top of page

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 10

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 10 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 16/06/2025

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక

రచన: వేలూరి ప్రమీలాశర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ..


సునీల, దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్ లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు.


రైల్వే స్టేషన్ లో  'అబద్ధం' అనే అనాధ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఆప్యాయంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది. స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ. అందులో సుదతి, సునీల చేరుతారు.


తన కూతురు సురభికి వేరే సంబంధాలు చూడాలనుకుంటాడు తేజ మేనమామ గోపీకృష్ణ. కనపడకుండా పోయిన సునీలను ట్రాకింగ్ డివైస్ సహాయంతో వెతకడానికి వెళ్తాడు తేజ. సునీలను, మీనాకుమారిని కాపాడుతాడు.



ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 10 (చివరి భాగం) చదవండి. 


ఇంటి బయట ఆగిన కారులోంచి ముందుగా దిగిన సుదతి, వెనక డోరు తీసి పట్టుకుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి దిగి, వెనక సీటు వైపు వచ్చాడు. వచ్చినది ఎవరయ్యుంటారోనని వంగి వంగి చూస్తోంది సురభి. 


కారు డోరు తీసి, లోపలకి వంగిన అతని మొహం స్పష్టంగా కనపడటం లేదు. సురభిలో ఆత్రుత రెట్టింపయ్యింది. 


"ప్రశాంత్! కొంచెం ఇటువైపు వచ్చి హెల్ప్ చెయ్యొచ్చుగా…" అన్న సుదతి మాటలకు ప్రశాంత్ కూడా కారు దిగి వెనకసీటువైపు వచ్చి నుంచున్నాడు. 


'అంటే… ముందు దిగిన వ్యక్తి తేజానే అయ్యుంటాడు. భగవంతుడా! ఈ తేజా, నా బావా ఒకటి కాకుండా చూడు… నా బావకి నేను దూరంగా ఉండలేను. నన్ను తప్ప, తన జీవితంలో ఇంకెవరినీ ఊహించుకోలేను…' ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని, సురభిలో ఆత్రుత మరింత పెరిగింది. 


రేబాన్ గ్లాస్సెస్ పెట్టుకుని, తల మీదుగా హుడీ వేసుకున్న ఆ వ్యక్తి ఎవరన్నదీ స్పష్టంగా తెలియట్లేదు. ఫోను చేతిలోకి తీసుకుని, మరోసారి రింగిచ్చింది సురభి. 


అదే పనిగా మోగుతున్న ఫోనును పాకెట్ లోంచి తీసి చూసాడు తేజ. రింగవుతున్నా కాల్ అటెండ్ అవకుండా ఆలోచిస్తూ, తల పైకెత్తి ఎదురుగా చూసాడు. సురభి అక్కడ ఉంటుందని ఊహించకపోవడంతో… కొంచెం షాకయ్యాడు. అప్రయత్నంగా కళ్లకున్న గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని, సురభివైపు చూసాడు. 

'అంటే… ఆ వచ్చిన వ్యక్తి నా బావేనన్నమాట' సురభి కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్టు అనిపించడంతో… ఒక్కసారిగా కూలబడిపోయింది. 


"అమ్మా! ఏం జరిగింది? లే… లేచి లోపలకి రా!" అంటూ సురభి చేతిని భుజంపైకి చేర్చి, మెల్లగా నడిపిస్తున్న గోపీకృష్ణ, 'మావయ్యా!' అన్న పిలుపుతో వెనక్కి తిరిగిచూసి, స్థాణువులా నిల్చుండిపోయాడు. తన మనసులోని భావాలేవీ బయటపడనీయకుండా సునీలను లోనికి తీసుకు రమ్మంటూ, సురభిని కూడా తీసుకుని లోపలకి నడిచాడు. 


కారు దిగిన సునీలను మెల్లగా నడిపిస్తూ లోనికి తీసుకొచ్చి కూచోబెట్టారు సుదతీ, తేజా. పరిచయంలేని వారందరూ ఎదురుగా కనపడడంతో, సునీల ఒకింత అయోమయానికి గురయ్యింది. తన అక్క పరిస్థితిని గమనించిన సుదతి… సురభి, గోపీకృష్ణలతోపాటు, అబద్ధాన్ని కూడా ఆమెకి పరిచయం చేసింది. సునీల కొంచెం స్థిమితపడ్డాక, మీనాకుమారిని, తేజా ఎలా సేవ్ చేసిందీ… ఆమెకు గోప్యంగా ఇప్పిస్తున్న ట్రీట్మెంట్ గురించీ, అన్నీ వివరంగా చెప్పింది. అంతా విన్న సునీల భారంగా నిట్టూర్చి, తేజ వైపు కృతజ్ఞతతో చూసింది.


వేడిగా కాఫీ పెట్టి, అందరికీ ఇస్తున్న సురభిని ఎలా పలకరించాలో తెలీక మౌనంగా ఉండిపోయాడు తేజ. బావ ఇబ్బందిని గమనించిన సురభి… "ఎలా ఉన్నావు బావా?" అంటూ తనే పలకరించింది. 

ఒక్క నిముషం తర్వాత మళ్లీ తనే కల్పించుకుని మాట్లాడింది.


"బావా! నువ్విక్కడ… అంటే ఇక్కడేదో స్టార్ట్ అప్ పెడుతున్నావని తెలుసు. కానీ, వీళ్ళందరూ ఎవరో మనకి ముందునుంచీ పరిచయం లేదు కదా! వీళ్ళల్లో ఒకడిగా… నవ్విక్కడ ఇలా…"


"నువ్వేం అడగబోతున్నావో నేనూహించగలను సురభీ! అంతా వివరంగా తర్వాత చెబుతాను. సునీలా, సుదతీ ఇద్దరూ నాకు ముందునుంచీ పరిచయం లేకపోయినా, మన దొరబాబు పెళ్లిలో వీళ్ళను చూసాను. తర్వాత… అనుకోకుండా వీళ్ళిద్దరూ కూడా నా స్టార్ట్ అప్ లో భాగస్వాములయ్యారు. అంతే… అదే పరిచయం… అంతకుమించి ఏమీలేదు" సూటిగా మేనమామ మొహంలోకి చూడలేక, నేల చూపులు చూస్తున్న తేజని చూస్తే గోపీకృష్ణకి అంతా అర్థమయ్యింది. 


అక్కడున్న పరిస్థితినిబట్టి ఇక ఏమీ మాట్లాడకపోవడమే మంచిదనిపించి, మీనాకుమారి విషయంగా తన చెల్లెలు నిర్మల దగ్గరకి ఆమెను చేరిస్తే, త్వరగా కోలుకునే అవకాశముంటుందేమో ఆలోచించమన్నాడు గోపీకృష్ణ. ఆ సూచన అందరికీ సమ్మతమే అనిపించింది.


డాక్టర్ భరత్ వచ్చి, సునీలకి తొందర్లోనే గాయాలు నయమైపోతాయనీ, నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుoదని, మరో రెండు రోజులు రెస్టు తీసుకుంటే సరిపోతుందనీ చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ మీనాకుమారి పరిస్థితికి అబద్ధంతో సహా, అక్కడున్న అందరూ కంటతడి పెట్టారు. 


"ఈమె కోల్పోయిన జ్ఞాపకశక్తిని పూర్తిగా తిరిగి పొందలేకపోయినా, పాక్షికంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే… జీవితాంతం ఈమె మరొకరిమీద ఆధారపడి బ్రతకాల్సి రావొచ్చు. తీవ్రమైన షాక్ కి గురవ్వడం వలన, గతాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవచ్చు. కానీ, రోజువారీ పనుల్లో కూడా మరొకరి ఆసరా అవసరమవుతుంది" డాక్టర్ భరత్ చెప్పినదంతా అందరూ చెవులు రిక్కించి విన్నారు. 


కాస్సేపు నిశ్శబ్దం తరువాత అబద్ధం మాట్లాడాడు. "ఈ అక్కా వాళ్ళ అమ్మా, నాన్నా యాడుంటారో తెల్వదు గానీ, అయినోళ్లందర్నీ ఒదిలి పారిపోయి బతుకుతున్నాదని సెప్పింది. అక్క సదువుకోనీకి, బతకనీకి యారో పైసలు ఇస్తున్రని సెప్పింది. గానీ ఆల్లేవరో, యాడుంటారో తెల్వదంట. ఇవరాలు సెప్పేంతలోకే సిక్కుల్లో పడ్డాది" ముక్కు ఎగబీలుస్తూ, మోచెయ్యి పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ అబద్ధం చెప్పినమాటలకి ఉలిక్కిపడ్డాడు తేజ. 


'ఈ కుర్రవాడు చెప్పిందాన్ని బట్టి, ఈమె మరెవరో కాదు… అమ్మ పేరు మీద డబ్బు పంపించి, నేను చదివిస్తున్న ఆ మే అయ్యుండాలి. మై గాడ్! విధి ఎంత చిత్రమైనది? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, నా సోదరియైన ఈమెను ఈరోజు నేను కాపాడుకోగలిగాను. ముందు అమ్మకీ విషయం చెప్పాలి. ఇకమీదట ఈమె కూడా మా కుటుంబంలోనిదే' మనసులో దృఢంగా అనుకున్నాడు తేజ. 


"ఏమాలోచిస్తున్నావు తేజా? మీనాకుమారిని మీ ఇంట్లో ఉంచడానికి ఏదైనా ప్రోబ్లమా? అంటీతో నేను మాట్లాడనా?" అడిగాడు ప్రశాంత్. 

"నో నో. అలాంటిదేమీ లేదు. ప్రశాంత్! నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రెండు సం. క్రితం ఓసారి… ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఓ అమ్మాయి చదువుకి ఆర్థిక సహాయం కావాలని వేదాంతి గారు చెబితే, ఆ డబ్బు కట్టి ఆ అమ్మాయిని చదివించడానికి నేను ఒప్పుకున్నాను గుర్తుందా? ఆ అమ్మాయే ఈ మీనాకుమారి. ఇంతకుముందెప్పుడూ ఈమెను ప్రత్యక్షంగా నేను కలవలేదు. నేను ఓ ట్యుటోరియల్స్ లో పార్ట్ టైమ్ ఫాకల్టీ ఇస్తూ, చదువుకునేవాడిని గుర్తుందా? అలా సంపాదించిన డబ్బులో కొంత మావయ్యకి ఇచ్చి, నిల్వ వేసినదానిలో కొంత ఈ అమ్మాయి చదువుకి పంపేవాడిని. కానీ ఓ మగాడు సాయం చేస్తే తీసుకోడానికి ఇష్టపడదని, మా అమ్మ పేరు మీద ఆ డబ్బు పంపిస్తున్నాను. అమ్మకి ఇన్నాళ్లూ ఈ విషయాలేవీ తెలియదు. అమ్మకే కాదు… వేదాంతి గారికి కూడా నేను డబ్బు పంపిస్తున్న విషయం చెప్పలేదు. ఎప్పుడో ఆయన ఇచ్చిన ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ కి మా కలీగ్ ఒకామె చేత మాట్లాడించాను. అలా ఫీజు కట్టాలన్నప్పుడల్లా డబ్బు పంపేవాడిని. 

 ఈమె మా అమ్మ సంరక్షణలో ఉండడమే కరెక్ట్. మీనాకుమారి కొద్దిరోజుల ముందు జరిగిన సంఘటనలను, వ్యక్తులను కూడా మర్చిపోతోంది. ఈ విషయమే కొంచెం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజులు కూడా కాకుండానే నన్ను కూడా గుర్తుపట్టలేకపోయిందంటే ఈమె జ్ఞాపకశక్తి మెల్లగా మందగిస్తోందని అర్థమవుతోంది…"

 "... ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గోరిథమ్ నుపయోగించి నేను డిజైన్ చేసిన కంపానియన్ రోబో మీనాకుమారికి చాలా సహాయకారిగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రూపొందించే ఈ మోడల్ లో, సిస్టమ్ కి పాస్ కోడ్ ఇచ్చి, అవసరమైన ఆప్షన్స్ మెమరీ ఫీడ్ చేస్తే… రోబో వాటిని తేలికగా గుర్తిస్తుంది. ఈమెతోపాటు, ఈమె సంరక్షకులకి కూడా ఈ కోడ్ వివరాలు తెలియజెయ్యడం చాలా అవసరం" తాను ప్రోగ్రామింగ్ చేసిన రోబో తన ఇంటిమనిషికే మొదటిసారిగా పనికొస్తోందన్న విషయం, బొటనవేలు పైకెత్తి చూపుతూ, సంతోషంగా చెప్పాడు తేజ.


 "వెరీ గుడ్! నీ ఆలోచన చాలాబాగుంది తేజా" తన స్నేహితుడిని దగ్గరకు తీసుకొని, హత్తుకుంటూ తేజ నిర్ణయం సరైనదేనన్నట్టు తలాడించాడు ప్రశాంత్. 

"అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ తేజా! స్టార్ట్ అప్ పెడుతున్నావంటే ఇంకేదో అనుకున్నాను. యూ అర్ ఎ సక్సెస్ ఫుల్ మాన్. నీ ఆవిష్కరణలు ఎందరికో ఉపయోగకరంగా ఉంటాయి. మా ఇంటి బిడ్డ ఇంత తెలివైనవాడు అవ్వడం నిజంగా మా అదృష్టం. అల్ ద బెస్ట్" అభినందనలతో ముంచెత్తుతున్న మావయ్య గోపీకృష్ణకు చేతులెత్తి నమస్కరించాడు తేజ. నీ కూతురిని కాదన్నందుకు మన్నించు మావయ్యా అన్నట్టున్న తేజ మనసులోని భావనను గోపీకృష్ణ గ్రహించగలిగాడు. 


"నాన్నా! చూసావా బావ ఎంత ప్రయోజకుడయ్యాడో? ఈ రోబోలు మాత్రమే కాదు… ఈరోజు సునీల ప్రాణాలతో దక్కింది అంటే… అందుక్కారణం ఆమె చేతికి, బావ ఉంచిన సేఫ్టీ డివైజే. ఇలాంటివి ఆడపిల్లల రక్షణకు చాలా అవసరం. అందుకే అంటున్నా… నేను కూడా డిగ్రీతో చదువు ఆపెయ్యడం కాకుండా, ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటాను అని" కూతురి కళ్ళల్లో మెరుపు గమనించిన గోపీకృష్ణ చాలా సంతోషించాడు. 

**************

"ఎవరు తేజా ఈ అమ్మాయి? ఏమయ్యింది? అయ్యో! ఇంత బలహీనంగా ఉంది. జాగ్రత్తగా ఇలా తీసుకురండి" గబగబా హాల్లో ఓ పక్కగా వేసి ఉన్న వైరుతాళ్ల మంచం మీది బట్టలు పక్కకి జరిపి, మీనాకుమారిని పడుకోబెట్టేందుకు మంచం ఖాళీ చేసింది నిర్మల. 

"అమ్మా! నీతో కొంచెం మాట్లాడాలి. ఒసారిలా వస్తావా?" అంటూ తల్లిని పెరటివైపు తీసుకెళ్లాడు తేజ. 

 "ఏమయ్యింది నాన్నా? ఏదైనా డబ్బు అవసరమైతే చెప్పు, నేను సర్దుబాటు చేస్తాను" చెల్లెలు నిర్మల వెనకాలే తానూ వస్తూ అడిగాడు గోపీకృష్ణ. 


 "అదేం లేదు మావయ్యా! మీ ఇద్దరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా రండి… అమ్మా! నీకు వినడానికి కష్టంగా ఉన్నా తప్పదు…మీనాకుమారి ఎవరో కాదు. నాన్న నీకు అన్యాయం చేసి… మరొకామెను రెండోపెళ్లి చేసుకున్నారే… ఆమె కూతురే ఈమె. ఇన్నాళ్ళూ ఈమెకే నీ పేరుమీద డబ్బు పంపించి చదివిస్తున్నది. ఇన్నాళ్లూ ఎవరికైతే నీ మొహం చూపడానికి నువ్వు ఇష్టపడలేదో… వారికి సంబంధించిన మనిషిని మన ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. తప్పలేదమ్మా! నీకోపం నాన్న మీదే కానీ, ఈ అమ్మాయి మీద కాదు కదా! నాన్న ఈమెని కూతురిగా అంగీకరించకపోయినా, ఎవరో తెలియకపోయినా… నేను ఈమెని చదివించే బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు చెబుతున్నాను… ఈమె ఇకమీదట మనతోనే… మన ఇంట్లోనే ఉంటుంది. ఆడపిల్లలు లేని లోటు నీకూ తీరుతుంది. దేవుడిచ్చిన చెల్లెలుగా, ఈమె బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ప్రతీక్షణం ఈమెని, ఈమె అవసరాలనూ కనిపెట్టుకుని ఉంటానని మాటివ్వమ్మా!" కళ్లనీళ్లతో తల్లి చేతులు పట్టుకుని అడుగున్న తేజను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు నిర్మలా, గోపీకృష్ణ. 


"కానీ మనందరం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి… నాన్న పేరు తలుచుకోడానికి కూడా ఇష్టపడని మీనాకుమారికి, రేపు పూర్తిగా నయమయ్యాక మనం ఎవరనేది తెలిస్తే, మళ్లీ కుంగిపోయే అవకాశం ఉంది. సో… ఆమెను ఎప్పటికీ కొత్త ఆలోచనలు, కొత్త జీవితంలోనే ఉండనిద్దాం" తేజా చెప్పింది సబబేననిపించడంతో అందరూ సరేనన్నారు. 


"ఏమిటీ? అందరూ ఒకేచోట సమావేశమయ్యారు? ఏదైనా శుభవార్తా?" లోనికి వస్తూనే అడిగారు వేదాంతి గారు. 

"ఇదిగో గోపీకృష్ణ గారూ! మీరడిగినట్టే మీ అమ్మాయికి ఓ మాంచి సంబంధం తీసుకువచ్చాను. వివరాలు చెప్పమంటారా?" చేతికి తగిలించుకున్న గుడ్డసంచిలోంచి ఓ పాత డైరీ తీసి, అందులో చివరి పేజీలలో నోట్ చేసుకున్న సంబంధం వివరాల కోసం పేజీలు అటూ, ఇటూ తిప్పుతున్నాడు. 


"మీరు మా అమ్మాయికి సంబంధం వెదికి తెచ్చేలోపే… నేను మా మేనల్లుడికి ఓ చక్కని పిల్లని చూసాను. వాడు ఊ అంటే రెండు పెళ్లిళ్లు ఒకే కళ్యాణమండపంలో చెయ్యొచ్చు…" మావయ్య ఎవరినుద్దేశించి అంటున్నాడో అర్థమైన తేజ… సిగ్గుతో తలదించుకున్నాడు. 


సుదతీ, సునీలలను వెంటబెట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశాంత్, "రెండు పెళ్లిళ్లు కాదు… అమ్మళ్ళు ‘ఊ!’ అంటే ఒకేసారి మూడు పెళ్లిళ్లు అవుతాయి" అంటూ సుదతి వైపు చిలిపిగా చూసాడు. 


ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇంతగా తాపత్రయపడుతున్న తేజని కానీ… అతని మాటకు కట్టుబడి మీనాకుమారిని ఎంతో జాగ్రత్తగా ఇంటికి చేర్చి, వైద్యం చేయించిన ప్రశాంత్ ని కానీ ఒదులుకోవడం సుదతికి ఇష్టం లేదు. అందుకే కవల సోదరిలు ఇద్దరూ, సంతోషంగా ఆ స్నేహితులిద్దర్నీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. 

 ****************

 ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీసులో తేజకి వర్క్ విషయంగా సాయం చెయ్యడానికి బయలుదేరింది సునీల. ఆఫీసుకి చేరేసరికి అప్పటికే అక్కడ ఉన్న తేజ, ప్రశాంత్, సుదతిలు వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా రోబోస్ ను సప్లై చెయ్యడానికి పాస్ కోడ్ లు ఇచ్చే బిజీలో ఉన్నారు. సేల్స్ డేటా చూస్తున్న సుదతి కళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్ పై ఆగిపోయాయి. 


"ప్రశాంత్! ఈ ఆర్డర్ పెట్టిన వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి చూడు…" అంటూ కొటేషన్ ప్రిపేర్ చేసేముందు ప్రశాంత్ కిచూపించింది. 


అది చూసిన ప్రశాంత్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.


"గాడ్! విధి ఎంత విచిత్రమైనది!? తేజా!! ఈ ఆర్డర్ పెట్టింది ఎవరనుకుంటున్నావు? దొరబాబు… తాను రెండవ పెళ్లి చేసుకున్న తన మరదలికి, ఇంటి పనుల్లో సాయంగా ఉండేలా డిజైన్ చెయ్యమని రిక్వెస్ట్ పెట్టాడు. అంటే మన కంపానియన్ రోబోలు సక్సెస్ఫుల్ గా అన్ని వయసుల వారికీ ఉపయోగపడుతున్నాయి. ఓపక్క మీనాకుమారి కూడా మన రోబోల సాయంతో అన్ని పనులూ చేసుకోగలుగుతోంది. ఇది చాలు మనకి" సంతోషంగా చెబుతున్న ప్రశాంత్ చేతిలోని పర్చేజ్ ఆర్డర్ తీసుకుని, డీటెయిల్స్ అన్నీ చూసాడు తేజ. 

అప్పుడే అక్కడికి వచ్చిన సునీల ఇదంతా చూసి చాలా సంతోషించింది. 


"తేజా! నిన్న ఈ ఇంగ్లీష్ పేపర్ లో ఒక ప్రకటన చూసాను. ఓ అడల్ట్ కేర్ సెంటర్ వాళ్ళు కంపానియన్ రోబోస్ కావాలంటూ ఇచ్చిన ప్రకటన ఇది. ఇదొకసారి చూడు" అంటూ ఆ ప్రకటన చూపించింది. 


"రియల్లీ ఇట్ ఈజ్ గుడ్. ఇదే కాదు మన సురభి హస్బెండ్ పని చేస్తున్న కాలేజ్ లోని అమ్మాయిల రక్షణకు కూడా సేఫ్టీ డివైజెస్ కావాలని అడిగారట. వారం క్రిందట ఢిల్లీ నుంచి ఈ సేఫ్టీ డివైజెస్ కోసం బల్క్ ఆర్డర్ వచ్చింది గుర్తుందా? ఒక్క కాలేజీలనుంచే కాదు, వర్కింగ్ ఉమెన్ చాలామంది ఈ సేఫ్టీ డివైజెస్ కోసం ఆర్డర్ పెడుతున్నారు. చూసావా!! ఏడాది గడిచేసరికి నేనూహించినట్టుగానే మన స్టార్ట్ అప్ ఏ స్థాయికి ఎదిగిందో…" సునీల కళ్ళల్లో సంతోషాన్ని తానూ పంచుకుంటూ చెప్పాడు తేజ. 


"అవును తేజా! కేవలం రిస్ట్ బ్యాoడ్ లు గా మాత్రమే కాదు… పాదరక్షలకు అమర్చిన ఈ డివైజెస్ కూడా చాలా ఉపయోగంగా ఉంటున్నాయి. నిజంగా ఈ డివైజే లేకపోతే, అసలు నేనిలా బ్రతికి ఈరోజు ఇంత సంతోషంగా మీ అందరి మధ్యనా ఉండేదాన్ని కాదు" మెచ్చుకోలుగా చూస్తూ చెప్పింది సునీల.


====================================================================================

  —-----సమాప్తం—---

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి వేలూరి ప్రమీలాశర్మ గారి తరఫున మా అభివాదాలు తెలుపుకుంటున్నాము.

====================================================================================


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




コメント


bottom of page