ఓటరు జాగృతం కావాలి
- Nallabati Raghavendra Rao

- Feb 10
- 6 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ఓటరు జాగృతం కావాలి, #VoterJagruthamKavali, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Voter Jagrutham Kavali - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 10/02/2026
ఓటరు జాగృతం కావాలి - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
ఓటుకి నోటు...
ఇది...
కేవలం సామాన్యుడి మనోగతం అనడం సరికాదు... ఆర్థికంగా బాగున్న కొందరి వ్యక్తుల మనోగతంలో కూడా ఓటు వేసే సమయం ఎప్పుడు వస్తుంది... దానికి ఏ పార్టీలు ఎన్ని డబ్బులు ఇస్తారు... మొత్తం ఒక వ్యక్తికి ఎంత ముడుతుంది... మన కుటుంబంలో ఎంతమంది ఉన్నాం... ఆ మొత్తం లెక్క పెడితే ఎంత అవుతుంది... ఆ వచ్చిన మొత్తం డబ్బులతో మనం ఏమి చేయవచ్చు?
అనే ఆలోచన కచ్చితంగా ఉందని చెప్పవచ్చు నేటి పరిస్థితుల ప్రభావం వల్ల.
రూపాయి నేల మీద శేషంలో దొరికితే తీసి కొళాయి దగ్గర కడుక్కుని మరీ జేబులో వేసుకునే మనస్తత్వం అందరి మనుషులది. దీనిని కాదనగలమా? మరి అలాంటప్పుడు... వేల రూపాయలు వదులుకోవడానికి ఎవరి మనసు ఇష్టపడుతుంది?
సీరియల్స్లో ఓటు అమ్ముకోకూడదు అని చెప్తున్నారు... అలాగే నాటకాలలో, సినిమాలలో, కథలలో... చెప్తున్నారు. కానీ అది వినడం వరకే... కచ్చితంగా చెప్పాలంటే పాటించడం జరగడం లేదు.
''ఎవరు చూస్తారు? అందరూ తీసుకుంటున్నారు... మనం తీసుకుంటే తప్పేమిటి? ఒకవేళ మనం తీసుకోకపోతే ఆ డబ్బులు మన పేరు చెప్పి ఆ మధ్యవర్తులు దొబ్బేస్తున్నారు కదా? అలాంటప్పుడు మనం తీసుకుంటే తప్పేమిటి?''
ఇదీ నేటి ఆలోచన.
దేశమంతా ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఒక్కళ్లము న్యాయమార్గంలో నడిస్తే మాత్రం ఏం వస్తుంది? ఇదీ నేటి ఆలోచన.
పోనీ చట్టాలు పగడ్బందీగా అమలు అవుతున్నాయా అంటే... ఏమాత్రం పగడ్బందీగా అమలు కావడం లేదని చెప్పవచ్చు.
మరి ఎలా ఈ సమస్యకు పరిష్కారం?
ఆ మధ్యన ఒక సినిమాలో ఇదే విషయం మీద ఒక సీన్ పెట్టారు...
అందులో ప్రజలు ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కోపంగా...
''ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మాకు కావలసిన ఊరి ఉపయోగాలు మీరు ఎందుకు చేసిపెట్టలేదు?'' అని నిలదీసి అడుగుతారు.
దానికి ఆ ఎమ్మెల్యే రెండు చేతులు వెనక్కి పెట్టుకుని స్టైల్గా ధైర్యంగా ఏం చెప్పాడో తెలుసా...
''మీరు ఓటు అమ్మేసుకున్నారు. మీరు వేసిన ఓటుకు ఇప్పుడు విలువ లేదు. ఒక విధంగా చెప్పాలంటే... వచ్చే ఎలక్షన్ల వరకు మీరు అసలు ఓటర్లే కాదు... ఈ తెలివితేటలు మీరు మీ ఓటును అమ్ముకునేటప్పుడు ఉండాలి. అమ్ముడు పోయిన వస్తువు మీద మీకు హక్కు ఎలా ఉంటుంది? ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేదా? వెళ్లి మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి!'' అంటాడు.
చూడండి! రాజకీయం కొమ్ములు విరుచుకుని ఎలా పరిగెడుతుందో.
ఆ వచ్చిన ప్రజానీకం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నోరు మూసుకుని నెత్తి గోక్కుంటూ వెళ్లిపోవడం తప్పించి ఏమీ చేయలేకపోయారు.
తప్పు ఎవరిది?
ఇక్కడ రాజకీయ నాయకుడిది తప్పు ఏమాత్రం కాదు... అలాగని ఓటు అమ్ముకునే ప్రజలది కూడా అణుమాత్రం తప్పు కాదు.
మరి తప్పు ఎవరిది? తప్పు ప్రభుత్వానిది... ఎస్...
మరి ఈ సమస్యకు పరిష్కారం?
ఉంటుంది. ప్రపంచంలో పుట్టిన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అసలు ముందు పరిష్కారం పుట్టి తర్వాతే సమస్య పుడుతుంది. ప్రతి మనిషి తర్వాత పుట్టిన సమస్యలోనే మునిగిపోతాడు కానీ అంతకన్నా ముందు పుట్టిన పరిష్కారం వైపు ఒక్కసారి కూడా చూడడు... ఆలోచించడు.
అయితే ఆ పరిష్కారం ఏమిటో... ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఏ ఒక్క ప్రజా నాయకుడు చదివినా ఈ పరిష్కారం కరెక్టే అని ఏకీభవిస్తే... తప్పకుండా మార్పు వస్తుంది.
ఒక స్కూలు ఉంది...
అందులో విద్యార్థులు అందరూ ఒకే రకమైన మానసికశక్తిని కలిగి ఉండరు. అది సృష్టి ధర్మం. అయితే తెలివైన ప్రిన్సిపాల్ తన విద్యార్థులు అందరూ సమానమే అని ఆలోచించి... తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకమైన ప్రైవేట్ క్లాసులు ఏర్పాటు చేసి వాళ్లను కూడా తెలివైన విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దుతారు. అప్పుడు ఆ స్కూలు ఆ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్లో 100% సక్సెస్ సాధించింది అని పేపర్లలో పెద్ద అక్షరాలతో వేయించుకుంటారు.
ఇక్కడ... ప్రభుత్వ అధికారి ఒక ప్రిన్సిపాల్ లాంటివాడు. అక్కడ విద్యార్థులు లాగే ఇక్కడ ప్రజలలో కూడా ఓటు హక్కు మీద అవగాహన లేని వాళ్ళు ఉంటారు... అది సహజం... ఇప్పుడు ఆ ప్రభుత్వ అధికారి ఇలాంటి వాళ్లందరినీ గుర్తించి వాళ్లకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి... ఓటు హక్కు మీద అవగాహన ఏర్పాటు చేయాలి.
చేస్తున్నారా? చేస్తున్నారా? చేస్తున్నారా?
ఎందుకు చేయటం లేదు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది లక్షలు, కోట్ల ఖర్చుతో కూడుకున్న పనా?!
75 సంవత్సరాలుగా... ఎందుకు ఓటు హక్కు మీద రాజకీయ నాయకులు... ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారు?
అవగాహన లేని ప్రజలలో ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు?
పరిపాలన అంటే అలా అలా సంవత్సరాలు గడిపేయడమేనా? పరిపాలన అంటే నమిలేసి అవతల పడేసే ఆవకాయ బద్ద అన్నట్టు చులకనగా ఆలోచిస్తే ఎట్లా?
ప్రభుత్వ అధికారులలో చిత్తశుద్ధి లేదు. నేను నా డబ్బు, నేను నా డబ్బు తప్పించి... నేను నా దేశం, నేను నా దేశం అని ఆలోచించగలిగిన ఒక్క ప్రభుత్వాధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ ఈ సమస్య గురించి... ఈ పరిష్కారం గురించి ఒక్క సెకను ఆలోచించగలిగితే ఈ సమస్య మరుక్షణం నిర్వీర్యమైపోతుంది.
చివరగా ఒక విషయం... ఇదంతా బాగానే ఉంది ఈ పని నేటి యువత చేయవచ్చు కదా అన్న ప్రశ్న ఈపాటికి పుట్టి ఉంటుంది అందరి మనసులో... ఇక్కడ ఒక విషయం గ్రహించాలి... ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ చెప్పినది వినినట్టు... సాధారణ మనుషులు చెప్పినది ప్రజలు వినరు.
అందుకని ప్రతి మనిషి ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది.
లేకుంటే... తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!
*
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments