top of page

కొండంత అమ్మ అండ



'Kondantha Amma Anda' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 27/12/2023

'కొండంత  అమ్మ అండ' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



చిన్నతనంలోనే  భర్తను  కోల్పోయిన చంద్రమ్మ తన కొడుకులిద్దరినీ  కష్టపడి   పెంచుకుంటూ,  ఉన్నంతలో  గౌరవంగా  బ్రతుకుతోంది. గ్రామంలో  తనకున్నది  రెండెకరాల పొలం, చిన్న  పెంకుటిల్లు. పెద్ద కొడుకు  మోహన్  చక్కగా చదువుతూ పదవతరగతి  పాసయ్యాడు. తనకు  పై  చదువులు  చదివే స్తోమత లేక  తమ  పొలంలో  వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని  పోషిస్తున్నాడు.

వయసుతో పాటే  మోహన్ లో క్రమేపి  ఆధ్యాత్మిక ధోరణి  ఎక్కువవుతూ వస్తోంది. ఉపవాసాలు, పూజలు, పునస్కారాలు, చక్కటి సత్ప్రవర్తనతో  ఉంటూ  అతను  గ్రామస్థుల మన్ననలను పొందుతున్నాడు. 


రెండవకొడుకు  వంశీ  చక్కగా చదువుతూ  మంచిమార్కులతో పదవతరగతి పాసయ్యాడు.


మోహన్ కి  తమ్ముడంటే  ప్రాణం. వంశీకి  తన అన్నంటే  వల్లమాలిన అభిమానం. ఆ అన్నదమ్ముల  సఖ్యతను, వాళ్ల ప్రేమానురాగాలను  చూసి  ఆ గ్రామస్తులు  చాలా మురిసిపోతున్నారు. 


వంశీ  పట్నంలో  కాలేజీలో చేరాడు. మోహన్  కష్టపడి వ్యవసాయం  చేస్తూ  పంటను  పండించి  ఆ పంటను  అమ్మగా  వచ్చిన పైకాన్ని  తన తమ్ముడి చదువుకి, వాడి ఖర్చులకు  పంపేవాడు. వంశీ  కష్టపడి చదివి  డిగ్రీ  పూర్తి చేశాడు.  కొన్నాళ్లకు  వంశీ మంచి ఉద్యోగంలో  చేరాడు. తమ కష్టాలు  తీరాయని  చంద్రమ్మ, మోహన్ లు  అభిప్రాయపడ్డారు.


మోహన్ కి  పెళ్లి చేద్దామని  తల్లి  నిర్ణయించుకుంది. కానీ  పెళ్లికి  మోహన్ సుముఖత చూపలేదు. పెళ్లి చేసుకుంటే  మరోయువతి  తనకి  భార్యగా వచ్చి  వాళ్ల ముగ్గురినీ  విడదీస్తుందని, తమ కుటుంబంలో కలతలు, కల్లోలాలు, మనస్ఫర్థలు  వస్తాయని  అభిప్రాయ పడి  తనకి  పెళ్లి వద్దని  నిక్కచ్చిగా చెప్పాడు. ఆ ఊరి  పెద్దలు  ఎంతగానో  నచ్చచెప్పచూసినా  అతను పెళ్లికి  సుతరాము ఇష్టపడలేదు. తను ఆంజనేయ స్వామి  భక్తుడిననీ, ఆజన్మాంతం  బ్రహ్మచారిగా ఉంటానని  భీషణ  ప్రతిజ్ఞ చేశాడు  మోహన్. . ఇంక చేసేదిలేక అందరూ  మిన్నకున్నారు. 


కాలం సాగిపోతోంది. కొన్నాళ్ల తర్వాత  వంశీకి మంచి  సంబంధం చూసి  పెళ్లిచేసింది చంద్రమ్మ. మోహన్ తన తమ్ముడిని, మరదలినీ  మనస్ఫూర్తిగా  ఆశీర్వదించాడు. పట్నంలో తన ఆఫీసుకి  దగ్గరలో ఒక ఇంటిని  అద్దెకు  తీసుకుని   వంశీ తన భార్యతో  క్రొత్త కాపురం  పెట్టాడు. అన్యోన్యంగా, సంతోషంగా కాపురం  చేసుకుంటున్న  ఆ క్రొత్త జంటని చూసి సంతోషిస్తున్నారు  చంద్రమ్మ, మోహన్ లు. అప్పుడప్పుడు వాళ్ల వద్దకు   వెళ్లీ చూసొస్తూ  వాళ్లకు  కావలసినవి  తమ ఇంటినుంచి  తీసికెళ్లి  ఇచ్చివస్తున్నారు  చంద్రమ్మ, మోహన్ లు.


 రెండు సంవత్సరాల తర్వాత  వంశీ కి  కొడుకు పుట్టాడు. వంశోధ్ధారకుడు వచ్చాడనే సంబరంతో  చంద్రమ్మ, మోహన్ ల  ఆనందానికి అవధులు లేవు. వాడికి  ‘’కిరణ్” అని పేరు పెట్టుకొని  అల్లారుముద్దుగా  పెంచుతున్నారు. కిరణ్  తన ఆట, పాటలు, ముద్దుమచ్చట్లతో  అందరినీ  అలరిస్తున్నాడు.  అప్పుడప్పుడు  వాడిని తమ ఇంటికి  తెచ్చుకుని  ప్రేమగా  చూసుకుంటూ  మురిసిపోతున్నారు  చంద్రమ్మ, మోహన్ లు.


కొన్నాళ్లకు  కిరణ్  స్కూలులో చేరాడు. వాడు కష్టపడి చక్కగా చదువుతున్నాడు. అతను నాయనమ్మ,  పెదనాన్నల  ప్రేమానురాగాలు  పుష్కలంగా  పొందుతున్నాడు. కాలం  హాయిగా సాగిపోతోంది. కొన్ని సంవత్సరాల తర్వాత  కిరణ్  కాలేజీలో చేరాడు.  వంశీ తన భార్య  చెప్పుడు మాటలతో  చాలా  మారిపోయాడు. తన తల్లంటే, అన్నయ్యంటే  ప్రేమానురాగాలు  క్రమేపి  తగ్గిపోయి  తను, తనకుటుంబమనే  స్వార్థగుణం  అతనిలో పెరిగిపోతోంది.  


కొన్నాళ్లకు   వంశీ, అతని భార్య  పట్నంలో  ఇంటిని కొనుగోలు  చేయడానికి  తనవాటా పొలాన్ని  అమ్ముకోవాలని గట్టి పట్టుపట్టారు. దానికి  చంద్రమ్మ  ససేమిరా  ఒప్పుకోలేదు. తను  బ్రతికున్నంతకాలం  ఆ పొలాన్ని  అమ్మే ప్రసక్తిలేదని, కడదాకా  ఆ  అన్నాతమ్ముళ్లు  అన్యోన్యంగా, సఖ్యతగా  ఉండాలని  తన కోరికని  చెప్పింది. 


వంశీ  మొండితనంగా  తన పొలం అమ్మాల్సిందేనని  పట్టుబట్టాడు. ఇంట్లో  పెద్ద గొడవ జరిగింది. మోహన్  తన  పొలాన్ని కూడా అమ్మి  ఆ పైకాన్ని  తమ్ముడికి  ఇంటికోసం ఇచ్చి  తన  ఆస్తిని  కూడా త్యాగం  చేశాడు. పట్నంలో  వంశీ  క్రొత్త  ఇంటిని  కొని తన భార్యాబిడ్డలతో  సంతోషంగా ఉంటున్నాడు.  అతను   తన తల్లితో, అన్నయ్యతో   ప్రేమానుబంధాలను  తగ్గించుకుని   రాకపోకలను  పూర్తిగా  మానేశాడు. ఈ పరిణామాలకు  చంద్రమ్మ, మోహన్ లు  చాలా వ్యధచెందారు. 


రోజులు  గడుస్తున్నాయి. కాలము,  ప్రాయము ఎవరికోసమూ  ఆగదు కదా! కొన్ని సంవత్సరాల  తర్వాత  చంద్రమ్మ  వార్ధక్యంతో  బాధపడి  తనువు చాలించింది.  మోహన్  చాలా  బాధపడి  తల్లి  తదుపరి కార్యక్రమాలను  సక్రమంగా  నిర్వర్తించాడు. మోహన్  ఒంటరివాడయ్యాడు. తల్లి పొలాన్ని  సాగుచేసే  ఓపిక లేక  కౌలుకు ఇచ్చాడు. ఇంట్లో ఉంటూ  కొన్నాళ్లు  తనే వండుకుని  తిన్నాడు.   


చూస్తూండగానే  మోహన్ కు  అరవైఐదు సంవత్సరాలు  వచ్చాయి. శారీరక బాధలు తలెత్తాయి. ఒంట్లో  ఓపిక  తగ్గిపోయి  మానసికంగా, శారీరకంగా  బాధపడుతున్నాడు.  ఆకలికోసం  అతని  పొట్ట బయటపడింది.  గ్రామస్థులు    అతని మీద  అభిమానంతో  తమ ఇంట్లో  వారాలకు అతడిని  పిలిచి భోజనం  పెడుతున్నారు. 


“తన అమ్మ ఉంటే తనకీ దుస్థితి ఉండేది కాదుగదా ! ఇప్పుడు  ఏకాకినయ్యాను. అమ్మ బ్రతికి ఉంటే  ఎంత బాగుండేది? తనకేలోటూ  ఉండేదికాదు. అమ్మ  ప్రేమానురాగాలు, ఆప్యాయత, ఆదరాభిమానాలు  తనకి అన్నిటికన్నా  మిన్న.  అమ్మ దయ ఉంటే  అన్నీ ఉన్నట్టే. కొండంత  అమ్మ  అండ ఉంటే  ఎంత  బాగుండేది?” అని తన తల్లిని  తలచుకుంటూ  బాధాతప్త హృదయంతో  కుమిలిపోతూ దుఃఖిస్తున్నాడు   మోహన్. 


…సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



50 views0 comments
bottom of page