top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 13

Sep 26, 2025
4 min read

Updated: Oct 1, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు


Kachadevayani - Part 13 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 26/09/2025

కచదేవయాని - పార్ట్ 13తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుష వేషంలో వేటకు వెళుతుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి తారస పడతాడు. తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు యయాతి. తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి ఆయనను ఆహ్వానిస్తాడు. 


ఇక కచదేవయాని పార్ట్ 13 చదవండి. 


వేట ముగిసింది. 

ఆ రాత్రికి రాచనగరుకు చేరుకున్నారు శర్మిష్ఠా వాళ్ళందరు. ఎవరో అగంతకుడు తన సైనికులను ఓడించి వెళ్లిపోయాడని వృషపర్వునికి తెలిసింది. రెండో రోజు పొద్దున్నే కూతురిని పిలిపించాడతడు. 


"చెప్పు తల్లీ! అతడు దేవతా పురుషుడిలాగా ఉన్నాడా? లేక మానవుని లాగా ఉన్నాడా?" అని అనునయంగా శర్మిష్ఠను అడిగాడు వృషపర్వుడు. 


"నాన్నగారూ! అతని వేషధారణ చూస్తే రాజకుమారుని లాగా ఉన్నాడు. నాకు కొంత సమయం ఇస్తే నేను అతడి చిత్రాన్ని గీసి చూపించగలను!" చెప్పింది శర్మిష్ఠ. ఆమె మంచి చిత్రకారిణి. 


ఈ లోపల వృషపర్వుని మంత్రులు అక్కడికి వచ్చారు. చిత్రాన్ని గీయమని కుమార్తెకు సైగ చేసి వాళ్లతో పాటు సభా భవనానికి వెళ్లిపోయాడతడు. 


అక్కడి నుండి తన గదిలోకి వచ్చింది శర్మిష్ఠ. 

అరణ్యంలో తన చేతిలో ఓడిపోయిన యువకుని చిత్రాన్ని శ్రద్ధగా గీయ సాగిందామె. అతడి చిత్రాన్ని గీయడానికి ఒక పూట పట్టిందామెకు. 


మధ్యాహ్నంగా కూతురు గదిలోకి వచ్చాడు వృషపర్వుడు. ఆయన వెంట సుమాలినీదేవి కూడా వచ్చింది. చిత్రాన్ని చూశారిద్దరు. 


చిత్రాన్ని చేతుల్లోకి తీసికొని పరీక్షగా దాన్ని చూస్తూ "చూడు మాలినీ! ఈ యువకుడిలో నహుష చక్రవర్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనవాళ్ళు చెప్పిన దాన్నిబట్టి అతడు పాతికేళ్ళలోపు యువకుడయితే నహుషుని పెద్ద కుమారుడు యయాతి అయ్యుండాలి." అన్నాడు వృషపర్వుడు ప్రసన్నంగా. 


"మీకు తెలిసిన వాళ్ళా నాన్నగారు?" శర్మిష్ఠ మనసులో ఆనందం పొంగుతోంది. 


"నా స్నేహితురాలైన విరజాదేవికి భర్త ఈ నహుష చక్రవర్తి. మీ నాన్నగారికి అతడు మిత్రుడు కూడా. విరజకూ నాకూ మధ్య స్నేహం మాత్రమే కాదు దూరపు చుట్టరికం కూడా ఉంది. మా అమ్మమ్మా వాళ్ళ వైపు బీరకాయపీచు బంధుత్వం అది. నువ్వు పుట్టినప్పుడు చేసిన ఉత్సవాలకు వాళ్లంతా వచ్చారు. అప్పుడు చూడటమే!" వివరించింది సుమాలినీదేవి. 


"నహుషుడు ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు. అలా చేసి చేసి దేవేంద్రునితో సమానమవ్వాలని ఉందేమో! తను నిర్వహించే ప్రతి యజ్ఞానికి మనల్ని పిలుస్తూ ఉంటాడు. వీలు కుదిరినప్పుడు నేను వెళ్తుంటాను. లేకపోతే మన ప్రతినిధులను పంపిస్తుంటాను! మొన్నా మధ్య క్రొత్తగా అతడు తలపెట్టిన యజ్ఞానికి కూడా ఆహ్వానం అందింది. " తండ్రి అలా చెబుతుంటే శర్మిష్ఠ మనసు పురి విప్పిన నెమలిలాగా నాట్యం చేయసాగింది. 


"బంధువులనందరినీ చూసినట్లు ఉంటుంది. ఈ సారి మనం వెళ్లి వద్దాం!" భర్తను అభ్యర్థించింది సుమాలినీ దేవి. 


"ఊ.. ఊ.. చూద్దాం! పురరక్షణకు ఏర్పాట్లు చేసి వెళదాం! మా అమ్మాయి చేతిలో నీ సుపుత్రుడు ఓడిపోయాడని గర్వంగా ఆ యజ్ఞసమారోహంలో అందరికీ వినిపించేటట్లుగా చెబుదాం!" అంటూ వృషపర్వుడు నవ్వుతుంటే 

"ఫొండి నాన్నగారు!"అంటూ రివ్వుమని తోటలోకి పరుగెత్తింది శర్మిష్ఠ. 


కూతురు వెళ్లిన వైపు చూస్తూ పెద్దగా నవ్వాడా వృషపర్వుడు. 


"మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది సుమాలిన దేవి. 


"అర్ధం కావటం లేదా మాలినీ! మన అమ్మాయిని నహుషుని కుమారుని కిచ్చి వివాహం చేద్దామని!"


"మనం తొందర పడుతున్నామేమో? అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా? కేవలం తండ్రి పేరు వినంగానే సంబంధం మాట్లాడేద్దామా?" సుమాలినీదేవికి భయంగా ఉంది. భర్త తన ధోరణిలో తాను ఆలోచిస్తున్నాడని ఆమెకు కంగారుగా ఉంది. 


"నహుషుడితో వియ్యమందితే మనకు అదనంగా కొంత బలం చేకూరినట్లు! ఈ సంబంధం కచ్చితంగా దేవేంద్రునికి భయాన్ని కలుగచేస్తుంది!.. మనకు.. "


భర్త మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చింది సుమాలినీదేవి. 


"మీరెప్పుడూ దేవతల మీదకు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మృత సంజీవని విద్య కూడా ఉంది. వాళ్ళను జయించటం అంత సులభం కాదు!"

 

భార్య దగ్గరికి వచ్చి కూర్చున్నాడు వృషపర్వుడు. 


"మనం శాంతిమంత్రం పఠిస్తే దేవతలు రెచ్చిపోతారు. వాళ్ళను భయ పెట్టటానికైనా మనం కొంచెం బలవంతులైన మిత్రులను తోడు తెచ్చుకోవాలి! ఇది రాజనీతి!" అన్నాడు వృషపర్వుడు సాలోచనగా. 


"మన శర్మిష్ఠ వివాహాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసమే చేద్దామనుకుంటున్నారా? నాకు మాత్రం అమ్మాయిని ప్రేమించే గుణవంతుడైనా భర్త ఉంటే చాలనిపిస్తోంది. రాజులు, చక్రవర్తులు ఎందరెందరో కన్యలను వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు స్త్రీ ఒక భోగ వస్తువు. స్త్రీలలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని పురుషులు అందులో రాజులు గుర్తించరు.. కనీసం స్త్రీ గురించి ఆలోచించనే ఆలోచించరు."

అంది సుమాలినీదేవి. 


ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమెకు దగ్గరిగా జరిగి ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు వృషపర్వుడు. 


కళ్ళనీళ్లు తుడుచుకొందామె. 


"మాలినీ! నేను నీకు విలువ నివ్వటం లేదా? నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? మరొక స్త్రీ వంక కన్నెత్తయినా చూశానా? చెప్పు! స్త్రీ విలువ తెలియని వాడనయితే శర్మిష్ఠకు యుద్ధ విద్యలు ఎందుకు నేర్పిస్తాను? ఉత్తరోత్తరా మన రాజ్యానికి మన కూతురు మాత్రమే వారసురాలు. నీ కెందుకీ సందేహం వచ్చింది?"


అనునయంగా భర్త చెబుతుంటే 

"మీ గురించి కాదు! లోకరీతి గురించి చెబుతున్నాను. శర్మిష్ఠ చదువుకొన్న పిల్ల. ఆమెను, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు భర్తగా రావాలని నా కోరిక. అంతే!"


"చూస్తాను! అతడి గురించి కనుక్కుంటాను! అతడు స్త్రీ లోలుడో, వ్యసనపరుడో అయితే మన చిట్టితల్లి నిచ్చి ఎందుకు వివాహం చేస్తాము? నువ్వు నిశ్చింతగా ఉండు మాలినీ!"


భర్త మాటలు సుమాలినీదేవికి ఒకింత ఊరటను కలుగ చేశాయి. 


ఆమె మనసులో భర్త పట్ల గౌరవం కొండంత పెరిగింది. 


'తన భర్త దానవరాజే అయినా గుణవంతుడు. కుటుంబం పట్ల బాధ్యత, అనురాగం వున్నవాడు. శత్రువులకు మాత్రం అరివీర భయంకరుడు. ' అని మనసులో తలపోస్తున్న భార్య వైపు చూచి నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసికొన్నాడు వృషపర్వుడు. 


======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page