జై జవాన్
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 12
- 6 min read
#JaiJawan, #జైజవాన్, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #సైనికకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Jai Jawan - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 12/05/2025
జై జవాన్ - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"సలామ్, సాబ్ !"
"కౌన్ ?"
"నర బహదుర్ సాబ్ !" నీర్సంగా జవాబు వినబడింది.
మేల్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాను సాగర్ బంకరు నుంచి బయటకు వచ్చి చూసేసరికి చిరిగిన ఉన్నికోటు నెత్తిమీద ఉన్ని టోపీ పెరిగిన తెల్లగడ్డం ముడతలు పడిన చర్మం చిరిగిన బూట్లతో
నడవలేని స్థితిలో పేరుకుపోయిన దట్టమైన ఐసులో కాళ్ళీడ్చుకుంటూ తమ సైనిక వైద్య శిబిరానికి చేరుకుని సుమారు ఎనభై సంవత్సరాల నేపాలీ వృద్ధుడు బంకరు ముందు స్పృహ తప్పి పడిఉన్నాడు.
దేశ సరిహద్దు హిమాలయ ప్రాంతంలో అదొక యుద్ధ క్షేత్రం. ఎముకలు కొరికే చలితో పాటు పొగమంచుతో కూడిన ఈదురు గాలలు, పగలు కూడా మసక వెల్తురు, పది అడుగుల దూరంలో ఉన్న వ్యక్తుల్ని దగ్గరకు వస్తేనే కాని గుర్తించలేని వాతావరణం, శరీరాన్నంతటినీ కప్పు ఉంచే చలిదుస్తులు, నెత్తిని కప్పి ఉంచిన ఉన్ని టోపీ, చేతులకు ఉన్ని చేతి తొడుగులు, కాళ్లకు స్నో బూట్లు, కళ్లకు రంగు కళ్లద్దాలు ధరించి ఆక్సిజన్ అందక భారమైన ఉఛ్వాశ నిశ్వాసాలతో క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్ని రాత్రింబవళ్ళు అప్రమత్తతో శత్రు సైనికుల నుంచి రక్షణ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్న భారత సైనికుడు సాగర్ ఎదురుగా నీర్సంగా బక్కచిక్కి శల్యావస్థలో ఉన్న నేపాలీ వృద్ధుణ్ణి చూసి మనసు చలించి పోయింది.
ముసలి తాత దైన్యస్థితిని తలుచుకుని తన చిన్న నాటి రోజులు గుర్తుకు తెచ్చుకుని పాత జ్ఞాపకాలతో కాలచక్రాన్ని వెనక్కి తిప్పాడు.
***
నేను పుట్టి పెరిగింది పల్లెటూరు వాతావరణం. తాతయ్య పక్షవాతంతో మంచాన పడి మలమూత్రాదులు సహితం అక్కడే చేసుకోవడం, దుర్వాసన ఈగలు దోమలు ముసురుతూ పరిసరాలు అసహ్యంగా ఉండేవి.
కమ్మల పాకలో ఒక మూల తడపలతో నేసిన మంచం మీద పడుకోబెట్టి ఒక చెంబుతో తాగడానికి నీళ్లు, దగ్గుతో వచ్చే కఫం ఉమ్మడానికి ఇసుకతో నింపిన మట్టిసిబ్బె ఉండేవి. ఎనబై ఏళ్లు నిండిన తాతయ్యని ఎవరి పనుల్లో వారు బిజీ ఉండి పట్టించుకునేవారు కాదు.
ఆయన వయసులో ఉన్నప్పుడు తన కాయకష్టంతో చెమటోడ్చి సంపాదించిన మూడెకరాల సాగు భూమికి ఆసామి అయాడు. తన తోటి వారు తాగుడు, జూదం లాంటి దుర్వస్యనాలకు అలవాటు పడి సంపాదించింది పాడుచేసుకుంటే తాతయ్య మాత్రం పైసకి పైస కూడబెట్టి
పంట భూమిని సంపాదించి నివాసానికి పక్కా ఇల్లు కట్టించి ఒక్కగానొక్క కొడుకు నాయన కిచ్చాడు.
