top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 20

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kakathi Rudrama Episode 20' New Telugu Web Series



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 20 వ భాగం


గత ఎపిసోడ్ లో

రామప్ప దేవాలయ శిల్పకళా వైభవం గురించి, అక్కడ చెక్కబడ్డ వివిధ నాట్య భంగిమల గురించి చక్కగా వివరించారు రచయిత.

కాకతీయులకు అండగా ఉన్న గన్నారెడ్డికి వర్ధమాన పురాన్ని అప్పగించబోతున్నట్లు సభాముఖంగా ప్రకటిస్తాడు శివదేవయ్య.

యుద్ధానికి సన్నద్ధులుగా ఉండమని అందరినీ కోరుతాడు.


ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 చదవండి..

కాకతీయ దేవాలయ శిల్పము, చాళుక్య శిల్పమున కొన్నిమార్పులు కల్పించింది. ఆంధ్ర శాతవాహనుల కాలంలో గుహవాస్తు, స్తూపవాస్తులతో పాటు, దేవాలయ వాస్తు కూడా వర్ధిల్లినది. ఆంధ్రులు, బౌద్దులు కాకమునుపు శైవమతావలంబకులు.


ఆంధ్రలు నెలకొల్పిన దేవాలయ శిల్పము అద్భుతమయినది. వారు గోడలు కట్టుటకు రాళ్ళు వుపయోగించలేదు. వివిధ మృత్తికలను కలిపి, ఇటుకలు చేసి వానితో నాలుగైదు అంతస్థుల భవనములు నిర్మించేవారు. అటుల ఇటుకలతోనే వారు దేవాలయాలు నిర్మించుకునేవారు.

బౌద్దయుగంలోనూ ఆంధ్రులు స్థూపాలు ఇటుకలతోనే నిర్మించిరి. విగ్రహాలకు, ద్వారాలకు, ఆలయస్థంభాలకు శిలలను ఉపయోగించెడివారు. కొండలు తొలిచి చైత్యాలుగా, విహారాలుగా, గుహలూ నిర్మించారు. ఇక్ష్వాకుల కాలంలో రాతితో ప్రథమచైత్య గృహ నిర్మాణము జరిగెను.


పల్లవుల కాలములో ఒకేరాతితో చెక్కిన దేవాలయాలు నిర్మాణములు చేసినారు. ఆంధ్రశిల్పులు చాళుక్యులకాలం నాటికిగూడా పూర్వరీతినే దేవాలయాలు ఇటుకలతో, సున్నముతో కట్టుచూ, మండపాలు, స్థంభాలు, విగ్రహాలు రాళ్ళతో నిర్మింపసాగిరి. రానురాను చాళుక్యుల కాలము వరకూ ఆంధ్రశిల్పులు ప్రతిభతో గర్భాలయము, వివాహ మండపాలు శిలలో నిర్మించి, శిఖరాలు మాత్రము ఇటుకలతో నిర్మించిరి.


కాకతీయ చక్రవర్తులకాలంలో స్తంభశిల్పము, ద్వారశిల్పము ఇంకనూ అపూర్వ కౌశలముతో ముందుకు సాగెను. దేవాలయ శిఖరము గూడ చాళుక్యకాలపు రూపము నుండి మార్పుపొందెను.

చాళుక్య శైవము లో సాధుశైవము- కాకతీయ శైవము వీరశైవము. వీరశైవ శిల్పములో వీరభద్ర నందికేశ్వర లింగమూర్తుల వికాసముచే నిండిపోయినది.

వట్టి లింగమూర్తి పూజతో తృప్తిపడిన చాళుక్యశిల్పి శైవలీలా వినోది అయినాడు. రాష్ట్రకూట వంశాదరణలో కాకతీయ రసపూర్ణ జీవిత ప్రాబల్యాన, ఆంధ్రశిల్పి- నృత్య విన్యాసకుడు, దివ్యసౌందర్య లీలావిలాసుడు, అలంకార పూరితాత్ముడు ఆయెను.

మొగలిచర్ల కాకతమ్మ గుడి శ్రీకాకతీయ ప్రోలమహారాజు ప్రథమ తనయుడయిన శ్రీరుద్ర చక్రవర్తి కట్టించెను. ప్రసిద్దాంధ్ర శిల్పి ఎఱ్ఱయ ఒజ్జ నిర్మించినది. ఆచార్య ఎఱ్ఱయ ఒజ్జ ప్రసిద్ర ఆంధ్రశిల్పి. అతని శిల్ప కౌశలము అనుమకొండ రుద్రేశ్వరాలయంలో ఆకాశమును చుంబించు చున్నట్లనిపించును.

ఆ ఎఱ్ఱయ ఒజ్జ తండ్రి కామయ ఒజ్జ. వారి పూర్వీకులు రాణ్మహేంద్రపురవాసి. అతని పూర్వీకులు ద్రాక్షారామ, భీమారామ, సోమారామ దేవాలయాలు నిర్మించారు. మహాచార్య అయిన భీమఒజ్జ కు ఎఱ్ఱయ ఒజ్జ మేనల్లుడు.

ఎఱ్ఱయ ఒజ్జ ముఖమంటపంలో నిర్మించిన ఎనిమిది స్తంభాలకు నాలుగువైపులా ముప్పదిరెండు విధాల అలంకారశిల్పము చెక్కినారు.

అంగుష్ట ప్రదేశంలో కేశ సదృశమయిన శిల్పము చూపరులకు హృదయ స్పందనమగునట్లు అద్భుతముగా శిల్పచాతుర్యము కనబరిచినారు.

దేవీ గర్భాలయద్వార సౌందర్యము వర్ణించనలవికానిది. ద్వారఫలకము పై దేవీనాట్యము చెక్కెను. ద్వారమున ఎనిమిది ఫలకములలో ఒక ఫలకము లతాయుక్తము, ఆ లతల రెండువేపులా రెండు రథాలు, పైన ఇంకొక వాద్య విశేష ఫలకము, లతాఫలకము నుండి ఉబ్బెత్తుగా ముందుకు వచ్చింది. శంఖకాహళ వేణువులు, నాద స్వరాది ముఖ్య వాద్యాలు, ఢమరు మర్దళ మృదంగాది చర్మవాద్యాలు, రావణహస్తాది తంత్రీవాద్యాలు అనేకులు వాయించుచు నాట్యం చేస్తున్నారు.

ఆ ఫలకానికి ముందు మరల లతాఫలకము. ఆ లతాఫలక మీవల ద్వారపాలక ఫలకము. భక్త ఫలకము. ! మరల లతాఫలకము.

ఏకవీరాదేవి విగ్రహ విన్యాసంలో ఎఱ్ఱయఒజ్జ చూపిన శిల్ప సౌందర్యము అలౌకికము. ఏకవీరావాహన మయిన సింహంలో ఎఱ్ఱయఒజ్జ విశ్వకర్మనే ఓడించినాడు.ఎఱ్ఱయ ఒజ్జ పనితనం గమనిస్తూ రుద్రమ ఆలయమంతటా కలయ తిరగసాగింది.

జేగంటలు మ్రోగినవి. రుద్రమ, అన్నమాంబికలు నిమిలిత నేత్రులైనారు. త్రిభంగాకారమైన ఏకవీర తప్తజాంబూనదాభయై, కాంచనారుణ పరిధాణయై, జ్వలితాగ్ని శిఖాభ సర్వభూషణ భూషితయై రుద్రాంబకు ప్రత్యక్షమైంది.

ఆమె విశ్వనాట్యము చేస్తున్నది. ఆమె లలిత పద గతులకు వేణుగానాలవలె, చిగురు జొంపాలువలె హస్తములు ఆడుచున్నవి. ఆ మూర్తి కన్నులనుండి ఒక మహాతేజం రుద్రాంబ హృదయంలో ప్రవేశించి లయించునట్లయింది. రుద్రదేవి సర్వ విశ్వమభ్యస్థమై పులకరించిపోయి, ఏదో దివ్యమత్తులో ఒక లిప్త మాత్రము చైతన్యరహితమైంది.

సర్వమాధుర్యాలు ఉత్తంగ తరంగాలై సుడులు తిరిగి ఆ సుళ్ళ మధ్య లయాత్మకమై వేయిరాగాలు సంక్లేషింప, సర్వవర్ణ పూరితయై ఏకవీరాదేవి నాట్యం చేస్తున్నది.

ఆ పరమపవిత్ర దర్శనమున పరవశయైన అన్నమాంబిక హృదయాన కంఠమాల నుండి ఒక పుష్పము ఎగిరి వచ్చి వ్రాలి కరిగి హృదయంలో లీనమైనట్లు తోచి అన్నమాంబిక చైతన్య రహితురాలైంది.

ఇరువురు ఒకసారి కనుల ఆనంద బిందువులు నిండ రెప్పలు తెరిచినారు.

------------------------------------------

ఏరవీరాదేవి పూజ ముగించుకొని రుద్రమ,అన్నమాంబిక, ముమ్ముడమ్మ మొగలిచెర్లనుండి సాయంత్రం బయలుదేరారు. ఈ ముగ్గురు వీరనారీమణులు నాలుగు అశ్వములు పూనిన రథముపై అధివసించి వెనుకల అశ్వికులు రక్షణగా రాగా ప్రయాణము సాగించిరి. రేచెర్ల రుద్రారెడ్డి అంగరక్షకులకు నాయకుడై అప్రమత్తుడై వుండెను.

ఆ వానకారున సస్యశ్యామలమై దేశం సుభిక్షం గా పచ్చని క్రొత్తవస్త్రం కట్టుకొన్న యిల్లాలిలా కళకళలాడుచున్నది. వాన కురియబోయే ఉక్కబోతలతో ప్రజలందరకు చెమటలు పోస్తున్నవి. పొలాలలో రైతులు వ్యవసాయమనే దివ్యయజ్ఞాలు ప్రారంభించారు.

వానకోయిల అరుపులు, ఆలమందల అంభారావాలు, రైతుల అదలింపు కేకలు మందరశ్రుతిజనిత కాంభోజిరాగమై ఆ సాయంకాలకాశావలయమున నిండినది.

ఈ ముగ్గురూ - యాదవ మహాదేవుని వలన సంభవించభోయే భయంకర రక్తపాతము, ప్రాణనాశము, ప్రజా సంక్షోభములను గూర్చి మాట్లాడుకొను చుండిరి.

రుద్ర: చెల్లీ! యుద్దాన విజయం తెచ్చేవి రెండు. ఒకటి- ఎదుటివాడి బలం సంపూర్ణముగా అవగాహన చేసుకోవడం. రెండవది- ఎదిరి బలాన్ని బట్టి మనం వ్యూహరచన చేసుకోవటం.

అన్న: అక్కగారూ! వ్యూహరచనలో భేదము లుంటాయనా మీ ఉద్ధేశ్యము.

రుద్ర: అవునమ్మా చెల్లీ! యెదుటివాడి బలం ఎక్కువయితే ఆత్మరక్షణ కొరకు వ్యూహాన్ని రచించుకొని, యెదుటివాడి బలం మనను తాకిన కొలదీ హీనమయ్యేటట్టు చూడాలి. నీరసించాడని తెలియగానే శత్రువుపై విజృంభించి నాశనం చేయాలి.

ముమ్మ: అక్కగారూ! శత్రువు యొక్క బలమే తక్కువగా ఉండి మన బలము ఎక్కువగ ఉంటుంది. శత్రువు దుర్భేద్యమైన వ్యూహం రచించుకొని వుంటాడు. అప్పుడు శత్రువు మీదికి వెళ్ళడము మనకు నష్టమే కదా!

రుద్ర: నిజమే. అప్పుడు సర్వకవచ భేదకమైన యుద్ధ విజృంభణన సాగించి శతృనాశనం చేయాలి. ఈ రెండు యుద్దాలలో గన్నారెడ్డి అసమాన ప్రజ్ఞావంతులు.

అన్న: గన్నారెడ్డి దొంగపోటుగాదా, అక్క గారూ!

రుద్ర: గన్నారెడ్డిని ఎవరైనా గజదొంగ అంటే చీల్చేసేదానివి. ఇఫుడు అలా అంటావేమి చెల్లీ!

ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. రుద్రదేవి ప్రేమతో అన్నమాంబికను కౌగలించుకుని

" చెల్లీ! మనష్యుని జ్ఞానం ఎంత సంకుచితమైనది! మూడడుగులు ముందుకు, ముప్పై అడుగులు వెనక్కు చూడలేని అజ్ఞానంతో ఉంటాడు. సర్వవిశ్వమూ ఆవరించి వున్న పరమ రహస్యాల ఛాయలన్నా మనకు తెలియవు సుమీ.

