top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 9



'Sabhaash Sanjeevi - Episode 9' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 13/02/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 


వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 


సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం. 


తమను బంధించిన చోటునుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు, సంజీవి. పిల్లల మంచితనం చూసి, వాళ్ళను వదిలివేస్తారు చండుడి అనుచరులు. 


హెడ్ మాస్టర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు సంజీవి, బాలు. 


బాలు, పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతాడు. 

హానికరమైన పానీయాలకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఉధృతం చేస్తాడు సంజీవి.. 



ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 9 చదవండి.. 


 తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదిమందితో ప్రారంభించిన ఆ ఉద్యమం గురించి మరుసటిరోజు ఆ జిల్లా దినపత్రికలో వార్తగా వచ్చింది.

 

కలెక్టర్ ఆ వార్తకు స్పందించాడు. మంత్రులను ఇతర అధికారులను సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకొన్నాడు.

 

 "పాఠశాల వున్నచోటునుండి ఐదువందల మీటర్లవరకు జంక్ ఫుడ్ అమ్మకాన్ని నా జిల్లాలో నిషేదిస్తున్నాను.. ” అంటూ మీడియా ద్వారా కలెక్టర్ ప్రకటించడం జిల్లావారందరిని ఆశ్చర్యపరిచింది 

 

 జిల్లా కలెక్టర్ ఆ హీరోకు ఫోను చేసాడు. 


 "హలొ నేను జిల్లా కలక్టర్ మాట్లాడుతున్నాను " 


 "చెప్పండి సార్. నేను.. సినిమా హీరోను మాట్లాడుతున్నాను "

 "మా జిల్లాలో.. ఆ బడి విద్యార్థుల పోరాటం గురించి వినపడ్డారా "


 "ఉదయాన్నే దినపత్రికలో వచ్చిన వార్తను మా సెక్రటరీ చూపిస్తే నవ్వుకొన్నాను. ఏమిటి సార్.. నేనొక్కడే చేయరాని తప్పు చేసినట్లు గుడ్డి గోలా ప్రకటనలో నటించినందుకు నన్ను క్షమాపణ అడగడం, అంతే కాకుండా సహజపానీయములు త్రాగండి అంటూ ప్రకటించాలంటూ చెప్పమంటూ నన్ను కోరడం ఏమైనా న్యాయంగా ఉందా. 


ఎన్నో సంవత్సరాలుగా జంక్ ఫుడ్ పైన హీరోలు ఇలా ప్రకటనలు ఇస్తూనే వున్నారు కదా. ఎంతోమంది మేధావులు, శాస్త్రజ్ఞులు, మంత్రులు అడగని విచిత్రమైన కోరికతో పోరాటం చేయడం చూస్తుంటే నవ్వు వస్తోంది సార్. " అన్నాడు నటుడు. 


"ఇంతవరకు కలగని అవగాహన విద్యార్థులలో ఇప్పుడు కలిగింది. ఈకాలం విద్యార్థులు ఆలోచిస్తున్నారు. తప్పు ఏమిటో తెలుసుకొని నిలదీసి అడుగుతున్నారు. "


 "సార్! అయినా ఆదివారం ఒక్క గంట అంటూ పదిమంది చేసిన పోరాటంను గొప్ప విషయంగా తీసుకొని ఫోన్ చేయడం.. కలెక్టర్ గా ఎన్నో సమస్యలు వున్నపుడు ఈ చిన్న విషయంపై మీ సమయం వృధా చేస్తున్నారనుకొంటాను "


"ఇది చిన్న సమస్య కాదు. ఈ సమస్య పెద్దది కాకుండా మొదట్లోనే పరిష్కరించాలనుకొని ఫోన్ చేస్తున్నాను. మీరు గుడ్డి గోలా ప్రకటనలో నటించింది పొరపాటని చెప్పండి. అలాగే సహజ పానీయాలు తాగమని చెప్పండి "


"తోమిదవ తరగతి చదివే చిన్నపిల్లలు, నోట్లో వేలుపెట్టినా కొరకలేని అమాయకులు. పదిమంది కలసి పోరాటం అంటూ ఏదో పిల్ల ఆటలు ఆడుతుంటే సరదాగా నవ్వుకోకుండా నాకు ఫోన్ చేసి చెబుతున్నారు" అన్నాడు నటుడు. 


"నేను కలెక్టర్ ఉద్యోగంలో లేకుంటే వారి పోరాటంలో నేనూ పాల్గొనేవాడిని. నా జిల్లాలో పోరాటం జరపకుండా శాంతియుతంగా పరిష్కరించగలను. కానీ మీ భవిష్యత్తు పూర్తిగా దెబ్బ తినకూడదని మీకు ఫోన్ చేసాను. మీరు గుడ్డి గోల ప్రకటనలో నటించడం తప్పు అని విద్యార్థులు అనుకొంటున్నారు "


 "సార్, గుడ్డి గోలా మంచిదో.. చెడ్డదో.. నాకు అనవసరం నాకు డబ్బు ఇచ్చారు నేను నటించాను" 


 "మీరు కొన్ని రోజులు ఆ గుడ్డి గోలాను త్రాగండి. అది ఎంతటి కీడు చేస్తుందో మీకే తెలుస్తుంది. మిమ్మల్ని దేవుడుగా భావించే విద్యార్థులను, యువకులను మీ అబద్దపు ప్రకటనలతో ఎందుకండీ వారి భవిష్యత్తును పాడు చేస్తారు"


 "ఏంటి సార్ నేను కొన్ని సెకండ్ల ప్రకటనలో నటించినందుకు అలా చెబుతున్నారు, నేను సినిమాలో నీతి, నిజాయితీ, న్యాయం, దర్మం అంటూ చెబుతున్నాను. నా అభిమానులు ఎవరైనా పాటిస్తున్నారా. వాళ్ళేదో తెలీక పోరాటం చేస్తే మీరు ఆదరించడం కష్టంగా వుంది సార్, ముందు మీ జిల్లాలో ఆ పిల్లలు పోరాటం చెయ్యకుండా ఆపండి సార్ " అన్నాడు నటుడు. 


“చివరిగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి సార్ "అన్నాడు కలెక్టర్.


 "సార్, మరో నెలలో నా సినిమా రిలీజు కాబోతుంది. ఆ సినిమాను నేను మా బావమరిది కలసి నిర్మాతలుగా వందల కోట్లు పెట్టుబడి పెట్టి తీస్తున్నాము. ప్రతి సినిమా కలెక్షన్ల తో విజయవంతం అవుతుందంటే అందుకు కారణం విద్యార్థులు, యువకులు అని నాకూ తెల్సు, వారితో శత్రుత్వం పెట్టుకొంటే మాసినిమా చూసేవాళ్ళు లేకుండా మా చేతికి చిప్ప తీసుకొనవలసివస్తుందన్న సంగతి నాకు తెలుసు. నాకు రెండురాష్ట్రాలలో చెప్పలేనంత అభిమానులున్నారు. పదిమంది పిల్లలకోసం నేను నా హోదానుండి కిందికి దిగి వచ్చి క్షమాపణ కొరవలసిన అవసరం నాకు లేదు. జంక్ ఫుడ్ ప్రకటనలో నేనొక్కడే నటించలేదు. ఇది అనాదిగా జరుగుతున్న ఆచారం లాంటిది. మీ జిల్లా పనులు మీరు చూసుకోండి సార్, నావిషయాల్లో తలదూర్చి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. " అన్నాడు.

 

"చెప్పవలసిన బాధ్యత కోసం చేప్పాను. నాజిల్లా సంగతి నేను చూసుకొంటాను ఇక వుంటాను సార్. " అంటూ ఫోన్ కట్ చేసాడు కలెక్టర్. 

**** *** ***

మరుసటి ఆదివారం జిల్లాలో చాలా బడులలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు పోరాటం పేరుతో రేల్వే స్టేషన్ నందు బస్సుస్టాండ్ నందు కొన్ని నిముషాలు మాత్రమే బండి నిలపగలిగారు. మూడవ ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోరాటం జరిగింది, ఇప్పడు చాలాచోట్ల తొమ్మిదవ తరగతి కాకుండా బడి విద్యార్థులు మొత్తం పోరాటంలో పాల్గొనడంతో కొన్నిచోట్ల రైలు బస్సు ఒక గంట వరకు కదలకుండా ఆపగలిగారు. అతంటితో కాకుండా పొరుగు జిల్లాలలో కూడాకొన్ని చోట్ల పోరాటం ప్రారంబించ బోతున్నట్లు తెలిసింది. 


తొమ్మిదవ తరగతి చదువుతున్న సంజీవి నాయకత్వంలో రెండు కోరికలకై పోరాటం చేస్తూ నాయకత్వం వహించడం గురించి కొంతమంది గొప్పగా చెప్పుకొనసాగారు. వీరి పోరాటానికి మద్దతుగా కొన్ని పార్టీలవారు మద్దతు పలకడంతో వీరి పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చడానికి అవకాశం వుంటుందని, తొందరలో ఈ పోరాటం మరో తెలుగు రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ వ్యాపించే అవకాశాలున్నాయంటూ ప్రముఖులు తమ అభిప్రాయం చెప్పసాగారు. 


"డబ్బుకోసం హీరో చెప్పిన మాటలు నమ్మ మంటారా. ధర్మం కోసం శాస్త్రీయంగా పరిశోధించి చెప్పిన మేధావుల మాట నమ్మ మంటారా. మీరే చెప్పండి సార్. ఆ హీరో మాటలు చెప్పింది నిజమనిపిస్తే అతను క్షమాపణలు చెప్పనక్కరలేదు. శాస్త్రీయంగా పరిశోధించిన ఆ మేధావులు తమ సైన్స్ తప్పని చెప్పమనండి సార్. మేమూ గుడ్డి గోలా పానీయం తాగుతూ పోరాటం నిలిపివేస్తాము. " అంటూ ఒక విద్యార్ధి పోలీసులతో ఆవేశంగా చెప్పిన వీడియో వైరల్ అయింది. 


రాష్ట్రం లోని జిల్లాలలో ఎక్కువ బడులు పోరాటంలో పాల్గొన ప్రారంభించారు. 


 ఈ సారి కలెక్టర్ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకొని పత్రికా మూలంగా ప్రకటించారు. 


 “జిల్లాలో శాంతి భద్రాదులు పరిరక్షించడం కోసం బడిపిల్లల పోరాటం ముగిసేవరకు ఆ హీరో సినిమాను మా జిల్లాలో రిలీస్ చెయ్యడం నిషేదిస్తున్నాము. ” మీడియా ద్వారా చెప్పారు. 


“నిజమైన హీరో మా జిల్లా కలెక్టర్. ” 


“అపాయకరమైన గుడ్డి గోలా తాగమంటూ ప్రకటన ఇచ్చిన ఆ గుడ్డి హీరో కనులు తెరచి మాట్లాడాలి " స్లోగన్ వున్న పోస్టర్లు అక్కడక్కడా అతికించారు. 


చదువులకు భంగం కలగకుండా ప్రతి ఆదివారం పోరాటం గురించి చాలా మంది మెచ్చుకొన్నారు. 

 *** *** *** 

 "సినిమా తీయడం పూర్తి చేసినా రిలీస్ చేయడానికి ఆ విద్యార్థులవల్ల ఇబ్బందులు వస్తుందని ఊహించలేదు. ఒక జిల్లా వారు నా సినిమాను రిలీజు చేయడం నిషేదించారు. " అన్నాడు హీరో.

 

“బావా, మనమిద్దరం కలసి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీసాము. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది యువకులు విద్యార్థులు. ఆ విద్యార్థులలో మనపై ద్వేషం పెరిగిందంటే మన సినిమా తప్పకుండా ఫెయిల్ అవుతుంది "


"నేనొక్కడే ఆ గుడ్డి గోల పానీయానికి ప్రకటనలో నటించానా, పోయిన సంవత్సరం ఆ హీరో నటించినప్పుడు ఎవరూ అడ్డు చెప్పలేదు. " కోపంగా అన్నాడు హీరో 


"బావా, మనం చేసింది తప్పు. ఈ విషయమై పబ్లిక్ ముందు ఒక్కమాట కూడా మాట్లాడవద్దు. మనకు ఆ పానీయం విషం లాంటిది అని తెలిసినా వాళ్ళిచ్చే రెండు కోట్ల రూపాయలకు ఆశపడి నేనే నిన్ను నటించామన్నాను. నీవూ సంతోషముతో అంగీకరించావు. అపుడు విద్యార్థులకు అవగాహన లేకపోవడం ఆ హీరో అదృష్టం. ఇప్పుడు విద్యార్థులు ఆలోచించడం ప్రారంభించి పోరాటం చెయ్యడం మన దురదృష్టం. " అన్నాడు. 


"గుడ్డి గోలా కంపెనీ వారి అగ్రిమెంట్ నందు నేను సంతకం పెట్టానుగా. ఆ అగ్రిమెంట్ ప్రకారం రెండు సంవత్సముల వరకు ఆ పానీయం పై ఎటువంటి విమర్శా చేయకూడదని ఉంది. నేనిప్పుడు ఆ పానీయం ఆరోగ్యానికి మంచిది కాదు అని ప్రకటిస్తే నామీద కేసు పెట్టారా "

"బావా, నేను అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో మనపైన కేసు పెట్టరు. మన తెలుగు రాష్ట్రమంతా ఆ పానీయం గురించి చెడుగా చెప్పుకొంటున్నారు. మన సినిమా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిలీజు కావాలంటే మొదట ఆ పిల్లలకు క్షమాపణలు చెప్పాలి "


"క్షమాపణా, పిల్లలకు చెప్పాలా. "కోపంగా అన్నాడు నటుడు.

 

 "మన సినిమా విజయవంతంగా ప్రదర్శించాలంటే నీవు తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పక తప్పదు బావా " కోపంగా అన్నాడు. 


కొంత సమయం ఆలోచించినతరువాత "పత్రికల వారిని మీడియా వారిని పిలిపించు. క్షమాపణ కోరుకొంటాను " అన్నాడు హీరో.

 

 పత్రికల వారు, మీడియా వారు వచ్చారు. 


 "మీ అందరికి తెలియజేసేదేమిటంటే గుడ్డి గోలా పానీయం త్రాగమంటూ ప్రకటనలో నటించడం నేను చేసిన పొరపాటు. నా పొరపాటును విద్యార్థులు చూపించారు. నేను చేసిన తప్పుకు క్షమించమని అడుగుతున్నాను. అంతేకాదు అందరూ రసాయనములు లేనిసహజ పానీయములు తాగుతూ మీ ఆరోగ్యం మెరుగుపర్చుకోవాలని కోరుతున్నాను " అన్నాడు హీరో 

 త్వరలో దేశం మొత్తమీద పాఠశాలకు ఐదువందల మీటర్ల లోపున జంక్ ఫుడ్ నిషేధాన్ని అమలు పరచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 


మొత్తం మీద విద్యార్థుల పోరాటం ముగిసింది. 

 ఆ హీరో సినిమా రిలీజు కాబోయే తారీకు ప్రకటించారు

 *** *** *** 

సంజీవి చదువుకొంటున్న బడికి కాలకేయుడు వస్తున్నట్లు వార్త విన్న వారందరూ ఆశ్చర్య పడ్డారు. సినిమా నటుడైనా రావడానికి అవకాశం వుంది కానీ కాలకేయుడు లాంటి వ్యక్తి రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ప్రముఖ కోటీశ్వరుల జాబితాలో ఆయన ఒకడు. ఆయన ఒక కేంద్ర మంత్రి తో కలసి హెలికాప్టరులో వస్తున్నట్లు వార్తల్లో వచ్చింది. బడికి వారం రోజులు సెలవు ప్రకటించారు. 

కాలకేయుడు వస్తున్న హెలికాఫ్టర్ దిగడానికి హెలిపాడ్ ఎక్కడ నిర్మించేంచాలని అధికారులు పరిశీలించారు. 


హెలీప్యాడ్ నిర్మాణం జరిగే ప్రాంతంలో 200 మీటర్ల వరకు ఐదు నుంచి పది మీటర్ల ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు, సెల్ టవర్లు వుండకూడదట. బడిమైదానం అనువైనదిగా తోచింది, ఊరివారంతా బడి మైదానంలో హెలిపాడ్ నిర్మించడం చూడటానికి వింతగా వచ్చారు. హెలికాప్టరు వాలడానికి కొన్ని ప్రమాణాలతో నేలపై నిర్మించిన H ఆకారంలో ఉన్న హెలిపాడ్ చూసారు. 


 డిఐజి, ఎస్పీ, ఏర్పాట్లను పరిశీలించేందుకు బడి మైదానములో నిర్మించిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులను తక్కువ సంఖ్యలో హెలిపాడ్ వద్దకు అనుమతిస్తామని చెప్పారు. 


 ఐ పీ ఎస్ అధికారి ఒకరు, నలుగురు ఎఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు రక్షణ విధుల్లో పాల్గొన్నారు. ఇతర వింగ్ల నుండి 200 మంది సిబ్బందితో అసాధారణ స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 


 సంజీవితో కాలకేయుడు చర్చాగోష్టి జరుపుతారని.. ఆ చర్చను లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేయడం వలన మీడియా వారందరూ తగు ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా వున్నారు. ఒక్క సారిగా ఆఊరి పేరు దేశమంతటా అనుకొనేలా చేసింది. 


చర్చా గోష్టి జరుపుతున్నట్లు ముందుగానే సంజీవికి తెలుపుతూ కాలకేయుడితో ఎటువంటి ప్రశ్నలు అడగదలచుకొన్నావో ఇమ్మని అధికారులు చెప్పారు. హెడ్ మాష్టర్ వెంకటరమణ సహాయంతో కొన్ని ప్రశ్నలు తయారు చేసిచ్చాడు సంజీవి. ఆ ప్రశ్నలను కాలకేయుడికి పంపారు. 

 “ఆ అబ్బాయి ఎటువంటి ప్రశ్నలయినా అడగవచ్చు. సంజీవిని ఎటువంటి కట్టడి చేయవద్దండి. “ అంటూ సమాధానం ఇచ్చాడు కాలకేయుడు.

 

కాలకేయుడు చెప్పిన సమాధానం వెంకటరమణ, సంజీవికి తెలిపారు.

 

కాలకేయుడిలో మార్పుకు వెంకటరమణ ఆశ్చర్యపడ్డారు. 

 కాలకేయుడికి తెలుగు రాక పోయినా అతను ఆంగ్లములో మాట్లాడుతుంటే అనువదించడానికి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటరమణను నియమించారు. 


 అందరూ ఆతృతతో ఏం చెబుతాడా అని ఎదురు చూస్తున్నారు. దేశమంతా ఆ లైవ్ టెలికాస్ట్ చూస్తోంది. కాలకేయుడు మొదటిసారి అలా వేదిక మీద మనసువిప్పి మాట్లాడుతున్నాడు. అదీ తొమ్మిదవ తరగతి చదివే ఒక చిన్న అబ్బాయితో.. 


అక్కడ ఒక చోట టీ వీ స్టూడియో లాంటిది ఏర్పాటు చేశారు. 

సంజీవి వెంకటరమణలతో పాటు కాలకేయుడు మరియు కేంద్రమంత్రి కూర్చొనడానికి కుర్సీలు వేసియున్నారు 

 వెంకటరమణ వారి సంభాషణలు అనువదించడానికి ఆ ముగ్గురితో పాటు అక్కడ కూర్చొన్నాడు. 


 హెలికాఫ్టర్ నుండి దిగి నేరుగా చర్చ జరపవలసిన చోటుకు వచ్చారు. 


వెంకటరమణ, సంజీవి లేచి నిలబడి నమస్కారం చేశారు. కాలకేయుడు, మంత్రి ప్రతి నమస్కారం చేశారు. ఇద్దరూ సంజీవి దగ్గరకు వచ్చి భుజం తట్టారు. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు

22 views0 comments
bottom of page