పల్లె పిలిచింది - 11
- T. V. L. Gayathri
- May 23
- 2 min read
Updated: May 28
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కావ్యము

Palle Pilichindi - 11 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 23/05/2025
పల్లె పిలిచింది - 11 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
52.
అంబురుహము.
భ, భ, భ, భ, ర, స, వ.
యతి -13.
సీమలఁ బౌరులు చిందులు వేయుచు శీఘ్రమేకడు భక్తిఁ శ్రీ
రాముని పెండ్లిని చేయగ దూకిరి రాణ చూపుచు నుద్ధతిన్
దామసభావన లెల్లను వేగమె దగ్ధమౌగతిఁ మేలుగా
నీమముగా తమ దేవుని సేవలు నిష్ఠమీరగఁ జేసిరే //
తాత్పర్యము.
ఆ పల్లెలో ప్రజలు సంతోషంతో ఉగాది తర్వాత వచ్చిన శ్రీరామనవమి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఆ రాముని కల్యాణాన్ని జరపటానికి పూనుకొన్నారు. ఆ దేవుని కళ్యాణం జరిపితే జనులలో ఉన్న చెడు భావనలు అన్నీ తొల్గిపోతాయనే నమ్మకంతో సేవలు చేస్తూ ఉన్నారు.//
53.
కందము.
చల్లని దేవుని సన్నిధిఁ
వెల్లను వేయుచు ప్రణతిగ వేడుక చేయన్
బిల్లలు పెద్దలు రాగా
తెల్లగ మెరిసెను వరదుని దేవళమెల్లన్.//
తాత్పర్యము.
జనులు ఆ దేవుని దేవళమునకు తెల్లటి రంగును పూశారు. (సున్నం వేశారు ) అప్పుడు ఆ దేవాలయం తెల్లగా మెరిసింది.//
54.
కందం.
పంటలు వృద్ధిగ పండెను
కుంటలు చెరువులట నిండ కూరిమితోడన్
గంటలు మ్రోగించిరి వెను
వెంటనె రామునికి జనులుపెండిలిసల్పన్.//
తాత్పర్యము.
ఆ పల్లెలోని కుంటలు, చెరువులు నిండటంతో పంటలు చక్కగా పండాయి. గంటలు మోగిస్తూ ప్రజలు శ్రీరాముని కళ్యాణం జరిపారు.//
55.
కందం
కళకళలాడెను పల్లెలు
పెళపెళరావములు మ్రోగ విజయంబంచున్
తళతళ మెరసెను దేవుడు
పులకించినలోకు లపుడు మ్రొక్కిరి భక్తిన్.//
తాత్పర్యము.
ఆ సమయంలో పల్లెలు కళకళలాడాయి. మేళతాళాలు మోగుతుండగా దేవుడు చక్కగా ప్రకాశించాడు. ప్రజలంతా సంతోషంతో దేవునికి భక్తిగా మ్రొక్కుకున్నారు.//
56.
తేటగీతి.
ఇటుల దేవుని కల్యాణమే సలిపిరి
పటుతరంబగు బుద్ధితో ప్రజలు కలిసి
రామభద్రుండు నిరతము లలినిజూప
వర్థిలిరి సుఖముగ జనుల్ పల్లెయందు.//
తాత్పర్యము.
ఈ విధంగా ప్రజలందరూ శ్రీరామచంద్రుని వివాహం జరిపారు. ఆ దేవుని దయవలన ఆ పల్లెలో జనులు సుఖంగా వర్థిల్లారు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments