top of page

నిజ ప్రతిబింబం

#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #నిజప్రతిబింబం, #NijaPrathibimbam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Nija Prathibimbam - New Telugu Story Written By - Kotthapalli Udayababu 

Published In manatelugukathalu.com On 05/05/2025

నిజ ప్రతిబింబం - తెలుగు కథ

రచన : కొత్తపల్లి ఉదయబాబు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఉదయమే లేచి భగవంతుడికి దండం పెట్టుకుని  ప్రశాంతంగా సోఫాలో కూర్చుని భార్య ఇచ్చిన  కాఫీ తాగుతూ వాట్సప్ ఓపెన్ చేసాను ఫోన్లో.


నా పేరు శరణ్.


ఈరోజు భోగి పండగ అనుకుంటూ ఆత్మీయ మిత్రులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాను. వస్తున్న వాటికి జవాబులు ఇస్తున్నాను.


అప్పుడప్పుడు మాత్రమే వచ్చేటటువంటి ఒక మిత్రుడి సందేశం చూసి ఆశ్చర్యపోయాను.


అందులో ఇలా ఉంది.


"ఒక 2000 అప్పు కావాలి. మళ్లీ నెలలో తీర్చేస్తాను.. భోగి పండుగ శుభాకాంక్షలు"

ఓ పక్కన శుభాకాంక్షలు చెబుతూనే పొద్దున్నే అప్పా!...


అదీ వందల్లో కాదు వేలల్లో!. అవునులే. షాపింగ్ చేద్దాం అని రోడ్డుమీదకడుగు పెడుతుంటే ఒకరోజులో కనీస అవసరాలకే  ₹2,000 అయిపోతున్న రోజులు ఇవి. వేలల్లో కాక వందల్లో ఎవడు అడుగుతాడు అప్పు?


అతను నాకు తెలిసిన బాగా మిత్రుడు కాదు. నాలా రిటైర్ అయిన నా స్నేహితుడిని సైట్లు అమ్మితే కమీషన్  వస్తుంది అని చెప్పి  తీసుకువెళ్లిన అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేస్తున్నాడు. నా స్నేహితునికి అతను ఎలా పరిచయం అయ్యాడో నేను అడగలేదు... నా స్నేహితుడు చెప్పలేదు.


రెండు సందర్భాల్లో మా ఇంటికి కూడా వచ్చాడు నా స్నేహితునితో పాటుగా. అలాపరిచయం అతను నాకు.


ఈరోజుల్లో ఫేస్బుక్లో  ఎంతో ఆత్మీయులైన,  గౌరవనీయులైన, స్థితి పరులైన ముఖ పుస్తక  స్నేహితులవి ఎందరివో  ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుక్కుంటున్న అటువంటి నిరుద్యోగులు మోసగాళ్లు ఫేస్బుక్ తెరిస్తే చాలు  వందల్లో ప్రత్యక్షమవుతున్నారు.ఇతను అలాంటివాడేనా?


పాపం ఏం అవసరం ఉందో... ఎందుకో అతను ముక్కుసూటి మనిషి, అభిమానవంతుడు అనిపిస్తాడు నాకు. అతను అడిగినంత కాకపోయినా సగమైన ఇద్దామని ముందు అనుకున్నాను.


కానీ నమ్మకానికి, స్నేహానికి చీడ పట్టించిన నమ్మకద్రోహుల చేతుల్లో దాదాపు 6 సార్లు మోసపోయిన నేను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఇవ్వలేదు కూడా.

******

కొన్నాళ్ల తర్వాత నా స్నేహితుడు నా ఇంటికి వచ్చినప్పుడు అడిగాడు.

"అతను పండగ పూట మిమ్మల్ని 2000 అడిగాడట కదా,నాకు ఆ సందేశమే పంపాడు " అని.


"అవును ఇవ్వలేకపోయాను" అన్నాను.


"అతను హైదరాబాద్ ఉద్యోగం కోసం వచ్చి అనుకోకుండా బస్ స్టాప్ లో నాకు పరిచయం అయ్యాడు. కానీ గత ఐదేళ్లుగా మా ఎల్ఐసి వ్యాపారానికి మంచి కస్టమర్లను చూపించి చాలా సహాయం చేశాడు. ఆ ఎల్ఐసి వ్యాపారానికి వేడిగా చన్నీళ్లు తోడుగా ఉంటాయన్న ఉద్దేశంతో అతనికి శాతం చేయాలనే ఉద్దేశంతోనే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాను.


