top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kakathi Rudrama Episode 5' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


గత ఎపిసోడ్ లో…

రుద్రమ దేవి స్త్రీ అని తెలుసుకుంటాడు వీరభద్రుడు.

కానీ అతనికి తెలిసిన విషయం ఆమెకు తెలియదు.

ఆమెలోని సహజమైన స్త్రీత్వం చాళుక్య వీర భద్రుడిని ఇష్టపడుతుంది.

ఇక చదవండి...

ఆమె వెంట వేటకు వెళ్ళిన వీరు లొక్కరొక్కరే వెనక్కి తరలి వెళుతున్నారు.

రుద్రమదేవి గంభీరంగా రాజ సౌధం లోకి వచ్చింది.


సుందరం, సువిశాల అంతఃపురము.

అందులోనే నిత్యమూ అలనీటితో ప్రవహించే స్నానశాల.-------


పన్నీటితో నింపబడిన సువాసనా భరితము.


వెన్నెల మొదలైన తొలినాడు 'రా' వత్తులలాగా,మబ్బు అంచు ను వేలాడుతున్న

చంద్రుడు, లక్షలాది నక్షత్రాలు, ఆకాశాన్ని నింపుకున్నాయి. స్వచ్ఛమైన గాలి విసుళ్ళు---

ఆమెకు ముఖ్యమైన పరిచారికలు ముప్పదిమంది.


వారికి ఆమె యెవరో తెలుసును. ఆమెకు మాత్రమే వారి మధ్య రహస్యాలు లేవు.

ఈమె వార్త ఆ ద్వారము గడపవరకే. ఆమె స్త్రీ యన్న మాట మరెవ్వరికీ తెలియరాదు.

అంత నిఘా.


ఎప్పుడూ కాపలా కాసే వీరశేఖరులు.

అందు ప్రవేశమే లేదు.


ఆఖరికి రుద్రదేవుని భార్య' మమ్ముడాంబిక' కూడా.

యిప్పుడామె లోనికి వచ్చి ఆసీనురాలైంది.


దాసీలు , ఆమె వలువలను వొలిచారు.

చల్లటిగాలికి వొళ్ళు హాయిగా వున్నది.ప్రాణము దూదిపింజల వలె మెత్తని కదులు

చున్న మేఘమువలె.

ఇంత సౌఖ్యము తనకు తెలియదు.

ఈ సౌఖ్యమును వదులు కొనలేదిప్పుడు.


అది వీరభద్రుని తలపు. తలపు కాదది , మన్మధుని వలపు పిలుపు. చిత్రమైన బాధ. ఈ సర్వ సామ్రాజ్యమూ, ఈ యావత్ప్రపంపచము , అతని ప్రేమ ముందు,

గాఢ అనురాగం ముందు , స్వల్పంగా - చాలా తక్కువగా కన్పిస్తన్నాయి.

ఆమె మడిచిపెట్టబడిన బారాటి వెంట్రుకలను ఒకదాసి విప్పినది. అవి వదులుగా

భుజాల మీద జారి , ఆకాశాన్ని కప్పుకున్న నల్లటి మేఘాల వలె వ్రేలాడుతున్నాయి.


ఎంత అందమైన కేశసంపద..

స్నానము -- పన్నీటి స్నానము.


పచ్చిపసుపుతో , గంధముతో, మెత్తని శెనగపిండితో నలుగు పెట్టబడిన శరీరము.

కమ్మని సువాసన.


పెద్ద దువ్వెనకు అలవి కాని పొడుగాటి వొత్తయిన వెంట్రుకలు.

ఎర్రని నిమ్నోన్నత. శరీరము.బంగారు మేనిఛాయ.


ప్రతి అంగమూ సౌందర్యసోద్దీపనమే.ముఖ్యంగా ఆ పెదవులు వొంగిన విల్లువలె ,

'ల' వత్తును వంచి ఎదురుబొదురుగా అంటించినట్టు - ఎంత చక్కని ముక్కు-పురు

ష వేషంలో బంధించబడిన, ప్రాణమున్న అపరంజి బొమ్మకు,ఈ గదిలోనే స్వాతంత్య్రము.


ఆమెకు నగ్నంగా స్నానం చేసే స్వాతంత్య్రము, యింతకు ముందు లేదు. కానీ

యివాళ తెలియని తెగింపు, కటివస్త్రం ఎప్పుడూ వుండేది. ఇప్పుడు లేదు. ఆ పచ్చటి

తొడలు, పూచిన పచ్చటి పువ్వుల గుత్తులవలె కాళ్ళ చర్మము , కలువ పూవుల

లావణ్యమువలె.


అందరికీ సంభ్రమమే !


అమె ఎత్తరి వక్షము మీద నిలిచిన నీటి తుంపరలు, ముత్యాల వలె నాజూకూ,

లాలిత్యమూ , సౌందర్యమూ- అన్నీ కలగలిపి.


ఆమెకి యిప్పుడొక ప్రశ్న వచ్చినది.

" తనను మహా సౌందర్యవతి అని ఈ రాణీవాసపు ఆంతరంగిక దాసదాసీలు

అంటూ వుంటారు."


కావచ్చును. కానీ తనకు తెలుసు. తాను సౌందర్యవతియే .లేక పోయినట్లయితే

ముమ్ముడాంబిక తనంటే ఎందుకు అంత వెర్రితో, పురుషవేషంలో వుండగానే

ఆరాధిస్తుంది.


తనను ముమ్ముండాంబిక భర్త వలె చూస్తుంది. ఆ ముగ్ధకి , ఆ వెర్రిపిల్లకి యింకా

తెలియదు; తాను స్త్రీనని - పురుషుణ్ణి కాదని.అదే ఖర్మము.


ఎట్లా మరిచిపోతుంది తను! చాళుక్య వీరశ్రేష్టుడైన ప్రభువుని---

కానీ శివదేవయ్యల ఆలోచన మరోవిధంగా వున్నది.


తాను పురుషుడుగా నటించక పోయినట్లయితే , తరతరాల వీరగాథలు గలిగి--

శాలివాహనుల వీరత్వంతో-


ఇక్ష్వాకుల క్షాత్రంతో---

కాకతీయుల కదన కౌశలంతో---


ఇంత సముజ్వలమైన పేరు కలిగిన , ఈ రాజవంశాల చరిత్ర, ఈ అఖండ పుణ్య

ధాత్రి క్షీణిస్తుందట.

తిరుగుబాటుదార్లు

సామంతులు

అందరూ, ఒక్కరొక్కరే, ఎవరికివారే , ఈ అఖండ హిందూ సామ్రాజ్య మహావృక్షాన్ని

ముక్కలు ముక్కలుగా తెగనరుక్కుపోతారు.


ఇది తన తండ్రీ-

తన మహామంత్రీ-


మహా సేనానీ --

ఎప్పటికప్పుడు చెబుతున్న మాటే-


అయినా----


తన సౌందర్యాన్ని పురుషవేషంగా చిత్రించవచ్చుగాక, కానీ-----తన యిరవై రెండేళ్ళ

వయస్సుని , యవ్వన రాగహేలని , ఏ ఇనుప కచ్ఛడాలు దాయగలిగినాయి!"


పురుషుడుగా నున్నప్పుడో---

రాజ్యకార్య నిర్వహణలోనే----


మంత్రిసామంతులతో మంతనాలు చేస్తున్నప్పుడో----

వేటకు వెళ్ళిన క్షణాల్లోనో-----


తాను పురుషుడు. రుద్రదేవుడు.కానీ యిప్పుడు !ఈ క్షణాన! మనస్సు వెయ్యి రేకుల

విరుసిన పూవై, గాలికూడా ప్రేమవార్తల గుసగుసలు పోతున్నప్పుడు----

సముద్ర తరంగాలవలె-


పగిలిన అగ్ని పర్వతం వలె----

గాలి వీవనల ఉధృతి వలె-----


ఇహ తాను బయటపడక తప్పదు----

తాను రుద్రదేవుడు కాదు. రుద్రదేవి-- రుద్రమదేవి.


ఈ రుద్రదేవుడికి, వీరభద్రును సమాగము యివాళటిది కాదు.అతను ఆమె

మనస్సులో చాన్నాళ్ళనంచీ వుంటున్నాడు.

ఒకానొకనాడు-----


అత్యవసర రాజకీయవ్యవహారం కోసం వచ్చాడు. అప్పుడు యింత అందము లేదు.

కానీ అందగాడే అనుకున్నది.


ఆమె పురుష వేషంలో తండ్రితో కూర్చున్నది.

ఆంతరంగిక వ్యవహారము.దీక్షాదక్షునివలె ప్రవర్తించినాడు.


చిరునవ్వుతో..........

తను అతని ముఖంలోకే చూసింది.


అదే నవ్వు.చిత్రమైన నవ్వు.గుండె గదులని పగులగొట్టే నవ్వు-మనస్సు వొడ్డుల్ని

కోసే వురవళ్ళు- నచ్చిన నదీతరంగమల్లే.


వచ్చినవాడు వెళ్ళిపోయాడు.

కానీ జ్ఞాపకాలు వున్నాయి.వాటిని మర్చిపోలేదు.


తొలి యవ్వన సంరంభంలో వున్నప్పుడు వికసించిన స్నిగ్ధ ప్రేమ , అది గుర్తు వుండ

కుండా ఎలా వుంటుంది?


అయితే , ఆమెకిప్పుడు వచ్చిన అనుమానమేమిటంటే--

' వీరభద్రుడు తనను స్త్రీ గా గుర్తించినాడా? '


ఈ ప్రశ్న వస్తే తనకెందుకింత పులకరింతలు కలుగుతున్నాయి!

ఆమెకి చాలా ప్రశ్నలు వస్తున్నాయి.ఆమె యే సమాదానాలతో సమాధానపరుచు

కుంటున్నది!


రుద్రమదేవికి నిన్నటి మాఘమాసంతో యిరవై ఒక్కేళ్ళ వసంతా లు గడిచిపోయాయి.

ఆమె వక్షోజాలు ఉన్నతంగా, నిగారింపుతో దీప్తివంతంగా వున్నాయి.వయస్సు

గడిచిపోతే, ఈ ఆలోచన ఆమెను భయపెడుతున్నది.నదిలో నీళ్ళు ప్రవహించకపోతే

----- అంతా శూన్యమేనా! లేక చీకటేనా!


ఒకానొకనాడు ఆమె , ఒక సుందరమైన స్త్రీ శిల్పాన్ని చూసింది.అద్భతమైన

అందమది.తనూ స్త్రీ వేషం వేస్తే -యింతకన్నా అందంగా వుండనా! ముఖ్యంగా ఆ

విగ్రహం నగ్నంతో విరాజిల్లిపోతోంది.అసలలు ఈ అనంత సృష్టికి, లాలిత్యమూ,

ప్రేమా, ఆరాధధనా, సౌందర్యము యిచ్చింది స్త్రీ కాదా!


ఆ నాటి నుంచి ఆమెను వేధిస్తున్న మరో ప్రశ్న ఏమిటంటే------


" లోకంలో అందరూ స్త్రీలకివలెనే, లాలిత్యంతో లాలించబడి పెంచబడుతూ

వుంటే,తాను మాత్రమ పురుషునిలాగా ఎందుకు పెంచబడుతున్నది!"

ఆమె ఆ సాయంత్రమే , తల్లిగారైన ' సోమాంబికాదేవి' ని యిలా అడిగింది.--


' అమ్మా! నే నెవరినీ"

' మా బిడ్డవు".


"యింతకీ నేను మీకుమల్లే స్త్రీ నా? తండ్రిగారికి మల్లే పురుషుడినా?"


ఆమె తల్లి చిత్తరువులోని బొమ్మలవలె బిత్తరపోయి నిలబడినది.

రుద్రమదేవి కంటికొనల చిన్న కన్నీటిబిందువు పొటకరించి----

"స్వచ్ఛమైన స్త్రీ లాలిత్యాన్ని , ఎంత క్రూరంగా పురుషునివలె మార్చబోతున్నారు.

నేను నీ వంటి స్త్రీని కానా ?" అన్నది.


సోమాంబికాదేవికి , ఏమని జవాబు చెప్పవలెనో తెలియలేదు.


రుద్రమదేవి గంభీరంగా నడుచుకుంటూ , అంతఃపురానికి వెళ్ళిపోయింది.

అయితే బాలికయైమ రుద్రమదేవికి , రాజకీయాలమీద యింకా పట్టు చిక్కలేదు.

అంతా తండ్రిగారూ, శివదేవయ్య మహామాత్యులూ చూసుకుంటున్నారు.అదీగాక---

మొదటినుంచి ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మి చాలా యుద్దాలని అనుభవించింది.

సుస్థిరత లేని ప్రభువులతో, సైన్యాల పదఘట్టనతో , కత్తి మొనల మెరుపులతో ,

రక్తపాతాలతో, ---- ఈ ధాత్రి చాలా దుఃఖాన్ని అనుభవించింది.


చాళుక్య రాజ్యాలపతనం తరువాతగానీ,సుస్థిరమైన కాకతీ వంశ స్థాపన జరగలేదు.

చాళుక్యరాజులు సామ్రాజ్యాన్ని , తమ దాయాదులవల్ల , ఛిన్నాభిన్నం చేసుకుని, ఈ

సామ్రాజ్యానికి ప్రభువులు తామంటే తామేనని తెగనరుక్కుని , యుద్దాలు చేసి ,

మరీ చచ్చారు.ఇది కాకతీయ ప్రభువులు , ఈ రక్త స్థలి నుంచి నేర్చుకున్న గుణ

పాఠం.కాదు అనుభవం.


అందుచేతనే రుద్రదేవి ముత్తాతగారు ' ప్రోలమహారాజు' -- ఈ కాకతీ వంశాన్ని

స్థాపించారు.


అయితే గణపతి రుద్రదేవులకి,పుత్రులు లేకపోవటం చేత - సారంగధర

మహారాజు ఉంపుడుగత్తెకు పుట్టిన, హరిహర మురారిదవులు , ఈ రాజ్యంమీద

కన్నేసి వుంచడం చేత - రుద్రమదేవి, రుద్రదేవుడుగా పెరగక తప్పలేదు.

నిజమే-- ఈ పెంపకం చాలా కష్టమే--


అయినా, యింతకన్నా, మరో మార్గంలేదు.

బాలికగా ఆమె పెంచబడినా , బాలుడిగా విద్యలూ-వీరత్వాలు నేర్చుకున్నది.అది

మనకు తెలిసిన కథే.


ఇట్లా ఆమెను పెంచటం లోని ధర్మసూక్ష్మత యిదే.

'కాకతీ సామ్రాజ్యాన్ని చిరకాలం శాంతిసౌభాగ్యాలతో , కళకళ లాడుతూ పరిపాలింప

చేయాలన్నదే.'


ఇది అర్ధమయ్యేట్టు చెప్పగల బాధ్యత శివదేవయ్య మంత్రులు .

ఇది కాకతీసామ్రాజ్య విజయశ్రీ నుదుటిని దిద్దిన కుంకుమ గా అందరూ భావిస్తున్నారు.


ఇంకా ఉంది.....


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


124 views0 comments
bottom of page