పల్లె పిలిచింది - 21
- T. V. L. Gayathri
- 15 hours ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 21 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 18/06/2025
పల్లె పిలిచింది - 21 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
17.
తేటగీతి.
ప్రకృతి వైపరీత్యంబులు వసుధయందు
పెరుగుచుండగా ప్రజలకు భీతి పుట్టి
వలస పోవుచు నుండిరి కలతతోడ
బావురనుచుండి నేడ్చుచు పల్లెమిగిలె.//
తాత్పర్యము:
ఈ ప్రకృతి వైపరిత్యాలకు ప్రజలు వలస వెళుతూ ఉన్నారు. జనులు లేక పల్లెటూరు ఏడుస్తున్నట్లుగా మిగిలి ఉంది.//
18.
తేటగీతి.
నిరుడు పండిన పంటలు నేడు లేవు
కరువు కోరలో చిక్కెనీ కనకభూమి
దిక్కు తోచని రైతులు దిగులు పడుచు
వలస కూలీలుగా మారి వగచి రకట!//
తాత్పర్యము:
అంతకు ముందు పండినట్లుగా పంటలు పండటం లేదు. రైతులు ఏమి చెయ్యాలో తెలియక వలస కూలీలుగా మారి పోతున్నారు.//
19.
తేటగీతి.
పెద్దకామందు మల్లయ్య పేరు మిగిలె
తలను వంచినా డా కాపు దారి కనక
సౌరభేయుల నమ్ముచు చౌక ధరకు
క్రుంగిపోయెనా ధీరుడు గుబులు తోడ.//
తాత్పర్యము:
ఆ ఊరికే పెద్ద అయిన మల్లయ్య పరిస్థితులకు తలవంచి తన దగ్గర ఉన్న ఆవులను తక్కువ ధరకు అమ్ముకొన్నాడు.//
20.
తేటగీతి.
కారుచీకటి మదియందు క్రమ్ముకొనగ
మినుకు మనుచుండునాశతో మెలగుచుండి
యూరి కొఱకు నా మల్లయ నుద్యమించి
వెదకు చుండెను దారిని విబుధమతిగ.//
తాత్పర్యము:
అంతటా కరువు. ఆ పరిస్థితుల్లో రాబోయే కాలం మీద ఆశతో మల్లయ్య ఆ ఊరి కోసం తపన పడసాగాడు.//
21.
తేటగీతి.
అరుణగిరియు శ్రీ కరుడు తా మాప్తులవలె
మల్లనార్యుని చెంతనే మసలుకొనుచు
నొకరి కొకరుగా మిత్రులు నోర్పు తోడ
గడుపుచుండగా కాలము కదిలిపోయె //
తాత్పర్యము:
మిత్రులైన అరుణగిరి, శ్రీకరులు మల్లయ్య చెంతనే ఉంటూ కాలాన్ని ఓర్పుగా గడుపుతున్నారు.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments