top of page

మారాలి........మనం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Marali Manam' Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

విదేశాలకు వెళ్లి కన్నవారి కడ చూపులకు కూడా నోచుకోలేకపోతున్నారు ఎందరో.

మమతానురాగాలు మరచి యంత్రాల్లా మారిపోతున్నారు.

మార్పు రావాలి.

మన దేశాన్ని ప్రేమించాలి.

మన మట్టి విలువ తెలుసుకున్న ఒక జంట కథను ఈ కథలో చక్కగా చెప్పారు ప్రముఖ రచయిత, కవి అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం


మారాలీ మారాలీ మారాలీ

మనం మారాలీ మనం మారాలీ


“జర్మనీ లో ఉద్యోగం " ప్రకటన" చూశారా .ఇవాళటి దినపత్రికలో మెసమీ కంపెనీవారు ప్రకటన ఇచ్చారు. అదో MNC కంపనీ. మూడు నెలల ట్రైనింగ్‌. ఆ తరువాత జర్మనీ వాళ్ళ ఖర్చులతోనే పంపుతారట. పాస్‌పోర్టు కూడా చాలా తొందరగా వచ్చేస్తుందట. వాళ్ళ కంపెనీ ప్రాస్పెక్టస్‌ చాలా బావున్నాయట.


రేపే ఇంటర్వ్యూ.అర్హత ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌.


“ఏమండీ, మనం కూడా ఈ ఇంటర్వ్యూకి వెళదాం. ఎన్నో రోజుల నాకల ఈ నాటికి నెరవేరబోతోంది. ఇద్దరమూ ఎంటెక్‌ పాసయ్యాము. ఒకే సబ్జక్టు మనం చదివింది

కూడా . మంచి ఫారిన్‌ కంట్రీకి వెళదామనేగా! ఇప్పుడు వచ్చింది మనకి మంచి

అవకాశము.” అంది రాజీ.


“ఇలాంటివి రోజూ వస్తూంటాయిలే!చూద్దాం !”అన్నాడు మహేష్


“చూద్దామంటారేమిటీ? వాళ్ళు మెయిల్‌ ఐడీ ఇచ్చారు. మనిద్దరి రెజ్యూమ్‌లు మెయిల్‌

చేయండి.”


సరేలే రాజీ!

మహేష్‌, రాజీ ఇంటర్వ్యూలో సెలక్టై మూడు నెలల ట్రైనింగ్ర తరువాత జర్మనీ వెళ్ళారు. అక్కడ కంపెనీ లో సాఫ్టువేర్‌ ఇంజనీర్లు. ఆరంకెల జీతం.


ఉ।। ఎనిమిది గంటలకు ఆఫీస్‌ కు వెళితే రాత్రి ఎనిమిది గం।। ల కన్నా ముందు రావడం వీలు కాదు.మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక గంట విరామం. టీ, కాఫీ, టిఫిన్‌ లకోసం ప్రక్కన కాంటీన్‌ వసతి ఉంది. ఏదీ ఏమైనా వీరి జీవితం బంగారుపంజరం లో బంధించిన చిలుకబ్రతుకై పోయింది.


అక్కడి పద్దతులూ, వ్యవహారాలూ అన్నీ చిత్రవిచిత్రంగా ఉంటాయి.మన ఇండియాలాగా అక్కడ అస్సలు కుదరదూ. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఒక టైమంటూలేకుండా వ్యవహారశైలి నడిచిపోతోంది.జీవితం ఒక యంత్రం లా తయారయ్యింది. లేచామా ఆఫీసుకు వెళ్ళామా తిన్నామా పన్నామా కాన్సెప్టు అయిపోయంది.


మార్కెట్లో వీళ్ళ కంపెనీ మంచి గుడ్‌విల్‌ సంపాదంచి అధిక లాభాలు ఆర్జిస్తోంది. ఎందుకంటే కంపెనీ ప్రాజెక్టు ప్రపోజల్సు లో వీళ్ళవే ఎంపికయ్యేవి.


రాజీ, మహేష్‌ లుమంచి తెలివైన యువజంట.జర్మనీ వచ్చి రెండేళ్ళయిపోయింది. ఇండియాకు వెళదామన్నా ఉద్యోగరీత్యా వీలుకాలేదు. రాజీ ప్రస్తుతము గర్భవతి. ఏడో నెల.సెలవు మీద హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు. టికెట్సు బుక్‌ చేసుకుని జర్మనీ నుండి హైదరాబాద్‍ బయలుదేరారు.


రాజీ! “ఏమండీ, ఇంటికి వెళ్ళాక డెలివరీ అయిన మూడు నెలలలోనే ఇండియా నుండి బయలు దేరీ జర్మనీ వచ్చేదామండీ. ఇండియాలో ఖర్చులే కాని సంపాదన ఎక్కడిదండీ!”


మహేష్‌! “రాజీ, ఏంటి ఇదంతా. ఊరుకో. మనమింకా విమానం కూడా దిగలేదు.నీ డెలివరీ టైమ్‌ ఇంకా రెండునెలలుంది. ఇప్పటి నుంచే తిరిగిరావడం గురించి ఆలోచిస్తున్నావు.


రాజీ! “ఉదయం ఆఫీసు కెళ్ళి రాత్రి రావాలి.! ఇవి బానిసబ్రతుకులే! ఇంత చదువుకుని ఏం లాభాం. ఇండియా లో వుంటే సాధ్యమయ్యేవా. ఇక్కడికి రావడం వల్లనే కదండీ , మనం ఇంతస్థాయికి ఎదిగాం. కారు కొనుక్కున్నాం. సొంత బంగళా కొనుక్కున్నాం. జర్మనీ కి రాబట్టే కదా ఇవన్నీ వచ్చాయి.

రేపు మనకు పుట్టబోయే పిల్లలు ఉన్నతస్థాయిలో పెరగాలంటే ఆస్తులు, అంతస్తులూ కావాలి. అందరిలోనూ దర్జాగా కనబడాలి. ఇటువంటి విషయాలు మీరు ఎందుకు ఆలోచించరు?మనం చుట్టపు చూపుగా ఇండియాకు వెళ్ళాలే కానీ ,మన సెటిల్మెంట్‌ మాత్రం ఇక్కడే”


మహేష్‌! “రాజీ, అది కాదు.”


రాజీ! “ఏది కాదండీ.”


మహేష్‌! “కూల్‌డౌన్. రాజీ, కూల్‌డౌన్‌.ఈ స్థితిలో నీవు అంతగా ఆలోచించకూడదు. డాక్టరు గారు చెకప్‌ కెళ్ళినప్పుడు చెప్పారు కదా!”


రాజీ! “పుట్టబోయే మన బిడ్డకు మన దేశ సంస్కృతే నేర్పుతాను. కాని డబ్బు సంపాదించాలి. అందుకే మనం ఇక్కడే జర్మనీలోనే ఉందాం.”


విమానం హైదరాబాద్‍ విమానాశ్రయం చేరుకుంది. విమానం దిగి ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుని బషీర్‌బాగ్‌లో నున్న ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌ గైనకోలాజిస్టు కు చూపించి టెస్టులు చేయించుకోవడానికి టాక్సీలో వెళ్ళి రాజీని హోటల్‌ వెయిటింగ్‌ హాల్లో కూర్చోబెట్టి రూమ్‌తీసుకుందుకు కాష్‌కౌంటర్‌ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టడానికి వెళ్ళాడు మహేష్‌.


తెల్లనిబట్టలు , ఖద్దరువి వేసుకుని వున్నారు. జుట్టుకూడా ముగ్గుబుట్టలా తెల్లగా ఉంది. రాజీ ప్రక్కసీటులోనే కూర్చొని ఉన్నారు. బహుషా ఆయన వయస్సు డెబ్బై సం।।లు పైనే ఉంటాయి. మాట మాట కలిసి ఆ పెద్దాయన “నీ పేరేమిటమ్మా? ఏంటీ ఏమన్నా ప్రాబ్లమా?”


రాజీ! “లేదంకుల్‌. చెకప్‌ కొచ్చాం. నా పేరు రాజీ.”


“చాలా మంచి పేరు రాజీ! నేను నల్లగొండ జిల్లా ఆలేరులో జిల్లాపరిషత్ స్కూల్లో లెక్కలు, సైన్సు బోధించేవాడిని. ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆ రెండు సబ్జెక్ట్స్ నేనే బోధించే వాడిని. అప్పట్లో పదవతరగతిలో రాజీ అనే అమ్మాయి ఉండేది. ఆ పేరు జ్ఞాపకం వచ్చింది.చురుకైన పిల్ల. ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్పేది. ఆ అమ్మాయి స్కూలు చదువంతా మా స్కూల్లోనే.”


రాజీ!” సార్‌, మీరు రాఘవయ్య మాస్టారా?”


“అవునమ్మ! నీ కెలా తెలుసు!”


రాజీ! “ఇందాకటి నుంచి చెబుతున్న అమ్మాయిని నేనే సార్‌, నా పేరే రాజీ.”


“ఒకరినొకరం గుర్తుపట్టలేని పరిస్థితి.దాదాపు ఇరవై ఏళ్ళయిపోయింది. ప్రస్తుతం ఏం

చేస్తున్నావమ్మా?”


రాజీ! “నేను మా ఆయన ఎంటెక్‌ చేశాము. ఇద్దరమూ సాఫ్టువేర్‌ ఇంజనీర్లము.జర్మనీ లో ఉంటున్నాము. మంచి జీతాలిస్తున్నారని అక్కడే ఉంటున్నాము. నేను డెలివరీ కోసమని ఇద్దరమూ కలిసి వచ్చాము. ఊళ్ళో ఆసుపత్రులు బాగుండవు కదా.అందుకే ఇక్కడ చెకప్‌లు చేయించుకుని వెళుతున్నాను.”


రాఘవయ్య! “సరేనమ్మా. చాలా మంచిది.”


“నీవు బాగా చదువుకున్న అమ్మాయివి. అయినా ఒక్కమాట చెప్పాలని ఉంది. చెప్పాలా ఏమనుకోవు గదమ్మా”


రాజీ! “చెప్పండి మాస్టారు!”

రాఘవయ్య! “ఇక్కడే అంత గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఇక్కడెందుకు ఉపాది చూసుకోలేరు?”


రాజీ! “ఇక్కడ అవకాశాలు లేవు మాస్టారు! అవకాశాలున్నా ఉద్యోగానికి దరఖాస్తు చేసి అర్హత సాధించినా ఇంటర్వ్యూలు అంటారు. ఇంటర్వ్యూలో లంచాలు ఇస్తేనే మనకు కంచాలు చూపిస్తారు. మనదేశం లో వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఏ చిన్న పని జరగాలన్నా లంచం లేందే పని జరగదు. బంట్రోత్‌ నుంచి బడా ఆఫీసర్‌ వరకు ఇంతే. అయినా ఓ సారి బిటెక్‌ అయిన వెంటనే ప్రయత్నించా. అన్ని పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలో కూడా సెలెక్టు అయ్యా. అయినా రాలేదు. నిరాశే మిగిలింది. ప్రతిభ ఉన్నా " ఇండియా లో వేస్టు-- ఫారిన్‌ లో బెస్ట్‌.”


రాఘవయ్య! “నీవు అన్నీ తెలిసీ కూడా అలా అంటే ఎలాగమ్మా! ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. ప్రయత్నిస్తే ఎన్నో వశమైతాయి.నీవు పుట్టి పెరిగి విజ్ఞానం సంపాదించింది ఇక్కడే కదమ్మా. తల్లిదండ్రులు పిల్లలని పెంచి పెద్ద చేస్తారు. ఎందుకమ్మా ఎదిగాక చెట్టులా తోడుంటారని.పేరుప్రతిష్టలు నిలుపుతారని. జీతం ఎక్కువ ఇస్తున్నారని ఎక్కువ పనిచేస్తున్నారు”.

" మీకు జీవితానిచ్చిన కన్నఊరిని, కన్న తల్లిదండ్రులను అనాధలుగా వదిలేస్తారా?"

“ఇక్కడి విధ్యావంతులు వివిధనైపుణ్యాలతో ఎన్నో కనుగొనవచ్చు. యువత దేశానికి పట్టుగొమ్మలు" “ప్రపంచంలో ఎవరికీ లేని సంపద మనకు ఉంది. అదే యువశక్తి. ఆ యువశక్తి పెట్టని కోట. ఈ యువశక్తితో ఎన్నైనా సాధించవచ్చు. మన ప్రధానమంత్రి గారు కూడా మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ఈ విషయాలే చెబుతూంటారు".


“ప్రపంచంలో మనదేశం మకుటాయమాన మవ్వగలదు. అందుకు మార్పులు తీసుకురావలసింది మీలాంటి యువతే కదమ్మా! చదువుకున్నవాళ్ళంతా బానిస బ్రతుకు బ్రతకటానికి విదేశాలకు వెళుతే మీ విజ్ఞానం ఈ దేశానికి అడవిగాసిన వెన్నెలే. నిష్ప్రయోజనమే కదమ్మా!”


