పల్లె పిలిచింది - 4
- T. V. L. Gayathri
- May 3
- 2 min read
Updated: May 7
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, #అశ్వలలిత, #అశ్వగతి, #కావ్యము

Palle Pilichindi - 4 - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 03/05/2025
పల్లె పిలిచింది - 4 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
15.
కందం.
జలజల మను నాదముతో
కులుకుచు గోదావరియట కొండలనడుమన్
కలిమిని కురిపించి సతము
పలుసీమల నుద్ధరించి పరుగిడుచుండెన్//
తాత్పర్యము.
జలజలా అను శబ్దం చేస్తూ గోదావరీ నది ఆ కొండల నడుమ పారుతూ ఉంటుంది. చాలా ప్రాంతానికి సంపదల నిస్తూ పరుగుతీస్తూ ఉంటుంది.//
16.
అశ్వలలిత.
న, జ, భ,జ, భ, జ, భ, వ.
యతి -13.
బిరబిర పర్వులెత్తు ఘన సింధు వేగము మనోజ్ఞమౌ కులుకుతో
తరగలు పొంగులెత్తు తమ రాగ తాళపు విభావరీ సుధలతో
గిరగిర మీనముల్ మిడియు ఖంబు ఖేచరుల భంగి కేళిగ సదా
వరముల నిచ్చు గౌతమి జయంబు పల్కును జగంబుకై సుడులతో //
తాత్పర్యము.
ఆ గోదావరి అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ తరంగాల సవ్వడి తాళ రాగ గతులతో మధురంగా సాగుతోంది. ఆ నదిలో చేపలు గరగిర తిరుగుతూ ఉంటాయి. ఆ నది సుళ్ళు తిరుగుతూ దేశానికి వరములిస్తూ జయనాదం చేస్తూ వెళుతోంది.//
17.
కందము
జాలరు లెల్లరు ముదముగ
వీలుగ మీనముల బట్టి విభవము పొందన్
శ్రీలట పొంగగ సతతము
జాలెత్తి నుఱుకును గంగ సత్వము నిడుచున్.//
ఆ నదిలో చేపలు పట్టి జాలరులు సంపదను పొందుతూ ఉంటారు. అక్కడ భూమికి శక్తి నిస్తూ ఆ నదీమతల్లి పరుగిడుతూ ఉంది.//
18.
అశ్వగతి
భ, భ, భ, భ, భ, గ.
యతి -10.
తీరమునందున పల్లెలు దిక్కని కొల్వగ సం
సారము లెల్లను పొందగ సంపదలన్ ద్వరగా
చేరగ సాగరు కౌగిట శ్రీనిధి గౌతమి తాన్
నీరమొసంగుచు పాఱును నిశ్చలమౌ గతిలో //
తాత్పర్యము.
ఆ నదీ తీరంలో ఉండే పల్లెలు ఆ నదియే తమకు దిక్కని కొలుస్తూ ఉండగా, భూమికి సంపదలిడుచు వెళ్లి సముద్రములో కలిసి పోవటానికి గౌతమి నిశ్చలంగా పారుతూ ఉంటుంది.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments