top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 6



'Sabhaash Sanjeevi - Episode 6' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 29/01/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 

వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 

గుడ్దిగోలాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చండుడు. ఆ మెజిషియన్, సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు. సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం. 

తమను బంధించిన చోటునుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు, సంజీవి. 


ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 6 చదవండి.. 


"రేయ్ సంజీవీ, ఇలారా "

"ఏంటి సార్" గడియ తీసి వంటగది తలుపుతెరచి అలాగే నిలబడ్డాడు సంజీవి. 

“మేముపిలిస్తే వంటగది దాటి రావచ్చు అని ముందే చెప్పానుగా, రా రా "

వంటగది దాటి హాలులోకి వచ్చాడు.

 

“ఆ పౌడర్లు కలిపి ఆ గదిలో పెట్టు "

"సార్ క్షమించండి నన్ను చంపినా సరే ఆ పని చెయ్యను. అది మత్తుమందు అని తెలుసు" అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు, 


కోపంతో చెంప చెళ్లు మనేలా కొట్టాడు. ఆ దెబ్బకు ఒక్కసారిగా కిందపడి ఏడవసాగాడు 

 వంట గదిలోంచి చూస్తున్న బాలు ఏమీ చేయలేక బాధగా చూడసాగాడు. 

 "రేయ్ వాళ్ళతో ఆ పనిచెప్పద్దు. మనకు మూడుపూటలా వంట చేయని రోజు నీ ఇష్టం వచ్చినట్లు కొట్టు. రేయ్ బాలూ వచ్చి ఈ సంజీవిని తీసుకెళ్ళు. " అన్నాడు ఇంకొకడు. 

బాలు వచ్చి వంటగదికి తీసుకెళ్లి తలుపుమూసి గడియపెట్టాడు. 


 "సిండరెల్లా నాటిక పోటీలో నేను సిండరెల్లాగా అమ్మాయి వేషం వేసాను, ఆ నాటికలో నా నటనకు ఉత్తమ బహుమతి వచ్చింది. కానీ నా జీవితమేఒక సిండరెల్లాలాంటిదని ఇప్పుడు తెలుసుకున్నాను. " ఏడుస్తూ అన్నాడు సంజీవి.

బాలూ సంజీవిని సముదాయించాడు. 


"అన్నా, ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది "

"వీళ్ళు ఆ విషపానీయంలో మత్తుమందు కలుపుతూ విద్యార్థులను, యువకులను మరింత అనారోగ్యానికి గురిఅయ్యేలా చేస్తున్నారు. వీళ్ళలోమానవత్వమే లేదు చంపినా పాపములేదు సంజీవీ "


"అన్నా, వాళ్ళనెందుకు చంపాలి. చంపితే ఆ చండుడును చంపాలి. వాడికింద పని చేసే వీళ్ళను అనారోగ్యవంతులుగా  మారుద్దాము. అప్పుడు మనం తప్పించుకొని పోవటానికి అవకాశం కలగవచ్చు " 


"అనారోగ్యమా.. ఎలాగా "


" గోధుమ పిండిని అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుచి మైదాపిండి గా మారుస్తారు. అంతేకాదు. ఆసుపత్రిలో గాయాలకు  శుభ్రం చేసే రసాయనాలను, తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చే హెయిర్ డై నందు వాడే రసాయనాలను ఈ మైదాపిండి తయారులో ఉపయోగిస్తారు. మొత్తంమీద విషపూరితమైన కెమికల్స్ ఉపయోగించడం వలన మైదా పిండి తెల్లగా మెత్తగా ఉంటుంది. మైదాను ‘ది మోస్ట్ డేంజరస్ ఫుడ్’ అనంటారు "


"సంజీవీ నీకు చాలా తెలుసు. ఎవరు చెప్పారు" 


"మా జబ్బార్ సార్ చెప్పారు. అసలు విషయానికి వస్తాను. వీళ్ళుమనం అడిగిన వంట సరకులు తెచ్చిస్తారు. మనం రేపటినుండి ఎక్కువగా మైదా వంటకాలే చేస్తాము. మైదాపిండి చాలా వ్యాధులకు మూలకారణం. తప్పకుండా ఏదో ఒక రోజు ఎవరోఒక్కరూ ఇద్దరో ముగ్గురోఅనారోగ్యానికి గురైనప్పుడు తప్పకుండా మన సహాయం కోరుతారు. అప్పుడు మనము తప్పించుకొనడానికి ప్రయత్నిస్తాము "


"నా తర్కంతో గోడ పడుతుందో లేక నీ శాస్త్రం తోవాళ్ళు అనారోగ్యం గురి అవుతారో చూద్దాము. మనిద్దరిలో ఎవరు గెలుస్తారో "


 "మనిద్దరిలో ఎవరు గెలిచినా మనకు సంతోషమే కదా అన్నా. అడగడం మరిచాను నీకు పరోటా చేయడం తెలుసా " అన్నాడు.

 

“హోటల్ నందు నా చేత ఎక్కువరోజులు పరోటా చేసే పని ఇచ్చారు "అన్నాడు బాలు 

 "రేపటినుండి పరోటాలు తయారు చెయ్యాలి "  అన్నాడు సంజీవి.

*********

వంటకు కావలసిన సరుకుల జాబితాను సంజీవితో కలసి తయారు చేసాడు. 

“ఈ రోజు ఏమైనా కావాలా?” అంటూ తలుపు కొట్టగానే తలుపు తీసి పేపర్  ఇచ్చాడు

మైదా పిండి, రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువగా ఉండటం చూసాడు. 

" ఏమిటి మైదా పిండి, రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువగావేశావు" 

"సార్, ఈ రోజు నుండి పరోటాలు చేద్దామనుకొంటున్నాను " అన్నాడు బాలు ..

"పరోటాలు వచ్చా, వెరీ గుడ్ అలాగే చెయ్ "


 ఒక గంట తరువాత సంజీవి వ్రాసిన సరుకులన్నీతీసుకొని వచ్చాడు. 

 "అన్నా ఈ రిఫైన్డ్ ఆయిల్ పాకెట్ గురించి తెలుసా " అడిగాడు సంజీవీ 

"నాకూ సైన్సుకు చాలా దూరం వేరే లాజిక్ లాంటి ప్రశ్నలు అడిగితే చెబుతాను. నువ్వే చెప్పు " అన్నాడు బాలు..

 

"అన్నా ఈ కె జీ నూనెతయారు చేయడానికి రెండు కేజీల విత్తనాలు కావలి. రెండుకేజీల విత్తనాలు రెండువందల యాభై రూపాయలు. కానీ ఈ కేజీ నూనె ధర నూట ఇరవై రూపాయలు. ఆన్ లైన్ లో ఆఫర్ వచ్చిందంటే తొంబై లేక నూరు రూపాయలకే ఇస్తారు. ఇంత తక్కువకు ఎలా ఇస్తారని ఈ ప్రజలుఆలోచించరు. చదువుకొన్నమూర్ఖులుఅయ్యారు. అంత తక్కువ రావడానికి ఎన్ని రసాయనాలు కలుపుతున్నారు అది శరీరానికి ఎంత హాని కలిగిస్తుందని ఎవడూ ఆలోచించరు "


" నీవు పందెంలో గెలవడానికి ఈ రిఫైన్డ్ ఆయిల్ ఒక ఆయుధమా " చిరునవ్వుతో అన్నాడు బాలు. 

*** ******

"అన్నా, నేను ఇక్కడకు వచ్చి మూడు నెలలు గడిచింది, నీవు వచ్చి ఆరునెలలు గడిచింది. మనం తప్పించుకొనే అవకాశం దొరకనేలేదు. " అన్నాడు సంజీవి. 


 "అవకాశం దొరకకపోయినా పరవాలేదు. గుడ్డిలోమెల్ల అన్నట్లు వాళ్ళు మనల్నిబాధించడం మానుకున్నారు. అదే పెద్ద వరమనుకోవాలి. "


వంటగది తలుపుతడుతున్న శబ్దం విని తలుపుతెరిచాడు. 

"వాళ్ళ ముగ్గురికి ఆరోగ్యం బాగోలేదు "అన్నాడు.

 

బాలువెళ్లి చూసాడు. వాసుపతివాంతి ఎత్తి నీరసంగా కూర్చొన్నాడు. 

బాలు, సంజీవీ కలసి నేలంతా శుభ్రం చేసి చేతులు కడుక్కొని వచ్చారు. జ్వరం ఎక్కువగా వున్నజగ్గయ్యను తాకి చూసి "జ్వరం చాలా ఎక్కువగా వుంది నీవు గిన్నెలో నీళ్లు తీసుకునిరా" అన్నాడు బాలు.

 

సంజీవీ ఒక గిన్నెలో నీళ్లు తెచ్చాడు. 

అక్కడున్న ఒక బనియన్ తీసుకొని నీటిలో ముంచి పిండిన తరువాత "సంజీవీ నీవు అప్పుడప్పుడు నీటిలో ముంచి తుడుస్తూ వుండు "అన్నాడు. 

కడుపునొప్పితో బాధపడుతున్న కనకయ్య దగ్గరకు వెళ్లి "కడుపునొప్పి మాత్రమేనా వేరే ఏమైనా సమస్యఉందా సార్. "అడిగాడు 

 "ఏమీలేదు కడుపునొప్పి మాత్రం "ఆయాసపడుతూ అన్నాడు కనకయ్య. .


"నేను మీ ముగ్గురికీ కషాయం పెట్టి తీసుకొని వస్తాను" అంటూ లోనికి వెళ్లి జీలకర్ర, ధనియాలు, వాము లను వేరు వేరుగా వేయించి మూడింటినీ కలిపి మిక్సీలో పొడిచేసి ఆ పొడిని మూడు నీటి గ్లాసులందు కలిపి ముగ్గురికీ వెళ్లి బలవంతంగా తాగిస్తూ "నాకు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, ఏది వచ్చినా మా అమ్మ ఈ షాయం చేసి ఇచ్చేది. మా అమ్మమాట వినకుండా పారిపోయి ఇప్పుడు అనుభవిస్తున్నాను. ” అన్నాడు. 


సంజీవీ, నేను తుడుస్తాను" అంటూ బనియన్ గుడ్డ తీసుకొన్నాడు. 

అతని శరీరంతుడుస్తూ "ఇంకా ముగ్గరు ఉండాలి. ఆసుపత్రికి పోవడానికి కారు తీసుకొనిరావడానికి వెళ్ళారా. " అనడిగాడు బాలు.


 "ఏదో ముఖ్యమైన పనిమీద చండుడు రమ్మని ఫోన్ చేస్తే వెళ్లారు. మరో రెండు మూడు రోజులదాకా రారు" అన్నాడు. 

“అమ్మా”అంటూ వాసుపతి వాంతి ఎత్తాడు. 

"అమ్మా కడుపునొప్పి భరించలేకుండా వున్నాను "అన్నాడుకనకయ్య. 


వాంతి ఎత్తినది శుభ్రం చేస్తూ "సార్ వెంటనే ఎవరైనా వెళ్లి కారు తీసుకునివచ్చి ముగ్గురిని డాక్టరు దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. "అన్నాడు బాలు. 

 “వర్షం పెద్దగా వస్తోంది. ఆటోలు కార్లు దొరుకుతోందో తెలీదు" అన్నాడు. 

 శుభ్రం చేసిన గుడ్డను నీటిలో తడిపి ఆరవేయడానికి బాలు వెల్తూ "సార్ వర్షం వస్తుంది అని ఇక్కడినుండిచెప్పడం కన్నాబయటకు వెళ్లి ప్రయత్నించండి ప్లీజ్ "అంటూ చేతులు జోడించాడు. 

"ఎలాగైనా బండి కోసం ప్రయత్నిస్తాము "అంటూ ఇద్దరు వెళ్లారు. 


పెరటివైపు లైట్ వేసాడు బాలు. తడి గుడ్డను గోడ ప్రక్కన ఆరపెడుతున్న సమయాన కరెంటు పోయింది. పెద్ద శబ్దం వినబడగానే బాలు వంటగదికి వేగంగా వచ్చాడు. 

 ఆ శబ్దం విన్న సంజీవి వేగంగా వంటగదికి వచ్చా డు. సంజీవి బాలు చేతిని పట్టుకొన్నాడు. 

మెరుపుకాంతిలో గోడ పడిపోయింది కనబడింది. దూరంగాఏదోపట్టణం లైట్లు కనపడుతోంది. ఈ ఇల్లు పట్టణానికి దూరంగా ఉందని అనుకొన్నారు. 


 “సంజీవీ మనకు ఈ రోజు వెళ్ళడానికి అవకాశం దొరికింది వెళ్లిపోదామా" 

"వద్దన్నా వీళ్ళు అనారోగ్యంతో వున్నప్పుడు వదలి వెళ్లడం బాగుండదు. మొదట్లో మనల్ని హింసించినా ఈ మధ్య మనదగ్గర మంచిగా నడచుకొన్నారు. కనీసం ఆసుపత్రి వరకు అయినా తీసుకొని వెళ్లి ఆ తరువాత ఆలోచిస్తాము. "అన్నాడు సంజీవి. 

"మంచి అవకాశం పోగొట్టుకొన్నాము. కష్టమైనా సుఖమైనా ఇద్దరమూ కల్సి అనుభవిద్దాం. నీ ఇష్ట ప్రకారం ఇక్కడే ఉందాము. " అన్నాడు బాలు. 

"అన్నా, నాకేమో వీరిలో మార్పు కలిగి త్వరలో మనలను ఇంటికి వెళ్ళమని చెబుతారనిపిస్తోంది " అన్నాడు సంజీవి.

 

 బాలు మౌనంగా అలాగే కూర్చొని బాధగా తలవంచుకున్నాడు, కొంతసమయం గడిచింది 

తమపై లైట్ వెలుగు పడటంతో తల ఎత్తి చూసాడు

ఏదో వాహనం ఇంటివైపు రావడం చూసి "ఏదో బండి వస్తోంది రా వెల్దాము" అన్నాడు 

 బండిలోంచి దిగి ఆ ఇద్దరూ వచ్చారు. 

 "వీళ్ళిద్దరినీ ఉంచి తాళమేసి వెల్దామా "అన్నాడ. 

 "వద్దు వీళ్ళిద్దరూ మనతో రావాలి "కడుపునొప్పితో బాధపడుతూ అన్నాడు కనకయ్య..


అందరూ కూర్చున్నాక బండి వేగంగా వేళ్ళ సాగింది. నాలుగు రోడ్ల జంక్షన్ రావడం చూసి బండి ఆపమని చెప్పాడు వాసుపతి. 


 "బాలూ, సంజీవీ మీరిద్దరూ మాట్లాడుకొనడం నేను వాసుపతి, కనకయ్య విన్నాము. జగ్గయ్యకు ఇదేమీ తెలీదు. మీకు పారిపోవడానికి అవకాశమున్నామాఆరోగ్యం కోసం వెళ్లకూడదనుకోవడం, మాలో మార్పువస్తుందని ఆశించడం చూసిన మాకు నిజంగానే మాలో మార్పు వచ్చింది. ఇక్కడినుండి మీ ఊరికి వెళ్ళడానికి ప్రతి అర్థగంటకు ఒక బస్సు ఉంటుంది. "అంటూ కొంత డబ్బు బాలూ చేతికి ఇచ్చాడు వాసుపతి. 


"ఆ చండుడు మా వల్ల కోట్లు సంపాదించాడు. ఆ చండుడుకి ఫోనుచేసి మా ఆరోగ్యంవిషయం చెబితే చావొచ్చినా సరే బయటకు వెళ్ళద్దని చెప్పాడు. ఏ మాత్రం కనికరం చూపకుండారెండు మూడు రోజులాగండి ఆ తరువాత చూద్దాం అంటూనిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అందుకే ఇక్కడ ఉండకూడని అనుకొన్నాం. " అన్నాడు కనకయ్య. 


"బాలూ, పోలీసులు అడిగితే ఏదీ దాచనక్కరలేదు, మేము ఇక అక్కడకు వెళ్లము. పోలీసులకు దొరకకుండా దూరంగా వెళ్తాము "అన్నాడు వాసుపతి.

"సంజీవీ నన్ను క్షమించు బాబూ" అంత జ్వరంలోనూ నీసంతో బాధపడుతున్న జగ్గయ్య బిగ్గరగా చెప్పాడు. 

"ఎందుకు సార్ “

"నిన్ను కిడ్నాప్ చేసిన ఉష్ణకుడు నేనే. " అన్నాడు జగ్గయ్య.

 

 బాలూ సంజీవీ కారు దిగినతరువాత వారి వైపు చూస్తూ చేతులు జోడించారు. ఒక్క సారిగా వేగంగా వెళ్ళింది. 

"కంగ్రాట్స్ అన్నా యుద్ధంలో నీవే గెలిచావు. "


"కంగ్రాట్స్ నీకే చెప్పాలి యుద్ధంలో నీవే గెలిచావు. ఇద్దరం గెలిచాము అని చెప్పడం కన్నా మంచితనం గెలిచింది అని చెప్పవచ్చు సంజీవీ "

“ఔనన్నా మంచితనం గెలిచింది "అన్నాడు.

 

"సంజీవీ నీకు ఆర్కిమెడిస్ గురించి తెలుసా" 

వేళ కానీ వేళలో ఎందుకు అడిగాడు అని మనసులోఅనుకొంటూ "ద్రవాలలో ఒక వస్తువు కోల్పోయిన భారం అది తొలిగించిన నీటి భారానికి సమానం అని తెలియజేసేది ఆర్కిమెడిస్ సూత్రం. " చెప్పాడు సంజీవి. 


"ఈ రాత్రివేళ నేను నిన్ను ఇలాంటి సూత్రాలు అడగడానికి నేనేమైనా పిచ్చివాడినా, నాకు సైన్స్ అంటేనే చిరాకు అని తెలుసుగా. నేను సూత్రం అడగలేదు. ఆయన జీవిత చరిత్ర గురించి అడిగాను. నాకుఇప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, ఆర్కిమెడిస్ స్నానపు తొట్టిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ సూత్రం కనిపెట్టాడు. ఉత్సాహం పట్టలేక ఉన్న పళంగా సిరక్యూస్ పురవీధుల్లో ‘యురేకా’ యురేకా' అంటూ దుస్తులు లేకుండా పరుగెత్తాడట. అంతటి ఉత్సాహం నాలో ఇప్పుడు కలిగింది. యురేకా యురేకా అంటూ అరుస్తూ పిచ్చిగా పరుగెత్తాలనివుంది. ఆ గుహ నుండి మనం ఇంత తొందరగా బయటపడదామని ఊహించలేదు "అన్నాడు బాలు. 


"అంతటి గొప్ప ఆర్కిమెడిస్ అలా ప్రవర్తించాడంటే నమ్మలేకపోతున్నాను. నిజంగా ఆనందం ఎక్కువైతే అలా ప్రవర్తిస్తారా. ”


“సంజీవీ, అంతులేని ఆనందం ఒక్కసారిగా ఏర్పడితే ఎవరైనా అలా ప్రవర్తిస్తారు. ”

========================================================================

ఇంకా వుంది..

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు


22 views0 comments
bottom of page