top of page

వీభోవరా - పార్ట్ 12

Updated: 6 days ago

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Veebhovara - Part 12 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 07/08/2025

వీభోవరా - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ. 


అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. ఎం. ఎల్. ఎ భీమారావు తన కుమార్తె సింధుకు ట్యూషన్ చెప్పమని విజయ్ శర్మను కోరుతాడు. ట్యూషన్ ప్రారంభమవుతుంది. స్వామీజీ తిరిగి కనబడి గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో  ఘర్షణ పడతాడు కాశ్యప్. దుర్గారావు వల్ల ప్రమాదాన్ని శంకించి, గంగ, కాశ్యప్ లను వేరే వూరి కాలేజీలో చేరుస్తారు.



ఇక వీభోవరా - పార్ట్ 12 చదవండి.. 


రామశర్మ బంధువుల ఇంటి వివాహానికిగాను జిల్లా నగరానికి వచ్చాడు. అక్కడ వివాహం ముగియగానే సాయంత్రంగా విజయ్, కాశ్యప్‍లను చూచి మాట్లాడాలని మురళీమోహన్ గారి ఇంటికి వచ్చాడు. 


వారి రాకను గమనించిన మురళీమోహన్ రామశర్మను ఇంట్లోకి ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగి వారిని ఆనందపరిచి, మెల్లగా కాలేజీలో జరిగిన విషయాన్ని, గంగను, కాశ్యప్‍ను తాను గుంటూరులో తన అన్న శాంతకుమార్ ప్రిన్సిపాల్‍గా వున్న కాలేజీలో చేర్పించిన విషయాన్ని చెప్పాడు. 


రామశర్మ ఆశ్చర్యపోయాడు. వదనంలో విచారం. 


"రామా! అక్కడ మన కాశ్యప్‍కు ఏ ఇబ్బందీ ఉండదు. అతనికి సంబంధించిన అన్ని విషయాలను మా అన్నయ్య చూచుకొంటాడు. కాశ్యప్ ప్రశాంతంగా చదువుకొంటాడు. వాడిని గురించి నీకు ఎలాంటి భయం అనవసరం" హామీ ఇచ్చాడు మురళీమోహన్. 

"విజయ్ మిద్దె మీద వున్నాడా!.. " అడిగాడు రామశర్మ. 


"ఆ.. వున్నాడు. ఈ సమయంలో కొంతమంది పిల్లలకు ట్యూషన్ చెబుతుంటాడు. అరగంట లోపల వాళ్లంతా వెళ్ళిపోతారు. ఆ.. ఆ పిల్లల్లో భీమారావు కూతురూ ఉంది" చిరునవ్వుతో చెప్పాడు మురళీమోహన్. 


"దుర్గారావుకు ఎలా వుందట?.. " అడిగాడు రామశర్మ. 


"ఆపరేషన్ చేశారట. ఇంకా కనీసం రెండువారాలు హాస్పిటల్లో ఉండాలట. "


"భీమారావు నిన్ను పిలిచి ఏమీ అడగలేదా!.. :"


"ఇంతవరకూ లేదు. ప్రిన్సిపాల్ మహమ్మద్ వారి ఇంటికి వెళ్ళి భీమారావుతో జరిగిన విషయాన్ని చెప్పాడు. ప్రిన్సిపాల్ గారి మాటలను విన్న భీమారావు తప్పు తన కొడుకుదే అని భావించి ఉండవచ్చు. తనకు పవర్ ఉండని గొడవ చేస్తే.. అది తనకే అవమానకరం అవుతుందని అనుకొని వుండవచ్చు. "


మేడమీద నుంచి వరుసగా పిల్లలు క్రిందికి దిగారు. 

మురళీమోహన్ వరండాలోకి వచ్చాడు. 

వీధి వైపుకు వెళుతున్నారు పిల్లలు. 

"రేయ్.. ! రంగా మీ మాస్టారు గారికి నేను పిలుస్తున్నానని చెప్పు" 


రంగడు వెనుతిరిగి వేగంగా మెట్లెక్కి విజయ్‍కు విషయాన్ని చెప్పాడు. విజయ్ ముందు, రంగడు వెనుక మిద్దె దిగారు. 

"విజయ్!.. రా.. ఎవరొచ్చారో చూడు.. "


విజయ్ ఆత్రంగా వరండాలోకి ప్రవేశించి లోనికి తొంగి చూచాడు. సోఫాలో కూర్చొని వున్న రామశర్మను చూచాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కన్నీరు. 

"నాన్నా!.. " మెల్లగా పిలుస్తూ రామశర్మను సమీపించాడు. 


కొడుకు చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు రామశర్మ. విజయ్ రామశర్మ ప్రక్కన తలవంచుకొని కూర్చున్నాడు. 

"విజయ్!.. నేను మీ నాన్నగారికి విషయాన్నంతా చెప్పాను. నీవు భయపడకు బాధపడకు."


విజయ్ మాస్టారు గారు ముఖంలోకి దీనంగా చూచాడు. అతని కళ్ళల్లోని కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి. 

రామశర్మ తన పై పంచతో విజయ్ కన్నీటిని తుడిచాడు. 

"విజయ్!.. బాధపడకు అంతా దైవ నిర్ణయం (క్షణం ఆగి) ఆ.. ఎలా చదువుతున్నావు?.. "


"బాగా చదువుతున్నాను నాన్నా!.. "


"అమ్మ, చెల్లి, తమ్ముడూ బాగున్నారా నాన్నా!.. "


"ఆ.. అందరూ బాగున్నారు" 


రెండు క్షణాల తర్వాత.. 

"విజయ్!.. "


"నాన్నా!.. "


"నాకు కాశ్యప్‌ను చూడాలని వుంది. గుంటూరుకి నీవు నాతో రాగలవా!"


"సార్!.. నేను నాన్నగారితో గుంటూరుకి వెళ్ళి వస్తాను. భోంచేసి బయలుదేరుతాను సార్!.. " వినయంగా అడిగాడు విజయ్. 


 మురళీమోహన్ గారు “అలాగే, వెళ్ళిరండి”.


చేతివాచీ చూచి, "మరోగంటలో బస్సు వుంది. భోంచేసి బయలుదేరండి రామా!.. " అన్నాడు. 


శ్యామల భోజనానికి ఏర్పాట్లు చేసింది. 

కాళ్ళు, చేతులు కడుక్కొని రామశర్మ, మురళీమోహన్, విజయ్, గౌరి భోజనాలకు కూర్చున్నారు. శ్యామల వడ్డించడం ప్రారంభించింది. 

నలుగురూ భోజనం చేశారు. 


పావుగంట కూర్చొని బస్టాండుకు బయలుదేరారు. రామశర్మ, విజయ్, మురళీమోహన్ గారు.. 

వీరు అక్కడికి చేరిన పదినిముషాల్లో బస్సు వచ్చింది. విజయ్, రామశర్మలు బస్సు ఎక్కారు. బస్సు వెంటనే కదిలింది. 

మురళీమోహన్ ఇంటివైపుకు నడిచాడు. 


ఉదయం ఐదున్నర కల్లా బస్సు గుంటూరుకు చేరింది. మురళీమోహన్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇరువురూ ప్రిన్సిపాల్ శాంతకుమార్ గారింటికి చేరారు. 

వారికి నమస్కరించి, తన వివరాలు చెప్పాడు రామశర్మ. 


"ఆఁ.. మోహన్ మీరు వస్తున్నట్లు నాకు ఫోన్‍లో చెప్పాడు. రండి" సాదరంగా వారిని ఆహ్వానించారు శాంతకుమార్‍ గారు. 


హాస్టలుకు ఫోన్ చేసి వార్డెన్‍తో కాశ్యప్‍ను ఇంటికి రమ్మనమని చెప్పారు. 

నిద్రలేచి హాల్లోకి వచ్చిన గంగ విజయ్, రామశర్మలను చూచింది. చిరునవ్వుతో ప్రీతిగా పలుకరించింది. రెస్ట్ రూంను చూపించింది. రామశర్మ, విజయ్‍లు స్నానం చేసి బట్టలు మార్చుకొన్నారు. 


కాశ్యప్ హాస్టలు నుండి వచ్చాడు. తండ్రిని చూచి తప్పు చేసిన వాడిలా తల దించుకొన్నాడు. 


విజయ్, కాశ్యప్‍ను సమీపించి భుజంపై చెయ్యి వేసి మెల్లగా.. "కాశీ!.. భయపడకు. నాన్నకు నీమీద కోపం లేదు" చిరునవ్వుతో చెప్పాడు. 

శాంతకుమార్ గారి భార్య సుభద్ర వేడి కాఫీని నలుగురికీ అందించింది. 


"సార్!.. మావాడు!.. " రామశర్మ పూర్తి చేయకముందే.. 

"సార్!.. కాశ్యప్ చాలామంచి వాడు. గొప్ప తెలివికలవాడు. అదేదో బ్యాడ్ టైం అలా జరిగింది. స్థానచలనం ఆ దైవ నిర్ణయం. అతన్ని నేను జాగ్రత్తగా చూచుకొంటాను. మీరు ఏ విషయానికి బాధపడకండి" అనునయంగా చెప్పాడు శాంతకుమార్. 


గంగ స్నానం చేసి పెద్దమ్మ సుభద్ర అందించిన ఖాళీ కాఫీ గ్లాసును చేత పట్టుకొని వంట ఇంట్లోకి వెళ్ళి వాటిని అక్కడ వుంచి వచ్చి పెదతండ్రి ప్రక్కన సోఫాలో కూర్చుంది. కాశ్యప్ ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ.. 

"గుడ్ మార్నింగ్ సార్!.. " అంది. 


"గుడ్ మార్నింగ్ గంగా!.. "


"మామయ్యగారూ!.. " రామశర్మ ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ అంది. 


గంగ, రామశర్మను అలా పిలవడం అది మొదటిసారి. గంగ ఆ పిలుపుకు రామశర్మ, విజయ్, కాశ్యప్‍లు ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూచారు. 

వారి ఆ చూపులను లెక్కచేయకుండా గంగ.. 

"అత్తయ్యగారు, రుద్రమ, భాస్కర్ శర్మ బాగున్నారా!.. " చిరునవ్వుతో అడిగింది. 


"ఆఁ.. ఆఁ.. అంతా బాగున్నారమ్మా!.. "


"రుద్రమ, భాస్కర్ ఇప్పుడు ఏం చదువుతున్నారు?"


"వారు నీవు గౌరీలా కవలలే కదా!.. ఎనిమిదవ తరగతి" చెప్పాడు రామశర్మ. 


ఖాళీ కప్పులను చేతికి తీసుకొని గంగ.. 

"ఆఁ.. వస్తున్నా పెద్దమ్మా!.. " వంటగది వైపుకు వెళ్ళింది గంగ. 


సుభద్ర చేసిన ఇడ్లీలు, అల్లం (చెట్నీని) పచ్చడి గిన్నెలను డైనింగ్ టేబుల్ మీద గంగ వుంచింది. నాలుగు ప్లేట్లను మంచినీటి గ్లాసులను టేబుల్ పై పెట్టి, హాల్లోకి వచ్చి, అందరినీ టిఫిన్‍కు రమ్మని నవ్వుతూ పిలిచింది గంగ. 


అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. గంగ వడ్డించింది. అందరూ టిఫిన్ చేయసాగారు. 

గంగ కొసరి కొసరి రామశర్మకు, శాంత కుమార్‍ గారికి విజయ్, కాశ్యప్‍లకు వడ్డించింది. 

"రామశర్మ గారు, ఒకమాట.. "


"చెప్పండి సార్!.. "


"ఇది నా మాటే కాదు. మా తమ్ముడూ మురళీమోహన్, మా ఆడవారు అందరి మాట" నవ్వుతూ చెప్పాడు శాంతకుమార్. 

"విషయం ఏమిటో చెప్పండి సార్!.. "


"సార్‍కి బదులుగా మీరు నన్ను బావగారు అని పిలిస్తే నేను సంతోషిస్తాను" నవ్వాడు శాంత కుమార్. 


రామశర్మ ఆశ్చర్యంతో శాంతకుమార్ ముఖంలోకి చూచాడు. వారికి శాంతకుమార్ గారి భావన అర్థం కాలేదు. 

"అన్నయ్యగారు, మీ కాశ్యప్ మా ఇంటి అల్లుడు కావాలని మా అందరి ఆశయం" నవ్వుతూ చెప్పింది సుభద్ర. 


"అంటే మా గంగ మీ ఇంటి కోడలు బావగారు" ఆనందంగా నవ్వాడు శాంతకుమార్. 


ఆ భార్యాభర్తల మాటలు రామశర్మకు ఆనందాన్ని కలిగించాయి. 

"బావగారూ!.. " ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రామశర్మ. 


"ఆఁ.. చెప్పండి మీ మనస్సులోని మాటను!.. "


కాశ్యప్ గంగా ఒకరినొకరు చూచుకొన్నారు. చిరునవ్వులతో తలలు దించుకొన్నారు. 

వారిని చూచిన విజయ్ ముఖంలో నవ్వు.. 

"వాడింకా చదవాలి కదా బావగారూ!.. " తన మనస్సులోని మాటను చెప్పేశాడు రామశర్మ. 


"అవునవును. తప్పకుండా చదవాలి. మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి. బావగారూ!.. నాకు ఒక్క కొడుకు ముకుంద్. డాక్టర్ అమెరికాలో ఎం. ఎస్ చదువుతున్నాడు. వాడు ఎప్పుడు భారత్ వస్తాడో చెప్పలేను. మురళీకి ఇద్దరూ ఆడపిల్లలు. మీకు తెలిసిందే. గంగ అంటే మా దంపతులకు ఎంతో ఇష్టం. తన చిన్నతనంలో మా దగ్గరే ఉండేది. గంగ నా కూతురే!.. కాబట్టి.." శాంతకుమార్ ముగించకముందే.. 


"బావగారూ!.. మీరు ఇక ఏమీ చెప్పనక్కర్లేదు. మీ ఇష్టమే నా ఇష్టం" ఆనందంగా నవ్వాడు రామశర్మ. 


కాశ్యప్ గంగ వదనాల్లో పరమానందం. 


టిఫిన్ తినడం ముగిసింది. మరలా అందరికీ కాఫీ ఇచ్చింది. త్రాగారు. హాల్లోకి వచ్చారు. 

"బావగారూ!.. చాలా డోలాయమానంగా వచ్చాను. మీ మాటలు, నిర్ణయం నాకు మహదానందాన్ని కలిగించాయి. ఇక మేము బయలుదేరుతాము. "


"ఈరోజు వుండి రేపు వెళ్ళవచ్చును కదా బావగారూ!" అడిగాడు శాంతకుమార్. 


"ఇంటి దగ్గర ఇబ్బంది బావగారు. ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికల్లా గ్రామం చేరుకోగలను. వెళ్ళొస్తాను బావగారూ!.. " చేతులు జోడించాడు రామశర్మ. 


"సరే బావగారు మంచిది. "


విజయ్, రామశర్మలు అందరికీ చెప్పి బస్టాండుకు బయలుదేరారు. వారితోటే కాశ్యప్ కూడా వచ్చాడు. 

"కాశీ!.. "


"నాన్నా!.. "


"మురళీలాగే శాంత కుమార్ గారు కూడా చాలా మంచివారు. ఇప్పుడు మేము చేసిన సంభాషణను మరచి బాగా చదువు. ఉన్నత స్థితికి రా. నీ వివాహం గంగతోనే జరిపిస్తాను. విజయ్ వివాహానంతరం సరేనా!" అనునయంగా చెప్పాడు రామశర్మ. 


"అలాగే నాన్నా!.. "


"కాశీ!.. " పిలిచాడు విజయ్. “స్వామీజీ వాక్యం ఫలించిందిరా!"


"అవును అన్నయ్యా!.. "


"ఎవరు స్వామీజీ!.. ఏమిటి వారి వాక్యం!.. " అడిగాడు రామశర్మ. 


విజయ్ విజయవాడ యాత్రను గుర్తుచేసి, అక్కడ వారిని కలిసి ఆ స్వామీజీ, వారికి శ్రీశైలంలో దర్శనమిచ్చినట్లు, కాశ్యప్‍కు స్థానచలనం వున్నట్లు, వారు చెప్పిన మాటలను విజయ్ రామశర్మకు వివరంగా చెప్పాడు. 


బస్సు వచ్చింది. విజయ్, రామశర్మలు బస్సును సమీపించారు. కాశ్యప్ విజయ్‍ని సమీపించాడు. 


"అన్నా!.. నీవు ప్రక్కన లేనిది నాకు ఎంతో వెలితిగా దిగులుగా వుంది. నీకు ఎలా వుంది?"


"కాశీ!.. నా పరిస్థితి అంతే. కానీ మన వర్తమాన పరిస్థితులను మనం మార్చలేము కదా!..

జాగ్రత్త. శ్రద్ధగా చదువు IPS లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకో సరేనా!.. "


"అలాగే అన్నయ్యా!.. "


"కాశీ!.. "


"నాన్నా!.. "


"ఏ విషయంలోనూ, ఎవరితోనూ ఆవేశపడకు. శాంతం, సహనం సదా శ్రీరామ రక్ష. నీకేదైనా సమస్య వస్తే దైవానికి చెప్పుకో. ఆ సర్వాంతర్యామి నీ సమస్యని నీకు అనుకూలంగా పరిష్కరిస్తారు. "


"సరే నాన్నా!.. "


విజయ్, రామశర్మలు బస్సు ఎక్కారు. బస్సు కదిలింది. 

కాశ్యప్ హాస్టల్ వైపుకు నడిచాడు. 



=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page