గద్వాల్ గండర గండడు
- Ayyala Somayajula Subramanyam
- Jun 8
- 6 min read
#AyyalaSomayajulaSubrahmanyam, #సోమభూపాలుడు, #GadwalGandaraGandadu, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguStory, #తెలుగుకథ

Gadwal Gandara Gandadu - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 08/06/2025
గద్వాల్ గండర గండడు - తెలుగు కథ
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
“గద్వాల్ గండర గండడు” — “తెలుగు గడ్డ శివాజీ” “నవాబుల నడ్డి విరగ్గొట్టిన నల్ల సోమభూపాలుడు”
గద్వాల సంస్థానం:
తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేది లో 800 చ.కి.మీ. మేర విస్తరించి ఉండేది. పదునాలుగవ శతాబ్దం లో కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమానీ సామ్రాజ్యం సామంతులు అయ్యారు. వంశచరిత్ర ప్రకారం గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్దనారారెడ్డి, పెద్దన్నభూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి పరిపాలించారు.
1650 ప్రాంతంలో ముష్టిపల్లి వీరారెడ్డి అయిజా, ధరూర్ మొదలైన మహళ్ళకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానం లేకపోవటంవలన, ఏకైక కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికంగా తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు — పెద్దవాడు అనంతగిరి, చిన్నవాడు సోమగిరి (ఇతనినే సోమనాథ్రి, సోమనాథ భూపాలుడుగా ప్రసిద్ధుడయ్యాడు). ఈయనే మన కథానాయకుడు.
పెద్దారెడ్డి తరువాత అతని చిన్నకొడుకు సోమన్న, 1704 నుండి నాడగౌడికం చేశాడు. ఇతను కృష్ణానది తీరాన గద్వాల కోటను నిర్మించి తుంగభద్రకు దక్షిణాన బనగానపల్లె, ఆదోని, సిరివెళ్ళ, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిలం, కర్నూలు మొదలగు ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానం క్రింద 103 పెద్ద గ్రామాలు, ఇరవై ఆరు జాగీరులు ఉండేవి.
భార్య లింగమ్మ — ఆమె పుట్టినిల్లు పూడూరు. ఆ పూడురే సోమనాథ్రి తొలిరాజధాని.
సోమనాథ్రి స్వరూపం:సోమనాథ్రి ఆరడుగుల ఎత్తుండేవాడు. నల్లని, భీకరమైన, గంభీరమైన ఆయన శరీరసౌష్టవం చూపరులకు భీతిగొలిపేది. సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు గలిగి, ఆయన శత్రువులకు ప్రళయకాల రుద్రుని వలె ఉండేవాడట.
జానపద ఇతిహాసం:
సోమనాథ్రి ఒకనాడు అటవీప్రాంతంగా ఉండిన గద్వాల ప్రాంతం — నిరి, పూడూరు నుండి వేటకు వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకు ఒక వింత దృశ్యం కనబడింది — ఒక కుందేలు వేట కుక్కను తరమటం గమనించాడు. ఇక్కడి స్థలానికి ఏదో మహత్తు ఉందని గ్రహించి, తన అనుయాయులతో చర్చించి, పూడూరు నుండి గద్వాలకు రాజధాని మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా పటిష్టమైన కోటను కూడా నిర్మించాలని నిర్ణయించాడు. కార్యాచరణను సిద్ధం చేశాడు.
ఉత్తరాన కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని భావించి, ఇక్కడ కోట నిర్మించి తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చెను.
కోట నిర్మాణానికి ఆదిలోనే అవాంతరాలు:
సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన అధీనంలోని ప్రాంతమని గద్వాలకు, రాయచూరుకు మధ్యలో నున్న ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ మియా కోట నిర్మాణానికి అడ్డు చెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలా కు బంధువు. ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి తీవ్రఆలోచనల లో పడిపోయాడు.
అనుకున్న పని జరగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరోమార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం చెల్లించగలనని సోమనాద్రి చెప్పాడు. నవాబు కూడా అంగీకరించెను.
కోటనిర్మాణము:
సోమనాద్రి వృత్తాకారంలో పటిష్టంగా మట్టి కోటను నిర్మించెను. తూర్పు పడమరల వైపు రెండు ప్రధాన ద్వారాలు, ఉత్తరం వైపు అత్యవసర రహస్య ద్వారము ఉండేటట్లు కోటను నిర్మించెను. కోటలో ఒకపెద్దబావి, అంతఃపురమందిరాలు, చెన్నకేశవస్వామి ఆలయం నిర్మించెను.
ఆలయనిర్మాణం వెనుక కథ:
కోట నిర్మాణం సమయంలో ఎంత పగడ్బందీగా నిర్మిస్తూ ఉన్నప్పటికీ కోట నిలబడకపోతే, కేశవాచారి అను బ్రాహ్మణుడు ప్రాణత్యాగం చేశాడని అంటారు. అతని పాపపరిహారార్థం అతని పేరు మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఈ ఆలయ సముదాయం పశ్చిమ ద్వారానికి సమీపంలో ఉంటుంది. మధ్యలో కేశవాలయం, రెండు వైపుల పెద్ద మండపాలు ఉన్నాయి. ఆలయానికి ఎడమవైపు మండపంలో శిల్పకళా నైపుణ్యం ఆకట్టుకుంటుంది. అన్నింటికి మించి ఆలయ రాజ గోపురం ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.
ఉప్పేరు నవాబుతో తగాదా:
కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి ఉల్లంఘించాడు. మొదట లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు అనవసర రాద్ధాంతం దేనికని నవాబు తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పని పూర్తయ్యాక ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించి నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా రాయచూరు నవాబు బసర్ జంగ్కు, ఆలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాబ్కు కబురు పంపెను.
అరగిద్ద వద్ద సోమనాద్రి తన సైన్యంతో మూడు ప్రాంతాల నవాబుల తో ఎదురుకొన్నాడు. అరగిద్ద( ఇది నేడు గట్టు మండలంలోని ప్రాంతం), ఇరుపక్షాల మధ్య సంకులసమరం
సాగింది. ఈ యుద్దంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూర్ నవాబు బసర్జంగ్ పలాయనం చిత్తగించెను.
ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా చేసేదేమి లేక ఇంటిముఖం పట్టెను తోడునిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాలమీది తీపితో తన ఓటమిని అంగీకరించి సోమనాద్రిని శరణు కోరెను. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని, యుద్ద పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగారా,పచ్చజెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకొనెనను. దిగాలుగా ఉప్పేరుకు చేరుకొన్నాడు.
చల్లారని ఉప్పేరు నవాబు కోపం:
అరగిద్ద యుద్దంలో ఎదుర్కొన్న పరాభావాన్ని ఉప్పేరునవాబు సయ్యద్ దావూద్, మరుసటిరోజు తనకోటపైనుండి గద్వాల వైపు చూడగా గద్వాల్ కోటపై రెపరెపలాడుతున్న తనపచ్చ జెండా కనిపించింది. అది అతనిని మరీ క్రుంగదీసింది. ఆగ్రహింపజేసింది. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు.
అనుకున్నదే తడవుగా నాటి నిజాం నాసిరుద్దౌలా దగ్గరకు హైద్రాబాద్ పయనమయ్యాడు. తన అవమానాన్ని, తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించేవరకూ నాకు మనశ్శాంతి ఉండదని చెప్పాడు. దానికి నిజాం సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ యోచన విరమించుకొమ్మని సయ్యద్ కు సలహా ఇచ్చెను. కానీ సయ్యద్ పట్టు వీడలేదు.
తప్పని పరిస్థితుల్లో ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియాకు బాసటగా నిజాం నవాబు సోమనాద్రి మీదకు యుద్దాన్ని ప్రకటించాడు. అరగిద్ద యుద్ధం లో పరాజయం పాలై రగిలిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ఇది అనుకోని వరమైంది. వెంటనే తమ సైన్యాలతో కలిస్, నిజాం సైన్యానికి తోడయ్యారు.
నిడ్డూరు మహాసంగ్రామం:
తుంగభధకు ఉత్తరాన ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యం తోడుగా నిజాం సైన్యం బయలుదేరింది. వీరు చాలరని తుంగభద్ర కు దక్షిణాన గుత్తినవాబు టీకుసుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు జతగూడాయి. ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు (నేటి నిడ్డూరు) గ్రామాన విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్ర కు ఉత్తరాన ఉన్న కలుగొట్ల ( నేటి మానోపాడు మండలం లోని గ్రామం) దగ్గర విడిది చేశాడు.
మరుసటి రోజు నిడుదూరు దగ్గర యుద్దం ప్రారంభమైంది. సూర్యోదయం తోనే సోమనాద్రి తన సైన్యం తో నిడుదూరు మీద దండెత్తాడు. రోజంతా నవాబుల సైన్యంతో వీరోచితంగా పోరాడాడు. నవాబుల సైన్యం కకావికకలమైపోయంది. సోమనాద్రి ఆ రాత్రి కలుగొట్ల కు వచ్చి విశ్రమించాడు.
ఆరోజు సోమనాద్రి పోరాటంలో చూపిన పరాక్రమాన్ని నిజాం, ఆ రాత్రి తక్షణ దర్బారు నిర్వహించాడు. సోమనాద్రిని ఓడించడానికి ఉపాయం చెప్పమన్నాడు. ఒక సర్దారు సోమనాద్రి బలమంతా అతని గుర్రమేనని దాన్ని వశం చేసుకుంటే, మన విజయం సుళువేనని చెప్పాడు. వెంటనే నిజాం, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రికి దొంగలించి తెచ్చి ఇచ్చిన వాడికి జాగీరును ఇస్తానని ప్రకటించాడు.
ప్రాణాలకు తెగించి ఒక సైనికుడు కలుగొట్ల కు వెళ్ళి సోమనాద్రి గుర్రాన్ని అపహరించి తీసుకువెళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు అమితానందంతో జాగీరుతో బాటు, ఒక బంగారు కడియాన్ని కూడా ఇచ్చాడు. మరుసటి రోజు సోమనాద్రి కలుగొట్ల శిబిరంలో కలకలం చెలరేగింది. తన గుర్రం లేకపోవడం తనకు కుడిచేయి తెగినట్లుగా అనిపించింది.
అయినా ధైర్య, స్థైర్యాలను విడువకుండా ఎలాగోలా రెండో రోజు యుద్ధాన్ని ముగించాడు. ముందురోజు నాటి ఉత్సాహం లేకపోవడాన్ని గమనించి, తన వాళ్ళందరితోనీ సమాలోచన చేశాడు. తన గుర్రాన్ని తెల్లవారేలోగా ఎవరైతే తిరిగి తెచ్చివ్వగలరో వారికి ఆ గుర్రం ఒక రోజు తిరుగునంత వరకూ భూమిని ఇనాంగా ఇవ్వగలనని ప్రకటించెను.
సోమనాధ్ర్ ప్రకటనకు హనుమప్పనాయుడు అనే బోయసరుదారు ముందుకు వచ్చెను. ఇతని స్వగ్రామం నేటి ఇటిక్యాల మండలంలోని బొచ్చెడుగన్న పల్లె. నాయుడు ఆ రాత్రి జొన్న సొప్పను ఒక మోపుగా వేసుకొని నిడ్డూరుకు బయలుదేరెను. నిజాం సైన్యాల డేరాల దగ్గర సొప్ప అమ్మేవాడిగా సమీపించెను. అక్కడి సైన్యం సొప్పను ఖరీదు చేయగా హనుమప్ప ధర కుదరనీయలేదు. తన లక్ష్యం గుర్రం కాబట్టి అలా చేశాడు.
ఎవరికీ అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్నీ చూశాడు. చివరకు ఒక గుర్రం తను వెతికే గుర్రంగా ఉండటాన్ని గమనించాడు. ఆ గుర్రం కూడా హనుమప్పని చూసి సకిలించింది. సొప్పను చూసి సకిలించిందని సరిపెట్టుకున్నారు అక్కడి సైనికులు.
గుర్రం కనబడిన ఆనందంతో తక్కువ థరకే సొప్పను అమ్మాడు. ఆ తరువాత తప్పించకొనే సమయం కోసం ఎదురు చూస్తూ ఎవరి కంటా పడకుండా అక్కడే ఉన్న గడ్డిమోపుల క్రింద చప్పుడు కాకుండా దూరాడు. దూరి అలగే పడుకుండిపోయాడు. నాయుడుని చూసిన ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటం పెరికి, సకిలించింది. దాని అలికిడికి దగ్గరలో వున్న ఒక సైనికుడు దగ్గరకు వచ్చాడు. నాయుడు చప్పుడు కాకుండా అలానే పడుకుని ఉండిపోయాడు.
ఆ సైనికుడు పెరికిన గూటాన్ని తిరిగి గడ్డిమీద మోపి పాతి, గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి క్రింద వెల్లకిలా పడుకొని ఉన్న నాయుడు కుడి చేతిమీద ఆ గూటం దిగిపోయింది. ఆబాధకు తనుకులాడితే, ప్రాణాలే పోయే ప్రమాదమని గ్రహించిన నాయుడు సహనంతో ఓర్చుకుని అలాగే ఉండిపోయాడు. అర్దరాత్రి దాకా, సమయం కోసం ఎదురు చూశాడు.
అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిసమయమని భావించి, చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఎంతకూ రాకపోయేసరికి నడుముకున్న కత్తిని ఎడమ చేతితో తీసుకుని, గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కున్నాడు.
తెగిన భాగానికి తలపాగా కట్టుకుని లేచాడు. గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి, కల్లుగొట్ల వైపు దౌడు తీయించాడు.
ఆ రాత్రి సోమనాద్రి ముందు గుర్రం తో సహా నిలబడి హనుమప్పనాయుడు ఎడమచేతితో సలాం చేశాడు. నాయుడి దుశ్చర్య కు సోమనాద్రి ఆగ్రహించెను. రక్తమోడుతున్న నాయుడి కుడి చేతిని చూశాక, జరిగిన సంగతంతా విన్నాక సోమనాద్రి కదిలిపోయి నాయుడిని కౌగలించుకుని సన్మానం చేసెను. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దానశాసనం రాయించాడు.
మూడవ రోజు యుద్ధం:
ఆ గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహుడైన సోమనాధ్రి, తన గుర్రంపై ఎక్కి యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. అప్పటికే నిడుదూరులో తండోపతండాలుగా ఉన్న నవాబుల సైన్యం అతని వస్తువైపు చూసి హడలిపోయింది. "ఈడు మళ్లీ వచ్చాడా?" అని ఆశ్చర్యపోయారు. సోమనాధ్రి గుర్రంపై ఆకాశంలా ఎగిసిపడి, తన కత్తితో శత్రువులను భయపెట్టాడు.
ఈసారి అతని పోరాటం మరింత ఉగ్రరూపం దాల్చింది. నవాబుల సైన్యం గందరగోళానికి లోనైంది. తాను ఓడిపోతున్నానన్న భావనతో నిజాం తన బృందాన్ని పిలిచి వెనక్కి వెళ్లాలని ఉత్తర్విచ్చాడు. మిగతా నవాబులు కూడా వెనుకడుగు వేశారు. ఓటమిని అంగీకరించి, తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఈ ఘనవిజయం గద్వాల సంస్థాన చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచింది. సోమనాధ్రి పేరు తెలుగువాళ్ల గుండెల్లో శాశ్వతంగా చెరిగిపోని అక్షరాలుగా చెక్కబడిపోయింది. అతని వీరత్వం, దైర్యం, తెలివితేటలు — అన్నీ కలసి “తెలుగు గడ్డ శివాజీ” అన్న బిరుదును పొందేలా చేశాయి.
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comentarios