top of page

తప్పు చేయద్దు!


'Thappu Cheyaddu' - New Telugu Story Written By A. Annapurna

'తప్పు చేయద్దు' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


సరే ఎలాగా లేట్ అవుతుందని చెప్పెడుకదా అని దీప పిల్లలను స్కూల్ నుంచి పార్కు లోకి తీసుకువెళ్ళింది,

మీటింగ్లో డిస్ట్రబ్ చేయడం ఎందుకని. దీప పార్క్ కి వెళ్లినట్టు మెసేజ్ పెట్టలేదు.


ఇంటికి వస్తూ మెసేజ్ పెట్టింది.. ‘ఇంటికి వస్తున్నారా?’ అని.

చరణ్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి అలసటగా సోఫాలో పడుకుని నిద్రపోయాడు.


''ఓ డాడ్ వచ్చేసారు. నేను త్వరగా డిన్నర్ రెడీ చేస్తాను. మీరు షవర్ చేసి రండి…” అని పిల్లలను పంపి

దీప కిచెన్లోకి వెళ్ళింది.


వాళ్ళు వచ్చిన అలికిడికి మెలకువ వచ్చింది చరణ్ కి.

అతనుకూడా స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గిరకు వచ్చేసరికి నందు ఆనందు వచ్చి వున్నారు.


''మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ ''అన్నాడు చరణ్.


''వాహ్ట్ డాడీ? అన్నారు పిల్లలు.


''ఏమిటో చెప్పండి.. ఆ గుడ్ న్యూస్. అంది దీపకూడా.


'' నాకు డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది.... అన్నాడు.


''కాంగ్రాచులేషన్స్ డాడ్ !” అంటూ పిల్లలు లేచి అతడిని హాగ్ చేసుకుని కిస్ పెట్టారు.


నందు కి కొంచెం తెలుసు. అర్ధం అవుతుంది. కానీ ఆనందు అన్నను చూసి అలాగే చేస్తాడు, తప్ప ప్రమోషన్ ఏమిటో వాడికి తెలియదు.


దీప పిల్లల ఎదురుగా వున్నారు కనుక దూరంగా వుండే శుభాకాంక్షలు చెప్పింది భర్తకి, కళ్ళతోనే సంతోషం తెలియచేస్తూ.


పిల్లలు నిద్రపోయాక అతడి బాహుబంధంలో చేరి మనస్ఫూర్తిగా మరోసారి చెప్పింది.


''ఇదంతా బాగానేవుంది కానీ, ప్రమోషన్తోబాటు ట్రాన్స్ఫర్ తప్పదు. ముంబై ఆఫీసుకి వేశారు నన్ను. !” అన్నాడు చరణ్.... అసలు విషయం చెబుతూ.


''అయితేనేం అందరమూ వెడతాం. నాకు ముంబై వెళ్లాలని కోరిక.... ఈరకంగా తీరుతుంది....” అంటూ మరోసారి చరణ్ ని హాగ్ చేసుకుంది... దీప.

''ఎలా? నందు స్కూల్ ప్రారంభం ఐ మూడునెలలు అయినది. ఇక్కడ స్కూల్ మధ్యలో వెడితే వాడికి అక్కడ సరిపడదు. కనుక మీరు ఏడాదివరకూ ఇక్కడ ఉండాలి. నేను నెలకు ఒకసారి వస్తాను. పిల్లలకు వెకేషన్ వచ్చినపుడు మీరు ముంబయి వద్దురుగాని.'' అన్నాడు చరణ్.


''ఆమ్మో ఇప్పటిదాకా మేము ఎప్పుడూ మిమ్మల్ని వదిలి వుండలేదు....” అంది దీప విచారంగా !


''నిజమే. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి. నాకంటే నువ్వే వాళ్ళదగ్గిర ఉండాలి. తప్పదు'' అని ఓదార్పుగా చెప్పేడు.


అతడికీ బాధగానే వుంది. పైకి గంభీరంగా వున్నాడు.... అంతే!


వారం రోజుల తర్వాత ముంబై వెళ్ళాడు. అక్కడ విశాలమైన క్వార్టర్, ఖరీదైన ఫర్నిచర్, వంటవాడు, ఇద్దరు పనివాళ్ళు, అంతకంటే అందమైన సెక్రటరీని ఇచ్చారు.


అంతా సర్దుకుని నెలరోజుల తర్వాత హైదరాబాదు వచ్చాడు. వారం రోజులు దీప పిల్లలతో గడిపి మళ్ళీ ముంబై వచ్చాక చరణ్ కి దిగులుగా అనిపించింది.


అనుకున్నంత సులువు కాదు, కుటుంబానికి దూరంగా ఉండటం... అని తర్వాత వీకెండులో వాళ్లనే పిలిపించుకున్నాడు. ఇల్లు వైభోగం చూసి నందు, ఆనందు “మేము ఇక్కడే ఉంటాం డాడీ, హైదరాబాద్ వెళ్ళం…” అన్నారు.


''ఇంత ఇల్లు ఎందుకు మీకు? అత్తయ్య మామయ్యను పిలిపించుకోండి ! లేదా చిన్న ఫ్లాట్ తీసుకోండి''

అంది దీప.


''మీరు ఎలాగా పది నెలల్లో వచ్చేస్తారు. వదిలేస్తే మళ్ళీ ఎలాట్ కావడానికి టైం పడుతుంది. ఉండనీ'' అన్నాడు చరణ్. పిల్లలకు ఎలాగో నచ్చచెప్పి వాళ్ళను తీసుకుని హైదరాబాదు వచ్చేసింది దీప.


ఆఫీసులో సెక్రటరీ పేరు మిళింద. నార్త్ ఇండియన్. వృత్తి రీత్యా చొరవగా చురుగ్గా ఉంటుంది.


స్వభావంలో కూడా డాషింగ్ నేచర్. అంతవరకూ చరణ్క కి కోలీగ్స్ను ఆడవాళ్లు తెలుసు. కానీ ప్రత్యేక హోదాతో తనకి అతిదగ్గిరగా ఉన్న మిళింద సహజంగానే అతడిని ఆకర్షించింది.


పైగా దీపకి దూరంగా ఉండటం... స్త్రీ -పురుష ఆకర్షణా అతడిని వివశున్ని చేసింది.


ఆఫీస్ పనేకాకుండా అతడి ఒంటరితనం పోగొట్టడానికి క్లబ్ పార్టీ బిజినెస్ టూర్స్ కల్పించుకుని చేరువ

అయింది. చరణ్ ఇక్కడ ముంబైలో పూర్తిగా అడ్జెస్ట్ అయిపోతే హైదరాబాదులో దీపా పిల్లలు కూడా చరణ్ లేకుండానే స్వంత పనులు చేసుకోడానికి అలవాటు పడ్డారు.

ఇంకెంత కొద్దిరోజులే.... అనుకుంటూ పాపం దీప ధైర్యంగా ఉండేది. నందు - ఆనందులకు స్కూల్ 'ఫ్రెండ్స్, స్పోర్ట్స్, వీటితో తీరిక లేనంతగా రోజులు గడిచిపోయాయి.


చరణ్ - మిళింద మధ్య అతి చనువును ఆఫీసులో చాలా మంది గ్రహించారు. వాళ్లలో వాళ్ళే గుసగుసలాడుకునేవారు.

‘మరీ మిళింద హద్దుమీరింది. పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు వున్నారు. ఇదేమిపని?’ అనుకున్నారు.


''మన బాస్ కి కూడా అంతేకదా.. భార్యా పిల్లలు ఉండగా తప్పుకాదా ! ఇద్దరిదీ తప్పే’. అనుకున్నారు.


''మగబుద్ధి ఇంతే, ఇలాంటివారిని ఎవరుమాత్రం కాపలా కాయగలరు?” అన్నారు కొందరు.


''మిళింద హస్బెండ్ చేతకానివాడా, భార్య సంగతి తెలుసంటావా?’


''ఎం తెలుస్తుంది! ఆఫీసుకాని రావడం రోజంతా బాస్ దగ్గిరే పని..... అందరి కళ్ళుకప్పి ఎంజాయ్ చేయడం ఏమి ఎరగనట్టు సాయంకాలం ఇంటికి పోడం”.


''బాస్ భార్య ఎక్కడో హైదరాబాదులో ఉంటుంది. ఆవిడకు తెలియదు. తెలిసినా పిల్లలకోసం భరిస్తుంది పాపం!'' జాలిపడ్డారు ఎవరో.


''నేను ఫోటోలు తీశాను చూడండి....” అంటూ ఒక ఉద్యోగి అందరికీ చూపించాడు.


''మంచిపని చేసావ్. రేపు అవసరానికి పనికివస్తాయి. ''


''మనకెందుకులెద్దు. '' అన్నాడో బుద్ధిమంతుడు.


''మన ఎంప్లాయాస్కి ఆదర్శంగా ఉండాల్సినవాడు. ఇలాంటి బిహేవియర్ మంచికాదు.... బుద్ధిచెప్పి పంపేద్దాం'' అంది మరో మహిళా ఉద్యోగి.


''అసలు మిళింద భర్త సంగతి కనుక్కుంటా…” అన్నాడు ఒకతను.


''మగాడు గాలం వేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆడవాళ్లు చేపలుకాదు.... అని మనం నిరూపించాలి. ఈమె ఎమ్ చేసిందో చూడండి..... ఎగిరివెళ్లి వొళ్ళోకూర్చుంది. చి ఛీ ఆడజాతినే అవమానించింది... ''

మరో సీనియర్ మహిళా ఉద్యోగిని బాధపడింది.


ఇలా అందరికి చరణ్ - మిళింద చులకన అయ్యారు.

నందుకు హైస్కూల్ చదువు పూర్తి ఐంది. ముంబై కాలేజీలో చేరాడు. దీప పిల్లలతో వచ్చింది. ఇక మీదట విడిగా ఉండక్కర్లేదని మురిసింది.


ఆఫీసులో అందరూ చేరి మళ్ళీ సమావేశం అయ్యారు. ''ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటావ్?”


''.... నీకీ సంగతి తెలుసా ? మిళిందకి ఫ్లాట్ కొన్నాడట మన బాస్. ఆవిడకు భర్త చనిపోయాడట ఎప్పుడో.. ఇంతకాలమూ ఆయన మాటాడటం లేదు అనుకున్నాం. లేపేసిందన్నమాట... అడ్డులేకుండా. ''


''ఏమో... మనకెందుకూ... తోడుకోసం బాస్ ని ఆశ్రయించిందన్నమాట !”


''ఈ న్యూస్ విన్నావా.. ఇద్దరూ విదేశాలకు వెడుతున్నారు నెలరోజులు.. ఆ టైములో మన ఆఫీసుకి లేడీబాస్ వస్తుంది అన్నారు. ''


''అవునుగాని దీపగారికి తెలుసోలేదో. ''


''నువ్వుగాని చెబుతావా? వాళ్ళ కాపురం చెడగొట్టకు. వాళ్ళు వాళ్ళూ చూసుకుంటారు. ''


'' కానీ మనబాస్ తనకుటుంబాన్ని పాడుచేసుకోడం బాధగా వుంది. మనం ఏమైనా బాగుచేయగలమా?''


''ఎలా ?వాళ్ళ స్వంత విషయాలలో ఇన్వాల్ కాకూడదు. ''

అక్కడితో వాళ్ళు సైలెంట్ అయిపోయారు.


దీపా పిల్లలు ముంబై వచ్చినా చరణ్ లో ఇంతకు ముందు సంతోషం కనిపించటం లేదు.

దీప కనిపెట్టి అడిగింది.


''ఏమిటి? దిగులుగా వుంటున్నారు! ఆరోగ్యం బాగుందా?''


