పల్లె పిలిచింది - 18
- T. V. L. Gayathri
- Jun 11
- 2 min read
Updated: 5 days ago
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #ధ్రువకోకిల, #తేటగీతి

Palle Pilichindi - 18 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 11/06/2025
పల్లె పిలిచింది - 18 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
1.
ధ్రువకోకిల.
మనుజులందున హెచ్చె స్వార్ధము మంచియన్నది లుప్తమై
కనలు చుండెడివారు కూడిరి కాసుకై కలహించుచున్
ధనముకోసము నీచులయ్యిరి దారితప్పుచు మానవుల్
వనములన్ బడి కొట్టి వేసిరి ప్రాణి హింసను జేయుచున్.//
తాత్పర్యము.
మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది.మంచి తనం తరిగి పోయింది. డబ్బు కోసము తగవులు పెట్టుకునే వారు ఎక్కువ అయ్యారు. మనుషుల్లో నీచ ప్రవృత్తి ఎక్కువయింది. ధనము కోసము అడవులను నరుకుతున్నారు.//
2.
తేటగీతి.
చెత్తనింపగా నదులలో చిందె విషము
మురికి కాసారములు కావె!ముందు చూపు
లేదు జనులకు పుఱ్ఱెలో లేదు బుద్ధి
స్వచ్ఛజలములు కనరావు జగతియందు.//
తాత్పర్యము.
జనులకు బుద్ధిలేదు.నదులలో చెత్తను పడేయటంతో నదులు విషంతో నిండి పోయాయి. నదులు మురికిగా తయారయ్యాయి.స్వచ్ఛమైన నీరు ఎక్కడఉంది?//
3.
తేటగీతి.
జీవకోటికి దిగులుతో చింత పెరిగె
తరువు లెల్లను గూల్చుట ధర్మమౌన?
వేడి సెగలతో నిట్టూర్చి పృథ్వి నేడు
కనలు చుండగా జనులిటు గాంచరేల?//
తాత్పర్యము.
చెట్లు కూల్చి వేయుట ధర్మమేనా? భూమి వేడితో మండి పోతుండగా మిగిలిన జీవరాసులకు దిగులు పెరిగి పోయింది. మనుషులు మాత్రం తెలుసుకోరెందుకు?//
4.
తేటగీతి.
వర్షఋతువులోభూమిపై వానపడదు
శిశిరమందున వర్షముల్ చిందులేయ
పంట కెంతయో నష్టము వాటిల నిట
సైరికుల జీవనంబులు సాగుటెట్లు?.//
తాత్పర్యము.
భూమి వేడెక్కటం వలన వర్షాకాలంలో వానలు పడటం లేదు. చలి కాలంలో వానలు జోరుగా పడతాయి. దానితో పంటలకు నష్టం కలుగుతుంది. ఇలా ఉంటే రైతుల జీవనం ఎట్లు సాగుతుంది?//
5.
తేటగీతి.
వరద గౌతమి పొంగుచు పరుగు పెట్టి
భీకరంబుగ గర్జించ భీతిపుట్టు
పల్లెటూళ్లను ముంచగ భయముతోడ
వణికి పోవుచు నా జనుల్ పాఱుచుంద్రు //
తాత్పర్యము.
గోదావరినది వరదతో వచ్చి పల్లెటూళ్లను ముంచుతూ ఉంటే జనులు భయంతో పారిపోతున్నారు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Komen