top of page

ప్రేమ(మి)కులం


'Premakulam' New Telugu Story

Written By Varanasi Bhanumurthy Rao

'ప్రేమ(మి)కులం' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"రాగి సంగటి సేసినా! అదే ఎత్తుకొని పో నాయనా! ఈ పొద్దుకి సర్దుకో! నా బంగారు తండ్రివి కదూ!" అంది నారాయణమ్మ మనవడిని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ. "పోయే! రోజూ రాగి సంగటేనా! నా కవమానం ఏస్తా వుండాది. మా స్నేహితులంతా నెల్లూరి బియ్యమన్నం తెస్తారు. నాకేమో రోజూ రాగి సంగటి, పచ్చి పులుసు కలిపిస్తావు. నేను ఇస్కూలుకి పోను. పో!" అని మారాం చేశాడు చంద్రం‌. వున్నగా ఒక్క మనమడు చంద్రం నాలుగు మైళ్ళ దూరంలో వున్న హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుకొంటున్నాడు. వున్న పల్లెలో ఐదవ తరగతి వరకు ఎలాగో ఒకలాగా చదివి ఆరవ తరగతి కి బయట వూర్లో ఉన్న హైస్కూల్లో చేరాడు. ‌ "ఏమి సేస్తాము ? మన లాంటి పేదోళ్ళకి బియ్యం కొనే స్థోమత యాడ వుండాది ? కూలి నాలీ చేసుకొని బతికే వాళ్ళము మనం. బియ్యం కేజీ కొనాలంటే నాలుగు రూపాయలు. అంత కూలి నాకు యాడ, ఎవరు ఇస్తారు నాయనా! అందుకే నూకలు కొని సంగటి సేత్తా వుండా!" అని చీర కొంగుతో కళ్ళు తుడుచు కొనింది నారాయణమ్మ. "అవ్వా! ఏడ్వద్దే! నువ్వు ఏడిస్తే నాకు గూడా ఏడ్పు వస్తాది. నువ్వు సెప్పి నట్లే ఇంటాను. రాగి సంగటే టిఫిన్ బాక్సుకు కట్టు. అదే బలం గదా!" అని తొందరగా స్కూలుకు రెడీ అయినాడు చంద్రం. నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న హైస్కూలుకు నడిచి పోవల్ల అంటే కనీసం ఒక గంటయినా పడుతుంది. తెల్లవారి ఎనిమిది గంటలకు టిఫిన్ బాక్స్ కట్టుకొని, భుజాన పుస్తకాల సంచీ తగిలించుకొని పరుగులాంటి నడకతో నడిస్తే తొమ్మిది గంటలకు హైస్కూలు చేరుతారు. పది గంటలకు ప్రార్థనకు అందరూ బయట నిలబడి ఉంటారు. చాలా మంది పిల్ల కాయలు ఇలా బయట పల్లెల నుండి వచ్చి చదువు కొంటున్నోళ్ళే! మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు స్కూల్ నుండి బయలు దేరితే ఏడు గంటలకు ఇల్లు చేరుతారు. "జాగరత్త నాయనా! అందులో వానా కాలము. ఆ ఏట్లో నీళ్ళు వచ్చినాయంట. ఏట్లోంచి నడిచి వచ్చేటప్పుడు సూసుకొని రాప్పా! లేదంటే సుట్టేసుకొని బిడ్జి మీద నడిసి రాండి" అంది నారాయణమ్మ. "సరే లేయే!" చంద్రం వడివడిగా అడుగులు వేసుకొంటూ వెళ్ళిపొయ్యాడు. మనవడి వంకే తదేకంగా చూస్తూ అలాగే నిలుచుండి పోయింది నారాయణమ్మ. ****************************************** నారాయణమ్మ కు రెండు కళ్ళూ ఆ మనమడు చంద్రమే! వాడి కోసమే తను బ్రతుకుతోంది. వాడ్ని ఎలాగో ఒకలాగు బాగా చదివించి ఒక ఇంటి వాడ్ని చెయ్యాలనేదే నారాయణమ్మ తాపత్రయం. భగవంతుడు తన కుటుంబానికి చేసిన అన్యాయానికి తనెప్పుడూ బాధపడలేదు. ఇదంతా తను పూర్వ జన్మలో చేసుకొన్న కర్మ అని అనుకొని బాధ పడుతుంది. కష్టాలు పడి పడి తన శరీరం కృంగి కృశించి పోయింది. నడుము వంగి పోయింది. కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకి పోయినాయి. అయినా తను చంద్రం కోసం ప్రాణాలు అదిమి పెట్టుకొని బ్రతుకుతోంది. ఉన్నగా నొక్క కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఒక మంచి సంబంధం వెతికి పెళ్ళి చేసింది. చంద్రం పుట్టాక ఇక తన భాధ్యతలన్నీ తీరినట్లే అని సంబర పడి పోయింది. అంత లోనే విధి తన కుటుంబాన్ని వెక్కిరించింది. పంచాయతీ ఎన్నికల్లో తన కొడుకు ఒక పార్టీ కోసం పని చేశాడని ప్రత్యర్థులు ఒక కన్ను వేశారు. మనకు పార్టీలు వద్దు, ఆ రాజకీయాలు వద్దురా నాయనా అంటే తన కొడుకు విన లేదు. ఒక రోజు తన కొడుకును సారాయి అంగడికి తీసుకెళ్ళి ముక్కుల వరకూ తాపించి, మాటా మాటా అనుకొని, వూరవతల ఉన్న చెరువు కాడికి తీసుకెళ్ళి తల నరికేసి నారు. ఈ దుర్వార్త విని తన కోడలు బాపనోళ్ళ బాయిలో పడి ప్రాణాలు తీసుకొంది. మూడేళ్ళ చంద్రాన్ని తన మీద వదిలేసి కొడుకు కోడలు వూర్లోని రాజ కీయాలకు బలి అయిపొయినారు. అనాధగా మిగిలిన చంద్రాన్ని నాయనమ్మ సంరక్షణా బాధ్యతలు చేబట్టింది. నారాయణమ్మ గుండె ధైర్యాన్ని వూర్లో వాళ్ళు అందరూ మెచ్చు కొంటారు. అప్పటి నుండీ అన్నీ తానే అయి రెక్కలు ముక్కలు చేసుకొని కూలీ నాలీ చేసుకొని వచ్చిన డబ్బులతో మనవడ్ని పోషించు కొంటూ వస్తోంది. రోజంతా పొలంలో పని చేస్తే ఇరవై రూపాయలు ఇస్తారు. ‌ వితంతు పెన్షన్ క్రింద ఐదు వందల రూపాయలు వస్తోంది. ‌ అలాగే బ్రతుకు బండిని ఈడుస్తోంది నారాయణమ్మ. **************************************** మనిషిగా పుట్టాక కష్టాలు కన్నీళ్ళు మామూలే! కానీ ఎప్పుడో వస్తాయి. వెడతాయి. అలాగే సుఖాలు వస్తాయి. వెడతాయి. కానీ కొందరి జీవితాల్లో కష్టాలు తప్ప సుఖం అనేది వుండదు. దానికి నారాయణమ్మ జీవితమే దృష్టాంతం. చంద్రాన్ని హైస్కూల్లో వూర్లో పెద్ద కులపోళ్ళతో సమానంగా చదివిస్తావున్నదని పల్లెలో కొందరికి కంటగింపుగా మారింది. రాము, సునీత, గోపాల్, గణేష్, నాగరాజు, ప్రమీల, రేణుక అందరూ ఒక జట్టుగా వెళ్ళి చదువుకొంటారు. రాము, గోపాల్, నాగరాజ్, గణేష్ అందరూ పదవ తరగతి స్కూల్ ఫైనల్ కి వచ్చారు. సునీత, చంద్రం తొమ్మిదవ తరగతి చదువు కొంటున్నారు. మిగతా వారంతా ఆరు, ఏడు తరగతుల్లో చదువుతున్నారు. రాము కి సునీత చెల్లెలు. అన్నా చెల్లెలు కలిసి స్కూలుకు వెడతారు. సునీత మీద ఈగ వాలినా సహించ లేడు రాము. చంద్రానికి సునీత అంటే చాలా ఇష్టం. అలాగే సునీత గూడా చంద్రాన్ని చూడందే వుండ లేదు. చంద్రం అన్ని సబ్జెక్ట్స్ లో చురుగ్గా వుంటాడు. టీచర్లు చెప్పింది అలాగే గ్రహిస్తాడు. సునీతకు గూడా రాని సబ్జెక్టు ను నేర్పిస్తాడు చంద్రం. *************************************** స్కూల్ లంచ్ టైం లో అందరూ కలిసే భోంచేస్తారు. కానీ చంద్రం మటుకు వారితో కూర్చొని భోంచెయ్యడానికి సిగ్గు పడతాడు. దానికి కారణం తను తెచ్చుకొనే రాగి సంగటి గాదు. రాము, గోపాల్ లకి చంద్రం తమతో కూర్చొని తినడం ససేమిరా గిట్టదు. చంద్రానిది తక్కువ కులం అని వారి అభిప్రాయం. కానీ సునీతకు చంద్రం అలా వేరుగా ఎక్కడో కూర్చొని తినడం అసలు ఇష్టం లేదు. ఒక రోజు చంద్రానికి ఇష్టమని చేపల పులుసు చేయించి తీసుకొని వచ్చింది. కానీ చంద్రం ఆమె తెచ్చిన చేపల పులుసు తినడానికి ఒప్పు కోలేదు. అదీ వాళ్ళన్నయ్యకు తెలిస్తే తనను చాకిరేవులో బట్టలు బండకు కొట్టినట్లు తనని కొడ్తారు. అసలు చంద్రం సునీత తో కలుపు గోలుగా ఉండడం వారికి ఇష్టం వుండదు. ఆ రోజు తన కోసం తెచ్చిన చేపల పులుసు తను తీసుకోక పోవడంతో, సునీత ఆ పులుసు పార బొయ్యడం గమనించాడు. ఆ రోజంతా సునీత అన్నం, తన కిష్ట మైన చేపల పులుసు తినలేదు. ఈ విషయం తెలిసీ చంద్రం చాలా బాధ పడ్డాడు. ****************************************** మనిషి పుట్టుకతో ఏ కులంలో పుడతాడో మనిషికి తెలీదు. ఏ మతంలో పుడతాడో గూడా తెలీదు. కుల మతాల అడ్డు గోడల్ని కట్టుకొని మనిషి సాటి మనిషి పట్ల హీనంగా ప్రవర్తిస్తాడు. పుట్టుకతో కులాన్ని అంటగట్టే ఈ సమాజం మనిషిని జీవితాంతం చిత్రహింసల పాలు చేస్తుంది. ఈ సమాజం కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మానవత్వాన్ని చాటు కొన్నప్పుడే సమాజంలో అన్ని వర్గాలూ పరిడవిల్లుతాయి. దేవుడి దృష్టిలో అందరూ సమాన మైనప్పుడు, మనుషులు సృష్టించుకొన్న ఈ కుల మతాలు ఎందుకు ఇన్ని వైషమ్యాల విషాన్ని వెదజల్లి సమాజాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది? చంద్రం వయసులో చిన్న వాడయినా ఈ సమాజాన్ని బాగా అర్థం చేసుకొన్నాడు. తన నాయనమ్మ కేవలం తక్కువ కులం అయినందువలన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదో! ఆ సాయంకాలం ఎంత సేపయినా చంద్రం ఇంటికి రాలేదు. నారాయణమ్మ భయ పడుతూ వూరి పొలిమేర వరకూ మనవడి కోసం ఎదురు చూసింది. భయంతో ఏడుస్తూ చంద్రం గురించి పల్లె లోని వారిని అందరినీ అడిగింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒళ్ళంతా చీరుకు పోయి, రక్త మోడుతూ ఇంటికి చేరుకొన్న మనమడ్ని చూసి బావురు మంది నారాయణమ్మ. "ఏమయింది నాయనా? ఎందుకు అట్లా వణికి పోతా వుండావు! ఎందీ రక్తం ? ఒళ్ళంతా దెబ్బలు ఏంది నాయనా! నా బంగారు తండ్రీ !" అని గట్టిగా ఏడుస్తూ మనమడికి సపర్యలు చేసింది. గాయాల్ని శుభ్రంగా తుడుస్తూ తనకు తెలిసిన ఆకు పసరు నాటు వైద్యం చేసింది. "ఏమి కాలేదులే నాయనమ్మా! మామిడి కాయలు కోస్తామని చెట్టు ఎక్కి క్రింద పడి పొయినాను" అని అబద్ధం చెప్పాడు చంద్రం. ఆ రాత్రి తనకు తగిలిన దెబ్బలకు జ్వరం వచ్చింది చంద్రానికి. ‌ నాలుగైదు రోజులు స్కూలుకు పోవడం మానేశాడు. *************************************** సునీత కోసం దెబ్బలు తిన్న చంద్రం మెల్లగా కోలు కోవడం మొదలు పెట్టాడు. సునీత చంద్రానికి బాగా దగ్గరవుతుందని చంద్రాన్ని నిలదీసి కొట్టాడు