top of page

అటకెక్కిన హరిశ్చంద్రుడి ఆశయం!



'Atakekkina Harischandrudi Asayam' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 27/01/2024 

'అటకెక్కిన హరిశ్చంద్రుడి ఆశయం' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సీతారామపురం ఊరి చివర కొండ కాలువ గట్టు దగ్గర జోడు తూముల మీద ఫ్రెండ్స్ అందరూ కూర్చుని రోజు లాగే ఇలా మాట్లాడు కుంటున్నారు. 


''కూర్చుండ్రా, ఈ పండుగ రోజున మనం కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుందాం?''


''ఏమిటవి?''


''ఈరోజు నుండి సత్యహరిశ్చంద్రుడు లా బ్రతకడం మొదలుపెడదాం.. ''


''అంటే.. ?''


''తెలిసిన విషయాలు దాయకుండా చెప్పాలి.. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదన్నమాట. ''


''ఇదేదో సినిమాను కాపీ కొట్టి ఇక్కడ మాకు పజిల్ పెడుతున్నట్టు ఉన్నావ్ నువ్వు. ''


''ఏం కాదు.. దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. ''


''అమ్మో.. అలా బ్రతకడం నా వల్ల కాదు.. ''


''నిజమే నావల్ల కూడా కాదు. అలా చెప్తే చాలా కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందిరా బాబు. ''


''ఏ కష్టాలు రావు గాని.. ప్రయత్నిద్దాం. ''


''నీకేరా మీ నాన్న ఎమ్మెల్యే. మీ చిన్నాన్న ఎంపీ. మీ బావ ఎస్సై.. నువ్వు ఎన్ని ఆటలైనా.. ఆడగలవు.. మా వల్ల మాత్రం కాదురా బాబు. ''


''సరే ఒకే ఒక పూట.. ''


''ఒక్క పూట కాదు కదా ఒక గంట కూడా అలా బ్రతకలేం. ఓపిక, ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నించి రా బాబు. ''


''ఇదిగో నువ్వు గెలిచావ్ అనుకో మేం ముగ్గురం కలిపి 10000 ఇస్తాం. నువ్వు ఓడిపోయావ్ అనుకో మాకు ఒక పైసా ఇవ్వక్కర్లేదు. ''


''డబ్బుల గురించి కాదురా మనం అప్పుడప్పుడు ఎక్స్పరిమెంట్ చేస్తుంటాం కదా.. అలాగే ఇది.. సరే ఇప్పుడు మధ్యాహ్నం12 గంటలు అయింది.. రాత్రి 12 గంటల వరకు ఒక్క పూట సత్య హరిశ్చంద్రుడు లా నీతినిజాయితీగా అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను.. ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను. 


***

తన కొలీగ్స్ అంతా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోగా ప్రతిజ్ఞ చేసిన పరశురాం దగ్గరలో ఉన్న తన ఫ్రెండు రాజా రావు ఇంటికి వెళ్ళాడు మొదటగా. 


రాజారావు పరుశురామ్ ని చూసి


“ఇదేమిటి ప్రతిజ్ఞ చేసిన వాడు మొదటగా నా ఇంటికి వచ్చేసాడు.. వీడు ఏం కొంప ముంచుతాడో '.. అని అనుకుంటుండగానే.. రాజారావు తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు పరుశురాం. 


''అంకుల్.. బాగున్నారా.. మీ అబ్బాయి రాజారావు గురించి కొన్ని నిజాలు చెప్పాలని వచ్చాను అంకుల్.. అవును. మేము ప్రతిరోజు జోడు తూముల మీద కూర్చుంటాం కదా వీడి గురించి నాకు బాగా తెలుసు. మీకే తెలియదు వినండి.. వీడు తాగుబోతు. మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. ఇదిగో నేను మీ ఇంటికి వచ్చేసి నిజాలు చెప్పేస్తున్నానని ఆ కిటికీలోంచి ఎలా నా వైపు కోపంగా చూస్తున్నాడో చూడండి. అయినా నాకేం భయం లేదు. నేను ఈ పూట సత్య హరిచంద్రుడిలా బ్రతకాలి.. బ్రతికి తీరతాను. అలా ప్రతిజ్ఞ చేశాను మా బ్యాచ్ అందరి దగ్గర.. సరే ఇంకా వినండి మీ వాడి గురించి. 


ఆ కొండ కాలువ గట్టుమీద కూర్చుని మేమంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు తెలియకుండా అల వాటు చేసుకున్న సిగరెట్లు కూడా గుప్పుగుప్పరింగు రింగుల పొగ వదులుతూ తాగుతాడు మీ అబ్బాయి. ఇంకా చెప్పాలంటే వీడికి మీ పాలేరు కూతురు వరలక్ష్మి తో లవ్ ఎఫైర్ కూడా ఉంది. నిజం.. అది తప్పు కాకపోయినా కథ చాలా దూరం లాక్కొని వెళ్ళాడు. రేపో ఎల్లుండో ఆ పిల్ల భళ్ళు మనటం ఖాయం. '' అంటూ పరుశురాం ఇంకా చెప్తున్నాడు


రాజారావు తండ్రి తన కొడుకు గురించి పరుశురామ్ చెప్పేది ఆసక్తిగా వింటుండగా పరుశురాం చెప్పడం పూర్తయ్యాక అక్కడి నుంచి బయటకు వచ్చి తన మిగిలిన కొలీగ్స్ నాగేష్, జగన్, కృష్ణ మూర్తిల ఇళ్లకు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ల వాళ్ల కుమారులు ముగ్గురు గురించి రహస్యాలు నిజాలు నిప్పులాగ వెళ్ళగక్కాడు. 


ఊహించని పరిణామం ఎదురైనా పరుశురాము కొలీగ్స్

 అందరూ ఏకమై పరుశురాం కొండ కాలువ గట్టు మీదకొస్తే చంపేయాలని నిశ్చయానికి వచ్చేసారు. 


చివరగా తన ఆప్తమిత్రుడు ప్రసాదమూర్తి ఇంటికి వెళ్ళాడు పరశురాం. అతని తండ్రితో ప్రసాద మూర్తి గతంలో చేసిన హత్య గురించి కూడా చెప్పేసి ఆ కేసును ప్రసాదమూర్తి డబ్బుతో ఎలా మాఫీ చేయించాడో వివరించాడు. తన బావ ఎస్సై కనుక ఆ కేసును మళ్ళీ తిరిగి తోడిస్తానని స్పీడ్ గా బండి ఎక్కి వెళ్ళిపోయాడు పరుశురామ్. 


మామూలుగా ఆ రోజు మధ్యాహ్నం.. 


కొలీగ్స్ అంతా కొండ కాలువ గట్టుమీద సమావేశం అయ్యారు. పరశురాం రాక కోసం కసిగా కోపంగా ఉగ్రరూపంతో ఎదురుచూస్తున్నారు. 


కాసేపటికి పరుశురాం రానే వచ్చాడు.. 


రాగానే వాళ్లంతా పరశురాముని చితకబాదేశారు. 


పరశురాం తనను వాళ్ళు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాడు. కర్రతో కొట్టిన మౌనంగా శాంతంగా భరించాడు. పందెం కట్టాడు కనుక ఈ ఒక పూట హరిశ్చంద్రుడిలా, గాంధీ మహాత్మునిలా గడపాలని నిశ్చయంతో ఉన్నాడు. 


చివరికి ఇంచుమించుగా కాకుండా పూర్తిగా రక్తాలు కారాయి పరుశురాముకి. 


పరశురాం పోలీస్ కేసు పెట్టకుండా ఆ బ్యాచ్ అంతా వాళ్లే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుని పరుశురామే తమ అందర్నీ చితక బాదినట్లు వాళ్లే పోలీస్ కేసు.. తిరిగి పెట్టేసారు. 