రుద్రాంబిక నిట్టూర్పు విడిచినది. తమ పరితాపాలన్నీ మరచి పోయి ఏవో ఆలోచనలలో అన్యమనస్కలై ఉన్న వారి మువ్వురకు ఒక్కసారిగా వేయి పిడుగులు పడినట్లు

గగ్గోలు వినబడింది. నాలుగువేలమంది సైనికులు రుద్రదేవి రథమును, అంగరక్షకులను చుట్టుముట్టారు.

అంగరక్షకులను ఇనుపగోడలా చేసి, రుద్రసేనాని రథాన్ని ఆపుచేసి ముందు నుంచున్నాడు హరిహరదేవ, మురారిదేవులు - రుద్రసేనాని ముందర ఆగినారు.

మహావీరుడు, యువకుడు అయిన రుద్రసేనాని హరిహర మురారి దేవులను చూసి చాలా ఉద్విగ్నముకు లోనయినాడు.

" రుద్రదేవ చక్రవర్తికి ఎలాంటి ఆపద కలుగుతుందో! ఎప్పుడూ ఊహించని విధంగా ఆపద వచ్చి పడిం" దని రుద్రసేనాని కలవర పడుచున్నాడు.

హరిహరదేవుడు దిక్కులు పిక్కటిల్లేలా - రేచర్ల రుద్రదేవులపై చూస్తూ, "ఓయి రేచర్ల రుద్రుడా! నువ్వేమి చేయగలవు? మేమిరువు రన్నదమ్ములము చావుకు తెగించి వచ్చాము. యమపురికి పంపటానికి సిద్దముగా నున్నారు మా నాలుగువేల సైనికులు.

కాబట్టి నీవు ప్రాణం దక్కించుకుని వెళ్ళిపో. మేము మా చెల్లెలిని మాకోటకు బంధీగా తీసుకొనిపోతున్నాము" అని తెలిపినాడు.

రుద్రదేవికి, అన్నాంబికకు, రేచర్లరుద్రునికి - ఎవరికీ నోట మాట రాలేదు. ఈ ఆకస్మికదాడితో. మురారిదేవుడు వెకిలిగా నవ్వుచు "అద్వితీయముగా విరాజిల్లుచున్న ఈ ఆంధ్రదేశాన ఆడది రాజ్యం చేయడానికి ధర్మం ఒప్పుకోదు. రుద్రచక్రవర్తి తరువాత సింహాసనం అధివసించవలసిన మా తండ్రిగారిని మోసం చేసి,, దొంగలై, అధర్మపూర్ణులై, మహాదేవరాజు- గణపతిదేవుడూ సింహాసనాలెక్కినారు.

అయినా ధర్మస్వరూపులు అయిన మా తండ్రిగారు మాటలాడక ఊరుకున్నారు. మేము మాత్రము

ఊరుకోము. రాచగద్దె మీద ఆడదాన్నెక్కించటమా!" అన్నాడు.

అప్పుడు ముమ్మడమ్మ రథం మీంచి లేచి నిలుచుండి “హరిహర మురారులారా! తాము ఈ విషయం శ్రీగణపతిదేవ చక్రవర్తుల వారిని అడిగి ధర్మనిర్ణయం ఎందుకు చేసుకోలేదు. ?” అని ప్రశ్నించింది.

మురారి: మాకు ఆడువాళ్ళతో మాటలు పనికిరావు. రేచర్ల రుద్రుడా! ఏమంటావు? నీ సైన్యాలన్నీ ఆయుధ విసర్జన చేస్తాయా, ఎక్కడివారినక్కడే హతమార్చమా!

హరి: మీరు ఆయుధాలు విసర్జించి గుర్రాలు దిగి నడిచిపోండి. లేదా రుద్రదేవి, ముమ్మక్క... ఆ మూడో అమ్మాయి అన్నాంబిక ల ప్రాణాలు దక్కగలవని మేము చెప్పలేము.

-----------------------------------------------------

ఇంకా వుంది...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 త్వరలో...

------------------------------------------------------


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



72 views0 comments
bottom of page