top of page

కచదేవయాని - పార్ట్ 6

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 6 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 15/08/2025

కచదేవయాని - పార్ట్ 6తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ

దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన కచుడు, శుక్రాచార్యుని బ్రతికిస్తాడు.

ఇక కచదేవయాని పార్ట్ 6 చదవండి. 


ప్రస్తుతం కచుని దగ్గర మృతసంజీవని విద్య ఉంది.


కొంతకాలమయ్యాక కచుడు తిరిగి అమరావతికి వెళ్తానని గురువుగారి అనుమతి కోసం ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే కూర్చుని ఉంది దేవయాని.తన శిష్యుడు అమరావతికి వెళ్లడానికి సంతోషంగా అనుమతిచ్చాడు శుక్రాచార్యుడు.


కచుడు తమ వివాహం గురించి తండ్రితో మాట్లాడతాడేమోనని ఎదురుచూచింది దేవయాని. కానీ కచుడు గురువుగారికి సాష్టాంగనమస్కారం చేసి, తనకు ప్రాణదానం చేయటమే కాకుండా మృతసంజీవని విద్యనొసగినందుకు కృతఙ్ఞతలు తెలిపాడు.దేవయానికి కూడా చేతులు జోడించి నమస్కరించి, ఇంతవరకు తనను ఆదరించినందుకు కృతఙ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు. దేవయాని ఊహకందని విషయం ఇది.


భరించలేని దుఃఖం కలిగిందామెకు.


కచుడు తన బసకు వచ్చి సామాన్లు సర్దుకుంటున్నాడు. సరాసరి అతడి గదిలోకి వచ్చింది దేవయాని.అసలు ఆడపిల్లలు అటువైపుకు రానే రారు. దేవయాని ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కచుడికి. 


అయోమయంగా చూస్తున్న కచుడితో "నీవు బ్రహ్మచారివి. గుణవంతుడివి. నేను నిన్ను ప్రేమించే కన్యను. నన్ను వివాహం చేసుకొని నీ వెంట తీసుకొని వెళ్ళు! మా తండ్రిగారు మన వివాహానికి ఒప్పుకోరేమోనని సందేహించకు! నువ్వు ఆయనకు ప్రియమైన శిష్యుడవు. నువ్వు ఏమడిగినా ఆయన కాదనకుండా ఇచ్చేస్తారు. ఆయన దగ్గరికి వచ్చి నన్ను అడిగి వివాహం చేసుకో! " అంది దేవయాని.


దేవయాని వైపు చూశాడు కచుడు.


అతడినే చూస్తోంది దేవయాని. ఆమె కళ్ళల్లో ఆశాదీపం రెపరెపలాడుతోంది.


స్థిరచిత్తంతో, మృదువైన స్వరంతో 


 "గురువులకు శిష్యులు పుత్ర సమానులు. నీవు నా గురుపుత్రికవు. కాబట్టి నాకు సోదిరితో సమానమైన దానివి. నీవు ఇలా అనైతికమైన ఆలోచనలు చేయరాదు... నీకు తగిన వరుడిని గురువుగారు తెచ్చి పెడతారు. వివాహం చేసుకొని సుఖంగా ఉండు! నీ విషయంలో ఇటువంటి అధర్మపరమైన ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు." అన్నాడు కచుడు.


మొదట అతడు చెప్తున్నది దేవయానికి అర్థం కాలేదు. కొంత సమయం పట్టింది. ఆమెకు విషయం అర్థం అయ్యాక కచుడి మీద విపరీతమైన కోపం వచ్చింది.


" ఓరి దుర్మార్గుడా! నీ దేవబుద్ధి చూపించావు! మా తండ్రి గారిని వంచించి విద్యను సంగ్రహించి ఇప్పుడు నిన్ను ప్రేమించిన నన్ను వదిలిపెట్టి నీ మానాన నువ్వు వెళ్ళిపోతావా? నా చూపుల్లో... నా పలకరింపులో నీమీద ఉన్న ప్రేమ నీకు తెలియదా?.. నీకు తెలుసు! అయినా నువ్వు కపటబుద్దితో వచ్చినవాడవు. నువ్వు నక్కవినయాలు చూపించి మా తండ్రిగారి దగ్గర శిష్యుడిగా చేరి ఏ మంత్ర విద్యనయితే నేర్చుకున్నావో ఆ విద్యను నీవు ప్రయోగిస్తే ఫలితం దక్కకుండుగాక! ఇదే నా శాపం! " అంది దేవయాని.


ఆమె కళ్ళు చింత నిప్పుల్లాగా మండుతున్నాయి. అయినా బెదరలేదు కచుడు.


 "నేను ధర్మపథాన్ని తప్పిన వాడిని కాను… నీ శాపం వలన మృతసంజీవని విద్యను నేను ప్రయోగిస్తే పని చేయకపోయినప్పటికీ నా చేత ఉపదేశం పొందిన వాళ్లు ప్రయోగిస్తే ఫలిస్తుంది. మరి నీవు ధర్మ విరుద్ధంగా నా గురించి భావించావు... పైగా నిరపరాధిని అయిన నన్ను శపించావు కాబట్టి బ్రాహ్మణుడు నిన్ను వివాహమాడకుండుగాక! " అని ప్రతిశాపమిచ్చాడు కచుడు.


ఆ తర్వాత అమరావతికి వెళ్లిన కచుడు మృతసంజీవని విద్యను దేవతల్లో నిష్టాగరిష్టులైన వాళ్లకు నేర్పించాడు. అయితే కచుడు దేవయాని మనసుకు చేసిన గాయం అంత త్వరగా మానుతుందా? దేవయాని మళ్ళీ మామూలు మనిషవుతుందా?//


=======================================================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 7 త్వరలో

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments


bottom of page