top of page

తొలి పాఠం


'Tholi Patam' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

సరిగ్గా 50 ఏళ్ళ క్రితం నాటి సంగతి. కృష్ణారావు మరిచిపోలేని సంఘటన. కృష్ణారావుకు చదువు పూర్తయిపోయినతర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది. అదీ బెంగుళూరులో నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో. కృష్ణారావు అంతవరకూ జిల్లా దాటి వెళ్ళలేదు.అలాంటిది ఇప్పుడు రాష్ట్రం దాటి పై రాష్ట్రంలో ఇంటర్వ్యూ. మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు కృష్ణారావు. వెళ్తేనే కదా అనుభవం వచ్చేది. అందుకని బయలుదేరేడు. ఆ రోజుల్లో బెంగుళూరుకు డైరెక్ట్ ట్రైన్ లేదు. మద్రాసు (అప్పట్లో) వెళ్లి అక్కడనుండి వేరే ట్రైన్ లో వెళ్ళాలి. దగ్గర్లో ఉన్న స్టేషన్ అనకాపల్లిలో మద్రాసుకు ట్రైన్ ఎక్కేడు కృష్ణారావు.ఎప్పుడూ బస్సుల్లో ప్రయాణాలేకాని ట్రైన్ ఎక్కింది లేదు కృష్ణారావు అంతవరకూ. అంచేత అంత దూరం ట్రైన్ ప్రయాణం క్రొత్తగా ఉంది కృష్ణారావుకు. ఎలాగయితేనేం మద్రాసు స్టేషన్ చేరేడు. బెంగుళూరు ట్రైన్ కోసం ప్లాట్ ఫార్మ్ లో బెంచీమీద నిరీక్షిస్తున్నాడు. ఇంతలో ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ప్రక్కన కూర్చున్నాడు. కృష్ణారావుకు కొంచెం బెరుకుగా అనిపించింది. తను తెలుగువాడని తెలుసుకున్న తర్వాత ఆ కానిస్టేబుల్ కృష్ణారావును అన్ని వివరాలూ అడిగి రకరకాల మోసాలు జరుగుతుంటాయనీ,దొంగలుంటారనీ జాగ్రత్తలు చెప్తూ సలహాలూ,సూచనలూ ఇచ్చేడు కృష్ణారావుకు.

ఇంతలో ట్రైన్ రావడంతో కృష్ణారావు ఆ కానిస్టేబుల్ కు థాంక్స్ చెప్పి ట్రైన్ ఎక్కేసేడు.తన సీట్ చూసుకుని కూర్చున్నాడు. తనకు ఎదురుగా ఉన్న సీట్లో ఓ మధ్యవయసులో ఉన్న వ్యక్తిని చూసేడు కృష్ణారావు.టక్ చేసుకుని ఉన్న అతనిని చూస్తే చదువుకున్నవాడిలా కనిపిస్తున్నాడు. కొంతసేపయినతర్వాత ఆ వ్యక్తి కృష్ణారావును ఆంగ్లంలో పలకరించేడు.కృష్ణారావుకు సదరు వ్యక్తిమీద అనుమానంరాలేదు. అదే అదనుగా ఆంగ్లంలోనే మాట్లాడుతూ తనపేరు తిరువేంగళం అని చెప్పి కృష్ణారావును పరిచయం చేసుకుంటున్నట్లుగా అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నాడు.

“ నేనూ బెంగళూరే వెళ్తున్నాను.మా అన్నయ్య బెంగళూర్ లో పెద్ద డాక్టర్. ఆయనకు నువ్వు ఇంటర్వ్యూ కు వెళ్తున్న ఎన్.ఎ.ఎల్ లో పెద్దపెద్ద ఆఫీసర్లందరూ తెలుసు. నీ గురించి మా అన్నయ్యకు చెప్పేనంటే నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయేలా చేస్తాడు. నిన్ను మా అన్నయ్య ఇంటికి కూడా తీసుకెళ్తాను అనడంతో కృష్ణారావుకు కొండంత ఆశ కలిగింది. ఎక్కడలేని ధైర్యంతో అప్పుడే ఉద్యోగం వచ్చేసినంత ధీమాగా ఫీలయిపోయేడు. అది గ్రహించేడా తి.వేం. (తిరువేంగళం). ఆ రాత్రి ట్రైన్ లో నిశ్చింతగా నిద్రపోయేడు కృష్ణారావు.

* *

బెంగుళూరు స్టేషన్ వచ్చేసింది లెమ్మని చెప్పేడు తి.వేం. కృష్ణారావుకు. కృష్ణారావు బేగ్ తీసుకుని దిగుతుంటే “ఆ బేగ్ ఇలా ఇచ్చి నువ్వు దిగు” అన్నాడా తి.వేం. మళ్ళీ కృష్ణారావు సందేహించకుండా “ నేనేం నీ బేగ్ పట్టుకుపోనులే “అన్నాడు కృష్ణారావుకు తన మీద మరి కొంత నమ్మకం కలిగేలా.

“నాతో రా” అని కృష్ణారావును అవుట్ గేట్ వైపు కాకుండా పట్టాలు దాటించి తీసుకెళ్తుంటే కృష్ణారావుకు అనుమానమొచ్చి“ఇటు తీసుకెళ్తున్నారెంటీ?” అని అడిగేడు.

“ ఇది షార్ట్ కట్. నీకెందుకు నేనున్నానుగా. ముందు నిన్ను మా అన్నయ్యకు పరిచయం చేస్తాననడంతో కృష్ణారావు ఏం మాట్లాడలేకపోయేడు. కొంత దూరం వెళ్ళేక “ పద! టిఫిన్ చేద్దాం “అని ఓ హోటల్ కు తీసుకువెళ్ళేడు తి.వేం. ‘ఇక్కడ సెల్ఫ్ సర్వీస్” అని చెప్తూ అన్నీ తనే తీసుకొచ్చి బిల్ కూడా తనే చెల్లించేసేడు. మరి కొంత దూరం వెళ్ళేక “ నేను మేజోళ్ళు కొనుక్కుని వస్తాను. నువ్విక్కడే ఉండు. ఎక్కడికీ వెళ్ళిపోకు. దొంగలూ, మోసగాళ్ళూ ఉన్నారు జాగ్రత్త. నేనిప్పుడే వచ్చేస్తాను.” అని వెళ్లి 5 ని. లలో వచ్చేసేడు. దాంతో కృష్ణారావుకు ఆ వ్యక్తిపై అనుమానం తీరిపోయింది.

“ ఇదిగో! ఈ హాస్పిటల్ లోనే మా అన్నయ్య పెద్ద డాక్టరు.” అంటూ లోపలికి తీసుకెళ్ళి ‘ఇక్కడ కూచో. మా అన్నయ్యతో మాట్లాడి వచ్చేస్తానంటూ వెళ్ళేడు. కొంతసేపయేక వచ్చి “ మా అన్నయ్య ఆపరేషన్ థియేటర్ లో బిజీగా ఉన్నాడు.నాకు అర్జెంటు గా ఓ పని పడింది. నీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? ఓ 500 ఉంటే ఇయ్యి. మళ్ళీ మా అన్నయ్య నడిగి నీకు తిరిగి ఇచ్చేస్తాను.”అన్నాడు.

“ అదేం లేదండీ! నేను ఇక్కడకు రావడానికి సరిపడేలా మాత్రమే డబ్బులు తెచ్చుకున్నాను.ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయేక నాకు రానూ పోనూ చార్జ్ లు వాళ్ళేఇచ్చేస్తారు. అందుకని. అంచేత నా దగ్గర డబ్బులు ఎంతో లేవు.” అని చెప్పేడు కృష్ణారావు.

కృష్ణారావు జంకుతున్నాడని అనుకొని “ ఎంత ఉంటే అంత ఇయ్యి. నా మీద నీకు నమ్మకం లేకపోతే పూచీగా నా దగ్గర వస్తువేదైనా పెట్టుకుంటావా?” అని అడిగేడు తి.వేం. అంత నమ్మకంగా చెప్తుండేసరికి ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి డబ్బులుంచుకుని మిగతా డబ్బుల్లో 500 ఇచ్చేసేడు కృష్ణారావు. అప్పట్లో 500 రు. అంటే ఇప్పుడు 50,000. అందర్నీ నమ్మేయడం కృష్ణారావు బలహీనత. ఎవర్నీ అనుమానించకపోవడం అతని అవగుణం. అదే అతని కొంప ముంచింది. డబ్బు తీసుకెళ్ళిన పెద్దమనిషి మరి తిరిగి రాలేదు. చూసి చూసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్పి అడిగితే ఆ హాస్పిటల్ లో ఆ పేరు గల డాక్టర్ ఎవరూ లేరన్నారు.

అర్థమైపోయింది కృష్ణారావుకు అసలు సంగతి, తెలివైన దొంగలంటే ఇలా ఉంటారని. ఇక చేసేదేమీలేక ఎలాగో ఇంటర్వ్యూ కు హాజరయ్యేడు కాని మనసు మనసులో లేకపోవడాన్ని ఆ ఇంటర్వ్యూ లో న్యాయం చెయ్యలేకపోయేడు. కాకపోతే వాళ్ళు చెల్లించిన ప్రయాణ ఖర్చుల పైకం వల్ల ఇంటికి తిరుగు ప్రయాణం అవగలిగేడు. ఇదీ కృష్ణారావుకు కలిగిన తొలి అనుభవం. నేర్చుకున్న తొలి పాఠం.

( సమాప్తం )

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం



71 views0 comments
bottom of page