top of page

పల్లె పిలిచింది - 7

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ఉత్పలమాల, #ధ్రువకోకిల, #కావ్యము

Palle Pilichindi - 7 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 15/05/2025

పల్లె పిలిచింది - 7 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



29.

తేటగీతి.


పెద్దకామందు మల్లయ్య వీథులందు 

సామజంబును బోలుచు సాగుచుండ 

పౌరులెల్లరు నిలుచుండి ప్రణతి యనుచు 

కరములన్ మోడ్చి భక్తిగ గౌరవింత్రు.//


తాత్పర్యము.


ఆ గ్రామమునకు పెద్ద కామందు మల్లనార్యుడు. ఆయన గ్రామ వీధులందు గంభీరంగా నడుస్తూ ఉంటే పౌరులందరు ఆయనను గౌరవిస్తూ నమస్కారములు చేస్తూ ఉంటారు.//


30.

ఉత్పలమాల.


దానము సేయుచున్ సతము ధర్మము మీరని గ్రామపెద్దగా 

దీనుల సేవకై నిలిచి ధీరత జూపెడు మాననీయుడా 

గోన కులోద్భవుండు శత గోవుల కీశుడుగా చెలంగుచున్ 

జ్ఞానమొసంగు విద్యలను చక్కగ నేర్చెను మల్లనార్యుడున్ //


తాత్పర్యము.


ఆ గోన మల్లయ్య ధర్మపరుడు. ఎల్లప్పుడూ దానధర్మములు చేస్తూ, పేదవారికి సేవ చేస్తూ ఉంటాడు. ఆయన తన వంశ గౌరవాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎన్నో శాస్త్రవిద్యలను చదువుకొన్నాడు.//


31.

తేటగీతి.


భార్యకోమలి సద్గుణవతిగ మెలగి

మల్లనార్యుని ప్రేమించు మంచి వనిత

బిడ్డలన్ బెంచి నధికమౌ ప్రేమజూపు 

పిచ్చితల్లి మాటాడదు పెదవివిప్పి.//


తాత్పర్యము.


ఆ గోన మల్లనార్యుని భార్య కోమలి. ఆమె ఎంతో మంచిది. భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ప్రేమ. ఎప్పుడూ ఒక్క మాట కూడ మాటలాడని సౌశీలవతి.//


32.

ధ్రువకోకిల.


తనయులిర్వురు మల్లనార్యుకు తన్వి యొక్కతి యుండగన్ 

దనకుమార్తెను గాంచి యాతడు తన్మయంబును పొందుచున్ 

వినయమించుక లేనివాడగు పిన్నబిడ్డను గాంచుచున్ 

మనము నందున క్రుంగిపోవును మౌని భంగిని మెల్గుచున్.//


తాత్పర్యము.


ఆ మల్లయ్యకు ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు ఉన్నారు. కూతురును చూచి ఆతడు సంతోషిస్తూ ఉంటాడు. అయితే అతని కుమారుల్లో చిన్నవాడు కొంచెం అల్లరివాడు. ఆ కుమారుణ్ణి చూసి మల్లయ్య అప్పుడప్పుడు దిగులుపడుతూ ఉంటాడు.//


(సశేషం )


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




bottom of page