కరోనా వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకంతకు దెబ్బ తినడం వల్ల  కాబోలు అతను నిజంగానే చాలా దెబ్బతిన్నాడు. కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, భార్య పిల్లల్ని పోషించుకొలేని పరిస్థితి అని,  వేరే పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ హోటల్ రూమ్లో ఆత్మహత్య చేసుకోవడమే తమకు మిగిలిన ఏకైక మార్గమని ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోయాడట.కనీసం నాతో కూడా చెప్పకుండా వెళ్లిపోయాక ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి. వెళ్ళాక కనీసం అతనినుంచి  సమాచారం లేదు. కొంతమంది అతనికి ఏదో ఉడతా భక్తిగా సహాయం చేసినా అది ఏ మూలకు సరిపోలేదు అని తెలిసింది. " అన్నాడు నా స్నేహితుడు.


నేను నిర్లిప్తంగా ' అలాగా ' అని ఊరుకున్నాను.


ఎందుకంటే అతనికి సహాయం చేయకూడదు అనుకుని అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వాళ్లలో నేను ఒకడినా, లేదా చేయకపోవడమే మంచిది అయిందా  అని నిర్ణయించుకోలేక....!

*****

కొంతకాలం తర్వాత శ్రీకాకుళం వెళ్లాను నా కుటుంబంతో. అరసవిల్లి సూర్యనారాయణమూర్తిని, శ్రీకూర్మం లోని ప్రసిద్ధ దేవాలయాన్ని చూసి రావడానికి.

అరసవల్లి సూర్యనారాయణ మూర్తి కోవెల ప్రాంగణంలో  అతను నాకు కనిపించాడు ఒక పెద్ద కొబ్బరి కొట్టుకు  యజమాని స్థానంలో కూర్చుని.


కొద్దిగా లావెక్కినా అతనిని గుర్తుపట్టి నవ్వబోయాను.నన్ను చూసి అతను సీరియస్ గా తల తిప్పుకుని పక్కనున్న అతనితో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాడు.  పనిచేసే కుర్రవాడి దగ్గర కొబ్బరికాయలు కొనుక్కుని దర్శనానికి వెళ్ళొచ్చాము.నా భార్య, పిల్లలని కారులో కూర్చొని చెప్పి  -ఈసారి నేను ఆయన్ని పిలిచాను.


అతను తన స్థానంలో కూర్చుని ఉన్నాడు.


"ఏం కావాలి సార్" నిర్లక్ష్యం అడిగాడు.


"మీరు వెంకటాచలపతి కదూ"అతను తనతో మాట్లాడుతున్న అతనితో ఉండమన్నట్టుగా సైగ చేసి నా దగ్గరకు వచ్చాడు.


"అవును అయితే..? "


"మీరు ఏదో ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకుంటామని ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోయారని  నా స్నేహితుడు చెప్పాడు."


"ఇంకా చచ్చి పోలేదా అని అడుగుతున్నారా? " అడిగాడతను కోపంగా.


నేను వెంటనే చేతులు పట్టుకోబోయాను అతను వదిలించుకున్నాడు.


"అయ్యో .. ఆ ఉద్దేశంతో అడగలేదండి. అప్పటికే నేను కొందరి చేతిలోనూ, ఫేస్బుక్ దొంగలు సృష్టించిన ఫేక్ అకౌంట్లవాళ్ళ చేతుల్లో మోసపోవడం వల్ల,  మీరు పంపిన సందేశం నిజం కాదనుకున్నాను. నేన్ను మన్నించండి" అన్నాను.


"చూడండి సార్. మీ స్నేహితునితో నేను మీ ఇంటికి రెండు మూడు సార్లు  వచ్చాను.  పండగ పూట మీకు సందేశం పంపాను అంటే దాంట్లో కొంతైనా నిజమే ఉంటుందేమో అని అర్థం చేసుకోవాల్సింది మీరు. నాకు మోసం చేసే తత్వమే ఉంటే మీ స్నేహితునితో పాటు మీతో ఇంటికి రాను కదా.  అతను లేకుండా వచ్చి అడుగుతాను కదా"


"అవును" అన్నాను తప్పు చేసిన వాడిలా.


"మీకు నమ్మకస్తుడైన స్నేహితునితోనే కదా నేను స్నేహం చేశాను. మరి ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే నన్ను కూడా మోసం చేసే వాడిలా  ఎందుకు జమకట్టారు? "


నేను సమాధానం చెప్పలేకపోయాను.


"మీరు నా సమాధానం విని బాధపడను అని చెప్పి నాకు మాట ఇవ్వండి." అన్నాడు అతను చేయి చాచి.


నిర్మొహమాటంగా తన చేతిలో చెయ్యేశాను.


"చూడండి సార్ మీరు విజ్ఞులు పెద్దవారు. మీ సర్వీసులో ఎంతోమంది ఉద్యోగస్తుల్ని, సమాజంలోని వ్యక్తులను, చుట్టుపక్కల వాళ్ళని చూసే ఉంటారు.


మీది ఒరిజినల్ గా మంచి మనస్తత్వం. మీ మిత్రుడు కూడా మీలా మంచి వాడే అనుకుంటారు మొదట. అతను - మీరు మంచివాడు అని అనుకోవాలని తాపత్రయంతో  అతనితో మంచిగానే ప్రవర్తిస్తుంటారు ఎపుడూ.... ఒకవేళ అతను చెడు ప్రదర్శించినా  అతని దృష్టిలో మీరు చెడు కాకూడదు అన్న ఉద్దేశంతో మంచిగానే ప్రవర్తిస్తుంటారు... అలా అని  అవసరం వచ్చినప్పుడు సాయం చేయరు.


ఆఖరికి ఆ విషయం గ్రహించిన వాడు మిమ్మల్ని మీ మంచితనాన్ని ఒక చేతకానితనంగా భావించి మీ దగ్గర అప్పులు అడుగుతాడు తిరిగి ఇవ్వడు. వాడి మేకల్లో ఉన్న మీరు వాడు అడగగానే అప్పిస్తారు.  వాళ్ళు మీకు అప్పు తీర్చకూడదు అని నిర్ణయించుకొని రేపు ఇస్తాము మాపిస్తాం... అంటారే తప్ప పైసా తిరిగి ఇవ్వరు. అప్పుడు వాళ్లు మీకు నమ్మకద్రోహం చేశారని మీరు భావిస్తారు.  ఆ నమ్మకం ద్రోహం చేయకపోతే వాడు బతుకు వెళ్లదు మరి. మీరు ఆరుగురు చేతిలో మోసపోయాను అన్నారు. మొదటివాడి చేతిలోనే ఆర్థికంగా మోసపోయినప్పుడు, రెండో వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా. మరి అజాగ్రత్తగా ఎందుకు ఉన్నారు? డబ్బు ఎందుకు పోగొట్టుకున్నారు? అతని విషయంలో మీరు మంచి వాడిగానే మిగిలిపోవాలని.


అంటే మీరు మీ కోణంలోంచి ఆలోచించి స్నేహం చేస్తున్నారు తప్ప ఎదుటివారి కోణం ఆలోచించి  స్నేహం చేయలేదు. అంటే మీరు స్నేహానికి పనికిరారు. నమ్మకద్రోహానికి పనికొస్తారు. అందుకే ఆరుగురు చేతిలో మోసపోయారు.


ఆ మోసగాళ్ల ప్రభావం మీ మీద ఉండడంతో నిజమైన మా ఇబ్బందిలో  మేము కూడా మీకు మోసగాడి లాగే కనిపించాము. అందుకే నేను పెట్టిన సందేశానికి మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు.


కానీ నన్ను నమ్మేవారు కొంతమంది అయినా ఉంటారు కదా. తలో రెండు వేలు సాయం చేశారు. కొన్ని అప్పులు తీర్చేసి ఆ నగరం నుంచి వెళ్లిపోయాం.


ఆత్మహత్య చేసుకుని చచ్చి పోదాం అనుకుంటే, నిజంగా మోసగాళ్ల ముద్ర పడిపోతామని భయపడ్డాం.


నగరాల్లో మనుషులు కాలక్షేపం చేయడానికి, మోసం చేయడానికి.. మాత్రమే పనికొస్తారు అని తెలుసుకున్న నేను ఆ ఊర్లో ఉండలేక తిరిగి మా అత్తగారు ఊరు వచ్చేసాను. నా భార్య మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టి ఈ వ్యాపారం పెట్టుకున్నాను. నా వ్యాపారం కొద్దిగా పెరిగాక  నాకు సహాయం చేసిన వారికీ డబ్బు తిరిగి నిజాయితీగా ఇచ్చేసాను. ఇంకెప్పుడూ నగరానికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను.


మీరు మోసపోయారు కాబట్టి అందరు మనుషులు మోసగాళ్లు అని అనుకోకండి. నిజమైన మోసగాన్ని గుర్తించి వారికి దూరంగా ఉండండి. నిజంగా సహాయం చేసే వాడికి సాయం చేయండి. ఆ సాయం వాడికి అవసరానికి ఆదుకుంటే, మీకు ఆ సాయమే మిమ్మల్ని కాపాడుతుంది.


అవతలి వ్యక్తి ఎంత సేపూ మనం మంచివాడు అని అనుకోవాలి అనే మాటకి విలువ ఇవ్వడం మానుకోండి. మూసుకుపోయిన నా జ్ఞాన నేత్రాన్ని  తెరిపించిన వాళ్లలో మీదే మొదటి వారు. అందుకే మిమ్మల్ని ఇంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను.ఒక విధంగా మీరు నాకు ఆదర్శం కూడా.  ఉంటాను" అనేసి కొట్లోకి వెళ్లిపోయాడు.


కళ్ళు తిరిగినంత పని అయింది నాకు. అతని జ్ఞాననేత్రం కాదు. ఇప్పుడు నా జ్ఞాననేత్రం తెరుచుకుంది.


                    సమాప్తం


కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

                  2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

  *సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

 2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

చివరగా నా అభిప్రాయం :

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్








Comments


bottom of page