వరుసలు ఆత్మీయతకు పునాది
- Peddada Sathyanarayana

- 3 hours ago
- 2 min read

Varusalu Atmeeyataku Punadi - Telugu Family Story | - Peddada Sathyanarayana
వరుసలు ఆత్మీయతకు పునాది - తెలుగు కుటుంబ కథ | పెద్దాడ సత్యనారాయణ
Published In manatelugukathalu.com On 31/08/2026
మన తెలుగు సంస్కృతిలో పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెదనాన్న, అత్తయ్య, మావయ్య, అన్నయ్య, అక్కయ్య వంటి బంధుత్వ వరుసలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి కేవలం పిలుపులు మాత్రమే కాకుండా, మన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ, గౌరవం, ఆత్మీయతకు ప్రతీకలు.
ప్రస్తుత కాలంలో పిల్లలు బంధువులను పేర్లతో లేదా అంకుల్, ఆంటీ అని పిలవడం సాధారణమైపోయింది. అయితే సంప్రదాయ బంధుత్వ వరుసలు మన కుటుంబ అనుబంధాలను ఎలా బలపరుస్తాయి? అవసరమైన సమయంలో అవి మన బంధువులను ఎలా గుర్తించడంలో సహాయపడతాయి? పెద్దాడ సత్యనారాయణ రచించిన ఈ చక్కని నైతిక కుటుంబ కథ ఆ విషయాన్ని ఎంతో సరళంగా, హృద్యంగా వివరిస్తుంది.
"అమ్మమ్మా, శీను నా బేటు లాక్కుని బెదిరిస్తున్నాడు" అని ఫిర్యాదు చేస్తాడు మురళి.
రమణమ్మకి ముగ్గురు కూతుళ్లు. కూతుళ్లు ముగ్గురు పిల్లలతో వేసంగి సెలవలకి పాలకోడేరు వచ్చి నెల రోజులు ఉండటం ఆనవాయితీ అని చెప్పవచ్చు. మొత్తము నలుగురు మనుమలు, ఇద్దరు మనుమరాండ్రు. నెల రోజులు అమ్మమ్మ ఇల్లు తిరునాళ్ళలా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.
"ఒరేయి శీను, మురళి నీకంటే ఏడాది పెద్దవాడు కదా! అన్నయ్య అని పిలవాలి, అంతేగాని పేర్లు పెట్టి పిలవకూడదు."
"అమ్మమ్మా, హైదరాబాద్లో అందరూ పేరుపెట్టే పిలుస్తారు. పెద్దవాళ్ళని అంకుల్ లేక ఆంటీ అని పిలుస్తారు."
"శీను, నీవు వెళ్లి పిల్లలందరినీ పిలుచుకురారా!"
"సరే అమ్మమ్మా" అని అందరూ వచ్చి అమ్మమ్మ చుట్టూ కూర్చుంటారు.
"మన బంధువులందరినీ పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెదనాన్న, అత్తయ్య, మావయ్య, అన్నయ్య, అక్కయ్య అని ఆప్యాయతతో పిలవడము మన సంస్కారమురా."
ఇంతలో సరోజ లేచి, "అమ్మమ్మా, అందరినీ అంకుల్ ఆంటీ అని పిలవడము తేలిక, నీవు చెప్పినట్టు వరుసలతో పిలిస్తే ఏమిటి లాభము? మనకంటే పెద్దవాళ్ళను అన్నయ్య అని, చిన్నవాళ్ళని ప్రేమతో పేరుపెట్టి పిలవడములో ఆత్మీయత అనుబంధము పెరుగుతుంది" అన్నది.
ఇంతలో మురళి లేచి, "అమ్మమ్మా, వరుసలు పెట్టి పిలవడము వలన ఏమి లాభమో అర్థము కావటం లేదు" అన్నాడు.
"సరే, ఈమధ్య జరిగిన విషయము మీకు చెప్తాను వినండి."
పిల్లలతో పాటు ముగ్గురు కూతుళ్ళుకూడా చెవులు రిక్కరించి, "తొందరగా చెప్పు అమ్మమ్మా" అన్నారు.
"మీకందరికీ తెలుసుకదా నేను మూడు నెలల క్రితము తిరుపతి వెళ్లి వచ్చానని."
"అమ్మ మాకు చెప్పింది" అని అందరూ ముక్తకంఠంతో జవాబిస్తారు.
"నేను తిరిగి వచ్చేటప్పుడు నా పక్కన తోటి ప్రయాణికులు రాజారావుగారు, భార్య సుగుణ, రాజారావు తమ్ముడు రంగారావు మరియు రాజారావు ముగ్గురు పిల్లలు దిగి స్టేషన్ బయటకు వెళ్ళబోయారు. ఆ రద్దీలో నాలుగేళ్ళ కొడుకు ముకుందు బొమ్మల బండిదగ్గరికి వెళ్ళిపోయాడు. ఐదు నిముషాల తర్వాత అందరూ గమనిస్తే ముకుంద్ కనిపించలేదు. అందరూ కంగారుగా వెతకడము మొదలు పెట్టారు. అంత జనసమూహములో ముకుందు 'బాబయ్య' అని అరుస్తున్నాడు. ఎక్కువ దూరముగా ఉండటం వలన ఆ పిలుపు ఎవ్వరికీ వినపడలేదు."
"ఇంక లాభములేదనుకొని పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకొని రాజారావు వెళ్ళబోయాడు. పక్కనుంచి ఎదురుగా వచ్చే ప్రయాణికులు 'ఎవరో కుర్రాడు బాబయ్య అని అరుస్తున్నాడు' అని మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు. వారి మాటలు రంగారావు చెవిన పడ్డాయి. వెంటనే వారు వచ్చిన వైపు పరుగెత్తాడు. కొంచెము దూరము వెళ్ళాక బాబయ్య అనే అరుపు వినిపించగానే, వెళ్లి ముకుందాన్ని తీసుకువస్తాడు."
"మీకందరికీ నేను చెప్పిన సంఘటన వలన ఏమి అర్థమయ్యింది?"
"అర్థమయ్యింది అమ్మమ్మా, వరుసలతో పిలుచుకుంటే మనము ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. మన బంధువులని వరుసలతో పిలుచుకుంటే ప్రేమ అనురాగాలు సహజముగా పెరుగుతాయి."
"అమ్మమ్మా, ఈ రోజునుంచి నీవు చెప్పినట్టు చేస్తాము" అని పిల్లలు ఆడుకునేందుకు వెళ్ళిపోతారు.
- సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
***
పెద్దాడ సత్యనారాయణ గారి కొన్ని ఇతర రచనలు:
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.









Comments