నాన్న మాత్రం తాత కడుపున చెడపుట్టాడు. స్నేహితుల సాంగత్యంతో తాగుడు, పేకాట నేర్చుకున్నాడు. తాతయ్యకి వ్యవసాయ పనుల్లో సాయం చేసేవాడు కాదు. తాగొద్దని చెబితే అమ్మని చితగ్గొట్టేవాడు. నేను, చెల్లి రాత్రయితే నాన్న ఇంట్లో చేసే గోలకి భయపడి ఒక మూల నక్కి కూర్చునే వాళ్లం. తాతయ్య నాన్న స్థితిని చూసి మనసులో బాధ పడేవాడు. తాగిన మైకంలో ఆయన్ని కూడా
దుర్భాషలాడే వాడు.
మానసికంగా తాతయ్య కుంగిపోయాడు. వృద్ధాప్యం వల్ల కంటిచూపు తగ్గి, వంట్లో శక్తి నశించి వ్యవసాయ పనులు చేయలేక కొడుకు అందుబాట్లో లేక భూమిని కౌలు కిచ్చేసాడు. అమ్మ పాడి గేదిల్ని మేపి పాలు సెంటరుకి పోసి, కూరగాయలు పండించి సంతలో అమ్మిన డబ్బుతో ఇల్లు గడిపేది. తాతయ్య ఆరోగ్యం సరిలేక మంచానికే పరిమితమవడం, నాన్న సంపాదన లేక ఇంటి బాధ్యతంతా అమ్మ భుజాలపై పడింది.
నేను, చెల్లి పక్క ఊళ్లో హైస్కూలుకి నడుచుకునే వాళ్లం. తాతయ్య మంచాన పడటం, నాన్న చెడు వ్యసనాలతో డబ్బు వ్యర్థం చెయ్యడంతో అమ్మ కూడా మానసికంగా కుంగిపోయింది. నన్ను చెల్లిని బాగా చదివించి వృద్ధిలోకి తేవాలని తన శక్తికి మించి కష్టపడి డబ్బు సంపాదించేది.
తాత కూడా నాన్న ప్రవర్తనకి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూసి మరింత బాధ పడేవాడు. మానసికంగా కుంగి రక్తపోటు పెరిగి పక్షవాతం వచ్చి కాలూ చెయ్యి పనిచెయ్యక మంచానికే పరిమితమయాడు.
అమ్మ పక్క ఊళ్లో ఉన్న గ్రామీణ నాటువైద్యుణ్ణి పిలిచి చూపిస్తే, ఆయనకి ఇప్పటి పరిస్థితిలో ఏ వైద్యం చేసినా ఫలితం ఉండదని ఇంటివద్దే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. అమ్మ కూడా ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మరేమీ చేయలేకపోయింది.
నేను రోజూ చెల్లిని పక్క ఊరి పాఠశాలకు నడిచి వెళ్తున్నామని తలిచి, అమ్మ పాత సైకిలు
కొనిస్తే చెల్లిని వెనక కూర్చోపెట్టి తీసుకెళ్లేవాడిని.
పాఠశాల నుంచి వస్తూనే నేను తాత దగ్గరకెళ్లి పొగాకు చుట్టలు, అగ్గిపెట్టె ఇచ్చి క్షేమ సమాచారం
తెలుసుకుని మంచం చుట్టూ ఉన్న మలమూత్రాలు శుభ్రం చేసి ఆయనకేం కావాలో అడిగి తెలుసుకుని కాసేపు కబుర్లు చెప్పేవాడిని.
ఉదయం పాఠశాల కెళ్లేముందు రాత్రంతా ఆయన పాడుచేసిన దుర్గందాన్ని శుభ్రం చేసి మంచం చుట్టూ ఫినాయిల్ చల్లేవాడిని. అమ్మ తాతకి అందుబాటులో తిండి ఏర్పాటు చేసిన తర్వాత బజారు పనులు చూసుకునేది. నాన్న మాత్రం తాగి ఊరంతా తిరిగి ఎక్కడో పడిపోతే అమ్మ ఇంటికి చేర్చేది.
తాతయ్యకి చుట్ట కాల్చే అలవాటుంది. తన ఆరోగ్యం మంచిగా ఉండేరోజుల్లో లంకపుగాకు తెచ్చుకుని తనే రోజుకి సరిపడే చుట్టలు చుట్టుకునేవాడు. ఇప్పుడు నేను కాని అమ్మ కాని దుకాణం నుంచి పుగాకు చుట్టలు కొని తెచ్చి ఇస్తున్నాము. సాయంకాలం నేను పాఠశాల నుంచి
వస్తూనే సైకిల్ బెల్ విని ' చిన్నోడా, వచ్చేవా !' అంటూ పిలిచి నా తల ఆప్యాయంగా నిమిరేవారు.
నేను పదవ తరగతికి రావడం వల్ల పబ్లిక్ పరిక్షల కోసం పట్టుదలగా చదువుతున్నా. తాత నన్ను చూసి " మీ నాన్నలా కాకుండా నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మీ అమ్మ కివ్వాల చిన్నోడా! " నాకు దైర్యం చెప్పేవారు.
అమ్మ కూడా నేను ఉద్యోగం సంపాదించి చెల్లిని బాగా చదివించి మంచి ఉద్యోగస్థుడితో పెళ్లి జరుపుతానని కలలు కనేది. ఇంతలో అనుకోని ఒక దుర్ఘటన జరిగింది. రాత్రి చుట్ట కాల్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఆర్పకుండా తాటాకుల దడి దగ్గర విసిరాడు తాతయ్య. బయటి గాలికి చుట్టకున్న నిప్పు రగిలి మంటగా మారి పాకలో ఉన్న తాతయ్య సజీవ దహనమైపోయాడు.
ఎర్రగా మండుతున్న మంటలకి అందరం లేచి చూసేసరికి తాత శరీరం పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఆ విషాదం నుంచి కోలుకోడానికి అమ్మకీ నాకు చాల కాలం పట్టింది. తాతయ్య చెప్పే దైర్య వచనాలు జ్ఞప్తికి వచ్చి దుఃఖాన్ని దిగమింగి రాత్రింబవళ్లు కష్టపడి చదివి పదవ తరగతి పబ్లిక్ పరిక్షల్లో పాఠశాల ప్రథమ శ్రేణిలో పాసయాను.
పట్నమెళ్లి కాలేజీ చదువులకు ఆర్థిక స్తోమత అడ్డు వచ్చింది. చెల్లిని బాగా చదివించాలి. ఎక్కువగా తాగుడికి అలవాటు పడిన తండ్రి కాలేయం పాడై చావు బతుకుల మద్య ఉన్నాడు.
వైద్యానికి డబ్బు ఖర్చవుతోంది. అమ్మని కష్టాల నుంచి గట్టెక్కించాలంటే తను ఏదో ఒక డబ్బు సంపాదన మార్గం చూడాలి. ఇవన్నీ ఆలోచించి పట్నంలో చిన్న ఉద్యోగం సంపాదించి అమ్మకు ఆర్థికంగా సహాయ పడుతున్నాను.
రోజులు గడుస్తున్నాయి. ఇంతలో మన పొరుగు దేశ సైన్యం దేశ సరిహద్దు ప్రాంతంలో యుద్ధం ప్రకటించగా భారత దేశమంతా ఆపత్కాల పరిస్థితి అమలు చేసారు. యువకుల్ని సైన్యంలో చేరి దేశసేవకు భారతమాత రక్షణకు ముందుకు రావల్సిందిగా వార్తాపత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో దేశ ప్రధాని విజ్ఞప్తితో నేను కూడా సైన్యంలో చేరి ఈ ఆపద సమయంలో దేశపౌరుడిగా నా కర్తవ్యాన్ని నిర్వహించాలనుకున్నాను.
అమ్మకి నా ఉద్ధేశ్యం చెబితే ముందు బాధ పడినా నా ఆకాంక్ష తెలుసుకుని కాదనలేక పోయింది. ఊళ్లోని కొందరు పెద్దలకు ఈ విషయం తెలిసి మిలిటరీ కెళితే ప్రాణాలతో తిరిగి రారని నన్ను నిరుత్సాహపరచాలని చూసారు. నా దృఢ సంకల్పం ముందు అవేవీ పని చేయలేదు.
మరుచటి రోజు రిక్రూటింగ్ ఆఫీస్ కెళ్లి చూడగా నాలాగే చాలా మంది యువకులు ఉత్సాహంగా సైనిక ప్రవేసానికి వరుసకట్టి నిలబడిఉన్నారు. వారందర్నీ చూసి నాలో ఉత్సాహం ఎక్కువైంది.
సైనిక సిబ్బంది యువతలో ఉత్సాహం చూసి హడావిడిగా శరీర దారుడ్య పరిక్షలు, విద్యార్హతలు, మేధస్సు తెలివి, వైద్య పరిక్షలు జరిపి విద్యార్హతల్ని బట్టి కేటగిరీలుగా విభజించి డాక్యుమెంట్లు నింపి మిలిటరి ట్రైనింగు సెంటర్సుకి పంపడం జరిగింది.
సైనిక దళంలో చేరి దేశరక్షణ కోసం పౌరుడి నుంచి సైనికుడిగా మారి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటూ చెల్లిని ఉన్నత చదువులు చదివిస్తు నాన్నకి సైనిక చికిత్సాలయంలో మెరుగైన వైద్యం చేయించే అవకాశం వచ్చింది. అమ్మకి కావల్సిన ఆర్థిక
సహాయం చేయగలుగుతున్నాను. తాతయ్య జీవించి ఉంటే నా ఉన్నతిని చూసి ఆనందపడేవారు.
***
సహచరుల పిలుపుతో గత జ్ఞాపకాల నుంచి తేరుకుని మేల్ నర్సు సాగర్ మిత్రుల సహాయంతో ఆ ముసలాయన్ని వెచ్చగా ఉన్న వైద్య శిబిరం లోకి తీసుకువచ్చి ప్రథమచికిత్స జరపగా కళ్లు తెరిచాడు. వేడిగా చాయ్ తాగించి తినడానికి బిస్కిట్సు తినిపించారు. కొంత సమయానికి తేరుకున్నాడు నేపాలీ తాత. కాలుకి గాయమై రక్తస్రావమవుతోంది. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో చికిత్సజరిపి కట్టు కట్టారు.
తను దగ్గరున్న నేపాలీతండాలో ఉంటానని తనకి ఎవరు లేరని కట్టెలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నానని, కట్టెలు కొట్టే సమయంలో కత్తి తగిలి కాలికి గాయమై సంపాదన. లేక ఆకలితో అలమటిస్తు తినడానికి ఏమైనా పెడతారని సైనిక శిబిరం వద్దకు వచ్చానని నేపాలీ కలిసిన హిందీలో చెప్పాడు నేపాలీ తాత.
నేపాలీ తాతను చూడగానే చనిపోయిన తాతయ్య మెదిలాడు సాగర్ మనసులో. సాదారణంగా సైనిక శిబిరాల్లోకి సైనిక సిబ్బంది తప్ప ఇతరులెవరికీ అనుమతి ఉండదు. అది దేశ సరిహద్దు ప్రాంతమైనందున శత్రు సైనిక గూఢచార విభాగం అనేక వేషాల్లో మన భూభాగంలో ప్రవేశించి సైనిక రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఐనప్పటికీ మానవతా దృక్పధంతో నేపాలీ తాతని ఆదరించి చికిత్స జరిపి సహచరులను తోడిచ్చి వారి నేపాలీతండాకు పంపించారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments