నర్తనశాల - పార్ట్ 2
- Ayyala Somayajula Subramanyam
- Jun 9
- 4 min read
Updated: 3 days ago
#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

Narthanasala - Part 2 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 09/06/2025
నర్తనశాల - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు.
ఇక నర్తనశాల - పార్ట్ 2 చదవండి..
పాండవులు సుఖముగా నివసిస్తున్నారు ఎవరి చేత గుర్తింపు బడకుండునటులుగా మిక్కిలి జాగ్రత్తగా మెలిగేవారు. తమ శత్రువైన దుర్యోధనుని నుండి ఎల్లప్పుడూ ప్రమాదమును ఊహించేవారు.
వారక్కడ నివసించు కాలములో నాలుగవ మాసములో మల్లయుద్ధ పోటీలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు మహారాజు. ప్రపంచంలోని అన్ని దిక్కుల నుండి వేలాది మల్లయోధులు తమ పరాక్రమమును ప్రదర్శించవలెనని మత్స్యకార రాజధాని ని చేరుకొనిరి. అట్లు విచ్చేసిన మల్లయోధులందరిలోకి జీమూతుడు గొప్ప మల్లయోధుడు.
ఈ దిగ్గజ యోధుడు సవాలు విసరగా అతనితో తలపడుటకు ఎవరూ సాహసించలేదు. జీమూతుడు గర్వముగా వలయము చుట్టూ తిరుగుతూ పోరాడే వారెవరూ లేరనుటతో విరాటుడు తన పాచకుని వలలుని ఆజ్ఞాపించెను.
బహిరంగ బలప్రదర్శనకు భీముడు వాంచింపకున్నను రాజాజ్ఞను అతిక్రమించ లేకపోయెను. భీముడు మల్లయుద్ధ క్షేత్రము లోకి ప్రవేశించెను. జీమూతునితో యద్దమునకు సిద్దపడెను. మల్లయుద్ధము ఆరంభమయ్యెను. యోధులు ఇరువురును తమ అసాధారణ పరాక్రమమును ప్రదర్శింపసాగిరి.
క్రమముగా వారు తమ రకరకాల నైపుణ్యాలను మరియు అద్భుతమైన శక్తిని ప్రదర్శించిరి. ఇరువురును కూడా తనకు తగిన ప్రత్యర్థి లభించెనని ఆనందపడుచుండిరి.
భారీ యోధులిద్దరూ ఉత్సాహంగా ఒకరిపై ఒకరు నేలపై విసురుకొనిరి. ప్రత్యర్థి ని గట్టిగా ఒదిమి పట్టుకునిరి. ఒకరు మరొకరినినఅల్లుకొని, చక్రముగా తిరుగుచూ, ప్రత్యర్థి ని నేలపై పడద్రోసి పిడిగుద్దులతో బాదుకోసాగిరి. అలా భీముడు మరియు జీమూతుడు ఒకరి నొకరు ఆనందించుటయే కాకుండ వీక్షిస్తున్నట్టి ప్రేక్షకులకు కూడ ఆశ్చర్యానందాలను కలిగించిరి.
చివరకు, భీముడు గట్టిగా అరుస్తూ జీమూతుడిని తన చేతులతో పైకెత్రి అతడు స్పృహ కోల్పోయేంతవరకూ అనేక పర్యాయాలు గాలిలో గిరగిరా త్రిప్పి నేలపైకి విసిరెను. జీమూతుని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయెను.
విరాట మహారాజు మరియు ప్రేక్షకులు భీముని అసాధారణ పరాక్రమమునకు ఆశ్చర్యపడుతూ ఆనందించిరి. ఆ తరువాత తనతో తలపడుటకు ధైర్యము చేసిన మరికొంతమంది యోధులను కూడ పోరాటములో వధించెను. చివరకు భీమునితో సమానముగా పోరాడేవారు ముందుకు రాకపోవడంతో మహారాజు పులులతోనూ, సింహాలతోనూ మరియు ఏనుగులతోనూ యుద్ధము చేయించేవాడు.
మత్స్యరాజధానిలో అజ్ఞాతవాసము లోని పాండవులు అనేక రకాలుగా తరచు విరాటమహారాజును ఆనందింప చేస్తూండేవాడు. కొన్నిసార్లు భీముడు అంతఃపుర స్త్రీల ఆనందం కొరకు పెద్ద పెద్ద సింహాలతో పోరాడేవాడు.
అర్జునుడు తన సంగీత, నృత్య గానాలతో మహారాజుకు, మరియు అంతఃపుర స్త్రీలకు వినోదము కలిగించువాడు. నకులుడు వేగముగా పరుగులు తీయునట్లుగా శిక్షణ పొందిన గుర్రాలతో ప్రదర్శన ఇచ్చేవాడు. సహదేవుడు క్రమశిక్షణ కలిగిన వృషభాలతో ప్రదర్శన చేసేవాడు. ప్రతీసారి విరాటరాజు ఆనందముతో పాండవులకు అసంఖ్యాకముగా విలువైన కానుకలతో సత్కరించేవాడు.
ఏమైనను ద్రౌపది బలవంతులైన తన భర్తల ఈ రకమైన ఊడిగమును చూచి దుఃఖించేది. ఈ విధముగా కాలము గడుచుచుండెను. పది నెలలు గడిచినవి. ఒకరోజు విరాటరాజు సైన్యాధ్యక్షుడు మరియు బావమరిది అయిన కీచకుడు ద్రౌపది ని చూచుట తటస్థించినది. ఆమె అద్భుత సౌందర్యమునకు ముగ్ధుడై, నిశ్చేష్టుడైన మిక్కిలి కామాధ్రితుడైన కీచకుడు ఆమెను ఎలాగైనను పొందవలెనని తలచెను.
కీచకుడు మహారాణి సుధేష్ణదేవి సోదరుడు. ద్రౌపది పై కోరికతో దహించుకు పోతున్నట్టి కీచకుడు తన సోదరి సుదేష్ణను సమీపించి ఇలా పలికెను.
“సోదరీ; నేను నీ సైరంద్రిని చూడకుండ ఉండకుండ లేకపొతుంటిని. ఒక్కసారి చూడంగనె నా హృదయము పూర్తిగా మోహనకు గురి అయ్యెను. ఈ స్త్రీ ఎవరు. ?మునుపెన్నడునూ ఈ భవనుములో కనబడలేదు. ఎలాగైనను నేను ఆమెను నా మహారాణి గా పొందదలచితిని. ఆమె నా హృదయేశ్వరి అయినచో, నా సర్వస్వమును ఆమెకు అర్పించెదను.”
కీచకుడు ఈ వ్యవహారములో తన విజయముపై విశ్వాసముతో ఉండెను. సుధేష్ణతో సంభాషించిన పిమ్మట కీచకుడు ఆసనమును సమీపించుచు నేరుగా ద్రౌపది తో ఇట్లు సంభాషించెను. “ఓ మంజులతా, నీ అద్భుత సౌందర్యము, మరియు తేనెలవంటి మాటల చేత నేను పూర్తిగా మోహింపబడితిని. నీ వెవరవో తెలుపుము. నీ మధుర వాక్కుల పట్ల నేను పూర్తిగా ఆకర్షింపబడితిని.
ఓ, మందస్మితవదనా; నీతో పొందుగురించి ఆశలు రేకెత్తి నా హృదయము కామముతో రగిలిపోతుండెను. నీ ప్రేమపూర్వక ఆలింగనం అను దానిని మేఘవృష్టితో ఆర్పివేయుము. ఒక పరిచారకుడు వలె దుర్భర జీవితమును ఇక్కడ కొన సాగింప నవసరము నీకేమిటీ? నా మహారాణిగా సకల రాజభోగాలను అనుభవించుము. నేను నా భార్యలందరినీ విడిచి, నీకు బానిసగా, నమ్మకమైన వానిగా ఉందునని వాగ్దానము చేస్తుంటిని.”
ద్రౌపది మొదట అతడిని శాంతిపూర్వకముగా నిరోధింపదలచి మర్యాదగా కీచకునితో ఇట్లనెను.
“ఓ, సింహబలా, నేను నిమ్నజాతిలో జనియించిన దానినైనందున నీకు భార్యగా నేను సరియైన జోడీ కాను. అంతేకాకుండా మరొకరి భార్యను పొందవలెనను నీ కోరిక కూడా పాపపూరితమైనది. కనుక అట్టి ఆలోచనను విరమించుము”
ఏమైనను కీచకుడు కామదృష్టితో నిండి ఉన్నందున ఇంద్రియాలపై నిగ్రహము కోల్పోయెను. కీచకుడు ఇతరుల భార్యను ప్రలోభపెట్టదలచుట చేత కలిగే ప్రమాదముల గూర్చి ఎరిగి ఉన్నప్పటికిని, ద్రౌపది తో తిరిగి ఇట్లనెను.
“ఓ, లతాంగీ; ఈ మత్స్యదేశమునకు నిజమైన ప్రభువును నేనని తెలుసుకొనుము. ఎందుకంటే ఈ రాజు నేను నియమించిన మట్టిబొమ్మ. ఈ రాజ్యములో అందరూ రక్షణ నిమిత్తము నాపై ఆధారపడుతుందురు. ఈ రాజ్యములో నేనే అందరిలోకి అందగాడిని. స్ఫురద్రూపిని. బలవంతుడను మరియు సుసంపన్నుడను.
నా దేవిగా నీవు అపారమైన సంపదలతో సుఖింపుము. దేవీ, నేను మన్మథునికి పూర్తిగా బానిసనైతిని. నిన్ను మరచుట నాకు సాధ్యపడదు. నీ క్షేమమును వాంఛిస్తూ నీవు నాకు స్వచ్చదంగా లొంగిపోవలెను”
బలవంతుడైన కీచకుడు అలా ద్రౌపది ని భయపెట్టి లొంగ దీసుకొనదలచినను ఆమె అతడిని నిందిస్తూ ఇలా స్పందించెను.
“ఓరి మూర్ఖుడా, అధర్మముగా ప్రవర్తిస్తూ నీ ప్రాణాలకు ముప్పు తెచ్చు కోకుము. అజేయులైన ఐదుగురు అదృశ్య గంధర్వులు నా పతులు. వారు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుందురు. నీవు నన్ను బలవంత పరచుటకు ప్రయత్నిస్తే వారు వెంటనే వచ్చి నిన్ను యమ పురికి పంపెదరు.
దుర్వార్త ఉద్యమ బాహు రసా సోక్త ప్రతాప స్ఫుర
ధ్గర్వాంద ప్రతివీర నిర్మథన విద్యాపార మత్పతు-
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను దోర్లీలన్ వెసన్ బట్టి గం-
ధర్వుల్ మానము ప్రాణముం గొనుట తథ్యంబె మ్మెయిం కీచకా.
ఈ పద్యం విరాటపర్వంలో, రెండో ఆశ్వాసంలో యాభైఐదో పద్యం. తిక్కన గారు రచించిన పద్యం. ఈ పద్యం కీచకుడి కామపేలాపనకు సమాధానంగా ద్రౌపది( సైరంద్రి) ఇచ్చిన ప్రతిస్పందన. కీచకుడు ద్రౌపది ని చూసి మోహించి రమించకోరాడు.
ఈ పద్యం గురించి రెండు విశేషాలు. సైరంద్రి తన భర్తలు ఎంత పరాక్రమవంతులో హెచ్చరించటానికి ఎలా మొదలుపెట్టిందో చూడండి. ‘
‘దుర్వార ఉద్యమ బాహు విక్రమ రసా సోక్త ప్రతాప స్ఫుర గర్వాంద’ ప్రతివీరులని అవలీలగా పచ్చడి చేయగల విద్య నేర్చిన ఐదుగురు రహస్య రూపాలలో వున్న గంధర్వులు, మహాపరాక్రమవంతులు, నా భర్తలు. నీకు మానభంగమే కాక ప్రాణభంగము కూడా తప్పక కలుగుతాయి సుమా’ అని పరుషవాక్యాలు పలుకుతుంది.
ద్రౌపది దుష్టవిరోధుల బలాన్ని బోలెడు విశేషణాలతో పొగిడి అంత ఘటికులని కూడా పిండిపిండి చేయగల సమర్థులు నా భర్తలు, ఓరి కీచకా అని సంభోదించి హెచ్చరించి ద్రౌపది చేత ఈ మాటలు చెప్పించారు తిక్కనగారు.
ఈ విధముగా నిందింపబడినను కీచకుడు కామక్రోధాలతో దాదాపు ఉన్మాది అయ్యెను.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments