top of page

హృదయం

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #Hrudayam , #హృదయం, #TeluguMoralStories, #నీతికథలు


Hrudayam - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 06/06/2025

హృదయం - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఉంగాల ఊరు, పాలమేరు చెరువుకి పడమటన దాదాపు కరకట్టెపైనుండి దొండకాయలా వ్రేలాడుతున్నట్లుంటుంది. మునుమాపు వేళ- చల్లగాలులు వీస్తున్నప్పుడు.. పొద్దుపోనట్లు తోస్తున్నప్పుడు.. రైతులు, వ్యవసాయి కూలీలు, గ్రామస్థులూ, సర్పంచులూ, ఉపసర్పంచులా చెరువు గట్టుపైన గుమికూడుతారు. కొత్తగా కాపురానికి వచ్చిన ఆడపడుచులు కూడా తమ భర్తలతో గాలివాటంగా వచ్చి తనివితీరా ఊసులాడి గట్టుపైనున్న పొగడ చెట్టునుండి కొమ్మలూపి కమ్మటి పూలతో బాటు పండ్లు కూడా రాల్చి ఇండ్లకు తీసుకెళ్తారు. 


ఆ రోజు తుంపర కురిసింది. ఆగినట్లే ఆగి మళ్ళీ కురవ నారంభించింది. దారులు చిత్తడి చిత్తడిగా తయారయాయి. అంచేత ఊళ్ళోని చాలా మంది చెరువు కట్ట వైపు రాకుండా మెట్టపైనున్న మైసమ్మ లక్ష్మీదేవి గుడివేపు వేపు తరలి వెళ్లిపోయారు. అప్పుడు జనసందడిలేని ఆ వాతావరణాన్ని అనువుగా మలచకున్నారు నలుగురు జత గాళ్లూ-- సూరప్పడు- మారప్పడు- గండప్పడు- వేంకటాద్రీ. 


ఊసులాట ముగించకముందే, ఎవరైనా మధ్యలో వచ్చి అంతరాయం కలిగిస్తారేమోనని నలుగురూ సరాసరి చెరువు గట్టుపైన కూర్చోకుండా తిన్నగా కల్వర్టుపైన ఆసీనులయారు తీరుబడిగా- ధైర్యంగా మనసులు విప్పి మాట్లాడుకునేందుకు వీలుగా---


మొదట సూరప్పడే ఆరంభించాడు- “తెలీని కుర్రెదవలందరూ అనుకుంటారు- ఈ కల్వర్టూ ఈ పారుతూన్న కాలవా గడీ వాళ్ళదేనని, వాళ్ల దయేనని-- కాని ఇది ఆ గండర గండర్ల పని కాదని- నిజాయితీగల సర్కారు ఆఫీసారెవరో వచ్చి పున్నెం కట్టుకుని వెళ్లాడని—“ 


“ఛే! నువ్వు మరీను! గడీవాళ్ళు మంచిపనే చేయలేదంటావా- వాళ్లకు మాత్రం గుండెలే లేవంటావా!”


మారప్పడు అడ్డుతగిలాడు. “నీమాట పాడెముందు ఒలకబోసిన ఏడ్పులాగే ఉందిరా బామ్మర్దీ! గుండెల్ని తీసే బంట్లకి గుండెలుంటాయంటావా! నీ నమ్మకం నెర్రెలిచ్చిన నేలలో ఇత్తనాలు చల్లినట్టుందిరా మారప్పా! ”


అప్పుడు గండప్పడు కూడా కలుగ చేసుకున్నాడు. సూరప్పడికి వత్తాసు పలికాడు. 


మారప్పుడు ఊరుకోలేదు. “అలాగని— ఆళ్ళందరూ ఉన్నోళ్లు కదానని అక్కసుతో అందర్నీ ఒకే గట్టుక్రిందకు ఊడ్చేయలేం కదరా గండప్పా! ఆళ్లలో మంచోళ్ళే లేరంటావా? ఉండరంటావా!”

దీనికి మారప్పడు మళ్ళీ స్పందించాడు. “నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా సూరప్పా! ఆళ్ళ వమసం గురించి చెప్పబోకు. ఒళ్లు మండుకు పోతూంది. ఆళ్ళ ఆగడాల గురించి మా తాతయ్య చెప్పింది విన్నావంటే మండిపోయి మసైపోతావు. తెలుసా!” 

ఉక్రోశంతో బదులిచ్చాడు గండప్పడు. 


అప్పుడు వేంకటాద్రి నిదానంగా కలుగ చేసుకున్నాడు- “మీ తాతయ్య ఏమన్నాడేమిటి? ” 


అక్కడి నలుగురులోనూ అతడికి నిదానం ఎక్కువ. ఆలోచన ఎక్కువ. కారణం- ఆధ్యాత్మిక చింతనతో ఆలయ ప్రవచనాలకు- ముఖ్యంగా పోతన భాగవత ప్రసంగాలకు మిక్కిలి ఇష్టంతో హాజరవు తుంటాడు. అక్కడక్కడ రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసే సభలకు కూడా వెళ్ళొస్తుంటాడు. ఎక్కువ సేపు ఊరి గ్రంథాలయంలో గడుపుతుంటాడు. అంచేత త్వరగా అసహనానికి లోనుకాడు. వచ్చినా అదుపు దాటనివ్వ డు. 


దానికి బదులిచ్చాడు గండడు- “మా తాతయ్యకు ఆరు ఎకరాల మాగాణి ఉండేది. అది ఎవరికి ఎల్లాలి? మా బాబుకి- ఆ తరవాత నాకు-- కాని అది మాకు దక్క లేదు. అంతా దొంగ లెక్కలు చూపించి అడ్డదిడ్డమైన లెక్కలతో వడ్డీలు పెంచి రెట్టింపు చూపించి లాగేసుకున్నాడు రాఘవయ్య. ఎదవ.. తెల్లకాగితాలపైన ఏలి ముద్ర లేయించుకుని, అట్టే ఉంచుకుని మమ్మల్ని బానిసలు చేసుకుని మా బ్రతుకుల్ని మంటగలిపాడు”


ఈసారి సూరప్పుడు పుస్సున లేచాడు కోడెత్రాచులా- “అంతేనట్రా గండప్పా! అందమైన ఆడాళ్లను చూస్తే చాలు నమిలి మింగేసేవాళ్లు- చెరకుగడ్డ తిని నమిలి తుప్పు తుప్పుమని ఉమ్మేసినట్టు పారేసేవారు ఆ గడీవాళ్లు. ఇప్పుడు ఆళ్ల పొలం గట్టుపైన గుడిసేసుకుని బ్రతుకీడుస్తుందే- పోలమ్మ- అది మనూరు కాదు- దాని బ్రతుకు అలా ఏడ్వడానికి ఆ రాఘవయ్య కదూ కారకుడు? 


“అదేలా” అని అడిగాడు వేంకటాద్రి. 


“ఎలాగంటే— మాతాతయ్య జతగాడు భూమయ్య ఆళ్ల వద్ద పాలేరుగా పని చేసే వాడు. ఆడికి తాతయ్య ఊళ్ళో పెళ్ళయి కొత్త పెళ్లాంతో కాపురం చేయడానికి మనూరుకి తీసుకు వచ్చాడు. కాని అది రాఘవయ్యతో కాపురం చేసింది. ఎలా గంటే-- ఆడి గూండాల వత్తాసుతో దానిని ఆళ్ల పొలాలకు లాక్కుపోయాడు. ఉంపుడుగత్తెగా మార్చేసుకున్నాడు” 


అప్పుడు ముఖం అదోలా చేసుకుని “ఆ తరవాత? ” అని అడిగాడు వేంకటాద్రి.


“ఇంకేముంది? ఇదేమైనా సినిమా ఫైటింగ్ కధా ఇంకా ఇంకా చెప్పడానికి-- బాగా అనుభవించి గర్భీణీ చేసి మొగుడి వద్దకు పంపించాడు ‘ఇక నువ్వేలుకోరా! ’అని. 


కాని పోలమ్మ కాపురం చేయలేదు. ’నా మొగుడూ నాబిడ్డ తండ్రీ రాఘవయ్యేనని పట్టుదలతో బాహ్య ప్రకటన చేసి ఆడి పొలం ప్రక్కనే గుడిసేసుకుని బిడ్డనక్కడే కంది. కొడుకుని పెంచి పెద్ద చేసి ఇంకా అక్కడే ఉంది మంగమ్మ సినిమా కథలా“ 


అది విన్నతరవాత అక్కడ గాలి తెరల విసుర్లు తప్ప మాటలు వినిపించడం మానుకున్నాయి. 


చివరన మారప్పడిగాడు- “ఇంతకీ నువ్వేమంటావు సూరప్పా! ”


“ఈ జనమలో ఆ గడీయోల్లు మంచన్నదే చేయరని-- ఆళ్ళున్నంతవరకూ మన మెడకు గుది బండేనని— ఎలాగంటే మునుపేమో మనకు తిన్నగా దెబ్బలు తగిలేవి. ఇప్పుడేమే పైకి కనిపించని విధంగా కౌకు దెబ్బలు— అంతే తేడా--”

 

“అంటే నువ్వంటున్నది ఇప్పడు అమెరికాలో ఉంటున్నాడే ఆళ్ల పెద్దబ్బాయి విశాల్- అతను కూడా అటువంటి బాపతేనంటావా! ” మారప్ప సందేహం వెల్లబుచ్చాడు. 


ఈసారి వేంకటాద్రి సౌమ్యత ఉట్టిపడే గొంతుతో కలుగ చేసుకున్నాడు- “ఛే! నాకలా అనిపించడం లేదురా సూరప్పా! ఆ పోరగాణ్ణి చూసాను- రెండుసార్లు మాట్లాడానుకూడా- మర్యాద తెలిసిన వాడిలా--“ 


“ఛీ! ఏమి మనుషుల్రా మీరు? చీమూ నెత్తురే లేదట్రా మీకు! మన ఆడాళ్లనూ మన పెద్దోళ్లనూ రాచి రంపాన పెట్టిన రాకాసులకు వత్తాసు పలుకుతున్నారా- క్రూర మృగం కడుపున ఎక్కడైనా గొర్రెపిల్లా పుట్తుందీ— రాక్షసుల కడుపున మనిషన్న వాడు పుట్తాడూ— నన్నడిగితే--” అని చప్పున ఆగాడతను. 


“ఊఁ ముందుకు వెళ్లూ---” అని కుదిపాడు వేంకటాద్రి. 


“నన్నడిగితే ఆ రాఘవయ్య కంటే ఇతగాడే మహా ఘాతుకుడుగా తయారవుతాడు. ఆ రాఘవయ్యకి కనీసం మన గురించి ఏదో కొంత తెలుసు- మనతో బాటు ఊరుగాలి పీల్చడం తెలుసు. అతగాడేమో— చిన్నప్పట్నించీ పరదేశాలలోనే పరదేశీయుడిగానే పెరిగాడు- అమెరికాలోని తెల్లవాళ్ల మధ్య నల్లవాళ్ల మధ్య గెంతులు వేస్తూ కేరింతలు కొడ్తూ ఎదిగాడు- బాటిల్స్ పైన బాటిల్స్ ఖాలీ చేస్తూ-- అసలతనికి మన ఊరి మట్టి వాసనే తెలియదు. ఐనా— మీరందరూ బుర్రలు బాదుకుంటున్నారు గాని- ఇతగాడి వంశాంకురం ఎక్కడిదని— అప్పటి రాక్షసుడిదే కదా! “ 


అప్పుడు వేంకటాద్రి అడ్డువచ్చాడు- “అలాగని అందర్నీ కొట్టిపారేయడానికి వీల్లేదోయ్. రాక్షసుడి కడుపున రాక్షసుడే పుట్టాలని లేదుగా— హిరణ్యకశిపుని కడుపున ప్రహ్లాదుడు పుట్టలేదా?”


“ఆ పుక్కిటి పురాణాల గురించి మాకు చెప్పకు— అవి విని వినీ నువ్వు పూర్తిగా మనూరి పంతుళ్లతో చేరిపోయినట్టున్నావు. మన మధ్యన ఉండి మాట్లాడు- మాలా మాట్లాడు. అప్పుడు గాని దరిని దాటి నీచూపు వెళ్లదు. రాను రాను మందనుండి వేరుపడ్డ గొర్రెపిల్లలా దారితప్పి వెళ్లిపోతున్నావు- మీ తాతయ్య కూడా ఒకనాడు మా తాతయ్యలాగే పాలేరని మరచిపోకు” 

ఆ మాటతో ఇక అక్కడుండడం ఇష్టం లేనట్టు వేంకటాద్రి లేచాడు. అప్పుడు గండప్పడు పుర్రెక్కించాడు “మాటకు మాట కలపలేక ఓడిపోయి వెళ్లిపోతున్నావా! ” 


ఆ మాట విని ఆగి వెనక్కితిరిగి చూసాడు వేంకటాద్రి. ”మీతో కయ్యానికి కాలు దువ్వి మీకెదురొడ్డి నిలవలేక నేను ఓడిపోవచ్చు కాని హృదయం ఎన్నటికీ ఓడిపోదు”


“ఇంతకూ ఎవరి హృదయం ఓడిపోదంటున్నావు?” గండప్పడు పుసుక్కున నిలదీసాడు.. 


“నా హృదయం - ఆ అమెరికా అబ్బాయి విశాల్ హృదయం. హృదయం వెళ్ళే దారిలో బుర్ర వెళ్ళదు. బుర్ర వెళ్లేదారిలో హృదయం వెళ్ళదు. గుర్తుంచుకోండి“ అంటూ కల్వర్టు పైనుండి లేచి వెళ్లిపోయాడు వేంకటాద్రి. సౌమ్యుడు కాబట్టి ఊరి జతగాళ్ళ మధ్య వాతావరణం అకారణంగా వేడెక్కిపోవడం అతడికి నచ్చినట్లు లేదు. ఎలాగూ తెలుగునాట ఒక సూక్తి ఉండనే ఉంది కదా— “ఎదుటి వారికి నీ మాట నచ్చనప్పుడు మౌనం వహించు. వాళ్ళకు నువ్వే నచ్చనప్పుడు దూరంగా తొలగిపో--“

 -----------------------------------------------------------------------------------------

విశాల్ అమెరికా నుంచి భార్యాసమేతంగా వచ్చి వారం రోజులవుతూంది. 


ఎక్కడకీ కదలకుండా ఇంట్లోనే ఉన్నాడు; భార్య సహకారంతో ఇంటిలోని రికార్డులు చూస్తూ తల్లితో గంటల తరబడి మంతనాలాడుతూ-- ఆ లోపల ఊరిజనం అటు వేపు ముఖ్యంగా గడివేపు తొంగి చూడటం మానుకున్నారు. అలా చూడకుండా మానుకోవడానికి వాళ్ల వాళ్లకు ఉండాల్సిన కారణాలు వాళ్లకున్నాయి. ఇంటికి పెద్దకాబట్టి విద్యాధికుడు కుడా కాబట్టి లెక్కల్లో బొక్కలు వెతుకుతూ కూర్చున్నాడేమో! అసలు విషయం అటుంచి వడ్డీ సంగతేమిటని అడిగితే— లేదని బదులిస్తే బుర్రమీసాల గుండాలతో వీర బాదుడు బాదితే--


ఎట్టకేలకు విశాల్ వారం రోజుల తరవాత గఢీ విడిచి బైటకు వచ్చాడు. ఆశ్చర్యం! అతడు బైటకు వచ్చిన మరునాడు పొలం గట్టునున్న పోలమ్మ గుడిసె మాయమైంది. అది చూసి గండప్పడు వేంకటాద్రి వద్దకు పరుగెత్తుకు వచ్చాడు- “ఇప్పుడేమంటావు వేంకటాద్రీ! ఇప్పటికైనా బుధ్ది తెచ్చుకుంటావా లేదా? మట్టి వాసనే తెలియని వాడికి మంచి మనసెలా ఉంటుందంటే— హృదయం అన్నావు- హృదయ స్పందన అన్నావు. ఇంకేదో అన్నావు. చూసావా పోలమ్మ గుడిసెకేమైందో! కక్షతో పగతో గుడిసెని కూలదోసి తల్లినీ కొడుకునీ అడవిలోకి రవాణా చేసుంటాడు. కాదంటావా సూరప్పడూ! ” 


సూరప్పడు కళ్ళు మిటకరిస్తూ చూడసాగాడే గాని—పెదవి విప్పలేదు. 


“అదేంవిటి సూరప్పా— మీ ఇద్దరికీ ఏమైంది బెల్లం కొట్టిన రాయిలా-- ఆడి బాబేమో మొదట పోలమ్మకు అన్యాయం చేసి పోయాడు. ఇప్పుడేమో వాడి వారసుడు వచ్చి ఏకంగా తల్లీ కొడుకూ ఉంటూన్న గుడిసెను ఊడగొట్టి తరిమేసాడు. రండి ఊరి పెద్దలవద్దకు వెళ్దాం. సర్పంచుకి చెప్దాం. తల్లీ కొడుక్కీ న్యాయం చేద్దాం”


“ఎట్టకేలకు మారెప్పడు నోరు తెరిచాడు- “నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా గండప్పా! ” 


“నేనా! ఎందుకూ? ”


“ఎందుకంటే విశాల్ గారు అటువంటి వాడు కాడు. ఆళ్ల నాన్నలా అత్యాశపరుడైతే ఎందుకు పాతికేళ్లనాటి మా భూమి పత్రాలు ఇల్లు వెత్తుకుంటూ వచ్చి నాకిస్తాడు? అలాగే భూమి పత్రాలను వేంకటాద్రికి ఎందుకు అందిస్తాడూ—“ 


ఈసారి తెల్లబోవడం గండప్పడి వంతయింది. “మరి మా భూమి పత్రాలు మాకింకా ఇవ్వలేదే— మావి ఆరెకరాలు మాగాణీ--’


అందరికీ ఒక్కసారిగా ఇవ్వలేడుగా! ఉదయం నుంచీ ఒక్కొక్కరికీ స్వయంగా ఇచ్చి వస్తున్నాడు. అంతటితో ఊరుకోకుండా మరొకపని కూడా చేస్తున్నాడు ఆయన- ‘ఇన్నాళ్లు మీ భూమిని ఆక్రమించుకుని ఏమీ ఇవ్వకుండా అనుభవించినందుకు క్షమించండి! ’అంటూ మా అందరి చేతులో ఇరవై వేల రూపాయల నోటులు పెట్టి వెళ్లాడు- భవ్యంగా— ఇక నీకు పోలమ్మా- ఆవిడ కొడుకూ ఎక్కడున్నారో తెలియాలి కదా! నువ్విప్పుడు మాతో రా-- చూపిస్తాం” అంటూ విశాలమైన గఢీ ముందుకు తీసుకు వెళ్లి చూపించారు. 


గండప్పడు తికమక పడుతూ అడిగాడు- “ఏరీ! ఒక్కరూ కనిపించరేం? ”


దానికి వేంకటాద్రి స్పందించాడు- “తొందర పడకు, కాసేపాగు, కనిపిస్తారు”


అతడన్నట్టే మరికొద్ది సేపటికి పోలమ్మ నిండైన చీర కట్టుకుని బైట మిద్దెపైకి వచ్చింది. ఈసారి గండప్పడు మరింతగా దిగ్భ్రాంతికి లోనయాడు “పోలమ్మ రాఘవయ్య నాయుడు గఢీలోనే! ”అంటూ--


“రాఘవయ్యగఢీ కాదు-- అదిప్పుడు విశాలయ్యగారి గఢీ— ఇప్పుడతని స్వంత తల్లిముందే బెరుకూ ఉరుకూ లేకుండా- పోల మ్మను పిన్నమ్మా అని పిలుస్తున్నాడు. వాళ్ల అబ్బాయి భూపతిని తమ్మూడూ అని పిలుస్తున్నాడు. ఇది చెప్తుంటే నీకు నమ్మ కం కలగడం లేదు కదూ! 


ఐతే మాతో రా— లోపలకు వెళ్లి వద్దాం. ఇచ్చిన మాట తప్పితే— పాపం చుట్టుకుంటుందని— తండ్రికి అపచారం కలుగుతుందని శ్రీరామచంద్రుడు తానుగా కైకేయి మాట ప్రకారం అరణ్య వాసం చేయలేదూ— అటువంటిదే ఇది కూడాను-- తన తండ్రి చేసిన పాప కర్మ ఫలితాలను తగ్గించుకోవడానికి— కన్నతండ్రి తరపున ప్రాయిశ్చిత్తం చేసుకోవడానికి విశాలయ్య ఇదంతా చేసుకుంటూ వస్తున్నాడు— మానవీయ హృదయంతో-- 


ఇప్పుడైనా ఒప్పుకుంటావా హిరణ్య కశిపుడి కడుపున హిరణ్య కశిపుడు వంటి కొడుకే పుట్ట లేదని-- ఇంకా అలానే నిల్చున్నావేమటి? రా లోపలకు వెళ్లి వద్దాం. విశాల్ బాబు కసురు కోడు. ఆప్యాయంగా యెదుర్కోలు పలుకుతాడు“ 


కొన్ని క్షణాల సేపు నిశ్శబ్దంగా చూస్తూండిపోయి ఆ తరవాత తల అడ్డంగా ఆడించి వెనక్కి తిరిగి తన దారిన తను నడిచాడు గండప్పడు. 


మరునాడు అతడికి కూడా వాళ్ల భూమి పత్రాలతో బాటు ఇరవై వేల రూపాయల రొక్కం లభించిందని వేంకటాద్రి విన్నాడు. అంతేకాదు— విశాల్ పలు పత్రాలు చేత బట్టుకుని చుట్టు ప్రక్కల గ్రామాలకు తరలిపోయిన ఉంగాల ఊరు రైతుల ఆచూకీ కోసం భార్యను వెంటబెట్టుకుని వాడవాడా వెతుకుతూ తిరుగుతున్నాడని కూడా విన్నాడు. 


వేంకటాద్రి మనసున మొన్న గుడి ప్రాంగణంలో విన్న పురాణ ప్రసంగంలోని పలుకులు సుతారంగా తాకాయి. 


“నేడు నీదనుకున్నదంతా నీది కాదు. మొన్నటి వరకూ అది మరొకడిది. అంతకుముందు ఇంకెవడిదో! ఇప్పటి వరకూ నీకు మాత్రమే స్వంతమనుకుంటున్నదంతా రేపు ఇంకెవడి వద్దకు చేరుతుందో! ఇకపోతే— ఈ భూమండలంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో! ఈ ధర్మసూత్రాన్ని గుర్తుంచుకుని నలుగురుతో పంచుకుని అణగి మణగి నడచుకో! “


 

శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






Kommentarer


bottom of page