అత్తగారి కథలు -24: గుర్తుండిపోయే కానుక
- LV Jaya

- 3 hours ago
- 4 min read

Atthagari Kathalu - 24: Gurthundipoye Kanuka - Telugu Emotional Family Story | L. V. Jaya
అత్తగారి కథలు -24: గుర్తుండిపోయే కానుక - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | L. V. జయ
Published in manatelugukathalu.com on 01/08/2026
ప్రతి కొత్త జంటకు హనీమూన్ జ్ఞాపకాలు జీవితాంతం ప్రత్యేకమైనవే. ఆ ప్రయాణంలో ఇచ్చుకున్న చిన్న కానుక కూడా అమూల్యమైన గుర్తుగా నిలుస్తుంది. కానీ కొన్ని ఇళ్లలో ఆ కానుక విలువ కంటే సంబంధాల విలువే పరీక్షకు గురవుతుంది. ప్రేమతో కొన్న బహుమతి ఎలా చేదు జ్ఞాపకంగా మారిందో, ఒక కోడలు తన కొత్త కుటుంబాన్ని ఎలా అర్థం చేసుకుందో చెప్పే హృదయాన్ని తాకే కథే "గుర్తుండిపోయే కానుక."
సమర్థ్, జాగృతిలు హనీమూన్ కి శ్రీలంకకు వెళ్లారు. కొలంబోలో బీచ్ లలో తిరిగారు. గాల్ లోని కోటలు, కాండీ లో బాటిక్ వర్క్, కాండ్యన్ లో ఫైర్ డాన్స్ చూసారు. పిన్నవల లో ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ లో చిన్న ఏనుగులకు బాటిల్ లో పాలు పట్టించారు. బుద్దుడి టీత్ టెంపుల్, ఇంకా ఎన్నో బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ చూసారు. ఇలా వారం రోజులపాటు కలిసి తిరుగుతూ, ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ గడిపారు. జాగృతి లాంటి భార్య దొరికినందుకు సమర్థ్, సమర్థ్ లాంటి భర్త దొరికినందుకు జాగృతి ఎంతో సంతోషించారు.
ఇక ఇండియా తిరిగి వెళ్లిపోయే రోజు ఉదయం జాగృతి నుదిటి మీద ముద్దుపెడుతూ, "ఈ ప్రయాణంలో నీతో జీవింతాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలను సంపాదించుకున్నాను. నీకు కూడా ఎప్పటికీ గుర్తుండేపోయేలా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామంటుకుంటున్నాను." అన్నాడు సమర్థ్.
"నాకు ఈ ట్రిప్, మీతో ఇలా గడపడం, ఇదే పెద్ద గిఫ్ట్." అంది జాగృతి నవ్వుతూ.
"నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. అందుకే నీకు చెప్పకుండా నిన్ను ఒక చోటికి తీసుకువెళ్లబోతున్నాను." అని కొలంబో నుండి రత్నపుర కి తీసుకువెళ్లాడు.
అక్కడ ఒక గైడ్, వాళ్ళకి జెమ్ మైన్స్ చూపిస్తూ, "శ్రీలంక ని రత్నద్వీప అని, ఐలాండ్ ఆఫ్ జెమ్స్ అని అంటారు. ఈ ఊరిలో 200 రకాలకు పైగా జెమ్ స్టోన్స్ దొరుకుతాయి. అందుకే దీనిని రత్నపుర అంటారు అంటే సిటీ అఫ్ జెమ్స్."అని చెప్పాడు. తరువాత జెమ్ స్టోన్స్ షాప్ కి తీసుకువెళ్ళి, రకరకాల జెమ్ స్టోన్స్ ని కూడా చూపించాడు.
"ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్ ఏవి ఎక్కువగా కొంటుంటారు?" అని గైడ్ ని అడిగాడు సమర్థ్.
"సఫైర్స్, మూన్ స్టోన్స్, క్యాట్- ఐ తో పాటు ఇక్కడ మాత్రమే దొరికే ఒక గోమేద్ క్వాలిటీ చాలా ఫేమస్." అన్నాడు గైడ్.
"జాగృతి నీకు నచ్చిన గోమేధికాల నెక్లెస్ ఒకటి ఎంచుకో. అదే నేను నీకు కొనబోయే మొదటి గిఫ్ట్." అన్నాడు సమర్థ్.
ఆ షాపులో ఉన్నవన్నీ వెండితో చేసినవి అని తెలిసాక, "అయితే ఇక్కడ కొన్ని గోమేధికాలు కొనుక్కో. ఇండియాలో వెళ్ళాక బంగారంతో చేయిస్తాను." అన్నాడు సమర్థ్. సరేనని జాగృతి తనకి నచ్చిన డిజైన్ కి సరిపోయేటట్టుగా పద్నాలుగు గోమేధికాలు కొంది.
"మరి అత్తయ్యగారికి, వదినకి, మా అమ్మకి కూడా ఏమైనా తీసుకుందాం." అని అడిగింది జాగృతి.
"ఈ ట్రిప్ మనకి స్పెషల్. అందుకే ఇప్పుడు నీకు మాత్రమే కొంటాను. నీకొక్కదానికే కొంటే వాళ్ళేమి అనుకొరులే. వాళ్ళకి సౌవనీర్లు తీసుకుని వెళ్దాం." అన్నాడు సమర్థ్ నవ్వుతూ.
సమర్థ్ తనకి కొన్న మొదటి కానుకను ఏంతో జాగ్రత్తగా దాచుకుంది జాగృతి.
******************************************
ఇండియా వచ్చాక, సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, "బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు?" అని అడిగింది. అవునని చెప్పాడు సమర్థ్ నవ్వుతూ.
"ఎందుకు చెయ్యవు? కొత్త పెళ్ళాంతో తిరుగుతూ, దాని మోజులో అమ్మని కూడా మర్చిపోయావన్నమాట. ఒక్క కాల్ కూడా చెయ్యలేదు." అంది రాధ సమర్థ్ తో.
శ్రీలంక వెళ్ళాక రాధతో మాట్లాడలేదన్న విషయం సమర్థ్ కి గుర్తుకు వచ్చి, అంతవరకూ స్వర్గంలో తిరిగినట్టున్న సమర్థ్, ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చాడు. భయంగా రాధ దగ్గరకి వెళ్లి, కాళ్ళ మీద పది, "అమ్మా. క్షమించమ్మా. అక్కడ నెట్ వర్క్ సరిగ్గా లేక, నీకు కాల్ చెయ్యలేకపోయాను." అన్నాడు.
"అబద్దాలు చెప్పడం కూడా నేర్పిందన్నమాట. చదువుకున్నదాన్ని చేసుకున్నావ్ కదా. మొగుణ్ణి ఎలా తన వైపుకు తిప్పుకోవాలో, తల్లిని, కొడుకుని ఎలా వేరుచెయ్యాలో బాగా తెలుసు ఇలాంటివాళ్ళకి. దాని మాయలో పూర్తిగా పడిపోయావ్ నువ్వు. వారం రోజుల్లో నన్ను పూర్తిగా మర్చిపోయేలా చేసేసింది. దీని సంగతి చెప్తానుండు." అంది రాధ కోపంగా జాగృతిని చూస్తూ.
జాగృతికి రాధ ఎందుకలా మాట్లాడుతోందో అర్ధంకాలేదు. 'నన్ను, నా చదువుని ఇష్టపడి చేసుకుని, ఇప్పుడేంటి ఈవిడ ఇలా మాట్లాడుతోంది?' అనుకుంది రాధని ఆశ్చర్యంగా చూస్తూ.
"అమ్మా. జాగృతి తప్పేమి లేదమ్మా. నన్ను నమ్ము. నెట్ వర్క్ సరిగ్గా లేదు అక్కడ." రాధ కాళ్ళని నొక్కుతూ అన్నాడు సమర్థ్.
"చూడు. అది నన్ను ఎలా చేస్తోందో? నువ్వు దాని వలలో పడిపోయావన్నమాట. దాన్ని వెనకేసుకుని వస్తున్నావ్. నాకు తెలుసు నువ్వు మారిపోతావని. అందుకే నేను కూడా నీతో శ్రీలంక వచ్చి ఉండాల్సింది." అంది రాధ.
"అమ్మా. నేను కూడా నిన్ను రమ్మన్నాను కదా. నువ్వే నాన్న ఒక్కళ్ళే అయిపోతారనని రాలేదు. " అన్నాడు సమర్థ్, రాధ కాళ్ళని ఇంకొంచెం గట్టిగా నొక్కుతూ. సమర్థ్ వాళ్ళ నాన్న మాణిక్యాలరావు అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.
'భార్య, భర్తలు మాత్రమే వెళ్లే హనీమూన్ కి ఈవిడ రావాలనుకోవడమేమిటి విచిత్రంగా? సమర్థ్ కూడా ఈవిడని రమ్మనమనడం ఏమిటి? ఈవిడ మాట తీరు, ఈవిడ ఎదురుగా సమర్థ్ ప్రవర్తన చూస్తుంటే, ఇంట్లోవాళ్ళందరికి ఈవిడ అంటే భయమని తెలుస్తోంది.' అనుకుంది జాగృతి.
సమర్థ్ రాధ దగ్గరే కూర్చిని, కాసేపు కాళ్ళు నొక్కాక, రాధ కాస్త శాంతించి, "ఇంతకీ శ్రీలంక నుండి ఏం తీసుకొచ్చావ్?" అని సమర్థ్ ని అడిగింది.
సమర్థ్ వెంటనే లేచి వెళ్లి, జెమ్ స్టోన్స్ తీసుకొచ్చి, "ఈ రకమైన గోమేధికాలు శ్రీలంకలో తప్ప ఇంకెక్కడా దొరకవు తెలుసా? " అని రాధ చేతిలో పెట్టాడు.
"పెళ్లి తరువాత కూడా నా కొడుకు ఏమీ మారలేదు. శ్రీలంక నుండి ఇవన్నీ నా కోసమే తెచ్చాడు." అంది రాధ గోమేధికలని చూసి మురిసిపోతూ.
'నాకని కొన్నవి ఈవిడ తీసేసుకుంటున్నా సమర్థ్ ఏమి అనటం లేదేమిటి?' అని ఆశ్చర్యంగా సమర్థ్ ని చూసింది జాగృతి. సమర్థ్ 'ఇప్పుడేమి మాట్లాడకు.' అన్నట్టు జాగృతికి సౌంగ్య చేసాడు.
"అమ్మా. ఇప్పటికైనా నీ కోపం తగ్గిందా? వీటితో నీకు నచ్చిన నెక్లెస్ చేయించుకో. ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను." అన్నాడు సమర్థ్, రాధ ఒళ్ళో తల పెట్టుకుంటూ.
"నాకేమి ఇప్పుడేమి వద్దురా" అంది రాధ. రాధ గోమేధికాలని తిరిగి ఇచ్చేస్తుందేమో అని చెయ్యి చాపాడు సమర్థ్. కానీ రాధ, "ఇంత విలువైన వాటిని విలువైన వాళ్ళకి ఇవ్వాలి. ముందు మా తమ్ముడికి, అక్కకి ఉంగరాలు చేయిస్తాను. తరువాత మీ అక్కకి, బావగారికి. మిగిలిన వాటితో తరువాత నేను నెక్లెస్ చేయించుకుంటాను. సరేనా." అంది రాధ.
సమర్థ్ ఆశ్చర్యంగా, "సరే. నీ ఇష్టం. కానీ నాన్నకి....ఇంకా..." అని జాగృతిని చూసాడు.
"మీ నాన్నకేమి అక్కరలేదు." అంది రాధ గోమేధికాలు తీసుకుని వెళ్ళిపోతూ.
"కోడలికి కూడా ఒకటి...." అన్నాడు మాణిక్యాలరావు.
"హ్మ్మ్." అని మాణిక్యాలరావు ని కోపంగా చూస్తూ, "మీకు మాట్లాడే అర్హత లేదు. ఇవన్నీ నాకు నా కొడుకు తెచ్చి ఇచ్చాడు. ఇంకెవ్వరికి కాదు." అని జాగృతిని చూసి, "వీటితో నాకు నచ్చింది నేను చేసుకుంటాను." అంది రాధ.
గోమేధికాలను జాగృతి కోసమే కొన్నాడన్న విషయం రాధకి తెలుసు. అయినా అది జాగృతికి అందనివ్వకుండా చేసింది.
ఆ రోజుతో రాధ ఎలాంటిదో అర్ధమయ్యింది జాగృతికి. రాధ తన వైపు కుటుంబానికి, తన కూతురికి ఇచ్చినంత ప్రాధాన్యం, భర్తకి, కొడుకుకి, కోడలికి ఇవ్వదని, రాధకి భయపడతారని, ఎవరూ ఎదురు చెప్పలేరని, తనకి ఆ ఇంట్లో ఏ విలువ ఉండబోదని అర్ధం చేసుకుంది. సమర్థ్ తనని ఎంత ప్రేమిస్తున్నా, తల్లి ఎదురుగా తన కోసం నిలబడలేడని తెలుసుకుని బాధపడింది.
*************************************************
సమర్థ్, జాగృతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చిన మొదటి కానుక, రాధకి నెక్లెస్ గా, మిగతావాళ్ళకి ఉంగరాలుగా మారింది. జాగృతికి మాత్రం ఏమీ దక్కలేదు. అత్తగారి రూపంలో జీవింతాంతం మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు





Comments