ఏకాకి నౌక
- Veereswara Rao Moola

- 2 hours ago
- 4 min read
ఏకాకి నౌక, రైతు కథ, రైతు జీవిత కష్టాలు, Telugu farmer story, emotional Telugu story, social awareness story, agriculture crisis, farmer struggles, Kurnool farmer, Tungabhadra project, real life inspired story, Telugu short story, inspirational story, rural life, Telugu literature, Mana Telugu Kathalu

Ekaki Nouka - Telugu Inspirational Story | Veereswara Rao Moola
ఏకాకి నౌక - తెలుగు ప్రేరణాత్మక కథ | వీరేశ్వర రావు మూల
Published In manatelugukathalu.com On 22/06/2026
ఒకప్పుడు తన పొలాల్లో పంటలు పండించి గర్వంగా జీవించిన రైతు...
కాలం మారింది.
పంటలు దెబ్బతిన్నాయి.
అప్పులు పెరిగాయి.
కుటుంబం ఛిన్నాభిన్నమైంది.
చివరకు తన నేలను, తన జీవితాన్ని వదిలి నగరానికి వలస వెళ్లాల్సి వచ్చింది.
"ఏకాకి నౌక" ఒక రైతు జీవితంలో ఎదురైన వరుస దెబ్బలను, గ్రామీణ భారతదేశ వాస్తవాలను, వ్యవసాయ సంక్షోభాన్ని మనసును కదిలించేలా చిత్రించే కథ. చదివిన తర్వాత రైతు జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేసే కథ ఇది.
స్థలం: బెంగళూరు. సర్వం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్
ఆ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫైనల్ ఇంటర్వ్యూ అవడంతో ఉదయమే ఆఫీసుకు చేరుకున్నా.
వెళ్ళే ముందు సెక్యూరిటీ గార్డు కేసి చూశాను.
ఎక్కడో చూశాను.
ఎక్కడ.. గుర్తుకు రాలేదు.
గంట తరువాత ఆఫీసు నుండి బయటికి వచ్చాను. దూరంగా టీ తాగుతూ అతను మళ్ళీ కనిపించాడు. అవును అతనే. గుర్తుకు వచ్చింది.
అవును అతనే.. !
జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నట్టు అతని నుదుటి మీద ముడతలు చెబుతున్నాయి.
ఐదేళ్ళ క్రితం ఎమ్మిగనూర్ స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు, సంచీడు ఎర్ర మిరపకాయలు ఇచ్చాడు. పచ్చడి పెట్టుకోమని. అతను ఇచ్చిన మిరపకాయల పచ్చడి రుచి ఇప్పటికీ నాలుక మీద ఉంది. అతని నవ్వు విచ్చిన పత్తి పువ్వులా ఉండేది.
మిరప పండించే రైతు ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా ఎలా?
అతని దగ్గరికి వెళ్ళి అడిగాను.
" మీది ఎమ్మిగనూర్ కదా!"
" అవును"
" మీ పేరు నరసింహ కదా.. నేను నా ఫ్రెండ్తో మీ మిరప తోటకి వచ్చాను. మీ అబ్బాయి నా ఫేస్బుక్ ఫ్రెండ్. మీరు ఏమిటి ఇక్కడ?"
"ఏం చేయను బాబు? రైతుగా గర్వంగా తలెత్తినోడిని, సెక్యూరిటీ గార్డుగా గుమ్మం ముందు తల దించుకుంటున్నా."
నరసింహకు వెనక చాలా పెద్ద కథ ఉందనిపించింది.
లంచ్ టైంలో నరసింహను హోటల్కు తీసుకువెళ్ళాను.
భోజనం చేయడం పూర్తయ్యాక నరసింహను అడిగాను తన కథ చెప్పమని. నరసింహ తన కథ
చెబుతున్నాడు.
**********
“నాకు రెండు ఎకరాలు ఎమ్మిగనూర్లో ఉన్నాయి. రెండు ఎకరాలు కర్నూలులో ఉన్నాయి.
ఒక చోట మిరప వేరే చోట పత్తి పండిస్తున్నా.
ఒక ఏడాది రెండు పంటలు బాగా పండాయి.
మరుసటి ఏడాది సకాలంలో నీరు అందక మిరప పంట దెబ్బతింది. పత్తికి గిట్టుబాటు ధర రాలేదు.
ఆకాశం మీద ఆధారపడకుండా అప్పు చేసి బోరు వేయించాను. వంద అడుగులు బోరు వేయించినా చాలినన్ని నీళ్ళు రాలేదు.
దానికి తోడు నకిలీ విత్తనాలతో పత్తి దెబ్బతింది. సగం మిరప పంట పోవడంతో చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి.
నా పిల్లాడు హైస్కూల్ చదువు పూర్తి చేసాడు.
రెండేళ్ల తర్వాత..
********
“అప్పుడు నీటి పారుదల ప్రాజెక్టు ప్రారంభమైంది.
ఈ ప్రాజెక్టుకి చరిత్ర చాలా ఉంది. వర్తమానంలో నత్తతో పోటీపడుతుంది. కుడి కాలువ పూర్తయితే రైతులకు స్వర్గం అన్నారు. కర్నూలు రైతుల కష్టాలు పోతాయన్నారు. రైతుల కలలు మళ్ళీ చిగురించాయి.”
"మరి ప్రాజెక్ట్ పూర్తయ్యిందా?" అడిగాను టీ తాగుతూ.
"ఎక్కడ బాబూ, అదా! మూడు రాష్ట్రాల రాజకీయంలో పడిపోయి ఆగిపోయింది. డబ్బులు ఇవ్వటం లేదని కాంట్రాక్టర్ పని ఆపేశాడు. ఇక్కడి ఎం.ఎల్.ఏ గారు ఎన్నోసార్లు అడిగినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. బడ్జెట్లో ప్రాజెక్ట్కి డబ్బులు శాంక్షన్ కాలేదు. కేంద్రం పట్టించుకోలేదు. మా జీవితాలు సుడిగుండంలో పడిపోయాయి.
"ఏమయ్యింది?"
"కర్నూలు దగ్గర ఉన్న స్థలం భూసేకరణకి పోయింది. ఆ స్థలం వల్ల వచ్చిన డబ్బు కొడుకు చదువుకు
సరిపోయింది." అతను చెప్పటం ఆపి నీళ్ళు తాగాడు. మనిషి ఆయాస పడుతున్నాడు.
“ఆ తరువాత ఏమయ్యింది? “ అడిగాను నేను.
" మా నీళ్ళ సమస్య మామూలే "
" ఏమయ్యింది ? " అడిగాను నేను.
"సరిగ్గా మిరప పంట, ప్రత్తి చేతికొచ్చే సమయం లో మాయ దారి వాన వచ్చి ముంచేసింది. మళ్ళీ నష్టాలే. అప్పులు తీరలేదు. అప్పుడే భారీ వర్షాలలో మా ఇంటి గోడ కూలి, మా ఆడది చనిపోయింది.
ఎప్పుడూ నా భార్య అనేది, బెంగళూరు వెళ్ళి సిమెంట్ పనులు చేసుకుందామని. ఈ నేల కూడు పెట్టదని. ఆ నేలలోకే వెళ్ళిపోయింది బాబూ” అంటూ
కళ్లు ఒత్తుకున్నాడు నరసింహ .
“నా కొడుకు తండ్రిని వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒంటరి వాణ్ణయిపోయాను. నమ్ముకున్న నేల దగా చేసింది. ప్రభుత్వం తుంగభద్రలో ముంచింది.
పొలం అమ్మేసాను బాబు! అప్పులు తీర్చలేక..... "
అని అన్నాడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.
దుఃఖంతో అతని గుండె బరువెక్కింది.
"నేను బతకాలిగా. రైతు గా బతికిన నేను
రైతు కూలీగా మారలేక బెంగళూరు వచ్చేసాను. తెలిసున్న వాడి ద్వారా ఇది సంపాదించాను."
"నీ కొడుకు ఎక్కడ?" అడిగాను.
"ఆడా బాబు. కంప్యూటర్లకు మరమ్మతులు చేస్తాడు. ఎవరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు."
"వాళ్ల తో కలిసి నువ్వు ఉండవచ్చు కదా" అన్నాను.
"వాళ్ళు ఒప్పుకోలేదు. నెలకి నాలుగు వేలు ఇస్తాడు నా కొడుకు. అందుకే దసరహళ్ళిలో ఉంటాను. సరిపోదు కదా, అందుకే ఈ పని." అతను యూనిఫాం సర్దుకుని లేచాడు.
నేను లేచి బిల్ చెల్లించాను.
"ఇంకో విషయం తెలుసా బాబు. నాలుగో అంతస్తులో వాడు కంప్యూటర్లు రిపేరు చేస్తాడు. నేను నేల మీద సెక్యూరిటీగా ఉంటాను. ఇద్దరం ఒక ఆఫీసే" అని కళ్ళు తుడుచుకుని సీట్ వైపు వెళ్ళాడు.
కలల సౌధాలు కూలుతుండగా, అతను కుర్చీలోంచి కదిలాడు.
రైతు జీవితం కష్టాల కవాతు?
తుంగభద్ర వారి కష్టాలకు నిర్వికార సాక్షి!
అతను వెళుతుంటే తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు.
సమాప్తం
(Inspired by true events)
వాస్తవ పరిస్థితుల ఆధారంగా వ్రాసిన కథ
***
వీరేశ్వర రావు మూల గారి కొన్ని ఇతర రచనలు:
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్లు, ఇంగ్లిష్లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Very good story👍🏻