top of page
Original.png

అమాయకపు దొంగల నిజాయితీ


సుబ్బారావు దంపతుల ఇంటి గుమ్మానికి దొంగలు తిరిగిచ్చిన బంగారం, నగదు ఉన్న గుడ్డ మూటను చూసి ఆశ్చర్యంగా నవ్వుతున్న వృద్ధ దంపతులు

Amayakapu Dongala Nijayithee- Telugu Inspirational Story | Vasundhara Rani Munipalle

అమాయకపు దొంగల నిజాయితీ తెలుగు ప్రేరణాత్మక కథ | వసుంధర రాణి మునిపల్లె 

Published in manatelugukathalu.com on 12/08/2026


“అమాయకపు దొంగల నిజాయితీ” కథ ఒక విచిత్రమైన దొంగతనం చుట్టూ తిరుగుతుంది. పచ్చని పంట పొలాలతో కళకళలాడే రామవరం గ్రామంలో సుబ్బారావు దంపతులు పెళ్లికి వెళ్లిన సమయంలో వారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు రెండ్రోజులకే మళ్లీ ఆ సొమ్ములో ఎక్కువ భాగాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అంతేకాదు, తాము ఖర్చు చేసిన రూ.4 వేలకూ బిర్యాని, పెట్రోల్, మందులు, దేవుడి హుండీ అంటూ పక్కాగా లెక్క రాసిన లేఖను వదిలి వెళ్తారు. దొంగతనంలోనూ కనిపించిన ఈ విచిత్రమైన నిజాయితీ ఈ కథను సరదాగా, ఆసక్తికరంగా నిలబెడుతుంది.


పచ్చని పంట పొలాలతో, కొబ్బరి చెట్లతో కళకళలాడే రామవరం గ్రామం. ఆ ఊళ్లో ఎవరికీ కీడు తలపెట్టని ప్రశాంత జీవి సుబ్బారావు. ఆయన భార్య సీతమ్మతో కలిసి ఎంతో అన్యోన్యంగా కాలం గడుపుతుండేవాడు.


ఒకరోజు ఊళ్లో ఉండే ఒక పెళ్లికి వెళ్లాల్సి రావడంతో... "రెండు రోజుల్లో వచ్చేస్తాంలే" అనుకుంటూ సుబ్బారావు కుటుంబం తమ ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి బయలుదేరింది.


ఇదే అదనుగా భావించిన స్థానిక ప్రొఫెషనల్ దొంగల గ్యాంగ్ ప్లాన్ వేసింది. చీకటి పడ్డాక సుబ్బారావు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో భద్రంగా దాచుకున్న రూ. 3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే అక్కడే ఉన్న రూ. 25 వేల నగదు వాళ్ల కంటపడటంతో వాటిని సర్దుకుని ఉడాయించారు.


మరుసటి రోజు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బారావు దంపతులు... తలుపు తాళాలు పగిలి ఉండటం, బీరువా బద్దలై అందులోని బంగారం, నగదు మాయమవడంతో లబోదిబోమన్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, ఎస్సై గారు తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఊళ్లో ఎక్కడ ఎవరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారో ఆరా తీయడం ప్రారంభించారు.

కథ ఇక్కడే అసలు ఊహించని మలుపు తిరిగింది. పోలీసులు చుట్టుపక్కల గాలిస్తుండగా... సరిగ్గా రెండ్రోజుల తర్వాత...


ఆదివారం వేకువజామున సుబ్బారావు నిద్రలేచి తలుపు తీసేసరికి, ఇంటి గుమ్మానికి ఒక గుడ్డ మూట వేలాడుతోంది!

అనుమానంగా, కొంచెం భయంగా దాన్ని విప్పి చూసిన సుబ్బారావు గుండె కుదుటపడినట్లయింది.


పోయిన బంగారమంతా, బీరువాలోని నగదులో సింహభాగం అందులోనే భద్రంగా ఉంది!

దానితో పాటు ఒక మురికి పట్టిన తెల్ల కాగితం, దాని మీద ఎడమ చేతితో రాసినట్టున్న వంకరటింకర అక్షరాలు ఉన్నాయి. అందులో ఇలా ఉంది: "అయ్యా సుబ్బారావుగారూ, మేము చేసింది మహా పాపం. మీ బంగారం, బీరువాలో ఉన్న డబ్బు మాకెందుకని తిరిగిచ్చేస్తున్నాం. కాకపోతే మీ సొమ్ములో నుంచి నాలుగు వేలు ఇలా ఖర్చయిపోయాయి బాసూ:"


1. రాత్రి ఆకలికి తట్టుకోలేక బిర్యాని, చికెన్ పార్శిల్: రూ. 1, 500


2. పోలీసుల కళ్లగన్ను తప్పించుకుని తిరగడానికి బండి పెట్రోల్: రూ. 1, 000


3. మా గ్యాంగ్‌లో ఒకడికి తలనొప్పి వస్తే వేసుకున్న మందులు, టీలు: రూ. 500


4. ఈ పాపం పోవాలని దేవుడి హుండీలో వేసిన కానుక: రూ. 1, 000


మొత్తం ఖర్చు: రూ. 4, 000


ఈ లెక్కలు పోను మిగతా డబ్బు, బంగారం అంతా ఇగో ఇలా భద్రంగా ఇస్తున్నాం బాసూ. ఆ నాలుగు వేలు మాత్రం ఇప్పుడు వెనక్కి ఇవ్వలేం, సోరీ!"


ఆ లేఖ చదివిన సుబ్బారావుకు ఒకవైపు నవాలో, మరోవైపు ఏడవాలో అసలు అర్థం కాలేదు. గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లిన సుబ్బారావు... "సీతమ్మా! ఇక్కడ చూడూ... మన బీరువాలో బంగారమే కాదోయ్, నగదు కూడా అలాగే ఉంది! కానీ ఆ దొంగగాళ్ళు రాసిన లెక్కలు చూశావా? బిర్యాని నుంచి దేవుడి హుండీ దాకా ప్రతి దానికి పక్కాగా హిసాబ్ రాసి మరీ మన సొమ్ములో నాలుగు వేలు కొట్టేసి, మిగతా డబ్బూ, బంగారమూ మళ్లీ మన గుమ్మానికే తగిలించి వెళ్లారు!" అంటూ ఆ లెటర్ ఆమె చేతిలో పెట్టాడు.


అది చూసి సీతమ్మ కళ్లలో ఆనందభాష్పాలు ఉప్పొంగాయి. వెంటనే ఆ లేఖను అందుకుని గట్టిగా చదివింది. ఆ దొంగలు రాసిన అమాయకపు లెక్కలను చూసి ఆమెకు నవ్వు ఆపుకోలేకపోయింది.

"అయ్యో దేవుడా! నిజంగా వీళ్లని ఏమనాలి? దొంగతనం చేసినా, పోనీలే అని ఆ నాలుగు వేలకి కూడా బిర్యాని, పెట్రోల్, హుండీ అంటూ పక్కాగా ఆడిట్ రిపోర్ట్ రాశారు చూశావా! ఆ మాత్రం దానికి ఆ దొంగలు ఎంత తెగించి మనకు లెక్క చెప్పి మరీ లెటర్ రాశారో కదా! అసలు ఆ దొంగల గుండెల్లో నిజాయితీ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు" అంది నవ్వుతూనే కంటతడి పెట్టుకుంటూ.


సుబ్బారావు నవ్వుకుంటూనే తల పట్టుకున్నాడు. "నిజమే.. అసలు ఆకలికి తట్టుకోలేక ఈ తప్పు చేసినా, ఆ తర్వాత మనసు మార్చుకుని దేవుడి హుండీ లెక్కలతో సహా అన్నీ లెక్క చెప్పి మరీ తిరిగిచ్చేసే దొంగలు మనకు తగిలారు!" అనిపించింది.


ఆదివారం ఉదయం ఆ వూళ్లో ఈ వార్త దావానలంలా పాకింది. "అరేయ్! దొంగతనం చేసినా, పోనీలే అని నాలుగు వేలు ఉంచుకుని, దానికి బిర్యాని, పెట్రోల్ అని అచ్చం ఆడిటర్ లాగా లెక్కలు రాసి మరీ మిగతాదంతా వెనక్కి ఇచ్చారట!" అని ఊరంతా ఆశ్చర్యంగా, సరదాగా మాట్లాడుకున్నారు.


పోలీసులు ఎన్ని విధాలుగా గాలించినా ఆ దొంగలు మాత్రం ఎవరికీ చిక్కలేదు. కానీ ఆ ఘటన మాత్రం సుబ్బారావు ఇంట్లో రోజూ నవ్వుకునేలాంటి ఒక మంచి జ్ఞాపకాన్ని, మనుషుల మధ్య ఇంకా మిగిలి ఉన్న మానవత్వాన్ని గుర్తుచేసింది.


"ఆ దొంగలకి ఎక్కడ ఉన్నా మంచి బుద్ధిని ప్రసాదించి, ఏదైనా సక్రమమైన పని చేసుకుని బతికే మంచి దారిని దేవుడే చూపించాలి" అని ఆ దంపతులు మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నారు! 


             ***


వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):





వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page