top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 12

Updated: Sep 26

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 12 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 20/09/2025

కచదేవయాని - పార్ట్ 12తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుష వేషంలో వేటకు వెళుతుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి తారస పడతాడు. తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు యయాతి.


ఇక కచదేవయాని పార్ట్ 12 చదవండి. 


చీకటి పడుతుండగా యయాతి, అతడి మిత్రులు అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు అత్రిమహాముని. 


"దూరం నుండి వచ్చారు నాయనలారా! స్నానాలు చేసిరండి! భోజనం వడ్డిస్తాను! "అంది అనసూయమ్మ ఆప్యాయంగా. 


స్నానాదులు ముగించి భోజనాలకు కూర్చున్నారందరూ. 

"అమ్మా! మీ చేతి వంట అమృతం! మా జన్మ ధన్యమయింది!" అన్నాడు యయాతి ప్రీతిగా ఒక్కో పదార్ధాన్ని మెల్లగా భుజిస్తూ. 


వెన్నెలలాగా నవ్వింది అనసూయమ్మ. 


ఆ మాట నిజమే! ఆమె చేతి భోజనం చేస్తూ పరమాత్ముడే ధన్యుడననుకొంటాడట. 

అదీ ఆమె మహాత్మ్యం. 


భోజనాలు అయ్యాక అందరూ వెదురుచాపల మీద కూర్చున్నారు. 


"మా నాన్నగారు వచ్చే నెలలో మరొక యజ్ఞం చేయబోతున్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించమని మమ్మల్ని పంపించారు. మీ ఆశీస్సులు ఉంటే చాలు అంతా సవ్యంగా జరుగుతుందని మా నమ్మకం!"


యయాతి వినయంగా అత్రిమహామునిని అభ్యర్థించాడు. 


నవ్వాడు మహాముని. 


"మీ నాన్నగారు నూరు యజ్ఞాలు చేయాలని సంకల్పించారు. ఆయన సంకల్పం తప్పకుండా సఫలమవుతుంది. సంతోషం! మంచి పనికి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి! యజ్ఞం అంటే సామాన్యమైనది కాదు.. దానిని నిర్వహించాలంటే ఎంతో సమర్థత ఉండాలి. నువ్వు, నీ తమ్ముళ్లు జగదేకవీరులు. మీరు తోడుగా ఉంటే వందేమిటి వెయ్యి యజ్ఞాలనైనా సులభంగా చేయవచ్చు. " అంటూ ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పంచ వన్నెల రామచిలుక వచ్చి అక్కడ వాలింది. 


"రా చారుమతీ!” అంటూ అనసూయమ్మ చిలుకకు ఒక పండిన జామపండును తెచ్చి పెట్టింది. 


"అతిథులకు నమస్కారం! "అంది చిలుక ముద్దుగా. 


"ఈ చిలుక మాట్లాడుతుందేమిటి?" అడిగాడు యయాతి ఆశ్చర్యంగా. 


"ఇది దేవలోకపు చిలుక. బృహస్పతి వారింటి చిలుక. బృహస్పతి వారింటిలో వేద వేదాంగాలు నేర్చింది. కాబట్టి దీని పేరు చారుమతి. బుద్ధి కుశలతలో బృహస్పతిని మించిపోయింది. వాళ్ళ కుమారుడైన కచుడికి ఎంతో ఇష్టమైన చిలుక ఇది. కొంత కాలం భూలోకంలో ఉండి ఇక్కడి వింతలూ, విశేషాలు చూద్దామని వచ్చింది. పగలంతా ఎక్కడెక్కడో తిరిగినా రాత్రికి మాత్రం మా దగ్గర చేరి ఆ కబుర్లు, ఈ కబుర్లు చెబుతూ ఉంటుంది" వివరించింది అనసూయమ్మ. 


ఆ రాత్రికి ఆశ్రమంలోనే వీళ్లకు విడిది ఏర్పాటు చేశాడు మహాముని. 


చిలుకతో కబుర్లు చెబుతున్నారు పింగళ, శక్తిధరులిద్దరు. చమత్కారంగా మాట్లాడుతోంది చారుమతి. 

దాని మాటలకు పెద్దగా నవ్వుతున్నారు మిత్రులిద్దరు. 


ఆశ్రమం బయటకు వచ్చి నిలుచున్నాడు యయాతి. 

అంతటా పరుచుకున్న చల్లని వెన్నెల. 

భుజం దగ్గర కొద్దిగా నొప్పి ఇంకా ఉంది. ఆ నొప్పికూడా తీయగా ఉందతడికి. 


'ఆ సుందరాంగి పేరేమిటి? ఎవరి కూతురు?' ఆలోచిస్తుంటే చారుమతి రివ్వున వచ్చి అతడి భుజంమీద వాలింది. ముక్కుతో అతడి భుజాన్ని పొడిచింది. 


"నొప్పి ఇంకా తగ్గలేదు" అన్నాడు యయాతి చిలుకను చేతుల్లోకి తీసుకుంటూ. 


"ఆ నొప్పి తగ్గకూడదనే నేను పొడుస్తున్నాను. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా?"


నవ్వాడతడు. 



ree

"నీకు మా మనసులోని ఆలోచనలు తెలుస్తాయా? అయితే నీతో పెద్ద ప్రమాదమే!" అంటూ చారుమతిని ముద్దు పెట్టుకొన్నాడు. 


"మీ మనుషుల కంటే ప్రమాదం కాదు! ఇంతకీ ఏమాలోచిస్తున్నావో చెప్పలేదు?"


"నేను ఏమనుకుంటున్నానో నీకు చెప్పకపోయినా తెలుసుకుంటావు కదా! సరే! ఆ అమ్మాయి ఎవరా అని"


"పోనీ! నేను కనుక్కొని రానా! "


"వద్దులే నేనే కనుక్కుంటాను! "


"సహాయం కావాలంటే చెప్పు మిత్రమా! ఉచితంగా చేసిపెడతాను!" అంటూ చారుమతి ఎగిరి పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. 


పకపకా నవ్వాడు యయాతి. 


లోపలికి వచ్చి చాప మీద పడుకున్నాడు. 

నిద్ర పట్టడం లేదతడికి. 

కళ్ళు మూసినా తెరచినా ఆ అమ్మాయి కనిపిస్తోంది. ఎప్పటికో తెలతెలవారుతుండగా కళ్ళు మూసుకున్నాడు. 


రెండోరోజు పెద్దవాళ్ళిద్దరికీ నమస్కారం చేసి బయలుదేరటానికి సిద్ధమయ్యారు యయాతి వాళ్ళు. 

"కల్యాణమస్తు!" అంటూ ఆశీర్వాదించారు పెద్దవాళ్లిద్దరు. 


"ఇప్పుడు అదే కావాల్సింది!" అంటూ ఎగురుతూ వచ్చింది చారుమతి. 


"ఇదిగో! ఈ అల్లరి చిలుకను నీ వెంట తీసికొని వెళ్ళు! దీని అల్లరి ఎక్కువయిందిక్కడ. తోచీ తోచక ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. నా తపస్సును భంగం చేయటమే ప్రధానమైన పనిలాగా పెట్టుకొంది" అన్నాడు అత్రిమహాముని మురిపెంగా. 


"నా వెంట వస్తావా!" 


"పద! నీ రాజ్యంలో ఉన్న వింతలేమిటో నాకు చూపిద్దువుగానీ!" అంటూ యయాతి భుజం మీదకు ఎక్కి కూర్చుంది చారుమతి. 


చిలుకతో సహా తమ రాజ్యానికి బయలుదేరారు ముగ్గురు మిత్రులు. 


======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page