పల్లె పిలిచింది - 15
- T. V. L. Gayathri
- Jun 5
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ధ్రువకోకిల, #మత్తకోకిల, #కావ్యము

Palle Pilichindi - 15 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 05/06/2025
పల్లె పిలిచింది - 15 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
67.
మత్తకోకిల.
మంచిచెడ్డల మేళవింపుగ మానవుల్ కల పృథ్విలో
పొంచియుండగ భీతిగొల్పెడి మోసపూరిత రక్కసుల్
కంచెలెక్కడ? చేరి దౌష్ట్యము కట్టివేయుచు పూనికన్
వంచనాత్ముల దొల్గ చేసిన భావి వెల్గును శోభగన్.//
తాత్పర్యము.
ఈ ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు.అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అందరూ కలిసే ఉండటంతో ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు మంచివాళ్ళోతెలిసికోవటం ఎలాగా? పైగా వంచకులను వారించటానికి కంచెలు లేవు. అందరూ కలిసి చెడ్డవాళ్ళను ఏరి పారేయాలి. అప్పుడే భావి జీవితం వర్థిల్లుతుంది.//
68.
మత్తకోకిల.
ద్రవ్యరాశిని కూడ బెట్టుచు దైన్యమున్ విడనాడుచున్
సవ్యమైన పురోగతిన్ గను సానుకూలతనొప్పగన్
దివ్యమౌ మన దేశమున్ సరి దిద్దుచున్ దమ మేధతో
నవ్యమౌ పథగామినుల్ గద నైతికవర్తనులీ ధరన్.//
తాత్పర్యము.
దీనత్వము లేకుండా డబ్బు సంపాదిస్తూ, సవ్యమైన రీతిలో కష్టపడుచు, నీతితో మేలుగుచూ,తమ మేధస్సుతో నగరవాసులు దేశ ప్రగతికి పాటుపడుతూ ఉంటారు.//
69.
ధ్రువకోకిల.
ప్రగతి బాటను జూపుచుండును పట్టణంబులు పృథ్విలో
పగలు రేయను భేదమెచ్చట? వాహనంబులు ద్రిమ్మరున్
దిగులు చెందరు లోకులిచ్చట ధీరతన్ జరియింతురా
నగరవాసులు చేరు కుందురు నవ్య మౌపథి మేలుగన్//
తాత్పర్యము.
పట్టణాభివృద్ధి వలన దేశమునకు మేలు కలుగుతుంది. ఇక్కడ పగలు రేయి అని లేకుండా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. లోకులు దిగులు చెందరు. ధైర్యంతో పని చేసుకుంటూ నగరవాసులు ప్రగతి బాటలో పయనిస్తూ ఉంటారు.//
70
తేటగీతి.
శ్రేష్ఠమౌ వైద్యశాలల సేవలిపుడు
పట్టణంబుల లభియించ భయమువీడి
యాయురారోగ్యములతోడ హాయినొంది
ప్రజలు నిత్యము సుఖముగా వరలుచుండ్రి//
తాత్పర్యము.
గొప్పవైన వైద్యసేవలు పట్టణాల్లో లభిస్తూ ఉండటం వలన ఇక్కడి ప్రజలు ఆయురారోగ్యముల తోడ హాయిగా జీవనం సాగిస్తున్నారు.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments