పల్లె పిలిచింది - 5
- T. V. L. Gayathri
- May 7
- 2 min read
Updated: May 12
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, #తరలము, #చంపకమాల, #ఉత్సుక, #మత్తకోకిల, #కావ్యము

Palle Pilichindi - 5 - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 07/05/2025
పల్లె పిలిచింది - 5 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
19.
తరలము.
వనము వర్థిల సీమ కెల్లను వర్షధారలు పొంగగన్
జనులు భాగ్యపు సంపదల్ కన జాతి సౌఖ్యము నిల్వగన్
ధనము పొందిన గేస్తు లెల్లరు దాతలై విలసిల్లగన్
ఘనులుగా జరియించి మెల్గిరి గ్రామపౌరులు శాంతులై.//
తాత్పర్యము.
ఆ గ్రామమునకు దగ్గరగా ఒక అడవి ఉంది. అడవి ఉండటం వలన వర్షాలు చక్కగా కురుస్తున్నాయి. వర్షాల వల్ల పంటలు బాగా పడుతున్నాయి. ధనవంతులైన ఆ గ్రామస్తులు దానధర్మాలు చేస్తూ, శాంతి కాముకులై హాయిగా ఉన్నారు.//
20.
చంపకమాల.
తరువులు వర్థిలన్ ధరణి తర్షము నొందును పచ్చపచ్చగన్
వరముగ వీచు వాయువులు ప్రాణము నిల్పును జీవకోటికిన్
జరజర దూకు నిర్ఝరులు జాతికి దాహము తీర్చుచుండగా
పరవశమొందుచున్ దిరుగు పక్షులు బంధువులీ జగత్తునన్//
తాత్పర్యము.
అడవిలో దట్టంగా చెట్లు పెరిగాయి. అంతటా పచ్చదనము ఉండటం వలన చల్లటి గాలి వీస్తూ ఉంటే అడవిలో నివసించే ప్రాణికోటి చక్కగా బ్రతుకుతోంది. జలపాతాలు దూకుతూ, ఆ ప్రాణులకు దాహం తీరుస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో పక్షులు ఎగురుతూ ఉంటున్నాయి. అలా ఆ భూమాత చాలా ఆనందించింది.//
21.
కందం.
వనదేవతలను కొల్చుచు
వనమున మొక్కలను నాటి పౌరులు వరలన్
ధనరాశులు కురియ నచటి
జనవాహిని పొందె శాంతి సౌఖ్యములెల్లన్ //
తాత్పర్యము.
వనదేవతలను పూజిస్తూ ఆ పల్లెవాసులు ఇంకా ఎక్కువ మొక్కలు నాటుతూ ఉన్నారు. వాళ్లంతా చాలా సంపదలు కలిగి శాంతి సౌఖ్యాలతో ఉన్నారు.//
22.
ఉత్సుక -భ, భ, ర.
యతిలేదు.
కొండల కోనల త్రుళ్ళుచున్
దండిగ మేతను మేయుచున్
కొండల దారిన గోవులున్
దండుగ మళ్లును పల్లెకున్.//
ఆ అడవిలో ఎగురుతూ ఆవులు మేతమేసి సాయంత్రానికి దండుగా పల్లెకు తిరిగివస్తాయి.//
23.
మత్తకోకిల.
సౌరభేయుల సంబరంబులు సందెవేళల గాంచుచున్
పౌరులెల్లరు సంతసంబుగ పాలనంబును జేయగన్
క్షీరధారలు పొంగి పొర్లగ చిందులేయుచు లేగలున్
వాడవాడల పాఱుచుండగ భాగ్యరాశులు వర్థిలెన్.//
తాత్పర్యము.
ఆవులు అలా వస్తుంటే వాటి లేగదూడలు చిందులేస్తూ ఉంటాయి. ఆ ఆవుల మందలను చూస్తూ పౌరులు ఆ గ్రామాన్ని పరిపాలిస్తూ ఉంటారు. పాలు పొంగుచుండగా ఆ పల్లెలో సంపదలు పొర్లుతూ ఉన్నాయి.//
24.
కందము.
గ్రామములో వెలసెను శ్రీ
రాముడు మైథిలిని గూడి రక్షణ నీయన్
కామిత వరదాయకునిన్
నీమముగా కొల్వ తోడు నీడగ నడచున్ //
తాత్పర్యము.
ఆ గ్రామంలో సీతతో కూడి శ్రీరామచంద్రుడు వెలిశాడు (ఆలయం ఉంది ). ఆ శ్రీరామచంద్రుని నియమంగా సేవిస్తే స్వామి భక్తుల కోరికలు తీర్చి వెంట నడచి రక్షణనిస్తాడు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments