పల్లె పిలిచింది - 23
- T. V. L. Gayathri
- Jun 23
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 23 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 23/06/2025
పల్లె పిలిచింది - 23 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
వీరేశునికి గోవిందుడు బోధచేయుచు చెడుదారిన పయనించు యువతను హెచ్చరించుట.
28.
తేటగీతి
ధూమపానంపు మత్తులో దొరలి దొరలి
పోవు చుందురీ యువకులు మూఢ మతిని
శ్వాస కోశము నాశమై చావు వచ్చు
మరచి పోదురీ నిజమును మందమతులు.//
తాత్పర్యము.
యువత సిగిరెట్లు కాలుస్తూ మూర్ఖుల్లాగా తిరిగితే శ్వాసకోశము చెడిపోతుంది.దాని వల్ల చావు వస్తుందని మరచి పోతే ఎలాగా?//
29.
తేటగీతి.
తగని ప్రేమను జూపుచు తల్లి దండ్రి
కనక మొసగుచు బిడ్డలన్ గాంచరకట!
పిచ్చి యలవాట్లు మరగిన పిల్లలిపుడు
పెద్దలన్ దూల నాడుచు పెరుగు చుంద్రు.//
తాత్పర్యము.
తల్లిదండ్రులు బిడ్డలకు అనవసరంగా డబ్బులు ఇస్తూ ఉంటారు. పిచ్చి అలవాట్లను మరిగి పిల్లలు పెద్దవాళ్ళను తిడుతూ ఉంటారు.//
30.
తేటగీతి.
కాన్సరను జబ్బు వచ్చునీ కాలమందు
కాల మెప్పుడు మన వెంట కలిసిరాదు
వెఱ్ఱి పోకడల్ జూపుచు వీథులందు
తిరుగు చుందురీ హీనులు తెలివి తప్పి .//
తాత్పర్యము.
ఈ దురలవాట్లతో క్యాన్సర్ అనే జబ్బు వస్తుంది. ఈ కాలం పిల్లలు
వెర్రిపట్టిన వాళ్ళలాగా వీథుల్లో తిరుగుతూ ఉంటారు.//
31.
తేటగీతి.
ఆయువంతయు తరుగంగ నాశవీడి
కుములు చుందురు చివరకు క్రుంగి క్రుంగి
ముందు జాగ్రత్త పడుకున్న ముప్పు వచ్చు
మాను కొన్నచో మిగులును మంచి బ్రతుకు.//
తాత్పర్యము.
చివరకు జబ్బున పడి ఏడుస్తూ ఉంటారు. అందుకని ముందు జాగ్రత్త పడి దురలవాట్లను మానుకోవాలి.//
32.
తేటగీతి.
మంచి యలవాట్లతో ప్రజ మసలు చుండ
బలము తెలివియు కల్గిన భావితరము
జాతి మనుగడ నిల్పుచు సాగుచుండ
ప్రగతి బాటలో దేశము పరుగులిడును.//
తాత్పర్యము.
మంచి అలవాట్లతో ఉన్న యువత వలన దేశానికి ప్రయోజనము. వారి వలన దేశ ప్రగతి పరుగుపెడుతుంది.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments