వాహనాల్లో భద్రతాపరమైన లోపాలు పిల్లలకు శాపాలు
Vahanallo Bhadrathaparamaina Lopalu Pillalaku Sapalu - Telugu Social Article | R C Kumar
వాహనాల్లో భద్రతాపరమైన లోపాలు పిల్లలకు శాపాలు - తెలుగు సామాజిక వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 12/09/2026
ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఫశంగా కొన్ని కుటుంబాల్లో విషాదం అలుముకుంటుంది. పార్క్ చేసిన వాహనాల్లో ఒంటరిగా వదిలివేయబడిన పిల్లలు ఊపిరాడక, శరీర ఉష్ణోగ్రత పెరిగి అకారణంగా మరణిస్తున్నారు. మనదేశంలో ఇటువంటి మరణాల సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని విషాద సంఘటనలు కలచి వేస్తున్నాయి. తెలంగాణ చేవెళ్ల పరిధిలోని దామరగిద్ద గ్రామంలో ఆడుకుంటూ కారులో ఇరుక్కుపోయి నాలుగు మరియు ఐదు సంవత్సరాల ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ద్వారపూడిలో నలుగురు పిల్లలు పార్క్ చేసిన కారులో ఆడుకుంటూ అకస్మాత్తుగా డోర్లు లాక్ అవ్వడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు కరూర్ జిల్లాలో ఇంటి బయట నిలిపి ఉంచిన కారులోకి ఎక్కిన ఒక 4 ఏళ్ల బాలుడు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక మరణించాడు
అసాధారణ ప్రమాదం :
అసాధారణ ప్రమాదంగా గుర్తించబడే ఇటువంటి సంఘటనలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అజాగ్రత్తలకు ఒక సూచిక. దగ్గరలోని దుకాణానికి వడివడిగా వెళ్లి రావడం ఎంతసేపులే అనుకొని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ సమయం పట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. అత్యంత బాధాకరమైన ఇటువంటి సంఘటనలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించి తీరాలి. ఆడుకుంటూ తెలియకుండా కారు ఎక్కడం లేదా పెద్దలు పొరపాటున పిల్లలను కారులోనే మరిచిపోవడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. పిల్లలను వాహనాల్లో ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టవద్దని అవగాహనా ప్రచారాలు, మీడియా నివేదికలు వాహనదారులకు నిరంతరం గుర్తుచేస్తున్నప్పటికీ, మానవ తప్పిదం అనేది ఒక చేదు నిజంగా మిగిలి పోయింది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా, సత్వరంగా పరిష్కరించడానికి పూనుకోకపోతే ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి.
కారణాలు :
ఆపి ఉన్న ఒక వాహనం తలుపులు మరియు కిటికీలు పూర్తిగా మూసివేసి పార్క్ చేసినప్పుడు, రెండు ప్రాణాంతక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.
1. ఉష్ణోగ్రత వేగంగా పెరుగడం:
సూర్యకిరణాలు కారు కిటికీల ద్వారా లోపలికి ప్రవేశించి, డాష్బోర్డ్లు, సీట్లు మరియు స్టీరింగ్ వీల్స్ను వేడి చేస్తాయి. మూసివున్న క్యాబిన్ లోపల కిరణాల వేడి ఆవరించి ఉంటుంది. ఒక మోస్తరు ఉష్ణోగ్రత అనగా 25°C ఉన్న రోజున కూడా, కారు లోపలి ఉష్ణోగ్రత 20 నిమిషాల కన్నా తక్కువ సమయంలో 40°C కి చేరుకొని హీట్ ఛాంబర్ గా మారిపోతుంది. ఊపిరి ఆడక పిల్లలు వడదెబ్బకు అత్యంత సులభంగా గురవుతారు, ఎందుకంటే వారి శరీరాలు పెద్దవారి శరీరం కంటే మూడు నుండి ఐదు రెట్లు వేగంగా వేడెక్కుతాయి.
2. ఆక్సిజన్ క్షీణత మరియు గాలి స్తంభించడం:
నిశ్చలంగా నిలిపి ఉన్న ఉన్న కారు క్యాబిన్లో, గాలి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. లోపల ఉన్న పిల్లలు లేక ప్రయాణికులు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ సాంద్రతలు క్రమంగా తగ్గుతూ, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. తీవ్రమైన వేడితో పాటు, వెంటిలేషన్ కూడా లేకపోవడం వేగంగా శ్వాసకోశ ఇబ్బంది, అపస్మారక స్థితి మరియు అవయవ వైఫల్యాలకి దారితీస్తుంది.
స్వయంచాలిత (ఆటోమేటిక్) భద్రతా వెంటిలేషన్ :
ఇటువంటి అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో ప్రభుత్వపరమైన హెచ్చరికలు, మానవ అప్రమత్తత విఫలమైనప్పుడు ప్రమాదానికి గురికాకుండా ప్రయాణికులను రక్షించే సాంకేతిక పరిష్కారాల వైపు తల్లిదండ్రులే కాకుండా ప్రభుత్వము మరియు వాహన తయారీదారులు కూడా దృష్టి పెట్టడం అవసరం. పదేపదే జరుగుతున్న ఈ విషాదాన్ని ఎదుర్కోవడానికి, కేంద్ర రవాణా మరియు భద్రతా అధికారులు వాహన తయారీదారులకు తప్పనిసరిగా తగు డిజైన్ సంబంధిత ఆదేశాలను జారీ చేయాలి. నిలిపి ఉన్న కారులో ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు దానంతట అదే పనిచేసే పాసివ్ మరియు స్వయంచాలిత వెంటిలేషన్ భద్రతా వ్యవస్థలను (AVSS) వాహనాలలో అమర్చాలి. ఇగ్నిషన్ ఆఫ్ చేసి అన్ని డోర్లు లాక్ చేసినప్పుడు, ఇంటీరియర్ సెన్సార్లు లోపల ప్రయాణీకుడు ఉన్నట్లు గుర్తించి ఆటోమేటిక్ గా పనిచేయడం ప్రారంభించే మోటరైజ్డ్ యాంబియంట్ ఎయిర్ వెంట్లు కార్లలో ఉండాలి.
స్మార్ట్ థర్మల్ ఎయిర్ సెన్సార్లు :
ఆధునిక వాహనాలు ఇప్పటికే వాతావరణ నియంత్రణ కోసం క్యాబిన్ ఉష్ణోగ్రత సెన్సార్లను ఉపయోగిస్తున్నాయి. అంతర్గత కార్బన్ డయాక్సైడ్/ఆక్సిజన్ సెన్సార్లు మరియు థర్మల్ థ్రెషోల్డ్లను అనుసంధానం చేయడం ద్వారా, లోపలి వాతావరణం సురక్షిత పరిమితులను దాటినప్పుడు ఆటోమేటిక్గా అద్దాల కిటికీలు 1నుండి 2 అంగుళాలు కిందికి దిగడం లేదా వెంట్లు తెరవడం జరుగుతుంది. వీటిని స్మార్ట్ థర్మల్ ఎయిర్ సెన్సార్లు అంటారు.
లోపల ఉన్న ప్రయాణికుల గుర్తింపు సెన్సార్లు :
సీటు బరువును గుర్తించే సెన్సార్లను (ఇవి ఇప్పటికే అధునాతన డ్రైవర్-సహాయ వ్యవస్థలలో ఉన్నాయి) ఉపయోగించి, వాహనంలో పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవచ్చు. దీనివల్ల లోపల ఉన్న వారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేయబడతాయి. తద్వారా తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా, సేఫ్టీ వెంట్లు ఒకేసారి తెరుచుకోవడం, హారన్ సంకేతాలు, హజార్డ్ లైట్ల సందేశాలను యజమాని స్మార్ట్ ఫోన్కు నేరుగా పంపే అవకాశం ఉంటుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS), సీట్బెల్ట్ రిమైండర్లు మరియు ఎయిర్బ్యాగ్ల వంటి ప్రాణరక్షక ఫీచర్లను ఏర్పాటుచేసి అమలు చేస్తున్నప్పుడు క్యాబిన్ లోని గాలి భద్రతను కూడా ఆటోమేట్ చేయడం అవసరం.
సాధ్యాసాధ్యాలు :
ఇలాంటి ఆటోమేటెడ్ వెంటిలేషన్ వ్యవస్థలను అమలు చేయడానికి అధిక ఖర్చుతో కూడిన విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. ఆధునిక ఆటోమొబైల్ ఉత్పత్తుల్లో ఇప్పటికే ప్రామాణికంగా ఉన్న భాగాలను ఉపయోగించుకుంటూ కొద్దిపాటి మార్పులతో వీటిని అమర్చుకోవచ్చు. ప్రపంచ వాహన ప్రమాణాల సంస్థల మార్గదర్శకాల నుంచి స్ఫూర్తిని పొంది భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వంటి సంస్థలు దశలవారీగా ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలి. ఈ విషయంలో అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ప్రాథమిక భద్రతా ప్రమాణాలపై అన్ని రకాల వాహనాలలో క్యాబిన్ ప్రయాణీకులకు అవగాహన ఫీచర్లను తప్పనిసరిగా రూపొందించాలి.
ముగింపు
అధిక వేడికి గురైన వాహనాల్లో పిల్లలు చిక్కుకోవడం వల్ల జరిగే విషాదాలను పూర్తిగా నివారించడం సుసాధ్యమే. తల్లిదండ్రుల బాధ్యతాయుతమైన సంరక్షణే ప్రాథమిక రక్షణ అయినప్పటికీ, వాహన రూపకల్పనలో కూడా సరైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఆటోమేటెడ్ సేఫ్టీ వెంట్లు మరియు స్మార్ట్ క్యాబిన్ పర్యవేక్షణ వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వాహన తయారీదారులు కలిసి పనిచేస్తే, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక చిన్నారి ప్రాణం పోకుండా చూసుకోవచ్చు.
సర్వేజనా సుఖినోభవంతు 🙏
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్ |











Comments