“మీరు మీ పరిజ్ఞానంతో స్వయంఉపాది స్కీంలు తెరిస్తే మన ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. మన దేశంలో యువశక్తి కి కొదవలేదు. మీరు పదిమందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడుతూ , దోహదపడుతూ....యజమానిలా బ్రతకగలరు."


“ఇంతమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్న దేశంలో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి?ఎందుకు?ఇంక వలసలు। ఉపాది కోసం పల్లెలనుంచి పట్టణాలకు, అక్కడ నుంచి విదేశాలకు.

అక్కడ కూడా ఒత్తిడి పెరుగుతోంది. మరో ప్రక్క గ్రామాలు మరింత పేదవి అవుతున్నాయి.”


"మ్యాజిక్‌ మన మనసులో ఉంది".


“ప్రతిష్టాత్మక సంస్థలో పెద్ద పెద్ద డిగ్రీలు చదవినందువల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమి లేదు. మ్యాజిక్‌ యూనివర్సిటీలలో లేదు. మన మనస్సులో ఉంది. దానిని ఉపయోగించుకోవాలి. జపాన్‌ వాళ్ళనే చూడండి. 1905 వరకు కనీసం సైకిల్‌ కూడా తయారు చేసుకోని వాళ్ళు నేడు ఈ స్థితికి రావటానికి కారణం- వారి లోని పట్టుదలే. ఒకప్పుడు డ్రాయింగ్ర కు వాడే పెన్సిల్స్‌ కూడా జర్మనీ నుంచి తెప్పించుకునేవాళ్ళము. జపాన్‌ లో అయితే విదేశాలవి వాడడానికి సిగ్గుపడతారు. ఎంత కష్టమైనా ప్రయత్నించి సొంతంగా తయారు చేసుకుంటారు. మీరైనా ఆ దిశగా ఆలోచించండి. జపాన్‌ వారి పట్టుదల మనం అలవరచుకోవాలీ." మేకిన్‌ ఇండియా అంటే ఎక్కడి నుంచో విడిబాగాలు తెచ్చి ఇక్కడ అసెంబుల్‌ చేయడము కాదు. మనమే పరిశోధించి అవసరమైన వస్తువులను అభివృద్ధి చేసుకోవడం".


" ఒక సిఈవో పల్లేటూరువాసం"

వ్యవసాయం అనగానే పల్లెటూరు గుర్తొస్తుంది.

అలాగే సాఫ్ట్‌వేర్‌ అనగానే ఎవరికైనా మెట్రోనగరాలు గుర్తొస్తాయి.

ఆ ప్రతీకల్ని తిరగరాశారు షణ్ముగం.

దక్షిణ తమిళనాడు లోని పశ్చిమ కనుమల మధ్య చెన్నైకి 650 కి.మీ. దూరంలో ఉన్న ఊరు తెన్కాశి. కుట్రాలం జలపాతానికి పేరొందిన ప్రాంతం అది. దానికి సమీపంలో ఉంది మత్తలంపారై అనే చిన్న గ్రామం. పచ్చని పొలాలతో ప్రశాంతంగా

ఉంటుంది.

దాదాపు పదేళ్ళ క్రితం ఓ భవనాన్ని తీసుకుని సాఫ్ట్‌వేర్‌ కార్యాలయం పెట్టారు షణ్ముగం. ఇప్పుడక్కడ కొన్ని వందలమంది పని చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆఫీసు పనిని పర్యవేక్షించడానికీ, టీమ్ తో టచ్‌లో ఉండడానికి వీలు కల్పించే

మరియు వ్యాపారాలకు ఉపయేగపడే కస్టమర్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటివి ఎన్నో పురుడు పోసుకున్నాయి.మారుమూల పల్లెటూల్లలో కూడా ఆఫీసులు తెరుస్తున్నారు.

" జీన్స్‌ వేసుకుని సైకిల్‌ తొక్కుతూ తిరిగే ఆయన ఆ ఊరివాళ్ళకు తమ తోటి రైతు

గానే పరిచయం. వాళ్ళలాగే పొలం వెళతారు.వరికి నీరు పెట్టి పొలంలో పండిన కూరలు కోసుకుని ఇంటికి వెళతారు. గత ఏడారి ఇదే టైములో ఆయన సూటూ, బూటూ వేసుకునిఅమెరికా లోని సిలికాన్‌ వ్యాలీ లో ఆఫీసుకు వెళ్ళేవారు. సాఫ్ట్‌వేర్‌

సంస్థ సీఈఓ గా మీటింగులు వ్యాపారలావాదేవీలతో బిజీ గా ఉండేవారు. ఇప్పటికీ

ఆయన సీఈఓ నే. మారిందల్లా నివాసమే. పల్లెవాసం. ఆయన జీవనశైలీ, సంస్థను

నిర్వహిస్తున్న తీరూ ప్రత్యేకమే.

పగలు.......రైతు.

సిలికాన్‌ వ్యాలీ నుంచి వచ్చి పల్లెలో ఉంటున్న షణ్ముగం రోజూ దినచర్య ఏంటంటే - తెల్లారగట్ట నాలుగింటికే మొదలవుతుంది . లేవగానే యూఎస్‌లోని ఆఫీసువాళ్ళతో ఫోన్‌లో మాట్లాడి బిజినెస్‌ విషయ్లు తెలుసుకుంటారు.ఆరింటికి కాస్త బయటతిర

గడము. ఒకసారి ఊరిబావిలో ఈత. తిరిగి వచ్చాక టిఫిన్‌ తిని ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు

పనులు. ఆ తరవాత పొలం పనులు. ముఖ్యమైన పంట వరి.టొమాటో, వంకాయ,

బెండకాయ లాంటి కూరగాయలూ మామిడి, కొబ్బరి తోటల పెంపకం చూసుకుంటూ

ఉంటాడు.

మరొకరితో పోలిక లేకుండా ప్రశాంతంగా ఉంటుంది జీవితం.అదే నగరంలో ఉంటే

పక్కింటివాళ్ళు కొత్త కారు కొన్నారనో, కొలీగ్‌యూరప్ టూర్‌కు వెళ్ళొచ్చాడనో పనికిరాని

చర్చలతో సమయం వృధా అయిపోతుంది.

అదీ గాకుండా అక్కడి ప్రభుత్వపాఠశాలలో విధ్యార్థులకు గణితం, ఇంగ్లీష్‌ క్లాసులు

కూడా తీసుకుంటాడు.సాయంత్రం మళ్ళీ వాహ్యాళి.ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్‌ మీదే.

దూరం అయితేనే ఆటోనో, బస్సు ఎక్కుతాడు.

ఇక్కడ ఉండడం వల్ల ఒక్క సాఫ్ట్‌వేర్‌ విషయమే కాక రైతుల, స్థానిక సమస్యల మీద

ఆలోచించే సదవకాశము కూడా కలిగింది.

---------------

మన ఇరుగుపొరుగు వాళ్ళు మంచి వాళ్ళుకాదని మనం ఇల్లు ఖాలీ చేసి వెళ్ళి

పోతామా!ఎంతటి మూర్ఖు లైనై మనం మంచిగా వుంటే ఈరోజు కాకపోతే ఇంకో

రోజైనా వాళ్ళ ప్రవర్తన లో మార్పు వస్తుంది కదా!

చదువుకున్న యువతంతా విదేశమంటే , స్వదేశం సంగతేమిటి? మనమెప్పుడు బాగుపడేది. దేశం కాని దేశం వెళ్ళి ఒకరి వద్ద బానిసలాగా బ్రతుకుతూ ఉద్యోగం

చేసేకన్నా , యజమానిలా ధృడసంకల్పముతో ఇక్కడే మన ప్రాంతంలో నైపుణ్యంతో

ఎంతో బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది.

సరేనమ్మా! రాజీ! మందులచీటీ మెడికల్‌షాప్‌ లో ఇచ్చి ఓ గంట కావస్తోంది.చీటి

లో రెండు మందులు బయట నుండి తెప్పించాలన్నారు. అందుకే నేను ఇలా వచ్చి కూర్చున్నాను.బహుషా తీసుకువచ్చుంటారు. మళ్ళీ కలుద్దామమ్మా!

రాజీ! ఇప్పుడు మా ఆయన కూడా వస్తారు. టీ, కాఫీ లేకపోతే పాలు ,ఏమి తీసుకుం

టారో చెప్పండి. తీసుకువస్తారు.

రాఘవయ్య! లేదమ్మా, నేను ప్రొద్దునే ఒక గ్లాసు పాలు తీసుకుంటాను. మొదటి

నుండీ అంతే. మధ్యలో ఏమీ తీసుకోనమ్మా! అంతలో మహేశ్‌ కూడా వచ్చాడు.

అతను కూడా గౌరవము, మర్యాదమన్ననలతో పలకరించి , వద్దన్నకూడా పళ్ళ

రసం తీసుకువచ్చి త్రాగించి మాస్టారును సాగనంపారు.

------------

రిపోర్ట్సు రావడానికి టైమ్‌ పడుతుందని ఇద్దరూ హోటల్‌ కారిడార్లో కూర్చున్నారు.

కొంత దూరంలో ఇద్దరు ముసలివాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు.

" ఇద్దరు కొడుకుల్ని కని పెంచి కష్టపడి పెద్దచేసి ఇష్టమైన చదువులు చదివిస్తే ఏం

లాభం! చూడు . ఓ కొడుకు సింగపూర్‌ వాయే. ఇంకో కొడుకు సౌదీ పోయే. మన

మేమో చేతనై చేతగాక దిక్కులేని పక్షుల్లా , అనాథల్లా ఇక్కడ ఏడ్వ వడ్తిమి!గొడ్డొల్ల

మైన ఏ ఆలోచనలు రాపోవు! వెనకాముందు చూసుకునేందుకు ఈ చచ్చే వయసు

లో దిక్కెవ్వరూ?రెక్కలొచ్చిన పిట్టలు లేసిపోయినట్టు కొడుకులు విదేశాల్లో మకామాయే

రోజురోజుకు చేతనైతలేదు! నేను సెప్పిన , ఇన్నవా! చదివినకాడికన్నా ఇనకపాయే.

కొడుకులు సదవాలని సదివిస్తివి. ఇప్పుడు ఏడున్నరు నీ కొడుకులు.సూడు కూసుంటే

లేవత్తలేపాయె! లేత్తే కూసోవత్తలేపాయె! రేపు మనం సస్తే అట్లచ్చి ఇట్లపోతరు.

" గంతేనయ్యా, ముసలమ్మ ఎగతడ్తూ కండ్లనిండ కన్నీళ్ళే!

-------------

అక్కడ హాల్లో టీవి ఆన్‌ చేశారు.. దూరదర్శన్‌ సాహితీచర్చ జరుగుతోంది.అందులో

ఓ సాహితీవేత్త మాటలు.

" కనిపెంచిన అమ్మానాన్నల్ని కన్నపిల్లల్లా చూసుకుంటున్నారా!వ్యాపారమే జీవితంగ

మార్చుకుంటూ మానవత్వాన్ని మంట గలుపుతున్నారు.యువత పెడదారులు పడు

తోంది.పిల్లలకు మంచి లక్షణాలు నేర్పే బాధ్యత ఎవరిదీ?

'డబ్బు, డబ్బు ఓ గబ్బు - అదే పెద్ద జబ్బు.'

ఉరుకులు పరుగులు - ఆలోచించుకోండి! అంతా యంత్రాల్లా మారిపోతున్నారు.

'సమాజానికి మేలుచేసే చెట్టులా, గుట్టలా, నదిలా జీవించండి'".

------

ఇంతలో మహేష్‌ రిపోర్ట్‌లు తీసుకుని రాజీ దగ్గరకు వచ్చి" డాక్టర్‌ గారు రిపోర్ట్‌లు

చూసి అంతా నార్మల్‌ అన్నారు" సరే వెళదా మంటూ టాక్సీ మాట్లాడుకుని ఊరికి

పయనమయ్యారు.

రాఘవయ్యమాస్టారు చెప్పిన మాటలు- సుదీర్ఘమైన చర్చ, ముసలివాళ్ళ మాటలు,

దూరదర్శన్‌లో సాహితీవేత్త సంభాషణ మనసులో తిరుగుతూ రాజీని కదిలించాయి

" ఇన్నాళ్ళు ఎకనామిక్స్‌ పాఠలే అమలుచేశాను. ఇకపైన ఎథిక్స్‌ పాఠాలు అమలు

చేయాలీ". రేపు పుట్టబోయే నా బిడ్డకు ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, ఇక్కడి ఆచార

వ్యవహారాలు లాలిస్తూ....... ఆడిస్తూ నేర్పాలి. యజమానిలా రాజీ ఇక్కడే బ్రతకా

లనుకుంది.

-------------------------శుభంభూయాత్‌---------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



257 views1 comment
bottom of page