దాంతో హుటాహుటిని పోలీస్ జీప్ పై వచ్చిన పరుశురాం సొంత బావ ఆయన ఎస్ఐ నిరంజన్రావు పరుశు రాముని జీప్ మీద స్టేషన్ కి తీసుకెళ్లాడు.. పరుశురాం చెప్పిందంతా విన్నాడు. 


''అవును బావా నేను చెప్పేవన్నీ నిజం వాళ్లంతా తప్పుడు మనుషులు ఈరోజు పండుగ కదా నేను సత్య హరిశ్చంద్రుడులా కనీసం ఒక్క పూట బ్రతకాలన్న భావనతో శపథం చేసి ఈ పూట అంతా నిజాలే చెప్పాలని నిర్ణయించుకోబట్టి దాచకుండా వాళ్ళందరి గురించి చెప్పగలిగాను అన్నమాట వాళ్లంతా తప్పుడు మనుషులే. '' అన్నాడు నిర్భయo గా. 


నిరంజన్ రావు ఆశ్చర్యపోతూ వింటున్నాడు. నిరంజన్ రావుకి తన వ్యక్తిత్వం గురించి కూడా ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. 


''అవును ఎస్సై బావ, నేను కూడా ఏమంత గొప్ప వాడిని కాదులే. ఆ మధ్య మా ఇంటిలో 50 వేలు పోయాయి అని మా పాలేరు పైడితల్లి మీద కేసు పెట్టించి వాడికి శిక్ష వేయించి జైల్లో పెట్టించాడు కదా మా నాన్న. అదంతా అబద్ధo. నిజానికి ఆ డబ్బు దొంగిలించింది ఎవరు అనుకున్నావు.. నా అవస రాలకు మా నాన్న డబ్బు ఇవ్వటం లేదని నేనే దొంగిలించానన్నమాట. అంతెందుకు.. నువ్వు మాత్రం మా అక్క ఉంటుండగా ఆ పసలపూడి పంకజాక్షి ని ఉంచుకోలేదా.. ఈ విషయం మా అక్కకి ఇప్పుడే వెళ్లి చెప్పేస్తాను. "


పరశురాం అలా అనేసరికి అన్ని నిజాలే చెప్తుండేసరికి ఎస్సై నిరంజన్ రావు బెంబేలు పడి బెదిరి పోయాడు. వీడేదో వ్రతం పట్టి ఇలా అన్ని నిజాలే చెప్పేస్తుం డడంతో చాలా జీవితాలు నాశనం అయిపోవచ్చు.. అన్న భయంతో పరశురాము ని అక్కడే కూర్చోబెట్టి అతని తండ్రి చిన్నాన్నలకు కబురు పెట్టాడు.. నిరంజన్రావు. 


పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం తెలుసుకున్న పరుశురాం తండ్రిం ఎమ్మెల్యే లింగేశ్వరరావు, అతని చిన్నాన్న ఎంపీ బసవేశ్వరరావు ఇద్దరూ వ్రతం విడవమని పరశురామ ని తిట్టారు. 


"నాన్న.. ఈ పూట అన్ని నిజాలే చెప్పాలని గట్టిగా నిర్ణయంచేసుకున్నాను. అసలు ముఖ్యంగా నీ గురించి చెప్పాలి నాన్న.. ఆ.. గుడిలో బంగారపు వస్తువులు అన్నీ కాజేసి దొంగలు దోచుకుపోయారని ఇదిగో ఈ నా ఎస్సై బావ నిరంజన్రావు చేత తప్పుడు కేసు పెట్టించావు. ఆ వస్తువులు అమ్మకి చెల్లికి ధరింప చేసి దేవుడిని మోసం చేసిన దగాకోరు ఎమ్మెల్యే నువ్వు.. అమ్మో అమ్మో నాకు తెలియదు అనుకుంటున్నావా.. ప్రభుత్వ డబ్బంతా కాజేసి నీ పేరున ఫ్యాక్టరీ కట్టించావు.. అమ్మో. 


ఇక మా చిన్నాన్న.. నీకు అడ్డు తగులుతున్న మాజీ ఎమ్మెల్యే గారిని బాంబు వేసి చంపించేసి కేసు లేకుండా చేసుకున్నాడు. ఎంపీ నిధులన్నీ సొంతానికి వాడుకుని ప్రజలకు మొండి చేయి చూపించాసాడు. ''


అలా ఇంకా ఇంకా పరశురాం చెప్పుకుపోతున్న స్థితి వాళ్ళు ఎవరికీ అర్థం కాలేదు. 


అప్పటికే అక్కడ చేరిన విలేకరులందరూ కూడా పరుశురాం చెప్పింది పూర్తిగా విన్నారు. పరుశురాం జంకు లేకుండ తన కుటుంబంలో వ్యక్తుల దుర్మా ర్గత్వం పూసగుచ్చినట్లు చెప్పటంతో విలేకరులు ఆ ఆ మొత్తం విషయాలు పేపర్లలో ప్రచురించాలి అన్న ఉద్దేశంతో వెళ్లిపోయారు. 


ఆ రాత్రి.. ఎస్సై నిరంజనరావు తన బావమరిది పరశురామ్ని కుర్చీకి గొలుసులతో కట్టేసి ఏ మాత్రం ఆలోచించకుండా నరక బాధలు పెట్టాడు.. లాఠీతో చితకొట్టాడు. 


''ఇది మీ నాన్న చిన్నాన్నల ఆర్డర్. అరేయ్ బామ్మర్ది, సత్య హరిశ్చంద్రుడులా బ్రతి కేయాలి.. అనుకొని ట్రై చేసిన ప్రతి వాడి బ్రతుకు ఇలాగే ఉంటుంది. 


అక్కడికి నువ్వు ఒక్కడివే సత్య హరిశ్చంద్రుడువి మేమందరం రాక్షసులం.. అదే కదా నీ ఉద్దేశం. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ రేపు పేపర్లో వచ్చేస్తే మేమంతా ప్రజలకు ముఖం ఎలా చూపిం చగలo? ఉరి పోసుకుని కానీ ఇంత విషయం తాగి కానీ రైలు కింద తలకాయ పెట్టి కానీ చచ్చి తీరాలి. 


సో మీ నాన్న చిన్నాన్న చెప్పిన దాన్ని బట్టి విలేకరుల దగ్గర ఒక డ్రామా కట్టాలి. 


అదేమిటంటే నీకు మతిస్థిమితం తప్పి.. ఏదేదో చెప్పి నట్టు అదంతా యదార్థం కానట్టు అలా విషయం అంతా నీరు కార్పించమన్నారు. అలా నువ్వు ఒప్పు కొని తీరాలి.. కాదు అని సత్యహరిశ్చంద్రుడులా సత్యం నిజం అనే వ్రతానికి.. గానుగెద్దు అయిపోకు.. 


విలేకరులు వచ్చి మళ్ళీ అడిగితే నాకు బుర్ర పనిగా సరిగా పని చేయడం లేదు. మెంటల్ గా నేను సంవత్సరం క్రితం దెబ్బ తిన్నాను.. ఇంతకుముందు చెప్పినవన్నీఅబద్ధాలు.. అని స్టేట్మెంట్ ఇయ్యి. దాంతో మా అందరి సమస్య క్లియర్. నేను నీకు మతిస్థిమితం తప్పినట్లు ఎలాగో డాక్టర్ సర్టిఫికెట్ సంపాదించి విలేకరులకు చూపిస్తాను. 


ఇదిగో ఈ సెల్ లోనే ఇలా నేల మీద పడుకునే కాసేపు బాగా ఆలోచించుకో. నేను అర్ధ గంటలో వస్తాను. లేదు.. కాదు. నా ఇష్టం నా ఇష్టం అన్నావు అనుకో ఈ తెల్లవారుజామున నిన్ను ఈ సెలలోనే లాకప్పు డెత్ చేయించి అప్పుడు వాళ్లకు కబురు పెట్టమని మీ నాన్న చిన్నాన్నలు ఆర్డర్ వేశారు. ''


అంతా పరశురాంకు వివరంగా చెప్పి అతని బావ ఎస్సై నిరంజనరావు లాఠీతో పదిసార్లు మళ్లీ చితకొట్టి బూటు కాళ్లతో కసి తీరా తన్ని స్పృహ కోల్పోయి రత రక్తాలు కారుతున్న తన బావమరిదిని అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. 


***

కాసేపటికి స్పృహలోకి వచ్చిన పరుశురాం కాసేపు ఏడ్చి ఏడ్చి నీరసంతో నిస్పృహతో నిద్రలోకి జారుకున్నాడు.. ఆ సెల్ నేల మీదే. 


తళక్కున మెరుస్తూ అతనికి ఒక అందమైన కల.. 


@@@@@@


రాత్రి 11:00 దాటిన సమయం.. 


సెల్ బయట తాళం వేసి ఉన్నప్పటికీ ఒక మహారాజు లాంటి వ్యక్తి సిమెంట్ గోడ లోంచి దూసుకుంటూ సెల్ లోపలకు తన దగ్గరకు రావడం గమనించాడు ఆ కలలోనే పరుశురాం. 


''ఎవరు నువ్వు? ఏదో రాజ్యాన్ని ఏలిన మహారాజు లాగా ఉన్నావు.. ?''


''నేను మహారాజు నే. అప్పట్లో నా పేరు హరిశ్చంద్రుడు! చాలామంది సత్య హరిశ్చంద్రుడు అని కూడా అంటారు.. అ.. విచిత్రంగా చూడకు.. విశ్వామిత్రుడు.. , నక్షత్రకుడు, లోహితాస్యుడు, చంద్రమతి ఆ పేర్లు విన్నావుగా అప్పటి హరిచంద్రుడునే. ఏమాత్రం అనుమానపడకు '' అన్నాడు హోందాగా ఆ వచ్చిన రాజులాంటి వ్యక్తి.. సత్య హరిశ్చంద్రుడు. 


''సరే మరి మహారాజు లాగా లేవేమిటి? ఏదో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్న వాడిలా ఇలా చిక్కి పోయి ఉన్నావేంటి?'' ప్రశ్నించాడు పరశురాం. 


''నీకు తెలియంది ఏముంది.. నిజాలు చెప్పి చెప్పి అవస్థలు పడి పడి ఇలా బక్క చిక్కి బల్లి లాగా తయారయ్యానన్నమాట. సరే అప్పట్లోనే ఎవరూ నామీద జాలి పడలేదు. ఇప్పుడు నీకెందుకు అంత బాధ. ''


''అయ్యో బాధపడడం కూడా తప్పేనా హరిశ్చంద్ర?''


''సరే కానీ పరుశురాం ఈ కాలంలో నిజాలు చెప్పి బ్రతికి బట్ట కట్టాలి అనే నీ ధైర్యానికి ప్రయత్నానికి మెచ్చి నిన్ను పలకరించి పోదామని వచ్చాను. '' నవ్వుతూ అన్నాడు మహారాజు సత్య హరిశ్చంద్రుడు. 


పరశురాం తనలో తాను నవ్వేసుకున్నాడు ఆనందంగా. 


''అంతేనా నా సమస్య నుండి గట్టెక్కించగలవా? 'అడిగాడు విచిత్రంగా కళ్ళు తిప్పి. 


''అమ్మో నువ్వు దిగిన ఊబి నుండి రక్షించడం నా తరం కాదు. అదేదో నువ్వే పడు.. సరే కానీ పరుశురాం నీ దీక్ష మాత్రం ఆపకు. ఇంతకీ నేను వచ్చిన ముఖ్య మైన విషయం ఏమిటో నీకు చెప్పమంటావా.. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో పరశురామ్''. చెప్పాడు సత్య హరిశ్చంద్రుడు. 


''అదేమిటి మహారాజా ప్రస్తుతం నేను అష్ట కష్టాల్లో ఉంటే దానికి సరైన ఆలోచన చెప్పడం మానేసి పెళ్లి చేసుకోమంటున్నావ్ ఏంటి నాతో వేళాకోళం ధర్మమా'''


''ఎంతమాట పరుశురాం ఈ సమయంలో నేను మాత్రం వేళాకోళం ఆడగలనా? నిన్ను ఎందుకు పెళ్లి చేసు కోమంటున్నాను అంటే మీ ఆవిడ కడుపున నీ కొడుకుగా.. నాకుమళ్లీ పుట్టాలని ఉందయ్యా. ''. 


''బాగుంది బాగుంది మహారాజా ఇన్ని కోట్ల మంది ఉండగా నా కడుపున పుట్టాలని నీకు ఎందుకు అనిపించింది?''


''ఎందుకయ్యా ఇన్ని కోట్ల మంది ఎవరి పరిధిలో వాళ్ళు చిన్నదో పెద్దదో అబద్ధం ఆడుతూనే ఉన్నారు ప్రతిరోజు.. అలా అబద్ధం ఆడకుండా బ్రతకలేక పోతున్నారు. ఒక్కొక్కళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టి నట్టుగా ఉంటుంది అలా వాళ్లు అబద్ధం ఆడి కోట్లు కోట్లు కూడా సంపాదించగలుగుతున్నారు.. మరి అలాంటప్పుడు నన్ను ఎవరి కడుపున పుట్ట మంటావు? కనీసం ఒక్క పూటైనా అబద్ధం ఆడకుండా నాలాగా బ్రతకాలని నువ్వు నీ స్నేహితుల దగ్గర నిర్ణయం తీసుకుని ప్రతిజ్ఞ చేశావే.. అదే నన్ను కట్టి పడేసింది. ఈ ప్రపంచం మొత్తం మీద నీలాంటి మరొకడు నాకు కనిపించలేదంటే నమ్ము. అందు కనే నీ కడుపున పుట్టాలని నిర్ణయించుకుని వచ్చానన్న మాట. ''


సత్య హరిశ్చంద్ర మహారాజు సంతోషంగా చెప్పాడు పరశురాంకు. పరుశురాం అర్థం కానట్టు చూశాడు మహారాజు ముఖంలోకి. 


''పిచ్చివాడా, నీకు అర్థం కాలేదా.. విను వివరంగా చెప్తాను.. తల్లి అబద్ధం, కూతురు అబద్ధం, తండ్రి అబద్ధం కొడుకు అబద్ధం, గురువు అబద్ధం శిష్యుడు అబద్ధం, భార్య అబద్ధం భర్త అబద్ధం.. మేనేజరు పనివాడు ఇద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు. పోలీసు దొంగ ఇద్దరు ది అదే పరిస్థితి. రాజకీయ నాయకుడు అబద్ధం ఓటర్ కూడా అబద్ధమే ఇలా ఉంది కదా దేశ చరిత్ర.. ఇప్పుడు చెప్పు నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా'' పూర్తిగా వివరించాడు సత్యహరిశ్చంద్ర మహారాజు. 

పరుశురాం ఇంకా అర్థం కానట్టు అలా చూస్తూనే ఉండిపోయాడు. 


“ఈ దేశం బ్రష్టు పట్టి పోయింది పరశురాం. ఇటువంటి బీభత్సమైన పరిస్థితిలో నా కంటికి సత్య దీక్ష పూనిన నువ్వు ఒక్కడివే సత్యవాదిగా కనిపిస్తున్నావని ఎన్నిసార్లు చెప్పమంటావయ్యా. 


అందుకని ఇదే నా చివరి మాట విను నీ కడుపున నేను మళ్ళీ పుడతాను. ఈ దేశానికి మళ్ళీ సత్యం అంటే ఏమిటో నిరూపిస్తాను. సత్యంగా బ్రతికి బట్ట కట్టడం వీలైనంతవరకూ కొంతమందికైనా నేర్పిoచడానికి ప్రయత్నిస్తాను. ఇదంతా నీకు.. కొడుకుగా పుట్టి నేను పెరిగి పెద్దయ్యాక అన్నమాట. అందు కోసం మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా ఆ విషయం చెబుదా మని వచ్చానయ్యా బాబు. నా ఆశ కోరిక తీరుస్తానని నా చేతిలో చెయ్యేసి ఒట్టు వెయ్యి నాయనా పరశురాం''


చాలా బాధాపూర్వకమైన గొంతుతో అన్నాడు సత్యహరిశ్చంద్ర మహారాజు.. 


''సరే.. నీ బాధ ఇప్పటికే అర్థమైంది కానీ ఒకవేళ నేను మాట ఇవ్వకపోతే ఏం చేస్తావు మహారాజా?'' విచిత్రంగా ప్రశ్నించాడు పరశురాం. 


''పరశురాం నిజంగా చెప్పమంటావా నువ్వు మాట ఇవ్వకపోతే ఒట్టు వేయకపోతే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. '' బాధపడిపోతూ చెప్పాడు సత్యహరిశ్చంద్ర మహారాజు. 


''ఆహా ఆహా ఆహా ఆహా.. నువ్వు ఇదివరకు ఎప్పుడో చచ్చిపోయావు కదా మహారాజా మళ్లీ కొత్తగా ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటి నాతో సరదా ఆట ఆడుతు న్నావు కదూ. సరే నీకు నిజంగా నేను మాట ఇచ్చాను అనుకో ఒట్టు వేసాను అనుకో ఇదిగో చూస్తున్నావు కదా నిన్ను నమ్మి ఇప్పుడు ఎంత మహాకర్మ అను భవిస్తున్నానో.. ప్రతి రోజు ఇలాగే అనుభవించవలసి వస్తుంది.. నువ్వు చెప్పింది మాత్రం నా వల్ల ఎంత మాత్రం కాదు. '' నిష్కర్షగా చెప్పేశాడు పరుశురాం. 


''అంటే చివరికి ఎన్ని వందల సంవత్సరాలు ఎదురు చూసిన నా ఆశ చిగురు తొడగదన్నమాట. నాకు నువ్వు మాట ఇవ్వలేవా నాయనా పరశురాం. నేను పెట్టుకున్న ఆశను నిరాశ చేస్తావా?''


సత్య హరిశ్చంద్రుడు అత్యంత బాధపూరిత హృదయంతో అన్నాడు. 


''మహారాజా తప్పదు అదిగదిగో గడియారం అర్ధరాత్రి 12 గంటలకు కొట్టేసింది. నా దీక్ష సమయం దాటి పోయింది. నేను ఒకే ఒక్క పూట నీలా ప్రవర్తించాలని దీక్షబూనాను. ఇంకా ఒక్క నిమిషం కూడా నీ దీక్షలో ఉండలేను. ''


ఏమాత్రం మొహమాటo లేకుండా చెప్పేసాడు పరశురాం. 


''అందుకని.. '' బేల ముఖం వేశాడు మహారాజు సత్య హరిశ్చంద్రుడు. 