రాము. "మా సెల్లెలు తో ఇక క్లాసులు, పాఠాలు అని తిరిగినావంటే ఎముకలు ఏరేస్తా! నీ కులం ఏందీ? మా కులం ఏందో నీకు తెలుసా?" అని భయ పెట్టాడు రాము. చంద్రం నిజంగానే భయ పడి పొయ్యాడు. అప్పటి నుండి సునీతకు కనబడకుండా తిరిగాడు. *************************************** అది వర్షాకాలం. ఎడ తెరపి లేని వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా నీరే! తమ పల్లెకు, హైస్కూలు ఉన్న టౌన్ కి మధ్యన ఉన్న బాహుదా ఏరు పొంగి పొర్లుతోంది. మోకాలి లోతు నీటిలో పాదాల కింద అతి వేగంగా ఇసుక జారి పోతున్నది. బాహుదా ఏరు దాటుకొని పోతే పల్లెకు తొందరగా పోవచ్చు. అదే ఆ ఏటి కడ్డంగా కట్టిన కర కట్టి రోడ్డు మీద పోతే చాలా దూరం నడవాలి. అందుకే ఏటిని దాటుకొని నడవడానికే చాలా మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుస్తారు. నీటి ప్రవాహం తక్కువగా వున్న ఎత్తు పల్లాల్ని చూసుకొంటూ నడచి వెడతారు. ఆ సాయంకాలం దట్టమైన మేఘాలు ఆకాశం నిండా పులుము కొన్నాయి. స్కూలు టీచర్లు మూడు గంటలకే స్కూలు మూసేసారు. తొందరగా ఇంటికి వెళ్ళమని పిల్లలకు చెప్పినారు. చంద్రం వడి వడిగా అడుగులు వేసుకొంటూ పల్లెకు బయలు దేరినాడు. తనకు కొంచెం దూరంలో సునీత తమ అన్నలతో గుంపుగా వెడుతోంది. ఏటి మధ్యలో సునీత ఆగి పోయి నట్లుంది. మిగతా పిల్లలంతా వడివడిగా ఏటి గట్టు చేరు కొన్నారు. ఒక్క సారిగా వరద ప్రవహించింది. వచ్చే ప్రమాదాన్ని పసి గట్టాడు చంద్రం. పరుగులాంటి నడకతో సునీతను చేరుకొన్నాడు చంద్రం. తన బలాన్నంతా ఉపయోగించి సునీతను వీపు మీద ఎక్కించు కొని ఈత కొడుతూ అవతలి గట్టుకు చేర వేశాడు. ఇద్దరి పుస్తకాలు, బట్టలు బాగా తడచి పొయ్యాయి. ఈ హడా వుడిలో సునీత స్కూలు బాగు ఏటి మధ్యలో ఉన్న పెద్ద ఎత్తు బండ మీద వదిలేసింది. నీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టి నట్లుంది. సునీత వద్దంటున్నా వినకుండా ఆ ఎత్తయిన బండ మీదకు ఏటికి అభిముఖంగా వెళ్ళి పుస్తకాల సంచీని పొదివి పట్టుకొని వీపు మీద తగిలించుకొని ఏటి లోకి దూకి గట్టు చేరడానికి ప్రయత్నించాడు. అంతే! నీటి ఉధృతి ఎక్కువయింది. ఇందాక తను చూసిన ఎత్తయిన బండ పూర్తిగా మునిగి పోయింది. వుప్పెనలా పొంగి పొర్లుతున్న ఆ నీటి ప్రవాహానికి ఎదురొడ్డి ఈత కొట్టడం తనకు చాత కావడం లేదు. తన శక్తినంతా వుపయోగించినా ప్రవాహానికి తల వంచక తప్పలేదు. అశక్తుడై రెండు చేతులూ పైకి ఎత్తేశాడు. గంగమ్మ తల్లి చంద్రాన్ని తనలో కలుపు కొంది. చంద్రం ప్రాణాలు క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసి పొయ్యాయి. **************************************** ( ఈ కథ గో తెలుగు. కాం‌లో‌ ప్రచురితం )

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/bhanumurthy/profile

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.





28 views1 comment
bottom of page