''నేను చాలా అలిసిపోతున్నాను. ఇక్కడ వర్క్ ఎక్కువగా వుంది. ప్రమోషన్ కదా అని సంతోషం లేదు'' అన్నాడు.


ఆమె అంత తెలివితక్కువది కాదు. చదువుంది ఆమె ఫ్రెండ్స్లో అన్ని ఫీల్డ్స్లో పెద్దఆఫీసర్లు వున్నారు.

వాళ్ళు చరణ్ కంటే వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ అలిసిపోలేదు.


ఫోను చేస్తే తీయడు. మెస్సేజ్ పెడితే చూడడు. కావాలనే దూరంగా ఉన్నట్టు గ్రహించింది. ఇంటికివచ్చి లాప్టాప్ తోనే ఉంటాడు. సడన్గా బయటికి వెళ్లి వస్తాడు.


మొక్కుబడిగా ఎవరో అతిథిలా ప్రవర్తిస్తాడు. అడిగితె ఎదో కారణం చెబుతాడు. వేరే రూంలో పడుకుంటాడు.


దీప నిలదీసింది. ''చరణ్! మీలో చాలా మార్పు వచ్చింది. నేను ఇక్కడికి రాకుండా హైదరాబాదులోనే ఉండిపోతే మీరు ఆనందంగా ఉండేవారేమో. అర్ధం చేసుకోలేనంత తెలివితక్కువ దాన్నికాదు. '' అని కన్నీరు పెట్టుకుంది.


అప్పుడు చెప్పేడు.... “సారీ దీపా ! నేను.. నా సెక్రటరీ మిళిందతో... వుండాలని అనుకుంటున్నాను. మేమిద్దరం చాలాదగ్గిర అయ్యాము. ఎంతగా అంటే విడిచి ఉండలేనంత. మనము డైవోర్స్ తీసుకుందాం. ''


ఎలా చెప్పాలా అని ఇంతకాలమూ టెన్షన్ పడి ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు.


''ఆలోచించి చెబుతాను.... చరణ్! నీ దారి నువ్వు చూసుకున్నావు. నా శ్రమకి - ప్రేమకి- మన వివాహ బంధానికి డబ్బుతో విలువ కడతావు. ఎదో ఇస్తావు. కానీ పోయిన కాలాన్ని నాకు తిరిగి ఇవ్వలేవు. ''


''ఇక ఆలోచించడానికి ఏమి లేదు. నీకు అన్నివిధాలా సరిపడే వాణ్ని చూసుకో. నాకు అడ్డురాకు. ''


''ఎంతమాట అన్నావు! నువ్వు దూరంగా ఉన్నావని నేను ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకోలేదు. నీకు గౌరవం ఇచ్చాను. భర్తగా ప్రేమించాను. అవకాశం వచ్చిందని తట్టులేక సంబంధాలు పెట్టుకోలేదు.


కానీ నువ్వు నాలా ఎందుకు వుండలేదు? దిగజారిపోయావు. తప్పు నీదే ! అసలు నాలో లోపం నాలో నచ్చనిది ఏమిటో చెప్పగలవా? తెలుసుకుంటాను. ''

''నేనంటే దూరంగా ఉంటావు. నా కోసం అంటూ సమయం ఇవ్వవు. నన్ను పట్టించుకోవు. ఎప్పుడూ పిల్లలు..... అంటూ వాళ్ళతోనే ఉంటావు. నాకోసం ఫ్యాషన్గా వుండవు. ''


''ఇదేమి ఆరోపణ! పిల్లలను బాధ్యతకల తల్లిగా చూడవద్దా? వాళ్ళ ఎదుట నీమీద ప్రేమ చూపించడానికి ఇది ఫారిన్ కంట్రీకాదు. అది సభ్యతకాదు. నీ చెల్లి మా అక్కా కూడా నాలాగే పిల్లలకోసం ప్రాణం ఇస్తారు.


ఇప్పుడు మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, చాలా నష్టపోతాం. నేను వాళ్ళకోసమే చదువు వున్నా వుద్యోగం చేయలేదు. నేను సంపాదన కంటే వాళ్లకి దగ్గిరగా ఉండటమే ఇష్ట పడతాను.

చరణ్ నువ్వు ఎదో నెపం వేస్తున్నావు. నీతప్పు లేదన్నట్టు తప్పించుకోడానికి. నువ్వు నిర్ణయానికి వచ్చేవు అంతే!


నీకు అడ్డుగా రావద్దు అన్నావు. నీలో స్వార్ధం వుంది. మాపట్ల ప్రేమలేదు. బాధ్యత డబ్బుతో మాత్రమే అని నీకు తోచింది. తండ్రిగా పిల్లలను ఇష్టపడి ఉంటే ఈమాట అనేవాడివి కాదు!

నీకు నేను అక్కరలేనప్పుడు.. నిన్ను దేవిరించవలసిన అవసరం నాకూలేదు.


నీకొడుకులతో కూడా చెప్పు. మీరు నాకు వద్దు..... అని. వాళ్ళు ఇప్పుడు పసివాళ్ళుకాదు. వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పుకో. ''అంది దీప బాధను దిగమింగి.


చరణ్ షాక్ అయ్యాడు. నందు ఆనందుల ఎదుట నేను నా అక్రమ సంబంధం గురించి ఎలా చెప్పడం?

కోర్టులు లాయర్లు ఏవో రూల్స్ చెబుతారు. పరిష్కారము చెబుతారు. కానీ మానసిక వేదనకు పరిష్కారం ఏది?నేను నిజానికి మిలిండాలో ఏమి చూసాను? వయసా అందమా సంపాదనా?


కాదు. మోడ్రన్గా ఉంటుంది. దీప వయసే... ఐనా తెలియదు. పెళ్లికాని అమ్మయిలా ఉంటుంది.


నేను ఆకర్హణలో మిళిందాని కోరుకుంటున్నాను. అంతే! దీపని ఎందుకు ద్వేషిస్తున్నాను? ఆమెతప్పు ఏముంది/

ఆమె కూడా పెళ్లి ఐనదే. ఇద్దరు అమ్మాయిల తల్లి. వాళ్ళు నాటో వున్నప్పుడు నా పిల్లలు కూడా గుర్తుకి వస్తారుగా !


ఈజీవితాన్ని వొదులోకుంటే తిరిగి పొందగలనా? మిళిందా కి గుడ్బై చెప్పేస్తాను. అనాలోచితంగా ఫోన్ చేసాడు. ఆమె లిఫ్ట్ చేయలేదు.


మళ్ళీ కొద్దీ క్షణాల తర్వాత మిళిందా కావాలనిపిస్తోంది.... ఆమెను తల్చుకుంటే కోరిక బుసకొడుతుంది. ఏమిటో తేడా అర్ధంకాదు. దీపను చూస్తే అలా అనిపించడంలేదు.


అలవాటైపోయిన నీ శరీర స్పర్శలో ఆనందం కనిపించడం లేదు.... అని దీపకి చెప్పలేను. మిళిందాను వదులుకోలేనూ.

ఏమి చేయాలి. ?


దీపకి కూడా నిద్రపట్టలేదు. చరణ్ ఎందుకిలా మారిపోయాడు? కొత్త మనిషి ఆకర్షణలో పడి నన్ను తృణీకరిస్తే కొన్నిరోజులకు మిళిందా కూడా విసుగు రాకుండా ఉంటుందా?


అప్పుడు మరొకరి ఆకర్షణలో పడకుండా ఉంటాడా! లభించినదానితో అడ్జస్ట్ కానివాడు కొత్త మార్గాలు వెదుకుతూనే ఉంటాడు.


ఇప్పుడే నేను మేలుకోడం మంచిది. నాకు నా పిల్లలు వుంటారు... చాలు., అని నిశ్చయానికి వచ్చింది.


''నందు నేను కొద్దికాలం అమెరికా వెడుతున్నాను. అక్కడ వేరే జాబ్ వచ్చింది. నీ చదువు పూర్తి చేసాక

అమ్మ తమ్ముడు నువ్వు వద్దురుగాని. నేను వచ్చి వెడుతూ వుంటాను.... అన్నాడు.


అప్పటికే తండ్రికి దూరంగా ఉండటం అలవాటే కనుక వాళ్ళు.... అంతగా సీరియ్సగా తీసుకోలేదు.


దీపకి అతను అబద్ధం చెప్పినందుకు కోపం వచ్చినా.... కొంతకాలానికి పిల్లలు అర్ధం చేసుకుంటారని ఊరుకుంది.

ప్రస్తుతానికి డైవోర్స్ ప్రసక్తి ఆగింది.


చరణ్ మిలిండా కలిసే అమెరికా వెళ్ళేరు. దీప మిలిండా కుటుంబం గురించి తెలుసుకుంది. ఆమె తల్లి తండ్రి వేరు కులాలవారు.... వేరు దేశాలవారు.. విడిపోయారు. ఎప్పుడో. !


మిలిండా స్వేచ్ఛగా ఎవరి అదుపు లేకుండా పెరిగింది. డబ్బువున్న బాగా వయసు తేడా వున్నా కోటీశ్వరున్ని వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. ఆమె జీవితానికి భద్రతా ఏర్పాటు చేసుకుంది. ఆమెకు పిల్లలు లేరు.


ఇద్దరు అనాథలను చేరదీసి నా పిల్లలే అని అబద్ధం చెప్పింది..... అందరికి.


ఈరోజుల్లో ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. కనుక మిలిండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది. ఇదీ ఆమె చరిత్ర. ఎవరినో పెళ్లి చేసుకుని ఆయన ఆస్తికి వారసురాలు అయింది.


ఇప్పుడిక లైఫ్ కి సెక్కురిటీ కావాలి. ఆమె పనిచేసే ఆఫీస్ కి చరణ్ వచ్చాడు. అందగాడు. సంపాదన, అవకాశం అతడి బలహీనత కలిసి వచ్చాయి. పెళ్లి ఐనా భార్య దూరంగా వుంది.


అతడు కూడా సులువుగా తన వెంట పడ్డాడు. దీపగురించి నాకెందుకు? అనుకుంది.


ఆమెకు ద్రోహం చేసింది. ఇవన్నీ తెలిసాక విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది.


ఇప్పుడు పూర్తిగా దీప నిశ్చయానికి వచ్చింది. చరణ్ కి నోటీస్ ఇచ్చింది లాయర్ ద్వారా.


మ్యూచువల్ అందరిష్టాండింగ్కు వచ్చారు.

నందు-ఉద్యోగంలో చేరెడు. ఆనందుని చదివిస్తున్నాడు. దీప ఇక పెళ్లి తలపెట్టలేదు. అప్పటికే సింగర్గా పేరు వుంది.... ఆమెకు. మ్యూజిక్ షో గ్రూప్ లో చేరింది. ప్రదర్శనలు ఇస్తుంది. ఆమె గొంతు ఆమెకు జీవితం. పాట

ఆమెకు తోడు!


ఎన్నడూ చరణ్ గురించి ఆలోచించడము లేదు. ఆ అవసరమూ లేదు.... ప్రశాంతంగా వుంది.


' అవును మన జీవితం ఎవరికోసమో కాదు. మనకోసమే!' హఠాత్తుగా భర్త మరణిస్తే ఏమి చేస్తాం?


అలాగే అతడు జీవించివున్నా, నువ్వు నాకు నచ్చలేదు అంటూ పాతికేళ్ళు కాపురం చేసిన భార్యకు విడాకులు ఇస్తే.. ఇదీ అంతే! ఆమె దృష్టిలో అతడు విగత జీవుడికింద లెక్క.


'మగవాడు తప్పులు చేస్తాడు. అందుకు ఫలితం అతడే అనుభవిస్తాడు. ఏమి పోగొట్టుకున్నాడో తెలిసినా ఎన్నటికీ తిరిగి పొందలేడు. '!

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)







48 views2 comments
bottom of page