగులూ కలసి నడిచాడు. ఇకపైన తను సుజాతకు భర్తగానే కాక-స్నేహితుడిగా ఉంటూ ఆమె అవసరాలను తీరుస్తూ ఆమెను అనుక్షణం కాపాడుతూ ఆమె సుఖ దు:ఖాలలో పాలు పంచుకుం టానని అగ్ని సాక్షిగా శపథం చేసాడు. అలా చేస్తూ యధాలాపంగా కళకళలాడూతూన్న పెళ్లి మండపం లోకి చూపు సారించాడు.
అప్పుడు అతడి మనసు లోతున అల్లల్లాడుతూన్న ఆలోచన ఫెళ్లున మెరుపులా తాకి మాయమైంది.
అంతసేపూ తన కళ్ళకి అటు యిటుగా అందరూ కనిపించారు- అంతకు ముందు తనతో అందరూ మాట్లాడారు. ఇప్పుడేమో- తనకు వెనుకా తనకు ముందూ ఇంకా కొందరు కనిపిస్తూనే ఉన్నారు- ఇద్దరు తప్ప. అక్కడెక్కడా శ్రీలక్ష్మణ్ గారూ ఆయన సతీమణి వైదేహిగారూ అతడి కళ్ళకు గోచరించలేదు. ఇక మోహన విషయానికి వస్తే— అక్కడెక్కడా ఆమె గొంతుక వినిపించనే లేదు.
అతడి కళ్లలోని కలవరపాటుని గమనించి గావాలి సుజాత మెల్లగా నరసింహమూర్తికి మాత్రమే వినిపించేలా అంది- “టెన్షన్ అవకండి, మీరు ఎవర్ని వెతుకుతున్నారో తెలుసు. కాసేపాగండి. చెప్తాను”
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Kommentarer