నమ్మకద్రోహం

Nammaka Droham - Telugu Moral Story | Palla Venkata Ramarao
నమ్మకద్రోహం - తెలుగు నీతి కథ | పల్లా వెంకట రామారావు
Published In manatelugukathalu.com On 10/09/2026
పల్లా వెంకట రామారావు రచించిన “నమ్మకద్రోహం” కథ దురాశ, మాయమాటలు, విశ్వాసఘాతం మనిషిని చివరికి ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తాయో సరళంగా తెలియజేస్తుంది.
సిరిపురం అనే ఊరిలో దాశరథి అనే ప్రతిభావంతుడైన శిల్పకారుడు ఉండేవాడు. అతని కింద చాలామంది శిల్పకారులు పనిచేసేవారు. వారందరూ అతని శిష్యులు. వారికి అతడే పని నేర్పి మంచి జీతాలు ఇచ్చేవాడు. అతని ప్రతిభ నలుదిశలా వ్యాపించడం వల్ల అనేక ప్రాంతాల నుంచి శిల్పాలు తయారు చేసి పెట్టమని పిలుపులు వచ్చేవి. కాబట్టి వారి పనులకు లోటు లేకుండా ఉండేది.
ఇదిలా ఉండగా, ఎక్కడినుంచో కాలుడు అనే యువకుడు దాశరథి దగ్గరికి వచ్చాడు. తనను శిష్యుడిగా చేర్చుకోమని కోరాడు. దాశరథి యువకుడి పరిస్థితి గమనించి జాలితో తన వద్ద చేర్చుకున్నాడు. అయితే ఎంత బోధించినా అతనికి శిల్పాలు చెక్కడం పట్టుబడలేదు. అయినా సరే శిల్పాగారానికి కాపలాగా ఉంచి పైపనులు చెప్పేవాడు దాశరథి.
శిల్పాలు తయారైన తర్వాత వాటిని రవాణా చేసే పని కూడా కాలుడికి అప్పగించేవాడు దాశరథి. క్రమక్రమంగా వాడికి శిల్పాల వ్యాపారం ఎలా సాగుతుందో అర్థమైంది. వాడిలో నెమ్మదిగా దుర్బుద్ధి బయలుదేరింది. మెల్లగా దాశరథి కింద పనిచేసే శిల్పకారులందరినీ మాటలతో లోబరుచుకున్నాడు.
దాశరథి లేని సమయంలో వారికి రకరకాల మాటలు చెప్పి తన వైపు లాక్కున్నాడు. తరువాత నెమ్మదిగా తన పథకం అమలు చేశాడు.
"మీరు నైపుణ్యంతో చేసే శిల్పాల వల్ల దాశరథి కష్టపడకుండానే విశేష లాభాలు పొందుతున్నాడు. కష్టం మీది, సుఖం అతనిది" అంటూ వారిని మాటలతో రెచ్చగొట్టాడు.
"అయితే మరి ఏం చేయాలి?" అని వారు అడిగారు.
"మనందరం కలిసి వేరుగా ఒక శిల్పాగారాన్ని మొదలుపెడదాం. నాకు బయట నుంచి శిల్పాలు కొనుగోలు చేసేవారు తెలుసు. నేను బయట నుంచి పనులు తీసుకుని వస్తుంటాను. మీరు శిల్పాలను తయారు చేస్తూ ఉండండి. వచ్చిన లాభాలు మనందరం పంచుకుందాం" అని మాయ మాటలు చెప్పాడు.
వారు అతని ఉచ్చులో పడ్డారు. "సరేనన్నారు".
కాలుడు చెప్పిన ప్రకారం వారంతా ఒకనాడు చెప్పాపెట్టకుండా దాశరథి వద్దకు పనికి రావడం మానేశారు. ఈలోపు కాలుడు నక్కజిత్తులు ఉపయోగించి శిల్పాల తయారీ పనులు తీసుకుని వచ్చాడు.
అంతా కలిసి పనిచేసి, సమయానికి కొనుగోలుదారులకు శిల్పాలను అందివ్వడం మొదలుపెట్టారు. ఆ పని అంతా కాలుడు చూసుకునేవాడు. వచ్చిన డబ్బులో కొంత శిల్పకారులకు ఇచ్చేవాడు.
అయితే వారికి ఎక్కువ ప్రయోజనం కలగలేదు. దాశరథి కంటే కొంత ఎక్కువ ఇచ్చేవాడు. ఎందుకంటే శిల్పాల తయారీ ఎంతకు ఒప్పుకుంటున్నాడో, ఎంతకు అమ్ముతున్నాడో వారికి తెలిసేది కాదు. ఒకరిద్దరు ఆ విషయంపై ప్రశ్నిస్తే, "అవన్నీ మీకెందుకు? నేను చూసుకుంటున్నాగా. నా పైన నమ్మకం లేదా?" అనేవాడు.
"దాశరథి కంటే కొంచెం ఎక్కువే ఇస్తున్నా కదా! ఎక్కువ మాట్లాడితే మీరే పై విషయాలు చూసుకోండి" అనేవాడు.
కానీ వారికి శిల్పాలు చెక్కడం తప్ప వ్యాపార సంబంధిత విషయాలు తెలియవు. దాంతో వారు నోరు మెదపలేకపోయేవారు. అలా కాలుడు వారిని ఉపయోగించుకుని విశేషంగా ధనం సంపాదించి ధనవంతుడయ్యాడు.
ఈ విషయం శిల్పకారులకు తెలిసినా, వారు ఏమనడానికి లేకుండాపోయింది. వారు సొంతంగా బయటికి వెళ్లి పనులు చేసుకోలేరు. తిరిగి దాశరథి వద్దకు వెళ్లడానికి మొహం చెల్లలేదు.
అన్నం పెట్టే యజమానికి నమ్మకద్రోహం చేసినందుకు, దురాశకు పోయినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని మిన్నకుండిపోయారు.
సమాప్తం.
***************
పల్లా వెంకట రామారావు గారి కొన్ని ఇతర రచనలు:
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.











Comments