top of page

ఓ మనిషీ మేలుకో !


'O Manishi Meluko' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

అందమైన రంగుల్లో ఎన్నెన్నో రూపాల్లో పూచే పూలను

తీయని మధురమైన ఫలాలనొసగే వృక్షరాజాలను

పశు పక్షి కీటక మానవ జాతులకు వరంగానూ

జీవించడానికి ప్రాణాధారంగానూ సృష్టించాడు అంతర్యామి .


అందరిలోనూ జ్ఝానంఉన్న మానవుడు తన జీవనాధారాన్ని

ప్రకృతి ఇచ్చిన సంపదను నాశనం చేస్తూ కౄరుడుగా మారేడు

తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటున్నాడు

వచ్చే తరానికి అపకారంచేస్తూ తీరని ద్రోహం చేస్తున్నాడు వాడికి శిక్ష ఏది?


రాజకీయాలు అనే ముసుగులో తరతరాలకు సరిపడా సంపదకోసం

ఆరాటపడుతూ కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు

పేదలకు సేవ అంటాడు మహిళా సంక్షేమం అంటాడు

వారిని వట్టిమాటలతో మాయచేసాడు వీడికి శిక్షయేది ?


పేదలకు ఇవ్వాల్సిన భూములు- పధకాలు స్వాహా చేస్తాడు

జీవనోపాధి చూపమంటే ఆకాశంలో చుక్కలు చూపుతాడు

మహిళల ఓటుకోసం ''నువ్వు ఆకాశంలో సగమని'' కీర్తిస్తాడు

పరాయి బిడ్డను తన ఇంటిపనికి బానిసను చేస్తాడు వీడికి ఏది శిక్ష?


కులమతాల భేదం లేక స్నేహంగా మసిలిన కుటుంబాలలో

ద్వేషాలను రగిలించి తమ అవసరాలు తీర్చుకుంటారు

''తనవాళ్లు '' అధికారంలో ఉండాలి ఇతరులు కిందస్థాయిలోనే మగ్గిపోవాలి

'' నీ- నా'' తప్ప ''మనమనే ''భావంలేని వారికీ శిక్ష ఏది?


ఒకానొకప్పుడు ఇంటికి కుటుంబానికే పరిమితమైన బేధభావం

ఇప్పుడు ప్రతి మనిషికి అంటించారు. వ్యక్తి పేరుతొ పార్టీ పోయి

కుల మతాల జాడ్యంతో పార్టీలు పెడుతూ విడిపోతున్నారు

ఇక మంచికి స్వచ్ఛతకు చోటెక్కడ? ''రాజ్యాంగానికి ''గౌరవం ఎక్కడ?


''రాజనీతి ''పేరుమార్చుకుంది ''రాజ్యాంగం ''రూపు మారింది

''అవినీతి ''అందలమెక్కింది ''ప్రతిష్ట'' మంటగలిసింది

రాజకీయం ''భ్రష్టు పట్టింది '' నాయకత్వం ''మనుగడ కోలుపోయిన్ది ''

''ప్రభుత్వం '' బలహీనమై పోయిన్ది ప్రజలు ''అశక్తులుగా'' మారిపోయారు


ఇంక ఎప్పుడు మేలుకుంటారు ఎప్పుడు మీ ప్రభావం చూపుతారు?

ఒకప్పుడు తెల్లవాడు మనదేశానికి శత్రువు

ఇప్పుడు మనకు మనమే శత్రువులంగా మారిపోయాము

ఎందుకిలా జరిగిందో ఆలోచించండి ప్రజలారా తెలుసుకోండి మీ దేశాన్ని

మీరాష్ట్రాన్ని కనీసం మీ ఊరును మార్చుకోండి అదే మీ శత్రువుకి శిక్ష!


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.






57 views0 comments
bottom of page