top of page

పల్లె పిలిచింది - 20

Updated: 16 hours ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 20 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 16/06/2025

పల్లె పిలిచింది - 20 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



12.

తేటగీతి.


కోయవాండ్రను వంచించి కూళలిపుడు 

ధనమునాశగా చూపించి తలలు వంచి 

మంచి గంధపు చెక్కలన్ మాయచేసి 

దొంగిలింతురా వనములో దూఱి దూఱి.//


తాత్పర్యము.


 దుష్టులు కొందరు కోయవాళ్ళను మోసం చేసి, వాళ్లకు డబ్బును ఆశ చూపించి మంచి గంధపు చెక్కలను దొంగిలిస్తూ ఉంటారు.//


13.

తేటగీతి.


చిక్కనైనట్టి వనమిట్లు చిక్కిపోయె 

పక్షి బృందముల్ భయముతో పాఱిపోవ 

ప్రకృతి బీభత్సములతోడ భయమునొంది 

పల్లెటూరి జనులు చాల బాధపడిరి.//


తాత్పర్యము.


ఒకప్పుడు దట్టమైన  అడవి అది. ఇపుడు అక్కడ చెట్లు తగ్గిపోవగా చిక్కి పోయింది. చెట్లు లేక పోవటంతో పక్షులు భయంతో వలసపోయాయి.

ప్రకృతి భీభత్సములతో పల్లె ప్రజలు చాలా బాధపడ్డారు.//


13.

తేటగీతి.


మూగజీవులు రోదించ ముప్పు వచ్చు

జీవరాశులన్ రక్షించి సేమమిడుచు

మనుజులందరు నడిచిన మంచి జరుగు

ప్రకృతి పరిరక్షణ ధరకు ప్రాణమిడును.//


తాత్పర్యము.


మూగజీవులు ఏడుస్తుంటే మనకు హాని కలుగుతుంది. జీవరాసులను రక్షించాలి. ప్రకృతి పరిరక్షణ వలన భూమికి ప్రాణం వస్తుంది. మనుషులందరు మంచి దారిలో నడవటమే శ్రేయస్కరము.//


14.

తేటగీతి.


పుడమి మనుజుల సొత్తని పొగరుతోడ

జీవ రాశులన్ జంపుచు చేవ చూపి

బ్రతుకు చున్నట్టి హీనులన్ పట్టుకొనుచు 

బుద్ధినేర్పంగ వలయును బుధులు కలిసి.//


తాత్పర్యము.


భూమి తమ సొత్తు అని కొందరు దుష్టులు జీవరాసులను చంపుతున్నారు. మంచి వాళ్లయిన ప్రజలు వాళ్లను పట్టుకొని బుద్ధి చెప్పాలి.//



15.

తేటగీతి.


హింస పెట్టగ జీవుల నిలకు హాని

వచ్చునంచు తా మెరుగంగ వలయు జనులు

పసుల పక్షులన్ బ్రేమించి ప్రాణమొసగి

వనములన్ బెంచి పోషించ పసులు మిగులు//


తాత్పర్యము.


జీవులను హింస పెట్టగా భూమికి హాని కలుగుతుందని ప్రజలు తెలుసుకోవాలి. పశువులను, పక్షులను ప్రేమించి జనులంతా వనములను పెంచుతూ ఉండాలి. అలా అయితే పశువులు ఈ భూమిపై మిగులుతాయి.//


16.

తేటగీతి.


స్వార్థమించుక తగ్గించి జనులు మెలగ

సర్వజీవులు భూమిపై సంతసముగ

బ్రతికి యుండెడి హక్కుతో వర్థిలంగ

పచ్చపచ్చగా నీపృథ్వి పరిఢవిల్లు.//


తాత్పర్యము.


మనుషులు కొంత స్వార్థం తగ్గించుకోవాలి. ఈ భూమిపై అన్ని జీవులు సంతోషంగా జీవించాలి. అప్పుడే ఈ భూమి పచ్చ పచ్చగా వర్థిల్లుతుంది.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page