top of page
Original.png

శ్రామిక బస్తీ

#SramikaBasthee, #శ్రామికబస్తీ, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Sramika Basthee - New Telugu Story Written By Mayukha

Published In manatelugukathalu.com On 12/08/2025

శ్రామిక బస్తీ - తెలుగు కథ

రచన: మయూఖ


"నాయనా! తాత లెగవట్లే! కాస్త చూడు".


"అవును! తాతకి రెండు రోజుల నుంచి జ్వరం బయటికి పోవట్లే.! మీ యమ్మే కాస్త జావ కాచి పోస్తోంది.”


"నాయనా! నువ్వు ఒకసారి రా! తాతని సూడు.”


"ఏమైంది బిడ్డ! వత్తన్నా ఉండు". అంటూ మల్లేశం గుడిసెలోకి వచ్చి తాతకి ముక్కు దగ్గర వేలు పెట్టి, ఊపిరి పోయిందని తెలుసుకుంటాడు. మల్లేశం గుడిసె పక్కనే తాత గుడిసె కూడా ఉంది. 


నాఅన్న వాళ్ళు ఎవరూ లేరు తాతకి. రోజు బిచ్చమెత్తుకొని బతుకుతున్నాడు.


ఆ వచ్చిన డబ్బులు దాచుకుని, అప్పుడప్పుడు మల్లేశం కూతురు నాగమణికి ఇస్తాడు. నాగమణి 9వ క్లాస్ చదువుతోంది. 


ఆ బస్తీలో మగవాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు, ఆడాళ్ళు ఇళ్లల్లో పనులు చేస్తారు. ఎక్కడ చిల్లర దొంగతనం జరిగిన పోలీసులకి ముందుగా గుర్తుకు వచ్చేది ఈ బస్తీనే. 

ఎవరూ వీళ్ళని పనుల్లోకి తీసుకోరు. పనులు లేక వీళ్ళు దొంగతనాలు మానరు. ఇది ఒక చక్రం.

 ******

తాత పోయిన సంగతి మల్లేశం చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడంతో అందరూ చందాలు వేసుకుని, తాతని చివరి వరకు సాగనంపారు. తాత పోవడంతో నాగమణి ఎక్కివెక్కి ఏడ్చింది. ఉన్నంతలో అందరూ కలిపి భోజనాలు చేశారు తాత పేరు చెప్పుకొని.


తాత పోయి అప్పుడే నెల అయింది. ఆ గుడిసె కేసి ఎవరు వెళ్లలేదు. ఒకరోజు నాగమణి తాత గుడిలోకి వెళ్లి, కుతూహలం కొద్దీ తొంగి చూసింది. ఎందుకంటే తాత ఎప్పుడు తను గుడిసెలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు.


లోపల చిన్న చిన్న సత్తు గిన్నెలు, కుక్కి మంచం, చిరిగిపోయిన పరుపు ఇవే సామాన్లు. ఆ మంచాన్ని నాగమణి తను వేసుకుని పడుకోవాలని పరుపు ఎత్తింది. పరుపు కింద పేర్చినట్టుగా పాత పడిపోయిన, నలిగిపోయిన రూపాయి నోట్లు.. ఒక్కసారిగా గుండె జల్లుమంది. ఎప్పుడూ అంత డబ్బు చూడక. 


ఇంటికి వచ్చి తల్లి తండ్రి తో చెప్పింది నాగమణి.

మల్లేశం ఆ డబ్బు మనం తీసుకుందాం అన్నా, నాగమణి ఒప్పుకోలేదు. 


"ఈ డబ్బుతో మనం మన బస్తీని అభివృద్ధి చేసుకుందాం నాయనా! దొంగలబస్తీ అనే మాట పోవాలి. స్కూల్లో అందరూ దొంగల బస్తీ నుంచి వస్తున్నావా? అంటున్నారు. మా స్కూల్లో లెక్కల టీచర్ ఉంది. ఆమెకి నేనంటే ఇష్టం. ఆమెకి చెపుతా. ఆమె మంచి సలహా ఇస్తుంది" అంది నాగమణి.

 *******

మర్నాడు టీచర్ తో చెబితే, ఆమె "మా సార్ తో చెబుతాను. ఆయన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. మీ అందరికీ ఏదో ఒక ఉపాధి కల్పిస్తారు. నీ బస్తీ వాళ్లని నలుగురిని వెంటబెట్టుకుని మీ నాయన ని రమ్మను. మా సార్ మాట్లాడతారు". అంది టీచర్.


మర్నాడు మల్లేశం మంచి బట్టలు కట్టుకుని ఓ నలుగురిని తీసుకుని టీచర్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే వీళ్ళ కోసం ఎదురుచూస్తున్న టీచర్ భర్త రామారావు వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని,

 

"మీరు ఎవరెవరికి ఏ పనులు వచ్చో చెప్పండి. ఐదారు మంది గ్రూపుగా తయారవ్వండి, మీరు కొంత పెట్టుబడి పెడితే మిగిలినది నేను గవర్నమెంట్ చేత సబ్సిడీ ఇప్పిస్తాను. ముందుగా మీ బస్తీకి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీని ఎన్నుకొని కొంతమంది సభ్యులతో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోండి. 


మీ ఆధార్ కార్డు, ఫోటోలు తీసుకుని మీరు ఏం చేయదలుచు కున్నారో అన్ని వివరంగా రేపు వచ్చి చెప్పండి.ఇక మీరు వెళ్ళండి". అన్నాడు రామారావు.


అందరూ "అలాగే అయ్యగారు! మీరు ఏం చెబితే మేము అది చేస్తాం. ఇక దొంగతనాల జోలికి వెళ్లం. పోలీసులు మా బస్తీ వైపుకి రాకుండా మేం బతుకుతాం" అన్నారు ముక్త కంఠంతో.

 ******

పది రోజుల్లో రామారావు చెప్పినట్లుగా అందరూ గ్రూపులుగా ఏర్పడ్డారు. ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ల వాళ్ల గ్రూపుల్లో చేరారు.లైన్స్ క్లబ్ తరఫున రామారావు అన్ని ముందుండి చూసుకున్నాడు. కలెక్టర్ తో మాట్లాడి వాళ్లకి రుణాలు ఇప్పించాడు. కొద్ది రోజుల్లోనే బస్తీరూ రేఖలు మారిపోయాయి. లయన్ రామారావు సహాయంతో కొంతమంది షామియానా సప్లయర్స్ గా, కొంతమంది పువ్వుల కొట్లు, పళ్ళ కొట్లు, కూరగాయల షాపు పెట్టుకున్నారు. బస్తీ ఎంతో కళకళలాడిపోతోంది.


మంచి రోజు చూసి కలెక్టర్ గారి చేత బస్తీలో సభ పెట్టించాడు. 

కలెక్టర్ మాట్లాడుతూ "ఇంతవరకు ఇది దొంగల బస్తిగా ఉండేది. కానీ మీలోనే ఒక చైతన్యం వచ్చి, మీరందరూ ఆ వృత్తికి స్వస్తి చెప్పి గౌరవనీయమైన పనులు చేయడానికి సిద్ధపడినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు నుంచి పోలీసు వారు మీ బస్తీ వైపు చూడకుండా ఉండేటట్లుగా ప్రవర్తించండి. 


రామారావు గారు చెప్పారు దీనికంతటికి కారణం చిరంజీవి నాగమణి. చదువుకుంటోంది కాబట్టే సంఘంలో గౌరవాన్ని కోరుకుంది. అందుకే మిమ్మల్ని అందరిని మంచివైపు నడిపించింది. ఈరోజు నుంచి ఈ బస్తీ పేరు శ్రామిక బస్తీ " అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 


తర్వాత నాగమణిని మాట్లాడమంటే "అందరికీ నమస్కారం. దీని వెనక కారణం మా తాత. మా తాత పోతూ పోతూ అంత డబ్బు ఇచ్చాడు కాబట్టే మేము అందరం సంఘటితంగా ఏర్పడి గౌరవనీయమైన పనులు చేసుకోవడానికి సిద్ధపడ్డాం.

మా తాత పేరు రామచంద్రం. ఈరోజు నుంచి తాత పేరు మీద రామచంద్రం శ్రామిక బస్తీగా పేరు పెట్టాలని కోరుకుంటున్నాను" అందిహర్షద్వానాల మధ్య నాగమణి.


******శుభం *******


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page