''మా వాళ్ళకి సరెండర్ అయిపోతాను. ప్రస్తుతం నేను బ్రతికి బట్ట కట్టాలంటే వాళ్ళు చెప్పిన విధానము లో నడుచుకోకతప్పదు. సత్యహరిశ్చంద్ర మహారాజా నిజం చెప్పమంటావా నాకు ఇంకా చాలా కాలం పాటు బ్రతికి బట్ట కట్టాలని ఇక్కడి స్వర్గసుఖాలు అన్నీ అనుభ వించాలని ఉంది. అయితే నీ సత్య దారిలో ఇవన్నీ ఉండవు కదా. నీ సత్యమైన దారికి నేను రాలేను నన్ను వదిలేయ్''. 


మరోసారి ఖచ్చితంగా చెప్పేసాడు పరశురాం. 


''నాయనా పరుశురాం నీ చివరి మాట ఇదేనంటావా??'


''అవును సత్యహరిశ్చంద్ర.. నేను నీ కన్నా చాలా చిన్నవాడినైనా.. అల్పుడునైనా.. మా దేశ కాల మాన పరిస్థితుల ప్రకారం నీకో సలహా ఇచ్చి తీరాలి.. అదే అదే చెప్పమంటావా చెప్పేస్తున్నాను విను.. నువ్వు తప్పు జారి కూడా ఎవరి కడుపున పుట్టవద్దు.. 


పుడితే నీతో కలిసి జీవనం సాగించడానికి నీలాంటి మరో మనిషి నీకు ఈ భూ ప్రపంచంలో దొరకడు. 


దాంతో నువ్వు ఒక్కడివే ఏకాకిలా ఎలా బ్రతకగలవు? అప్పుడైనా నువ్వు మరొకసారి మళ్ళీ కచ్చితంగా చచ్చి తీరాలి. అందుకని ఈ గోల అంతా ఎందుకు కానీ నా మాట విని నీ ప్రయత్నం మానుకో. 


నేను కూడా నా దీక్ష విరమించుకుంటాను. 


నేను ఇప్పుడు విలేకరుల ముందు పిచ్చివాడిగా నటించబోయే మెంటల్ పరుశురాముని అన్నమాట. 


అర్థమైంది కదా.. అబద్ధం ఆడకుండా, అన్యాయం దగా మోసం చేయకుండా, కుళ్ళు కుట్ర ద్రోహం లేకుండా బ్రతకలేనటువంటి భయంకర పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఈ దేశంలో.. 


నీ సిద్ధాంతాలే కాదు మా మహాత్ముడు.. గాంధీ గారి సిద్ధాంతాలు కూడా ఎప్పుడో తుంగలో తొక్కి 

భూస్థాపితం చేసేసుకున్నాము. 


మా గౌతమ బుద్ధుని ఆచరణలు కూడా మరచిపోయాం. 


ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో.. అరిగరిగో మా వాళ్ళందరూ విలేకరులతో పాటు వచ్చేస్తున్నారు. 


వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో.. '' అంటూ.. ఆ సెలలో నేల మీద పడి గట్టిగా అరుస్తు న్నాడు పరశురాం. 


అతనికి వచ్చిన కల కరిగిపోయింది.. నెమ్మది నెమ్మదిగా. 


@@@@


ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటలకు దాటిన తర్వాత.. తను కన్న కలలోంచి.. 


యదార్థంలోకి వచ్చాడు పరశురాం.. ఆ సెల్ లో. 


దూరంగా చీకట్లో వెనుతిరిగి సెల్ గోడలు దాటుకుంటూ బాధగా అలా అలా వెళ్ళిపోతున్న మహారాజు సత్య హరిశ్చంద్రుడు.. స్పష్టంగానే కనిపిస్తున్నాడు పరశురాం కి!!!!


''సత్య హరిశ్చంద్రుడైన, శ్రీరామచంద్రుడైన, జీసస్ అయినా, అల్లా అయినా, మహాత్మా గాంధీ అయిన, గౌతమ బుద్ధుడైన.. ఎవరూ మళ్లీ పుట్టరు.. పుట్ట కూడదు!!!!''


అంటూ తనలో తానే గొణుక్కుంటున్నాడు పరుశురాం. 


 ******

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు




 


34 views0 comments
bottom of page