పల్లె పిలిచింది - 20
- T. V. L. Gayathri
- 3 days ago
- 2 min read
Updated: 16 hours ago
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 20 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 16/06/2025
పల్లె పిలిచింది - 20 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
12.
తేటగీతి.
కోయవాండ్రను వంచించి కూళలిపుడు
ధనమునాశగా చూపించి తలలు వంచి
మంచి గంధపు చెక్కలన్ మాయచేసి
దొంగిలింతురా వనములో దూఱి దూఱి.//
తాత్పర్యము.
దుష్టులు కొందరు కోయవాళ్ళను మోసం చేసి, వాళ్లకు డబ్బును ఆశ చూపించి మంచి గంధపు చెక్కలను దొంగిలిస్తూ ఉంటారు.//
13.
తేటగీతి.
చిక్కనైనట్టి వనమిట్లు చిక్కిపోయె
పక్షి బృందముల్ భయముతో పాఱిపోవ
ప్రకృతి బీభత్సములతోడ భయమునొంది
పల్లెటూరి జనులు చాల బాధపడిరి.//
తాత్పర్యము.
ఒకప్పుడు దట్టమైన అడవి అది. ఇపుడు అక్కడ చెట్లు తగ్గిపోవగా చిక్కి పోయింది. చెట్లు లేక పోవటంతో పక్షులు భయంతో వలసపోయాయి.
ప్రకృతి భీభత్సములతో పల్లె ప్రజలు చాలా బాధపడ్డారు.//
13.
తేటగీతి.
మూగజీవులు రోదించ ముప్పు వచ్చు
జీవరాశులన్ రక్షించి సేమమిడుచు
మనుజులందరు నడిచిన మంచి జరుగు
ప్రకృతి పరిరక్షణ ధరకు ప్రాణమిడును.//
తాత్పర్యము.
మూగజీవులు ఏడుస్తుంటే మనకు హాని కలుగుతుంది. జీవరాసులను రక్షించాలి. ప్రకృతి పరిరక్షణ వలన భూమికి ప్రాణం వస్తుంది. మనుషులందరు మంచి దారిలో నడవటమే శ్రేయస్కరము.//
14.
తేటగీతి.
పుడమి మనుజుల సొత్తని పొగరుతోడ
జీవ రాశులన్ జంపుచు చేవ చూపి
బ్రతుకు చున్నట్టి హీనులన్ పట్టుకొనుచు
బుద్ధినేర్పంగ వలయును బుధులు కలిసి.//
తాత్పర్యము.
భూమి తమ సొత్తు అని కొందరు దుష్టులు జీవరాసులను చంపుతున్నారు. మంచి వాళ్లయిన ప్రజలు వాళ్లను పట్టుకొని బుద్ధి చెప్పాలి.//
15.
తేటగీతి.
హింస పెట్టగ జీవుల నిలకు హాని
వచ్చునంచు తా మెరుగంగ వలయు జనులు
పసుల పక్షులన్ బ్రేమించి ప్రాణమొసగి
వనములన్ బెంచి పోషించ పసులు మిగులు//
తాత్పర్యము.
జీవులను హింస పెట్టగా భూమికి హాని కలుగుతుందని ప్రజలు తెలుసుకోవాలి. పశువులను, పక్షులను ప్రేమించి జనులంతా వనములను పెంచుతూ ఉండాలి. అలా అయితే పశువులు ఈ భూమిపై మిగులుతాయి.//
16.
తేటగీతి.
స్వార్థమించుక తగ్గించి జనులు మెలగ
సర్వజీవులు భూమిపై సంతసముగ
బ్రతికి యుండెడి హక్కుతో వర్థిలంగ
పచ్చపచ్చగా నీపృథ్వి పరిఢవిల్లు.//
తాత్పర్యము.
మనుషులు కొంత స్వార్థం తగ్గించుకోవాలి. ఈ భూమిపై అన్ని జీవులు సంతోషంగా జీవించాలి. అప్పుడే ఈ భూమి పచ్చ పచ్చగా వర్థిల్లుతుంది.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments