top of page
Original.png

శుచి శుభ్రత

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #శుచిశుభ్రత

Suchi Subhratha - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 16/02/2026 

శుచి శుభ్రత - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 21)

రచన: L. V. జయ

సమర్థ్ తల్లితండ్రులు రాధ, మాణిక్యాలరావు పల్లెటూళ్ళో పుట్టి పెరిగినవాళ్ళు. మాణిక్యాలరావు నార్త్ ఇండియాలో, సెంట్రల్ గవర్నెమెంట్ ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక, సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు.  


జాగృతి పట్నంలో పుట్టి, పెరిగిన అమ్మాయి. ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తోంది. తల్లితండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో, అన్ని రకాల వసతులతో, సదుపాయాలతో పెరిగింది.


జాగృతికి, సమర్థ్ తో పెళ్ళి తరువాత, రాధ సమర్థ్ తో, 'మీ ఆవిడకి పని నేర్పి పంపిస్తానని,' చెప్పి, వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళింది. రాధ పద్ధతులు, అలవాట్లు, జాగృతికి తెలియకపోయినా,  పనివాళ్ళు లేకుండా అన్ని పనులు రాధే చేసుకుంటుండడం చూసి, రాధకి పనిలో సాయం చెయ్యటానికి ప్రయత్నించింది.


కానీ రాధ, "నాకు శుచి శుభ్రతలెక్కువ. ఎవరి పనీ నచ్చదు నాకు. అందుకే పనిమనిషిని కూడా పెట్టుకోకుండా అన్ని పనులు నేనే చేసుకుంటాను." అని గసిరి, జాగృతిని పని దగ్గరికి రానివ్వలేదు. 'పని నేర్పిస్తానని చెప్పి, పని దగ్గరికి కూడా రానివ్వటం లేదేమిటి ఈవిడ?' అనుకుంది జాగృతి. జాగృతికి కూడా శుభ్రత ఎక్కువే అయినా, రాధకి భయపడి దూరంగా ఉండిపోయింది.    


ఆ రోజు రాత్రి రాధ, మాణిక్యాలరావు తో, "చూసారా. ఇది ఒక్క పనిలో కూడా నాకు సాయం చెయ్యలేదు. చక్కగా తిని కూర్చుంటోంది. ఇంటికి కోడలు వచ్చినా, నా పని ఏమీ తగ్గలేదు. నా బతుకులో ఏ తేడా రాలేదు. అంతా నా ఖర్మ." అని భాదగా చెప్పింది.


మాణిక్యాలరావు, జాగృతిని పిలిచి, "అత్తగారు, అలా కష్టపడుతుంటే, పనిలో చెయ్యందించకుండా కూర్చున్నావేం? ఇదేనా మీ ఇంటివాళ్ళు నీకు నేర్పించారు?" అని తిట్టాడు.  మాణిక్యాలరావు మాటలకి జాగృతి బాధపడినా, 'పనిలో సాయంచేస్తానంటే గసిరి, ఇప్పుడు చెయ్యటంలేదని వాళ్ళ అయన చేత నన్ను తిట్టిస్తున్నారేమిటి ఈవిడ!! ఈవిడ మనసులో నా మీద ఎదో ఉంది. ఈవిడ ఎదో దాస్తున్నారు. ఏమిటో చూద్దాం.' అనుకుని రాధని గమనించడం మొదలుపెట్టింది.


మర్నాడు ఉదయం జాగృతి లేచిన సమయానికి, రాధ పెరట్లోనుంది. 'ఇంత ఉదయాన్నే లేచి, ఇక్కడ ఏం చేస్తున్నారు?' అని వంటిటి గుమ్మం దగ్గరనుంచి రాధని చూసింది జాగృతి. రాధ నోట్లో ఉండాల్సిన పళ్ళు, ఆవిడ చేతిలో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. రాధ వాటిని బాగా తోమి, నోటులో పెట్టుకుంది. జాగృతి దృష్టి కిటికీ మీద పడింది. కిటికీనిండా పడున్న ముగ్గుపిండి మధ్యలో, ముగ్గు పిండి డబ్బా, సుద్దముక్కలు, పేస్ట్, బ్రష్ లు, టంగ్ క్లీనర్లు, వాటి పక్కనే పెరట్లోకి వేసుకునే చెప్పులు, పువ్వుల బుట్ట ఉన్నాయి. 'శుచి శుభ్రత ఎక్కువని చెప్పినావిడ, నోట్లో పెట్టుకునే వస్తువుల్ని ఇలాంటి చోట పెట్టారేమిటి?' అనుకుంది జాగృతి.


రాధ, చెప్పులు వేసుకుని వెళ్ళి, పువ్వులు కోసుకొచ్చి, వాటిని బుట్టలో వేసి, పూజ గది ముందు పెట్టింది. 'చెప్పులు, దేవుడి కోసం పువ్వులు పెట్టె బుట్ట అన్నీ ఒక్కచోటనా?' అని ఆశ్చర్యపోయింది జాగృతి.


ముగ్గు డబ్బా తీసుకుని ఇంటిబయట ముగ్గువేసి వచ్చి, "పట్నంవాసులకి ముగ్గులు వెయ్యడం వచ్చో, రాదో?" అని  మాణిక్యాలరావుకి వినపడేలా అంది రాధ. తరువాత, రాధ వంటింటిలోనున్న గిన్నెలు తోమడానికి వెళ్ళింది. రాధ వెనకే వెళ్ళింది జాగృతి. రాధ గిన్నెలను ముందు విమ్ సబ్బుతో తోమి, కడిగి, తరువాత బట్టలుతికే రిన్ పౌడర్తో తోమి, మళ్ళీ కడిగింది. కడిగిన గిన్నెలలో పాలు కాచి, కాఫీ కలిపి, మాణిక్యాలరావుకిస్తూ, 'ఇలా మిలమిల మెరిసేటట్టు గిన్నెలు తోమగలదా ఈ పట్నం ఆవిడ?' అంది.


మాణిక్యాలరావు, జాగృతిని పిలిచి, "చూడమ్మాయ్. ఉదయాన్నే లేవడం, శుభ్రంగా పనులు చేసుకోవడం మీ అత్తగారి దగ్గర చూసి నేర్చుకో. పనుల్లో సాయం చేస్తుంటే అవే వస్తాయి. ఖాళీగా కూర్చుంటే ఏమీ రావు." అని చెప్పాడు.


"నన్ను చూసి నేర్చుకోవడం కూడానా!!  అది నా మాటే వినటం లేదు. చదువుకున్నానన్న పొగరు దానికి." అని చెప్పింది రాధ. మాణిక్యాలరావు, జాగృతిని చిరాకుగా చూసి, "పోనీ. నువ్వు దగ్గరుండి నేర్పించు. నేర్చుకుంటుందేమో చూద్దాం." అన్నాడు రాధతో.


జాగృతి, 'ఈవిడకి నన్ను తిట్టించడమే అసలు పనిలా ఉంది. ఈవిడ దగ్గర నేనేం నేర్చుకోవాలి? ఉదయాన్నే లేచి, ఎవరికీ కనపడకుండా కట్టుడు పళ్ళు తోమడం నేర్చుకోవాలా? లేక బట్టలుతికే రిన్ పౌడర్ తో గిన్నెలని తోమడం నేర్చుకోవాలా? అసలు ఆ పొడి పొరపాటున కడుపులోకి వెళితే ఏమవుతుందో ఈవిడకి తెలియదేమో.' అనుకుంది. 

   

రాధ తరువాత, ఉతకాల్సిన బట్టల్ని తీసుకుళ్తుంటే, జాగృతి రాధ వెనకే వెళ్ళింది. 'గిన్నెలనే రిన్ తో శుభ్రం చేసినావిడ, బట్టల్ని ఎలా ఉతుకుతుందో?' నని చాటునుండి చూసింది. పది చెంచాల రిన్ లో బట్టల్ని నానబెట్టి, తనని ఎవరూ చూడటంలేదని నిర్దారించుకుని, నల్ల రంగు హెయిర్ డై తీసి, జుట్టుకి రాసుకుంది రాధ.


'ఓహో. ఇందుకా ఎవరికీ కనపడని చోటికి వచ్చి, బట్టల్ని ఉతుకుతున్నారు ఈవిడ!! ఇలాంటివన్నీ నాకు తెలియకూడదని నన్ను దగ్గరికి రానివ్వటం లేదేమో.' అనుకుంది జాగృతి.


జుట్టుకి డై వేసుకోవడం అయ్యాక, రాధ బట్టల్ని చేతితో ఉతికి, వాటిని పిండకుండా, దండెం మీద వేసి, స్నానానికి వెళ్ళింది. 'వాషింగ్ మెషిన్ కొనుక్కోవచ్చు కదా. ఇంత కష్టపడడం ఎందుకు? ఉతికిన బట్టల్ని పిండకుండా వదిలేసేరేమిటి? ఆ బరువుకి దండం తెగి పడిపోతే ఏం చేస్తారు?' అనుకుంది జాగృతి. రాధ స్నానం చేసి వచ్చి, ఉతికిన బట్టలని డాబా మీదకి తీసుకెళ్ళి, అక్కడున్న దండాన్ని రిన్ తో తుడిచి, మడతలు పడకుండా బట్టలన్నింటినీ ఆరేసింది. రాధ పనితీరుకు జాగృతి ఆశ్చర్యపోతూ, 'బట్టలకి క్లిప్పులు మర్చిపోయారా ఈవిడ?' అనుకుంది.


రాధ మళ్ళీ ఎవరు తనని చూడటంలేదని నిర్దారించుకుని, తన జుట్టుని విప్పి ఆరబెట్టుకుంది.  పైపైన కనపడే వెంట్రులకు మాత్రమే డై వేసుకుని, లోపల వెంట్రుకల్ని తెల్లగానే రాధ వదిలెయ్యడాన్ని జాగృతి గమనించింది.


'బట్టలకి క్లిప్పులు పెట్టడం మర్చిపోలేదన్నమాట. అవి అర్ సమయంలో ఈవిడ జుట్టుని ఎవరు చూడకుండా ఆరబెట్టుకుందన్నమాట!!' అనుకుంది జాగృతి. బట్టలు, జుట్టు ఆరేంతవరకు డాబా మీదే ఉండి, బట్టల్ని మడతపెట్టి, దాబా మీదనుండి కిందకి దిగింది.


అప్పుడే బయటనుండి వచ్చిన మాణిక్యాలరావు రాధ చేతికి డబ్బులిచ్చి, "నిన్నే వెతుకుంటున్నాను. ఎక్కడున్నావ్ ఇంతసేపూ. పెన్షన్ డబ్బులు వచ్చాయి. జాగ్రత్తగా దాచు. పొదుపుగా ఖర్చు చెయ్యి." అని చెప్పాడు.


"నా పొదుపు గురించి మీకు తెలియదా? క్లిప్పులకి, ఇస్త్రీకి కూడా ఖర్చుపెట్టాను నేను. చక్కగా మడతలు పడకుండా బట్టల్ని ఆరేసి, అవి ఎగిరిపోకుండా చూసుకుంటూ, ఆరేంతవరకు  ఎండలోనే కూర్చుంటాను. నాకు జాగ్రత్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తున్నామన్న పొగరుతో దుబారా ఖర్చులు చేసేవారికి చెప్పండి పొదుపు పాఠాలు." అని జాగృతిని చూస్తూ అంది రాధ. 


మాణిక్యాలరావు, జాగృతిని చిరాకుగా చూస్తూ, "మీ అత్తగారు చెప్పేది అర్ధమయ్యిందా? ఆవిడ దగ్గర పొదుపు నేర్చుకో. ఇంజనీరింగ్ చదివాను, ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు మా దగ్గర చూపించకు." అన్నాడు.


'ఎన్ని మాటలు అనిపిస్తోంది ఈవిడ. నేను ఈవిడ దగ్గర పొదుపు పాఠాలు నేర్చుకోవాలా? నాకేమన్నా జుట్టు తెల్లబడిందా ఈవిడలాగా? బట్టలు ఉతకటానికాని వెళ్ళి, ఎవరికీ కనపడకుండా హెయిర్ డై వేసుకుకోవడానికి. బట్టలు ఆరేంతవరకూ ఎండలోనే ఉన్నానని చెప్పి, ఎవరికీ కనపడకుండా జుట్టు ఆరబెట్టుకోవడానికి?' అని రాధని మనసులోనే తిట్టుకుంది  జాగృతి.


మాణిక్యాలరావు జాగృతిని తిడుతుంటే, రాధ మోహంలో సంతోషంతో వెలిగిపోయింది. ఆ సంతోషంలో వంట చెయ్యడానికి వెళ్ళింది. 'ఇప్పటివరకూ శుచి శుభ్రత, పొదుపు పాఠాలని నేర్చుకోమని తిట్టించిన ఈవిడ, వంట ఎలా చేస్తారో, వంటింటిని ఎలా సర్దుకున్నారో చూద్దాం.' అనుకుంటూ వంటింటిలోకి చూసింది జాగృతి. వంటిల్లంతా బూజుతో, దుమ్ముతో నిండివుంది. డబ్బాలలో ఉండాల్సిన బియ్యం, పప్పులు, పోపు దినుసులులాంటివన్నీ ప్యాకెట్లలో ఉన్నాయి.


'వంటింటిని కూడా శుభ్రంగా ఉంచటం లేదు ఈవిడ. తన భర్త ఏమీ పట్టించుకోడు, తనేం చెప్పినా నమ్ముతాడన్న నమ్మకంతో తన గురించి అన్నీ మంచిగా చెప్పుకుని, నన్ను తిట్టిస్తోంది. ఏముంది ఈవిడ మనసులో?' అనుకుంది.  


వంట చెయ్యడం అయ్యాక, రాధ మాణిక్యాలరావుని భోజనానికి పిలిచి, వండిన పదార్ధాలని వడ్డించింది. జాగృతిని లాగి, "రా అమ్మ. నువ్వు కూడా తిను. నీకొచ్చిన పని ఇదొక్కటే కదా." అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది.


రాధ అంటున్న మాటలు, ఆవిడ ప్రవర్తన జాగృతిని చాలా బాధపెట్టాయి. జాగృతికి తినాలనిపించలేదు. తినే కంచాల పక్కనే జుట్టు, దువ్వెన, మొహానికి రాసుకునే పౌడర్ ఉండడం చూసి, రాధ రిన్ తో కంచాలని కడిగిన విధానం గుర్తువచ్చి, జాగృతికి కడుపులో తిప్పినట్టు అయ్యింది. అసహ్యంతో, కన్నీళ్ళతో, తినకుండా అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది.


జాగృతిని వెళ్ళిపోవడాన్ని చూసి, "చూసారా దీని పొగరు. దీనికి పని నేర్పిస్తానని నా కొడుకుకి చెప్పాను. ఇది ఏమీ నేర్చుకోదు. ఇలాంటిదానితో నా కొడుకు బతుకు ఏమైపోతుందో ఏమో!! ఈవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే, నా కొడుకే వంట చేసుకుని, దీనికి పెట్టాలేమో!! ఈవిడ తిన్న కంచాలని కూడా వాడే కడుగుతాడేమో. నా ఖర్మ కొద్దీ వచ్చింది ఇలాంటి చదువుకున్న, ఉద్యోగం వెలగబెడుతున్న కోడలు." అని ఏడుస్తూ మాణిక్యాలరావుకు చెప్పింది రాధ.


మాణిక్యాలరావు కోపంతో, సమర్థ్ కి ఫోన్ చేసాడు. "మీ ఆవిడ ప్రవర్తన బాగులేదు. ఎవరి మాట వినదు. ఏ పని రాదు. మీ అమ్మ నేర్చుకోమని చెప్తున్నా, నేర్చుకోవడంలేదు. ఒక్క పనిలో కూడా సాయం చెయ్యలేదు. మీ అమ్మ కష్టపడి, వండి పెడితే, అది కూడా తినకుండా వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఇలాంటి దానితో నువ్వు బతకలేవు. ఈ పిల్లని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఉద్యోగం మానేసి, పనులు నేర్చుకుని వస్తే, ముని దగ్గరికి వస్తుంది. లేదంటే ఇక ఆ అమ్మాయిని మర్చిపో." అని చెప్పాడు. రాధ కూడా ఫోన్ తీసుకుని, "నీకు ఈ పిల్ల సరైనది కాదని నేను ముందునుండి చెప్తున్నాను. నువ్వు వినలేదు. చక్కగా ఇంటి పనులు చేసుకునే ఇంకో పిల్లని ఇచ్చి పెళ్ళి చేస్తాను నీకు" అని చెప్పింది. 


రాధ గురించి జాగృతికి పూర్తిగా అర్ధమయ్యింది. ఏ ఉద్దేశంతో, తనతో అలా ప్రవర్తించిందో తెలిసింది. ఉద్యోగం ఎట్టి పరిస్థితిలోనూ మానకూడదని నిర్ణయించుకుంది. కానీ అప్పటికి సమర్థ్ గురించి ఏమీ తెలియని జాగృతి, తను ఎలాంటివాడో, వీళ్ళ మాటలు విని ఎం నిర్ణయం తీసుకుంటాడో అనుకుంది.


మాణిక్యాలరావు చెప్పిదంతా విన్న సమర్థ్, "వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే, ఇంకా తిని పడుకుంటుంది నాన్నా. అమ్మ దగ్గర కూడా పని నేర్చుకోవటంలేదంటే, ఎలాంటిదో తెలుస్తోంది కదా. నా దగ్గరకే పంపించండి. చూస్తూండండి. ఉద్యోగం మాన్పించి, దాని చేత పని చేయించి, దాని తిక్క ఎలా కుదురుస్తానో." అని చెప్పాడు. సమర్థ్ మాటలకి రాధ సంతోషించింది.


తరువాత, జాగృతికి ఫోన్ చేసాడు సమర్థ్. "నువ్వింక అక్కడ ఉండలేవన్న సంగతి నాకు అర్ధమయ్యింది. తొందరగా బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. రేపటికి నీకు టికెట్ కొని పంపిస్తాను." అని చెప్పాడు.


జాగృతి, సమర్థ్ దగ్గరికి వెళ్ళాక, జరిగిందంతా అడిగి తెలుసుకుని, అర్ధం చేసుకున్నాడు. జాగృతి చేత సమర్థ్ పనులు చేయిస్తున్నాడో లేదో, ఉద్యోగం మాన్పించాడోలేదోనని తెలుసుకోవడానికి రాధ, సమర్థ్ కి ఫోన్ చేసింది.


"చక్కగా పనులు చేస్తోందమ్మా. ముగ్గుపిండి మధ్యలో బ్రష్ లు, టాంగ్ క్లీనర్ లు, చెప్పులు, పూల బుట్టలు ఉంచదు. గిన్నెలను రిన్ తో తోమదు. వంటింటిట్లో బూజులు ఉండవు. ఇల్లంతా ఇంద్రభవనంలా ఉంచుతోంది. ఇంక వంట అంటావా? ఇన్నాళ్లు రెస్టారంట్ లో తిన్నవాడిని నేను. అంతకన్నా చక్కగా వండుతోంది. నేను కూడా ఇప్పుడు అన్నీ పనులు తన దగ్గర నేర్చుకుంటున్నాను. ఎప్పటికైనా పనికొస్తాయి కదా. ఏమంటావ్?" అని చెప్పాడు.


వింటున్న రాధ బుర్ర తిరిగింది. మొహం మాడిపోయింది. జాగృతి చేత ఉద్యోగం మానిపించాలని, జాగృతి పరువుని తీద్దామనుకుంది. కానీ ఇప్పుడు తన పరువే పోయింది.   

***

L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya/profile

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page