top of page

 దేశరక్షణే లక్ష్యం

#DesaRakshaneDhyayam, # దేశరక్షణేలక్ష్యం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Desa Rakshane Dhyayam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 14/05/2025

దేశరక్షణే లక్ష్యం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


ఆర్మీలో హవల్దారుగా దేశ సరిహద్దు జమ్మూకాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్న రాజారామ్ సంవత్సర శలవులో ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం తను విధులు నిర్వహిస్తున్న ప్రదేశం టెర్రరిస్టుల ప్రమాద హెచ్చరికల వల్ల కుటుంబంతో ఉండే అవకాశం లేదు. 


వీలున్నప్పుడు శలవు తీసుకుని వచ్చి కుటుంబ సబ్యుల్ని కలిసి వెల్తూంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత రాజారామ్ కుటుంబంలో పెద్ద కొడుకు కాగా, ఆర్మీలో చేరి ఇద్దరు తమ్ముళ్లను చదివించి ఒకర్ని టీచర్ గా, మరొక తమ్ముడిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా జీవితంలో స్థిరపరిచాడు. వారికి

 వివాహాలు జరిపించగా కుటుంబాలతో వేరుగా ఉంటున్నారు. 


అవకాశం ఉన్న చోట ముసలితల్లి, భార్య శారద, ఇద్దరు కూతుళ్లతో కుటుంబంతో ఉంటున్నాడు. కూతుళ్లిద్దరు సెంట్రల్ స్కూల్లో చదువుతున్నందున వారి చదువులకు ఆటంకం అవుతుందని కుటుంబాన్ని ఇంటి వద్దే ఉంచి ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. 


రాజారామ్, శలవులో ఉండగా పండగ వచ్చినందున తమ్ముళ్లను కుటుంబాలతో ఇంటికి పిలిచాడు. అందరూ పిల్లలతో ఆనందంగా పండగ రోజులు గడిపారు. మాటల సందర్భంలో రాజారామ్ పెద్ద కూతురు మానసను ఆర్మీ సర్వీసులో చేరుస్తాననగానే ఆ మాట విన్న ముసలితల్లి కలగచేసుకుని "నీకు మతిపోయిందా, ఏమిటి ? నువ్వు మిలిటరీ కెళ్లి ఏం సుఖపడుతున్నావు ? గత ఇరవై సంవత్సరాలుగా దినదిన గండంలా ఉద్యోగం చేస్తున్నావు. ఒకసారి దేశ సరిహద్దుల్లో అయితే ఇంకోసారి ఉత్తరాదిన అంటూ కుటుంబంతో నిలకడ లేకుండా జీవితం గడుపుతున్నావు. 


తమ్ముళ్లలా ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే సుఖంగా ఉండేవాడివి. తెగిన గాలిపటంలా ఎప్పుడెక్కడుంటావొ తెలియదు. మానసని బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి. నీలా దాన్ని కూడా దేశాలంట తిప్పకు " ఉపోద్ఘాతం మొదలెట్టింది. 


అత్తగారికి తోడుగా శారద కూడా వంత పలికింది. తమ్ముళ్లు కూడా అమ్మ, వదిన మాటలను బలపరిచారు. 


"చూడండి, అందరూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటే దేశ రక్షణ దళాలలో చేరేదెవరు? చావు అనేది ఎక్కడైనా రావచ్చు. దాన్ని ఎవరూ తప్పించ లేరు. యూనిఫామ్ సర్వీసుల్లో పరిస్థితుల దృష్ట్యా కొన్ని సుఖాలు త్యాగం చెయ్యాల్సి ఉంటుంది. 


ఇక ఆడపిల్ల అంటారా, ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. క్రీడారంగంలో పురుషులకు ధీటుగా నైపుణ్యం చూపించి పతకాలు తెస్తున్నారు. రోదసిలో కెళ్లి వస్తున్నారు. విమానాలు, భారీ వాహనాలు నడుపుతున్నారు. 


వైద్య విజ్ఞాన వ్యవసాయ రక్షణ విభాగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. కొన్ని ఉద్యోగాల్లో మహిళలే పనిచేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి. నేను కొన్ని సందర్భాల్లో మిలిటరీ హాస్పిటల్లో ఎడ్మిట్ అయినప్పుడు అక్కడ వార్డుల్లో మా సైనిక సిబ్బందికి, వారి కుటుంబ సబ్యులకు ఎంతో ఓర్పు చిరునవ్వులతో సేవ చేసే యూనిఫామ్ లో నర్సులను చూస్తుంటే నాకు కూడా కొడుకు లేకపోయినా పెద్ద దాన్ని మానసను మిలిటరీ నర్సుగా చూడాలనుకుంటున్నాను. " అని మనసులోని మాట బయటపెట్టాడు. 


రాజారామ్ దృఢ ఆశయం విన్న తమ్ముళ్లు, తల్లి, భార్య మరేం మాట్లాడలేకపోయారు. 


రాజారామ్ కూతురు మానస ఉద్దేశ్యాన్ని కూడా అడిగి తెలుసుకున్నాడు. మానస ఇంతకుముందు తండ్రితో కుటుంబంతో ఉన్నప్పుడు కొన్ని సార్లు మిలిటరీ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. అక్కడ వార్డుల్లో మిలిటరీ నర్సింగ్ విద్యార్థినులు చలాకీగా నవ్వుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ కలివిడిగా ఉండటం చూసింది. 


ఎక్కువగా కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీ అమ్మాయిలే వాళ్ల భాషలో మాట్లాడుకుంటూ ఉషారుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అంటే తను కూడా నాన్నలాగే దేశసేవకు అంకితమవాలని నిశ్చయించుకుంది. 

 

సంవత్సరం శలవు రెండునెలలు కుటుంబంతో గడిపి రాజారామ్ తన ఆర్మీ యూనిట్ జమ్మూకాశ్మీర్ కి వెళిపోయాడు. మానస సెంట్రల్ స్కూల్లో పన్నెండవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాయగా మెరిట్ మార్కులతో పాసయింది. 


ఇంతలో మిలిటరీ నర్సింగ్ సర్వీసుల నర్సుల ట్రైనింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. మానసకు బి. యస్సీ నర్సింగ్ కాలేజ్, ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC) పూణేలో సీటు వచ్చింది. 


రాజారామ్ కి ఎంతో సంతోషమైంది. తను దగ్గరుండి నర్సింగ్ కాలేజీలో ఎడ్మిషన్ చేయించాడు. అక్కడే హాస్టల్ సౌకర్యం ఉండి అన్ని విధాల బాగుంది. కాలేజీ శలవుల్లో ఇంటికి వచ్చి కుటుంబ సబ్యులతో గడిపి వెళ్తోంది మానస. 


బియస్సీ నర్సింగ్ ట్రైనింగ్ నాలుగు సంవత్సరాలు డిగ్రీ పూర్తయిన తర్వాత ఫ్లోరెన్స్ నైటింగేల్ కేండిల్ లైటింగ్ సెర్మనీతో మిలిటరీ నర్సింగ్ కమీషన్డు ఆఫీసర్సుగా మిలిటరి నర్సింగ్ సర్వీసులోకి తీసుకుంటారు. వారు దేశంలోని వివిధ రక్షణ దళ మిలిటరీ హాస్పిటల్స్ లో సర్వీస్ చెయ్యవల్సి ఉంటుంది. 


మానస మూడవ సంవత్సరం నర్సింగ్ ట్రైనింగ్ లో ఉండగా అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. జమ్మూకాశ్మీర్ బారాముల్లా సెక్టర్లో రాజారామ్ విధులు నిర్వర్తిస్తుండగా టెర్రరిస్టుల ఎటాక్ లో కుడి చెయ్యి గాయంతో మిలిటరీ హాస్పిటల్లో ఎడ్మిట్ అవవల్సి వచ్చింది. తర్వాత ఆపరేషన్ చేసి మోచేతి వరకు తీసేసారు. వికలాంగుడిగా ఆర్మీ సర్వీసు నుంచి పదవీ విరమణ చెయ్యవల్సి వచ్చింది. 


ఈ సంఘటన మానసను ఎంతో కుంగతీసింది. పెర్మిషన్ తీసుకుని తండ్రిని ఓదార్చి వచ్చింది. తండ్రి కోరిక ప్రకారం తను నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసి మిలిటరీ హాస్పిటల్స్ లో

తండ్రిలా దేశసేవలో వికలాంగులకు సర్వీసు చెయ్యాలని నిశ్చయించుకుంది. నర్సింగ్ కాలేజీలో బియస్సీ నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి చేసి మెరిట్ విద్యార్థినిగా వచ్చింది. 


కేండిల్ లైటింగ్ సెర్మనీలో బెస్ట్ నర్సుగా కమీషన్ తీసుకుని నర్సింగ్ ఆఫీసర్ అయింది. ఆ ఫంక్షన్ కి విశ్రాంత సైనికోద్యోగిగా మోచేతి వరకు మొండి చెయ్యితో వచ్చిన తండ్రిని చూసి దుఃఖం ఆపుకోలేకపోయింది మానస. 


కూతురు తన కోరిక ప్రకారం మిలిటరీ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్గా చూడటం గర్వకారణమైంది హవల్దార్ రాజారామ్ కి. 

   

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


bottom of page