top of page

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 6


'Raghupathi Raghava Rajaram Episode 6' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar

'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ


కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి. కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.


స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.


రాఘవ, సీతయ్య ల ఘర్షణలో అడ్డు వెళ్లిన రఘుపతికి గాయం అవుతుంది. రఘుపతి కోలుకుంటాడు. అతని కోరిక మీద రాఘవ ఎడ్ల పందాలలో పాల్గొని గెలుస్తాడు.


కాలేజీలో అవయవ దానం గురించి కల్యాణి చేసిన ప్రసంగానికి ఆకర్షితుడవుతాడు రాజారామ్.

వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది.

ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 6 చదవండి..


కళ్యాణి ని చూడగానే రాజాకు ఆమెతో పరిచయం, స్నేహం అన్నీ ఒక్కసారిగా మదిలో మెదిలాయి.


నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు సంక్రాంతి పండగకు రమ్మని చెప్పాడు. గీతమ్స్ కాలేజీలో ప్రోగ్రామ్ వుందని దాదాపుగా రాకపోవచ్చని చెప్పింది.


కళ్యాణి సంగతులన్నీ యింట్లో అందరికీ చెప్పాడు. సంక్రాంతి కి రమ్మని ఆహ్వానించిన విషయం కూడా చెప్పాడు.


అనుకోకుండా సడన్ గా వచ్చిన ఆమె రాక రాజాకు ఆశ్చర్యాన్ని కలుగచేసింది.


"ఎంత సేపయింది కళ్యాణీ వచ్చి?పిల్లలు కూడా వచ్చారా?" అని అడుగుతూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు.


వదిన వైపు చూస్తూ "వదినా తను కళ్యాణి.." అంటూ చెప్పబోతుండగా విశాల అతన్ని ఆపి

"రాజా, తను వచ్చి చాలా సేపు అయింది. మా పరిచయాలన్నీ ముగిసాయి. పిల్లలు అన్నం తిని తిలక్ రూం లో చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. తను మనతో ఏదో మాట్లాడాలని వచ్చింది. నీకోసమే ఎదురు చూస్తున్నాం" అంది.


రాజా కళ్యాణి ముఖం లోకి చూసాడు.


కళ్యాణి ఒకసారి అందరివైపు చూస్తూ


"రాజా పరిచయం కాకుంటే ఈ పరిస్థితులలో ఏమి చేసేదాన్నో తెలియదు. రాజా స్నేహం నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఈ విషయంలో పెద్దవారిగా మీ సలహాలు, సూచనలు అవసరం అని భావిస్తున్నాను. నా గురించి అన్ని సంగతులు మీ అందరికీ చెప్పానని రాజా ఫోన్ లో చెప్పాడు.

మా బావ దగ్గరనుండి రెండు రోజుల క్రితం ఒక వుత్తరం వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఉత్తరం రాయలేదు. ఏదైనా వుంటే ఫోన్ చేసేవాడు. నేను ఆదుర్దాతో ఉత్తరం విప్పాను.


కళ్యాణి,

మీ అక్క చనిపోయాక నేను ఈ ఒంటరి బ్రతుకుతో విసిగిపోయాను. పిల్లలను పెంచటానికి నేను ఇబ్బంది పడుతుంటే వారిని నీ దగ్గర ఉంచుకుని వారి ఆలనా, పాలనా చూస్తున్నావు. పెళ్ళి చేసుకుందామని అనుకొని ముందుగా నిన్నే అడిగాను. నువ్వయితే పిల్లలను ప్రేమగా పెంచుతావని. కానీ నువ్వు అంగీకరించలేదు.

దానికి నేను నిన్నేమీ తప్పుపట్టను. ఎవరి ఇష్టం వారిదే.

ఇక్కడ నాకు మేరీ మరియం అనే ఆమెతో పరిచయం అయింది. తనకు స్టేట్స్ లో జాబ్ వచ్చింది. మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం. ఆమెకు నా సంగతి తెలుసు. పెళ్ళి అయిందని, ఇద్దరు పిల్లలు వున్నారని.

పెళ్లికి ఆమె ఒక షరతు పెట్టింది.


పిల్లల సంగతి నేను మరచిపోవాలని. నేనూ సరేనన్నాను.

మా పెళ్ళి జరిగిపోయింది. ఈ ఉత్తరం నీకు అందేనాటికి నేను ఈ దేశం లోనే ఉండను. తనతో కలసి స్టేట్స్ కు వెళ్ళిపోతున్నాను. పిల్లల సంగతి నీ ఇష్టానికే వదిలివేస్తున్నాను.


వారిని నీ దగ్గర వుంచుకోలేకపోతే ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించు. దాదాపు నేను ఇక ఇండియాకు రాను. ఇదే నా మొదటి, చివరి ఉత్తరం. ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడికొచ్చి నన్ను ఆపటానికి ప్రయత్నం చేస్తావని చివరి నిముషం దాకా తెలియచేయలేదు. పిల్లలు నన్ను అడిగితే వాళ్ళ అమ్మలా నేను కూడా చనిపోయానని చెప్పు. ఇంతే. ఇక రాయటానికి ఏమీ లేదు.


బై ఫరెవర్.. మోహన్


ఆ ఉత్తరం చదవగానే నా మైండ్ పనిచేయటం మానేసింది.

ఆ రాత్రంతా స్తబ్దుగా సోఫాలోనే కూర్చుండిపోయాను. నిన్నంతా ఏం చేయాలని ఆలోచిస్తూనే గడిపేసాను. అప్పుడే నాకు రాజా మీ ఊరు రమ్మని అడిగిన విషయం గుర్తొచ్చింది.

నాలుగు రోజుల క్రితం రాజా ఫోన్ చేస్తే గీతమ్స్ లో స్పీచ్ ఇవ్వాల్సి వుంది రానని చెప్పాను.

ఈ పరిస్థితులలో మీ దగ్గరకు వచ్చి మీ వంటి అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిదని అనిపించింది. గీతమ్స్ కు ఫోన్ చేసి అత్యవసర పనివల్ల రాలేకపోతున్నానని ఒక పది రోజుల తరువాత ప్రోగ్రామ్ పెట్టి ఇంఫర్మేషన్ ఇవ్వమని చెప్పి ఇక్కడకు బయలుదేరి వచ్చాను.


రాజా తో పరిచయం స్వల్పకాలమే అయినా ఎందుకో నాకు మంచి మిత్రునిగా, ఆత్మీయుడిగా అనిపించాడు. రాజా మాటల్లోనే మీ అందరి పరిచయం కలిగింది. మీ వంటి సంస్కారం గల వ్యక్తులు నా గురించి వేరే రకంగా ఆలోచించరనే దైర్యం తోనే మీ ఇంటికి వచ్చాను.


నేను ఎట్టి పరిస్థితులలోనూ నా అక్క పిల్లలను అనాధలుగా వదిలివేయను. పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలి?" అంటూ ఆగిపోయింది కళ్యాణి కళ్ళ వెంట నీళ్ళు సుడులు తిరిగాయి.


విశాల, కళ్యాణి చుట్టూ చేతులు వేసి ఓదార్చింది. వింటున్న అందరూ రెండు నిమిషాల పాటు ఏం మాట్లాడలేకపోయారు.


"బెంగుళూరు వెళితే మోహన్ గురించి, మేరీ గురించి విషయాలు, అడ్రసు తెలుస్తాయేమో !" రాజా అన్నాడు.


" దానివల్ల ఉపయోగం ఉంటుందని నెననుకోవటం లేదు. పిల్లలను వదిలించుకోవాలనే చివరి దాకా తన సంగతులన్నీ గోప్యంగా ఉంచుకున్నాడు. అతను తిరిగిరాడు అన్నది స్పష్టమౌతూనే వుంది.


పిల్లలను పెంచటం కళ్యాణికి కూడా ఇష్టమే కాబట్టి ప్రస్తుతం సమస్య లేదు. కానీ రేపు కళ్యాణికి పెళ్లి అయితే వచ్చేవాడు పిల్లలను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు.

అప్పుడే సమస్య !


మీరిద్దరూ నాకొక విషయము స్పష్టంగా తేల్చి చెప్పండి? మీరిద్దరూ ప్రస్తుతం స్నేహితులమంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? భవిష్యత్తులో పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నదా?


ఈ విషయం పై మీరిద్దరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి మాకు చెపితే మీరు చెప్పనదాన్ని బట్టి ఆలోచిద్దాం ఏం చేయాలన్నది. ఇప్పటికిప్పుడు చెప్పనవసరం లేదు.

రేపు ఉదయానికల్లా చెప్పండి.


విశాలా! చాలా టైమ్ అయింది. భోజనాల సంగతి చూడు" అంటూ లేచాడు రఘుపతి.


రాజాను, కళ్యాణిని ఆ హాల్లోనే వదిలి అందరూ వంటగదిలోకి వెళ్ళారు. తెల్లవారిన తరువాత యింట్లో వారందరిముందు రాజా చెప్పాడు.


"అన్నయ్యా మీరు చెప్పిన విషయాలు రాత్రి నేనూ, కళ్యాణి చాలాసేపు చర్చించుకున్నాం. మేమిద్దరం పెళ్ళి చేసుకుంటాం. కానీ ఇప్పుడు కాదు.

నేను మన ఊరిలో పెట్టదలుచుకున్న ఇండస్ట్రీ విజయవంతం కావాలి. రాఘవ పెళ్ళి కావాలి. కళ్యాణి పీజీ పూర్తవ్వాలి. ఇవన్నీ పూర్తి అయ్యాకనే మా పెళ్ళి.


కళ్యాణి కూడా ఒక షరతు పెట్టింది. తను ఉద్యోగం చేసినా, చేయకపోయినా అవయవ దానం మీద కార్యక్రమం మాత్రం ఆపనని చెప్పింది. యింట్లో అందరూ దానికి అంగీకరించాలని చెప్పింది. మంచి పనులకు మన యింట్లో ఎవ్వరు అభ్యంతర పెట్టరని చెప్పాను.


మా పెళ్ళికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది.

ఇదే మేము అనుకున్నది. మీకు చెప్పాను. మీ సలహా చెప్పండి దీనిమీద."


రఘుపతి తండ్రి గాంధీ వైపు చూసాడు. గాంధీ గారు నువ్వే చెప్పు అన్నట్లు సైగ చేసాడు.


"కళ్యాణికి ప్రస్తుతం మనమే అండగా వున్నాం. తను మనఇంట్లో తిరగాలన్నా, మనం కళ్యాణి దగ్గరకు వెళ్ళి రావాలన్నా మనమధ్య ఒక బంధం అనేది ఉండాలి.

పెళ్ళి మీరు ఎప్పుడు చేసుకున్నా ఈ వేసవిలో మీ ఇద్దరికీ నిశ్చితార్ధం చేయాలని మా కోరిక.


నిశ్చితార్ధం అయితే లోకం దృష్టిలో వేరే ఆలోచనలకు ఆస్కారముండదు. ఈ విద్యా సంవత్సరం పూర్తికాగానే పిల్లలను తీసుకొచ్చి తిలక్, పల్లవి చదివే స్కూల్లోనే జాయిన్ చేద్దాం. కళ్యాణి చదువు పూర్తి అయ్యేవరకు హైదరాబాదు లోనే ఉంటుంది.


పదిహేను రోజులకొకసారి మన ముగ్గురిలో ఎవరో ఒకరం వీలును బట్టి హైదరాబాదు వెళ్లి తనబాగోగులు చూద్దాం. పండగలకు, సెలవులకు తను ఇక్కడికి వస్తూ ఉంటుంది.

ప్రస్తుతానికి నాన్న, నేను ఆలోచించింది ఇది. కళ్యాణీ! నేను చెప్పింది నీకు ఏమనిపిస్తుంది?" అంటూ కళ్యాణి ముఖం లోకి చూసాడు రఘుపతి.


కళ్యాణి ఏం మాట్లాడలేదు. రఘుపతికి హృదయ పూర్వకంగా నమస్కారం చేసింది.


గాంధీ గారి కాళ్లకు నమస్కరిస్తూ "నన్ను ఆశీర్వదించండి మామయ్యా " అంది చిరునవ్వుతో.


గాంధీ గారు"దీర్ఘసుమంగళీభవ" అంటూ కళ్యాణిని లేవనెత్తి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు.


నలుగురు పిల్లలు రాఘవ ను, రాజా ను వెంటబెట్టుకొని గాలిపటాలు ఎగుర వేయటానికి బయటకు వెళ్ళారు. కళ్యాణి ని తీసుకొని సత్యవతి గారు, విశాల లోపలికి వెళ్ళారు. రఘుపతి పేపర్ తిరగేయసాగాడు.


చైనా లో బయటపడిన క్రొత్తరకం వైరస్ అన్న వార్త మీద దృష్టి నిలిపాడు. ఇటీవల కనుగొన్న కరోనా, ఒకరకమైన వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. డిసెంబర్, 2019 లో చైనాలోని వుహాన్‌లో బయటపడినప్పుడే ఈ వైరస్ మరియు వ్యాధి గురించి అందరికీ తెలిసింది. 2019 డిసెంబర్‌లో చైనాలో కొవిడ్-19 తొలి కేసు నమోదైనట్టు డబ్ల్యూహెచ్‍వో తొలిసారి అధికారికంగా ప్రకటించింది.


ఆ వార్తను చదివి మనిషి సాంకేతికంగా ఎంతో ముందుకు పోతున్నా క్రొత్త క్రొత్త సమస్యలు ఉద్భవించి మనిషి ప్రగతిని సవాలు చేస్తున్నాయ్ అనుకుంటూ నిట్టూర్చాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.


29 views0 comments
bottom of page