top of page

పల్లె పిలిచింది - 21

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 21 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 18/06/2025

పల్లె పిలిచింది - 21 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



17.

తేటగీతి.


ప్రకృతి వైపరీత్యంబులు వసుధయందు 

పెరుగుచుండగా ప్రజలకు భీతి పుట్టి 

వలస పోవుచు నుండిరి కలతతోడ 

బావురనుచుండి నేడ్చుచు పల్లెమిగిలె.//


తాత్పర్యము:


ఈ ప్రకృతి వైపరిత్యాలకు ప్రజలు వలస వెళుతూ ఉన్నారు. జనులు లేక పల్లెటూరు ఏడుస్తున్నట్లుగా మిగిలి ఉంది.//


18.

తేటగీతి.


నిరుడు పండిన పంటలు నేడు లేవు 

కరువు కోరలో చిక్కెనీ కనకభూమి 

దిక్కు తోచని రైతులు దిగులు పడుచు 

వలస కూలీలుగా మారి వగచి రకట!//


తాత్పర్యము:

అంతకు ముందు పండినట్లుగా పంటలు పండటం లేదు. రైతులు ఏమి చెయ్యాలో తెలియక వలస కూలీలుగా మారి పోతున్నారు.//


19.

తేటగీతి.


పెద్దకామందు మల్లయ్య పేరు మిగిలె 

తలను వంచినా డా కాపు దారి కనక 

సౌరభేయుల నమ్ముచు చౌక ధరకు 

క్రుంగిపోయెనా ధీరుడు గుబులు తోడ.//


తాత్పర్యము:


ఆ ఊరికే పెద్ద అయిన మల్లయ్య పరిస్థితులకు తలవంచి తన దగ్గర ఉన్న ఆవులను తక్కువ ధరకు అమ్ముకొన్నాడు.//


20.

తేటగీతి.


కారుచీకటి మదియందు క్రమ్ముకొనగ

మినుకు మనుచుండునాశతో మెలగుచుండి 

యూరి కొఱకు నా మల్లయ నుద్యమించి 

వెదకు చుండెను దారిని విబుధమతిగ.//


తాత్పర్యము:


అంతటా కరువు. ఆ పరిస్థితుల్లో రాబోయే కాలం మీద ఆశతో మల్లయ్య ఆ ఊరి కోసం తపన పడసాగాడు.//


21.

తేటగీతి.


అరుణగిరియు శ్రీ కరుడు తా మాప్తులవలె 

మల్లనార్యుని చెంతనే మసలుకొనుచు 

నొకరి కొకరుగా మిత్రులు నోర్పు తోడ 

గడుపుచుండగా కాలము కదిలిపోయె //


తాత్పర్యము:


మిత్రులైన అరుణగిరి, శ్రీకరులు మల్లయ్య చెంతనే ఉంటూ కాలాన్ని ఓర్పుగా గడుపుతున్నారు.//


(సశేషం)


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page