top of page

పల్లె పిలిచింది - 10

Updated: May 23

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #ఉత్పలమాల, #చంపకమాల, #మత్తకోకిల, #ధ్రువ కోకిల, #తేటగీతి, #కావ్యము

Palle Pilichindi - 10 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 21/05/2025

పల్లె పిలిచింది - 10 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



 44.

ఉత్పలమాల.


 వసంతఋతువు.


ఆమని శోభలన్ గనుచు హాయిగ త్రుళ్లగ పుల్గుపాళికల్ 

మామిడి పూతలన్ దినుచు మత్తుగ కూయుచు నుండకోయిలల్ 

సేమము నీయగా భువికి శీర్షములూపెను వృక్షరాజముల్ 

కాముని మాసమందున వికాసముతో విలసిల్లె పల్లెలున్.//


తాత్పర్యము.


అలా ఆ పల్లె ప్రజలు హాయిగా ఉండగా వసంతఋతువు వచ్చింది. వసంతఋతువును చూచి పక్షి గుంపులు చాలా సంతోషించాయి. మామిడి పూతలను తినుచు కోయిలలు తీయగా కూస్తూ ఉన్నాయి. భూమికి క్షేమాన్ని కలుగచేయుచు చెట్లు తమ చిటారు కొమ్మలను ఊపుతున్నాయి. ఆ పల్లెలన్నీ వసంత ఋతువులో ఎంతో అభివృద్ధిని పొందుతున్నాయి.//


45.

చంపకమాల.


విరులట తొంగలించ బహు వేగముగా రవి పర్వులెత్తగా 

మురియుచు భృంగరాజములు మూగుచు నత్తరి సందడించగన్ 

జెరువున తామరల్ చిలుక స్నిగ్ధముగా తమ పుప్పొడుల్ వెసన్ 

ధరణికి వచ్చె మాధవము తద్దయు రమ్యముగా చరించగన్ //


తాత్పర్యము.


 వసంతంలో పూవులు పూస్తూ ఉంటే తుమ్మెదలు ఆనందంగా ఆ పువ్వుల దగ్గరికి చేరుతున్నాయి. చెరువులో తామరలు తమ పుప్పొడులను చిల్కుతూ ఉంటే భూమికి అందాన్నిచ్చే వైశాఖమాసం వచ్చింది.//


46.

మత్తకోకిల.


జీవరాసుల జీవనంబున శ్రేయమున్ గలిగించగా 

భావికంతయు నాశ నిల్పెడు భావనల్ వికసించగా 

చేవ నిచ్చెడు మాసమియ్యది చేరవచ్చె వసంతమై 

దీవెనల్ కురిపించి జాతికి దివ్యమౌ పథి చూపగన్ //


తాత్పర్యము.


భూమిలోని జీవరాసులకు జీవమును ఇచ్చి, భవిష్యత్తు మీద ఆశ కలిగించే భావనలు వికసించేటట్లు ఈ వసంతం వచ్చింది. ఈ మాసము మానవులకు మంచి మార్గాన్ని చూపిస్తుంది.//


47.

చంపకమాల.


శుకపికముల్ చెలంగ బహు శోభగ సాలములెల్ల వర్థిలన్ 

బకపకలాడుచున్ విరులు భాతిగ భానుని స్వాగతించగన్ 

బ్రకటితమాయె రశ్మినిడు పాంథుడు నిర్మలమౌ నభంబునన్ 

వికసీతమాయె వెల్గుమెయి పృథ్వి వసంత విభూతి బొందుచున్.//


తాత్పర్యము.


పక్షులు అన్నీ సంతోషంతో తిరుగుతూ ఉంటే, చెట్లు చిగురులతో అందంగా కనిపించగా, ఆ సూర్యుడు ఆకాశంలో కనిపించగానే భూమి అంతా వెలుగుతో నిండిపోయింది.//


48.

ధ్రువ కోకిల.


నవవసంతపు వేళ కోయిల నాదముల్ వినిపించగా

దివి సమంబుగ గోచరించగ దివ్యమై భువియందముల్

నవయుగాదికి నాంది పల్కుచు నర్మిలిన్ జను లెల్లరున్

భవము పొందగ స్వాగతించిరి భవ్యమౌ శుభ వర్షమున్.//


తాత్పర్యము.

ఆ వసంత వేళలో కోయిలలు పాడుతూ ఉంటే, భూమి స్వర్గాన్ని తల పించేట్లుగా ఉన్న సమయంలో క్రొత్త సంవత్సరం (ఉగాది) వచ్చింది. ఆ ఉగాదిని జనులంతా ప్రేమగా స్వాగతించారు.//


49.

తేటగీతి.


స్వచ్ఛమై నదులన్నియు పాఱుచుండ

ప్రాణవాయువొసంగెడి పచ్చదనము

పరుచుకొన్నట్టి ధరణిలో పసులు పెరుగ

శాంతి కావాసస్థానమై జగతి వెలసె.//


తాత్పర్యము.


నదులన్నీ స్వచ్ఛంగా పారుతున్నాయి. పచ్చదనం అంతటా పరుచుకొంది. పశువృద్ధి జరిగింది. అంతటా శాంతి నెలకొంది.//



50.

తేటగీతి.


వచ్చెనిప్పుడు నూతన వత్సరంబు 

ప్రజలు భక్తిగా పూజించి వైభవంబుగ

దివ్యమౌ యుగాదిని స్వాగతించి కలిసి 

శుద్ధమౌ మదిన్ జేసిరి స్తుతులనపుడు.//


తాత్పర్యము.


ఇపుడు నూతన సంవత్సరం వచ్చింది. ప్రజలు ఉగాది పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ భగవంతుడిని స్తుతించారు.//



51.

తేటగీతి.


జనులు ధర్మమౌ దారిలో సాగుచుండి 

క్రొత్త వత్సరమీ భువిన్ గొలువు చేయ

'మంచికాలమా!నీకిదే మంగళంబు!'

యనుచు పల్కిరి కాలపు ఘనత తెలిసి.//


తాత్పర్యము.


ఆ పల్లెలో జనులందరూ ధర్మంగా నడుచుకొంటూ మంచికాలము వచ్చిందని సంబరంతో మంగళ గీతాలు పాడుతూ ఉన్నారు.//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Commentaires


bottom of page