top of page

పల్లె పిలిచింది - 5

Updated: May 12

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, #తరలము, #చంపకమాల, #ఉత్సుక, #మత్తకోకిల, #కావ్యము

Palle Pilichindi - 5 - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 07/05/2025

పల్లె పిలిచింది - 5 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



19.

తరలము.


వనము వర్థిల సీమ కెల్లను వర్షధారలు పొంగగన్ 

జనులు భాగ్యపు సంపదల్ కన జాతి సౌఖ్యము నిల్వగన్ 

ధనము పొందిన గేస్తు లెల్లరు దాతలై విలసిల్లగన్ 

ఘనులుగా జరియించి మెల్గిరి గ్రామపౌరులు శాంతులై.//


తాత్పర్యము.


ఆ గ్రామమునకు దగ్గరగా ఒక అడవి ఉంది. అడవి ఉండటం వలన వర్షాలు చక్కగా కురుస్తున్నాయి. వర్షాల వల్ల పంటలు బాగా పడుతున్నాయి. ధనవంతులైన ఆ గ్రామస్తులు దానధర్మాలు చేస్తూ, శాంతి కాముకులై హాయిగా ఉన్నారు.//


20.

చంపకమాల.


తరువులు వర్థిలన్ ధరణి తర్షము నొందును పచ్చపచ్చగన్ 

వరముగ వీచు వాయువులు ప్రాణము నిల్పును జీవకోటికిన్ 

జరజర దూకు నిర్ఝరులు జాతికి దాహము తీర్చుచుండగా 

పరవశమొందుచున్ దిరుగు పక్షులు బంధువులీ జగత్తునన్//


తాత్పర్యము.


అడవిలో దట్టంగా చెట్లు పెరిగాయి. అంతటా పచ్చదనము ఉండటం వలన చల్లటి గాలి వీస్తూ ఉంటే అడవిలో నివసించే ప్రాణికోటి చక్కగా బ్రతుకుతోంది. జలపాతాలు దూకుతూ, ఆ ప్రాణులకు దాహం తీరుస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో పక్షులు ఎగురుతూ ఉంటున్నాయి. అలా  ఆ భూమాత చాలా ఆనందించింది.//


21.

కందం.


వనదేవతలను కొల్చుచు 

వనమున మొక్కలను నాటి పౌరులు వరలన్ 

ధనరాశులు కురియ నచటి 

జనవాహిని పొందె శాంతి సౌఖ్యములెల్లన్ //


తాత్పర్యము.


వనదేవతలను పూజిస్తూ ఆ పల్లెవాసులు ఇంకా ఎక్కువ మొక్కలు నాటుతూ ఉన్నారు. వాళ్లంతా చాలా సంపదలు కలిగి శాంతి సౌఖ్యాలతో ఉన్నారు.//


22.

ఉత్సుక -భ, భ, ర.

యతిలేదు.


కొండల కోనల త్రుళ్ళుచున్ 

దండిగ మేతను మేయుచున్ 

కొండల దారిన గోవులున్ 

దండుగ మళ్లును పల్లెకున్.//


ఆ అడవిలో ఎగురుతూ ఆవులు మేతమేసి సాయంత్రానికి దండుగా పల్లెకు తిరిగివస్తాయి.//


23.

మత్తకోకిల.


సౌరభేయుల సంబరంబులు సందెవేళల గాంచుచున్ 

పౌరులెల్లరు సంతసంబుగ పాలనంబును జేయగన్ 

క్షీరధారలు పొంగి పొర్లగ చిందులేయుచు లేగలున్ 

వాడవాడల పాఱుచుండగ భాగ్యరాశులు వర్థిలెన్.//


తాత్పర్యము.


ఆవులు అలా వస్తుంటే వాటి లేగదూడలు చిందులేస్తూ ఉంటాయి. ఆ ఆవుల మందలను చూస్తూ పౌరులు ఆ గ్రామాన్ని పరిపాలిస్తూ ఉంటారు. పాలు పొంగుచుండగా ఆ పల్లెలో సంపదలు పొర్లుతూ ఉన్నాయి.//


24.

కందము.


గ్రామములో వెలసెను శ్రీ 

రాముడు మైథిలిని గూడి రక్షణ నీయన్ 

కామిత వరదాయకునిన్ 

నీమముగా కొల్వ తోడు నీడగ నడచున్ //


తాత్పర్యము.


ఆ గ్రామంలో సీతతో కూడి శ్రీరామచంద్రుడు  వెలిశాడు (ఆలయం ఉంది ). ఆ శ్రీరామచంద్రుని  నియమంగా సేవిస్తే స్వామి భక్తుల కోరికలు తీర్చి వెంట నడచి రక్షణనిస్తాడు.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page