top of page

పల్లె పిలిచింది - 18

Updated: 5 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #ధ్రువకోకిల, #తేటగీతి

Palle Pilichindi - 18 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 11/06/2025

పల్లె పిలిచింది - 18 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



1.

ధ్రువకోకిల.


మనుజులందున హెచ్చె స్వార్ధము మంచియన్నది లుప్తమై 

కనలు చుండెడివారు కూడిరి కాసుకై కలహించుచున్ 

ధనముకోసము నీచులయ్యిరి దారితప్పుచు మానవుల్ 

వనములన్ బడి కొట్టి వేసిరి ప్రాణి హింసను జేయుచున్.//


తాత్పర్యము.


మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది.మంచి తనం తరిగి పోయింది. డబ్బు కోసము తగవులు పెట్టుకునే వారు ఎక్కువ అయ్యారు. మనుషుల్లో నీచ ప్రవృత్తి ఎక్కువయింది. ధనము కోసము అడవులను నరుకుతున్నారు.//


2.

తేటగీతి.


చెత్తనింపగా నదులలో చిందె విషము 

మురికి కాసారములు కావె!ముందు చూపు 

లేదు జనులకు పుఱ్ఱెలో లేదు బుద్ధి 

స్వచ్ఛజలములు కనరావు జగతియందు.//


తాత్పర్యము.


జనులకు బుద్ధిలేదు.నదులలో చెత్తను పడేయటంతో నదులు విషంతో నిండి పోయాయి.  నదులు మురికిగా తయారయ్యాయి.స్వచ్ఛమైన నీరు ఎక్కడఉంది?//


3.

తేటగీతి.


జీవకోటికి దిగులుతో చింత పెరిగె 

తరువు లెల్లను గూల్చుట ధర్మమౌన?

వేడి సెగలతో నిట్టూర్చి పృథ్వి నేడు 

కనలు చుండగా జనులిటు గాంచరేల?//


తాత్పర్యము.


చెట్లు కూల్చి వేయుట ధర్మమేనా? భూమి వేడితో మండి పోతుండగా మిగిలిన జీవరాసులకు దిగులు పెరిగి పోయింది. మనుషులు మాత్రం తెలుసుకోరెందుకు?//


4.

తేటగీతి.

వర్షఋతువులోభూమిపై వానపడదు 

శిశిరమందున వర్షముల్ చిందులేయ 

పంట కెంతయో నష్టము వాటిల నిట 

సైరికుల జీవనంబులు సాగుటెట్లు?.//


తాత్పర్యము.


భూమి వేడెక్కటం వలన వర్షాకాలంలో వానలు పడటం లేదు. చలి కాలంలో వానలు జోరుగా పడతాయి. దానితో పంటలకు నష్టం కలుగుతుంది. ఇలా ఉంటే రైతుల జీవనం ఎట్లు సాగుతుంది?//


5.

తేటగీతి.


వరద గౌతమి పొంగుచు పరుగు పెట్టి 

భీకరంబుగ గర్జించ భీతిపుట్టు 

పల్లెటూళ్లను ముంచగ భయముతోడ 

వణికి పోవుచు నా జనుల్ పాఱుచుంద్రు //


తాత్పర్యము.


గోదావరినది వరదతో  వచ్చి పల్లెటూళ్లను ముంచుతూ ఉంటే జనులు భయంతో పారిపోతున్నారు.//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Komen


bottom of page