top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 21



'Neti Bandhavyalu Episode 21'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 19/02/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 21' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 


ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. 


వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 


సీతాపతి, లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు. 


వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది. తనను క్షమించమని తల్లిదండ్రులను కోరుతుంది వాణి. అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య. దీప్తి, ఈశ్వర్ లు ప్రేమలో పడతారు. ఉంగరాలు మార్చుకుంటారు. దీప్తికి వేరొకరితో వివాహం తలపెడుతాడు ప్రజాపతి. 


ప్రజాపతి ఇంటికి వెళ్లి దీప్తిని తీసుకొని వస్తాడు ఈశ్వర్. ఈశ్వర్, దీప్తిల వివాహం రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతుంది. ఈశ్వర్ మీద కక్ష పెంచుకుంటాడు ప్రజాపతి.

ఈశ్వర్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. అతని కళ్ళను విష్షుకు అమరుస్తారు.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 21 చదవండి.. 


 మరుదినం ఉదయం ఆరుగంటలకు ఈశ్వర్ భౌతికకాయం గూడూరులోని అతని ఇంటికి అంబులెన్సులో చేర్చబడింది. 

విషయం విన్న ప్రణవి... వీధిన భోరున ఏడుస్తూ హరికృష్ణ ఇంటికి చేరింది. కూతురు దీప్తిని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చింది.

ఈశ్వర్!... దీప్తి ప్రక్కన కూర్చున్నాడు. నవ్వుతున్నాడు. 

అతన్ని చూచి దీప్తి ఆశ్చర్యపోయింది.

"దీపూ! నేను వెళ్ళిపోయాననుకోకు. నీలో వున్నాను. తొమ్మిదినెలల తర్వాత నీ చేతుల్లో వుంటాను. నీ జీవితాంతం నీ బిడ్డగా నీకు తోడుగా నీతోనే వుంటాను. నీవు కోరిన రీతిలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. నీవు డాక్టర్‍గా పదిమందికి సేవచెయ్యి. మంచిపేరు తెచ్చుకో. నీ ఈశ్వర్ నీ ప్రక్కనే వున్నాడనే విషయాన్ని ఏనాడూ మరువకు. జననం మరణం ప్రతిజీవికి తప్పదు కదా!... కానీ వారు పదిమందితో తెచ్చుకొన్న ’పేరు’ అది ఆ తరంలోనే కాక ముందు తరాల వారికీ గుర్తుంటుంది. దానికి మన తాతయ్య. ఏడవకు.... అందరికి ధైర్యం చెప్పు. మన ఇంటివారి బాధ్యత అంతా నీమీదనే వుంది. శార్వరికి, సీతాపతికి వివాహం జరిపించు.’

ప్రక్కన వున్న ఈశ్వర్ రూపు మాయమైంది. నట్టింట శాశ్వత నిద్రలో వున్న ఈశ్వర్ ముఖంలోకి చూచింది దీప్తి. ఈశ్వర్ ముఖంలో చిరునవ్వు కనిపించింది దీప్తికి. కొన్ని క్షణాలు చూచి కళ్ళు మూసుకుంది. ఆ కాటుక కనుల నుండి కన్నీరు జలజలా రాలాయి. శివరామకృష్ణ అమెరికాలో వున్న దినకర్‍కు, ఢిల్లీలో వున్న వాణికి హైదరాబాద్‍లో వున్న శార్వరీకి, విశాఖపట్నంలో ఉన్న సీతాపతికి విషయాన్ని తెలియజేశారు. అందరూ ఆవేదనలో మునిగిపోయారు.

ఊరిజనం అంతా హరికృష్ణ ఇంటి ముందు గుమికూడారు. కొందరు... ’ఈ దారుణాన్ని ఆ ప్రజాపతే చేయించి వుంటాడు’ అనుకొన్నారు. కొందరు భయస్తులు అవునన్నట్లు తలాడించారు.

"నేను వస్తున్నాను... జరుగవలసింది నేను వచ్చాకనే" ఫోన్‍లో శివరామకృష్ణకు చెప్పాడు దివాకర్.

ఐస్ బాక్స్ లో ఈశ్వర్ శవాన్ని భద్రపరిచారు.

హరికృష్ణ, లావణ్యలు తమ గదిలో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. దీప్తి తన గదిలో దుఃఖసాగరంలో మునిగిపోయింది. వారిని ఊర్మిళ, ప్రణవి, శివరామకృష్ణ తమలో దుఃఖభారాన్ని అణచుకొని ఓదార్చ ప్రయత్నించారు. వారి మధ్యన క్షణం ఒక యుగంగా గడుస్తూ వుంది.

పోయిన వ్యక్తి వృద్ధుడా! అనారోగ్యంతో బాధపడేవాడా! ఇరవై ఏడేళ్ళ యువకుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. అందరి మంచినీ కోరేవాడు. తల్లితండ్రి బంధువులంటే ప్రాణ సమానంగా భావించేవాడు. అతన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ఎలా నిర్లక్ష్యం చేయగలరు?

రైల్వే స్టేషన్‍లో పినాకినీ ఎక్స్ ప్రెస్ నుండి సీతాపతి, శార్వరీ వేరు వేరు కంపార్టుమెంట్ల నుంచి ఒకేసారి దిగారు. విషయం తెలియగానే సీతాపతి లారీలో, శార్వరీ బస్సులో విజయవాడ చేరారు. వేరు వేరు కంపార్టుమెంట్‍లో ఎక్కారు. గూడూరులో దిగారు.

శార్వరిని చూచిన సీతాపతి కన్నీటితో ఆగిపోయాడు. శార్వరి పరుగున వచ్చి అతన్ని చుట్టుకొని భోరున ఏడ్చింది. ఇరువురి మధ్యనా కొన్నిక్షణాలు కన్నీటి క్షణాలుగా సాగిపోయాయి. తెప్పరిల్లుకొన్న సీతాపతి "శారూ!.... ఏడవకు.. నీవు ఏడుస్తూ వుంటే నాకూ నీకన్నా ఎక్కువగా ఏడుపు వస్తూంది. కంట్రోల్... ప్లీజ్ కంట్రోల్. అందరూ విచిత్రంగా మనల్నే చూస్తున్నారు. పద... ఇంటికి వెళదాం" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు సీతాపతి. శార్వరి తన్ను స్టేషన్‍లో కలుస్తుందని, తన ఎదపై వాలి తన హృదయ వేదనను తనకు పంచుతుందని సీతాపతి ఊహించలేదు.

ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని భుజంపై చేయివేసి మెల్లగా రిక్షాను సమీపించి ఇంటివైపుకు బయలుదేరారు.

మాధవయ్య... ప్రక్క ఊర్లో ఓ పెళ్ళి జరిపించేదానికి వెళ్ళి వున్నందున, విషయం తెలిశాక ఆ కార్యక్రమాన్ని ముగించి భోరున ఏడుస్తూ హరికృష్ణ ఇంట్లో ప్రవేశించాడు.

సీతాపతి, శార్వరీలు నట్టింట నిద్రావస్థలో వున్నట్లున్న ఈశ్వర్ అచేతనా శరీరాన్ని చూచి అతనిపై వాలి భోరున ఏడ్చారు. రెండురోజులు గడిచాయి. ఎంతో భారంగా ఆ ఇంటి సభ్యుల మధ్యన....

వస్తానన్న దివాకర్....

రాలేదు....

అప్పటికీ ఈశ్వర్ శ్వాస ఆగిపోయి డైబ్బై ఆరుగంటలు...

శివరామకృష్ణ మెల్లగా హరికృష్ణను సమీపించాడు. 

"హరీ!..." భుజంపై చెయ్యివేసి పిలిచాడు.

భారమైన కనురెప్పలను ఎంతో ప్రయాస పూర్వకంగా పైకి లేపి... శివరామకృష్ణ ముఖంలోకి చూచాడు హరికృష్ణ.

"మూడు రోజులు గడిచిపోయాయిరా!" గద్గద స్వరంతో చెప్పాడు శివరామకృష్ణ.

"అవును" మెల్లగా చెప్పాడు హరికృష్ణ.

"దినకర్ ఎప్పుడూ వస్తాడో!" శివరామకృష్ణ పూర్తి చేయకముందే....

"మనకు తెలియదు"

"ఇక మనం..."

"జాప్యం చేసి ప్రయోజనం లేదు!!!"

అందరూ శోక సముద్రంలో మునిగిపోయి వున్నారు.

"నీ భావన నాకు అర్థం అయింది బావా! పద...." మెల్లగా లేచి నిలబడ్డాడు హరికృష్ణ.

కన్నీటితో తననే చూస్తున్న మాధవయ్యను చూచి...

"బావా! నీ అల్లుడు నీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి వుంటే మన్నించి... వాడికి చివరిసారిగా మనం చేయవలసిన మర్యాదలను సక్రమంగా జరిపించు" మాధవయ్య చేతులు పట్టుకొని కన్నీరు కార్చాడు హరికృష్ణ.

గంటలో ఇంట్లో జరుగవలసిన తతంగాలన్నీ ముగిసిపోయాయి. అలసి అణగారిపోయిన కంఠాలన్నీ మరోసారి తారాస్థాయిలో రోదించాయి.

హరికృష్ణ ముందు...

వెనుక నలుగురి వాహకులతో ఈశ్వర్ తనువు... శవం... ఆ వూరి స్మశానం వైపుకు బయలుదేరింది ఒక వూరేగింపులా!... వెనకాల బంధువులు.... హితులు... వూరిజనం... మౌన ముద్రలో ముందుకు సాగారు.

ఆ ఈశ్వర్ అంతిమ యాత్ర సాగిన పదిహేను నిముషాలకు దివాకర్.... అతని భార్య ఇద్దరు పిల్లలూ ఇంటికి కార్లో చేరారు.

అక్కడి స్థితిని చూచి.... దివాకర్ స్మశానం వైపు పరుగు తీశాడు. శాశ్వత నిద్రావస్థలో వున్న తమ్ముని చూచి భోరున ఏడ్చాడు. ఈశ్వర్.... శరీరం... అగ్ని స్నానంతో బూడిదగా మారిపోయింది.

ప్రజాపతి....

పాపాల భైరవుడు....

ఆ సాయంత్రం... వూరికి చేరాడు. మార్గమధ్యాన అతనికి విషయం తెలిసింది. ముఖంలో విజయగర్వం, పెదాలపై చిరునవ్వు.

’ప్రజాపతిని ధిక్కరించి పాతికేళ్ళకే పరమపదించావు కదరా ఈశ్వర్!’ అని వికటంగా నవ్వాడు.

ఆ నవ్వుకు ప్రతిధ్వనిగా మరో నవ్వు.... అది... ఈశ్వర్ కంఠం....

"మామా!..."

ఉలిక్కిపడి ద్వారం వైపు చూచాడు ప్రజాపతి.

’గెలిచావని సంతోషిస్తున్నావా!.... నీవు గెలవలేదు మామా!. అహంకారంతో పూర్తిగా పతనమైపోయావు’ వికటంగా ఈశ్వర్ నవ్వు.

ప్రజాపతి ఎదుట.... ఈశ్వర్ ఆకారం... 

ప్రజాపతి గుండె వేగం.... పెరిగింది.

పరుగున మేడపైకెక్కి తన గదిలో దూరి తలుపు బిగించుకొన్నాడు.

శరీరం నిండా భయంతో చెమట. కాళ్ళు చేతుల్లో ఒణుకు... కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకొన్నాడు.

కొన్ని క్షణాల తర్వాత  మెల్లగా కళ్ళు తెరిచాడు.

ఎదుటి కుర్చీలో ఈశ్వర్... నవ్వుతున్నాడు.

ప్రజాపతికి భయం... గుండె దడ....

అద్దంలో తన ముఖాన్ని చూచుకొన్నాడు. ముఖం నిండా చెమట కారుతూ వుంది.

కొన్ని క్షణాల తర్వాత... తన ప్రతిబింబం స్థానంలో.... ఈశ్వర్!

"ఆఁ...." ఆశ్చర్యంతో హడలిపోయాడు ప్రజాపతి.

’మామా!’ పలకరింపు. ఈశ్వర్ రూపం మాయమైంది. 

ఆందోళనతో గది నలువైపులా చూచాడు.

తలుపు తట్టిన శబ్దం....

బెదిరిపోయి తలుపు వైపు చూచాడు.

"అయ్యా!...."

"తన హితుని కంఠం"

"ఎవర్రా!" గర్జించాడు ప్రజాపతి.

"నేనయ్యా! వీర్రాజును"

వేగంగ వెళ్ళి తలుపు తెరిచాడు.

ఎదురుగా వీర్రాజు.

"అయ్యా!... మన ఫ్యాక్టరీ కాలి బూడిదైపోయింది"

"ఆఁ!...." ఆశ్చర్యం.

"అవునయ్యా!..." విచారంగా చెప్పాడు వీర్రాజు.

కొన్ని క్షణాల తర్వాత....

వీర్రాజు స్థానంలో ఈశ్వర్!...

"మామా!" విచిత్రంగా పలకరింపు.

భయంతో వెనక్కు నాలుగు అడుగులు వేశాడు ప్రజాపతి. ఈశ్వర్ నవ్వుతూ ప్రజాపతి వైపు నడిచాడు. 

సోఫాను తన్నుకొని ప్రజాపతి క్రింద పడ్డాడు. భయాందోళనలతో పైకి లేచాడు. టీపాయ్ పైన వున్న గ్లాసును తీసుకొని ఈశ్వర్‍పై విసిరాడు.

"అమ్మా!" గ్లాసు తలకు తగిలిన కారణంగా వీర్రాజు తల పట్టుకొన్నాడు.

"అయ్యా!... నన్ను ఎందుకు కొట్టారయ్యా!" దీనంగా అడిగాడు వీర్రాజు.

"ఆఁ..... నీవు,.... నీవు... ఈశ్వర్... ఈశ్వర్‍వు కదా!" ఆందోళనగా అడిగాడు ప్రజాపతి.

"అయ్యా!.... ఈశ్వర్ చచ్చిపోయాడు. వారి కారును లారీతో గుద్దించి యాక్సిడెంట్ చేయించింది మీరే కదయ్యా వారిని చంపింది!" వ్యంగ్యంగా నవ్వాడు వీర్రాజు.

"రేయ్ పెద్దగా అరవకు."

"నేను చిన్నగానే చెప్పానయ్యా!"

"ఆఁ...."

"అవును"

వీర్రాజును విచిత్రంగా చూచాడు ప్రజాపతి.

"మామా!" వీర్రాజు స్థానంలో ఈశ్వర్.

ప్రజాపతి కళ్ళు బయర్లు కమ్మాయి. చిత్తభ్రమ.... ఎదురుగా వున్నది ఈశ్వర్ అనే భావన. భయం, ఆవేశం, తత్తరపాటు.`` GZzz

వేగంగా వెళ్ళి దిండు క్రింద వున్న తుపాకీని చేతికి తీసుకొని వీర్రాజుకు గురిపెట్టి కాల్చాడు.

రెండురోజుల క్రితం పడక గదిని శుభ్రం చేస్తున్న ప్రణవి తుపాకిని చూచి అందులోని గుండ్లను బయటికి తీసి దాచేసింది. తన భర్త ఆవేశంతో ఎవరినీ కాల్చకూడదు అని.

ప్రజాపతి తుపాకి ట్రిగ్గర్‍ను నొక్కాడు. గుండ్లు లేని కారణంగా అతని ఆశ నిరాశయింది. ప్రజాపతి చేష్టలకు వీర్రాజుకు భయం కలిగింది. అతనికి మతి చలించిందనే నిర్ణయానికి వచ్చాడు.

"రేయ్!.... ఈశ్వర్ నిన్ను గొంతు పిసికి చంపుతా!" కసిగా వీర్రాజు పైకి దూకాడు ప్రజాపతి.

తన పేరుకు బదులుగా ఈశ్వర్.... ఈశ్వర్... అనే కలవరంతో ఆవేశపడుతున్న ప్రజాపతికి పిచ్చి పట్టిందని చెబుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు వీర్రాజు.

అరగంటలో ఆ గాలి వార్త వూరంతా వ్యాపించింది. జనం.... ప్రజాపతికి పిచ్చి పట్టిందని, కొందరు అయ్యో పాపం అని, కొందరు ఆయనగారు చేసిన పాపాలు పండాయని తీర్మానించేశారు. 

ఆ వార్త.... హరికృష్ణ ఇంటి వారి చెవికీ సోకింది. ప్రజాపతి ఎంత చెడ్డా... ప్రణవి భార్య కాబట్టి... సీతాపతి కొడుకు కాబట్టి అతన్ని చూచేదానికి వచ్చారు.

"అయ్యా!... మీరు చెప్పిన రెండు పనులు ఖచ్చితంగా ముగించినా!.... ఫ్యాక్టరీ కాలిపోయిందానికి మీకు ఇన్సూరెన్స్ వస్తది. ఈశ్వర్ బాబు చచ్చిపోయాడు కాబట్టి దీపమ్మ మీ ఇంటికి వస్తది. మీరు ఆమెను పరంజ్యోతి సార్ కొడుకు దివాకర్ బాబుకు ఇచ్చి మీ ఇష్టప్రకారం పెళ్ళి చేయొచ్చు. నాకు పాతికవేలు అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మిగతా డైబ్బై అయిదు వేలు ఇస్తే నాదారిన నేను పోతా. ఇక మీ కంటబడ."

ప్రజాపతి తన ఆఫీస్ గదిలో కూర్చొని ఉన్నాడు. ఎదుట నిలబడి పై మాటలు చెప్పి చేతులు జోడించాడు రౌడీ కోటేసు.

ఇంట్లో ప్రవేశించిన ప్రణవి... సీతాపతులు ఆ వ్యక్తి చెప్పిన మాటలను పూర్తిగా విన్నారు.

"మామా!"

ప్రజాపతి ఉలిక్కిపడి చూచాడు.

తన ఎదుట నిలబడి వున్న వ్యక్తి స్థానంలో ఈశ్వర్...!

"ఈశ్వర్ నీవా!" ఆశ్వర్యంతో, ఆగ్రహంతో ప్రజాపతి కుర్చీనుండి లేచి.

"సార్!.... నేను ఈశ్వర్ బాబును కాను. ఆయన చచ్చిపోయుండుగా!.... నేను కోటేసును... నా డబ్బును యియ్యండి. ఎల్లిపోతా!"

"రేయ్!.... ఈశ్వర్!...." కోటేసుపైకి దూకి అతని గొంతును గట్టిగా పట్టుకొని పిసకబోయాడు ప్రజాపతి.

మంచి దేహధారుడ్యం గల కోటేసు ప్రజాపతికి పిచ్చిపట్టిందనుకొని.... అతన్ని ప్రక్కకు నెట్టి... గది నుండి వేగంగా బయటికి వచ్చాడు. హాల్లో వున్న ప్రణవి.... సీతాపతులను చూచాడు.

"బాబూ!... మీ అయ్యకు పిచ్చిపట్టింది. పిచ్చి హాస్పిటల్లో చేర్చండి" చెప్పి వేగంగా వీధివైపుకు వెళ్ళిపోయాడు కోటేసు.

కొన్నిక్షణాల తర్వాత.... సీతాపతి మెల్లగా, ప్రజాపతి వేగంగా ఒకరినొకరు సమీపించారు. సీతాపతి అతని కళ్ళకు ఈశ్వర్‍లా కనిపించాడు. 

"రేయ్!... ఈశ్వర్!... నీవు ఇంకా బ్రతికే వున్నావా!.... చావలేదా!.... చావలేదా!" ఆవేశంగా తన రెండు చేతులతో సీతాపతి గొంతును పట్టుకొని నులిపి చంపబోయాడు.

సీతాపతి అతని చేతులను తన చేతులతో పట్టుకొని బలంగా లాగి తన మెడను వెనక్కు తీసుకున్నాడు. వేగంగా గది బయటికి వచ్చి తలుపు మూసి గడియ బిగించాడు.

గదిలో జరుగుతున్న సన్నివేశాన్ని ఆశ్చర్యాందోళనల్తో చూస్తూ వున్న తల్లి ప్రణవిని సమీపించిన సీతాపతి....

"అమ్మా!.... ఆయనకు పిచ్చి పట్టింది. పిచ్చి హాప్సిటల్లో చేర్చక తప్పదు" 

విచార వదనంతో ప్రణవి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొంది. కన్నీరు కార్చింది. సీతాపతి పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ లో ప్రజాపతి పిచ్చివాళ్ళ హాస్పిటల్‍కు చేర్చబడ్డాడు.

విష్ణుకు.... ఈశ్వర్ నేత్రాలతో చూపు వచ్చింది. అతనికి ఒకవైపు ఆనందం... మరోవైపు ఈశ్వర్ లేనందున ఆవేదన. హరికృష్ణ ఇచ్చిన మూడు లక్షలను శివరామకృష్ణ హాస్పిటల్లో కట్టాడు.

హరికృష్ణ.... ఈశ్వర్ ఖర్మ క్రతువులను కన్నీటితో సక్రమంగా నెరవేర్చాడు. అది దైవ నిర్ణయం... తండ్రికి తనయుడు చేయవలసిన దానికి మారుగా తండ్రి తనయుడికి చేయవలసి వచ్చింది.

దివాకర్ తల్లిదండ్రులను తనతో అమెరికా రమ్మన్నారు. వారు నిరాకరించారు. అతను తన భార్యా బిడ్డలతో అమెరికా వెళ్ళిపోయాడు.

దీప్తి తన కర్తవ్యాన్ని గుర్తించింది. ఎదలో ఎంతో వేదన వున్నా... పైకి నవ్వుతూ అత్తామామలను జాగ్రత్తగా చూచుకోసాగింది.

శార్వరి పరీక్షలు ముగిశాయి. ఇంటికొచ్చేసింది. తన వదిన..... దీప్తికి అన్ని విషయాల్లో సాయంగా వుంటూ తల్లిదండ్రులను ప్రేమాభిమానాలతో చూచుకోసాగింది. వాణి ఆమె భర్త కళ్యాణ్ ఈశ్వర్ అంత్యక్రియలు ముగిశాక ఢిల్లీకి వెళ్ళిపోయారు. 

ప్రజాపతి చేసిన పాపాల ఫలితంగా... పిచ్చిఆసుపత్రి పాలయ్యాడు.

వారంరోజుల తర్వాత గూడూరుకు వచ్చిన విష్ణు.... దీప్తికి సీతామాతకు ఆంజనేయ స్వామిలా నమ్మిన బంటులా వర్తించసాగాడు. అతని కళ్ళను చూచినప్పుడు దీప్తికి ఈశ్వర్ గుర్తుకు వచ్చేవాడు. తలను ప్రక్కకు త్రిప్పుకొని కన్నీరు కార్చేది.

ఈశ్వర్ గతించి ఆరువారాలు పూర్తయినాయి. దీప్తి డాక్టర్ కాబట్టి తన శరీర తత్త్వాన్ని గమనించి... తాను నెల తప్పానని లావణ్యకు తెలియజేసింది.

ఆ వార్త విన్న లావణ్యకు ఒక కంట కన్నీరు.... మరో కంట ఆనందభాష్పాలు. ప్రణవి లావణ్య ప్రక్కనే ఉండేది.

శివరామకృష్ణ, ఊర్మిళా ఆ ఇంటి వారికందరికీ కావలసిన వాటిని సమకూర్చేవారు.

విష్ణుకు చూపు వచ్చినందుకు వారికి ఆనందమే!.... కానీ ఈశ్వర్ మరణం అందరికీ బాధాకరం అయింది.

దీప్తి హాస్పిటల్‍ను ప్రారంభించింది. నెల రోజుల్లో గ్రామస్థుల ఆదరాభిమానాలను సంపాదించింది. ఆమె హస్తవాసిని గురించి ప్రక్క గ్రామాలకు తెలిసి.... వ్యాధిగ్రస్తులు అక్కడికి వచ్చేవారు. ఆ వూరు నుండి వెళ్ళి చెన్నై శ్రీరామచంద్రా మెడికల్ కాలేజీలో చదివిన శాంతి... దీప్తిని కలిసి ’అక్కా!..... నేను మీతో కలిసి పనిచేసే దానికి సమ్మతిస్తారా!’ అడిగింది దీప్తి.

దీప్తి సమ్మతించడంతో శాంతి ఆ హాస్పిటల్లోనే పనిచేయడం ప్రారంభించింది.

సీతాపతి ఎంటెక్ చేయడానికి వైజాగ్ బయలుదేర నిశ్చయించుకొన్నాడు. శార్వరి.... తనూ వైజాగ్ వెళతానని ఎంటెక్ చేస్తానని లావణ్యతో చెప్పింది. లావణ్య, హరికృష్ణలు సమ్మతించారు.

వాణికి నెలలు నిండాయి. కాన్పుకు సాయంగా లావణ్య, హరికృష్ణలు ఢిల్లీకి వెళ్ళారు. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది వాణి. ఆ బిడ్డ నామకరణ మహోత్సవానికి అందరూ ఢిల్లీ వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని కళ్యాణ్ ఎంతో గొప్పగా నిర్వహించాడు. అతను వాణి బాబు పెద్దలందరి ఆశీస్సులను అందుకొన్నాడు. ఆ బాబు పేరు భరత్.

దీప్తికి కూడా నెలలు నిండాయి.

శ్రీ మహాశివరాత్రి నాడు... దీప్తి ప్రసవించింది. మగబిడ్డ. 

’దీపూ!.... నేను వెళ్ళిపోయాననుకోకు.... నీలోనే వున్నాను. తొమ్మిదినెలల తర్వాత నీ చేతుల్లో వుంటాను. నా జీవితాంతం నీ బిడ్డగా నీకు తోడుగా నీతోనే వుంటాను.’

తొమ్మిది నెలల క్రిందట ఈశ్వర్ తనకు చెప్పిన మాటలు దీప్తికి గుర్తుకువచ్చాయి. బోసినవ్వులతో తన ప్రక్కనే పడుకొని వున్న బాబుని చూచిన దీప్తి కళ్ళల్లో కన్నీరు... పెదవులపై చిరునవ్వు.

దీప్తి మనోవేదనను ఎరిగిన తల్లి ప్రణవి తన పవిటతో ఆమె కన్నీళ్ళను తుడిచింది. ప్రీతిగా బాబు తలను నిమిరింది దీప్తి.

ఆ దృశ్యాన్ని చూచిన లావణ్య.

"ఏమండీ!... మన ఈశ్వర్ మరలా పుట్టాడండీ!...." ఆనందభాష్పాలతో బిగ్గరగా చెప్పింది. ’అవును’ అన్నట్లు తలడించాడు హరికృష్ణ.

విష్ణు.... శాంతి, సీతాపతి, శార్వరీలు లోనికి వచ్చారు. దీప్తిని బాబును చూచారు. ఆ రెండు జంటలు ప్రక్కప్రక్కన నిలబడ్డ తీరు.... వారి చూపులను చూచిన దీప్తి తృప్తిగా నవ్వుకొంది.

శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు బాబును చూచి ఆనందంగా నవ్వుకొన్నారు. దీప్తి విష్ణు కళ్ళల్లోకి చూచింది. ’బావా!.... నీవు నీ మాటను నిలబెట్టుకొన్నావు’ అనుకొంది.

========================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ సిహెచ్. సీఎస్. శర్మ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

48 views0 comments
bottom of page