పరిపాలనలో లలనల ప్రాముఖ్యం
- Karlapalem Hanumantha Rao

- May 15
- 3 min read

Paripalanalo Lalanala Pramukhyam - Telugu Moral Story | Karlapalem Hanumantha Rao
పరిపాలనలో లలనల ప్రాముఖ్యం - తెలుగు నీతి కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 15/05/2026
అనగనగా మణిద్వీపమనే రాజ్యాన్ని విక్రమసేనుడనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో మూడేళ్లుగా వర్షాలు లేవు. చెరువులు పగుళ్లిచ్చాయి, పశువుల దాహానికి నీరు లేదు. దేశమంతా అశాంతి నెలకొంది. రాజుగారు మంత్రిని పిలిచి, "మంత్రివర్యా! వారం రోజుల్లోగా వరుణ దేవుడు కరుణించే మార్గం చూడాలి. ప్రజల ఆకలి తీరాలి, లేదంటే మీ పదవి ఊడటమే కాదు, మీకు మరణశిక్ష తప్పదు!" అని గర్జించాడు.
మంత్రిగారు ఇంటికి వెళ్లి భోజనం కూడా చేయకుండా దిగులుగా కూర్చున్నారు. "వానలు కురిపించడం మనిషి చేతిలో పని కాదు కదా! ఇప్పుడు నా ప్రాణాలు పోవడం ఖాయం" అని వాపోయారు.
అప్పుడు ఆయన భార్య సుగుణవతి వచ్చి, "స్వామీ! మీరు చింతించకండి. నేను చెప్పినట్టు చేయండి" అని ఒక రహస్యం చెప్పింది.
మర్నాడు మంత్రిగారు రాజుగారి అనుమతితో ఊరంతా చాటింపు వేయించారు:
"ప్రజలారా! కరువు వల్ల ధాన్యం కొరత ఉంది. ఎవరైతే అడవిలో ఎండిపోయిన కొమ్మలను తెచ్చి, వీధుల చివర బహిరంగ ప్రదేశాల్లో పొయ్యిలు పెట్టి వంట చేస్తారో.. వారికి మాత్రమే రాజకోట నుండి ఉచితంగా ధాన్యం ఇవ్వబడుతుంది!"
ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. "ఇదేం వింత? ఇంట్లో వంట చేసుకోనివ్వకుండా వీధుల్లో చేయమంటారేంటి?" అనుకున్నారు. కానీ ఆకలి ముందు ఆశ్చర్యం ఆగలేదు. జనం గుంపులు గుంపులుగా అడవికి వెళ్లి, ఎండు కొమ్మలను తెచ్చి, ఊరి కూడళ్లలో పెద్ద పెద్ద పొయ్యిలు రాజేసి వంటలు చేయడం మొదలుపెట్టారు.
వేల సంఖ్యలో వెలిగిన ఆ పొయ్యిల నుండి దట్టమైన పొగ ఆకాశంలోకి లేచింది.
అద్భుతం జరిగింది! మూడు రోజులు గడిచేసరికి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్మాయి. నాలుగో రోజున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండిన భూమి తడిసింది, చెరువులు నిండాయి. ప్రజల ఆనందానికి అంతులేదు.
రాజుగారు మంత్రిగారిని అభినందించి తన ధర్మసందేహన్ని బైటపెట్టారు ”వంటల కారణంగా వర్షాలు కురువటం విచిత్రంగా ఉంది. ఈ అద్భుతం ఎలా సాధ్యమయింది?“.
“మహారాజా! మన నగరం చుట్టూ గల అడవుల్లో ఉన్నవి మంచి గంధపుచెట్లు, దేవదారు వృక్షాలు. వాటి ఎండు కొమ్మలనే వంటచెరకుగా ఉపయోగించింది. శాస్త్రీయంగా చెప్పాలంటే.. గంధపు చెక్కలు, దేవదారు వంటి వృక్షాల పొగలో ఉండే కొన్ని అణువులు (Nuclei) ఆకాశంలోని మేఘాలను ఆకర్షించి, అవి వర్షించేలా ప్రేరేపిస్తాయి. ఆరుబయలు అందరూ కలసి రెండు రోజులుగా వంటలు చేయటం వల్లే మూడో రోజు నుంచి ముసురు పట్టి పుష్కలంగా వర్షాలు కురిసాయి” మంత్రిగారు అసలు విషయం బైటపెట్టారు.
"మంత్రివర్యా! మరోసారి మీ ప్రతిభతో సమస్యను పరిష్కరించారు." అని ప్రశంసించగా , పక్కనే ఉన్న మహారాణి నవ్వుతూ.. "మహారాజా! ఈ ఉపాయం వెనుక ఒక స్త్రీ ఉంది. పురుషులు యుద్ధాలు, లెక్కల గురించి ఆలోచిస్తారేగాని .. స్త్రీలు వంటింటి పొయ్యిని కూడా ప్రజా సంక్షేమానికి అనువుగా తీర్చిదిద్దగలరు " అంది.
మంత్రిగారు తన భార్య చేసిన మేలును వివరించగా, రాజుగారు ఆశ్చర్యపోయి, "కేవలం ఇంటిని కాపాడటమే కాదు, సంక్షోభాలనుంచి రక్షించడంలో కూడా మహిళల ఆలోచనలు ఎంతో అవసరమని మేం గుర్తించాం" అని ప్రకటించారు.
ఆ రోజే తన పాలనలో మూడో వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తూ శాసనం చేశారు మణిద్వీపం మహారాజుగారు.
స్త్రీల సహజమైన ఆలోచనా ధోరణి, సమయస్ఫూర్తి క్లిష్టమైన సమస్యలకు కూడా ఎంతో సులభమైన, శాశ్వతమైన పరిష్కారాలను చూపిస్తాయి. అందుకే ప్రజాపాలన సవ్యంగా సాగాలంటే స్త్రీలకు సైతం శాసనాధికారంలో ఎంతో కొంత భాగం పంచాలి.
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.




Comments