వీభోవరా - పార్ట్ 17
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Sep 3
- 7 min read
Updated: Sep 8
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 17 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 03/09/2025
వీభోవరా - పార్ట్ 17 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. స్వామీజీ తిరిగి కనబడి మురళీ మోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయ్, కాశ్యప్ ల వివాహాలకి ముహుర్తాలు చూస్తారు విజయేంద్రభూపతి తో వివాహం ఇష్టం లేని సింధూ ఆత్మహత్య చేసుకుంటుంది.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 17 చదవండి..
విజయశర్మ వూరికి తిరిగివచ్చాడు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వ్యవసాయ పనులు చూచుకొంటానని తండ్రికి చెప్పాడు. సయ్యద్ కుమారుడు రషీద్ గ్రామానికి వచ్చాడు. భీమారావు కుమార్తె సింధూ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అన్న విషయాన్ని తండ్రికి చెప్పాడు.
సయ్యద్ ఆ విషయాన్ని రామశర్మకు తెలియజేశాడు. వారి సంభాషణను విన్న విజయ శర్మ ఆశ్చర్యపోయాడు. అతని మనస్సున కలవరం, వేదన. తాను సింధూని నిరాకరించినందున ఆమె చనిపోయిందా అనే ప్రశ్న?.. బాధాపూరిత ఆలోచన!.. వేదన!..
సివిల్స్ పరీక్షకు అప్లికేషన్ ఫిలప్ చేసి, ఆ వార్త విన్న కారణంగా వేదనతో అప్లికేషన్ను పోస్ట్ చేయలేదు. మదిలో అన్నివేళలో, సింధూని గురించిన తలపులే. ఎక్కువ సమయం పొలంలో గడిపేవాడు.
రామశర్మ వారం రోజుల తర్వాత టేబుల్ మీద వున్న ఆ అప్లికేషన్ను చూచాడు. విజయ్కు చూపించాడు. ఆ అప్లికేషన్ను పోస్ట్ చేశాడు విజయ్.
ప్రిన్సిపాల్ శాంతకుమార్ కాశ్యప్ చేత సివిల్ పరీక్షకు అప్లికేషన్ను సకాలంలో పోస్టు చేయించాడు. కాశ్యప్ సివిల్ సర్వీస్ పరీక్షలు వ్రాశాడు. అప్లికేషన్ ఆలస్యంగా పోస్టు చేసిన కారణంగా విజయ్కు పరీక్షల కాల్ లెటర్ రాలేదు.
సింధూ మరణం విజయ్ని పిచ్చివాణ్ణి చేసింది. ప్రతిపని మీద ధ్యాస తగ్గింది. ఎప్పుడూ ఏదో ఆలోచన, మనస్సున వేదన మస్తిష్కంలో కలవరం. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చునేవాడు. సింధూ చనిపోయి అప్పటికి మూడునెలలు.
శవాన్ని బయటికి తీసిన తర్వాత ఆ గదిలోనికి వెళితే సింధూ జ్ఞాపకాలు వస్తాయని కావేరి ఆ గదికి తాళం బిగించింది. మూడునెలల తర్వాత ఆ గదిని శుభ్రం చేయించేటందుకుగా పనిమనిషి తాయారు చేత తాళం తెరిపించింది.
పక్కను క్లీన్ చేస్తున్న తాయారు దిండును వేగంగా లాగడంతో దిండు క్రింద వున్న సింధూ డైరీ క్రిందపడింది.
దాన్ని చేతికి తీసి తాయారు తన యజమానురాలు కావేరికి ఇచ్చింది.
కావేరి డైరీలోని పేజీలలో సింధూ వ్రాసిన విషయాలను చదవసాగింది. సాంతం చదివేసరికి, తన కూతురు మరణానికి విజయశర్మ కారకుడని గ్రహించింది. మనస్సున ఆవేదన. కళ్ళల్లో కన్నీరు. బయటనుంచి ఇంట్లోకి వచ్చిన దుర్గారావు తల్లి వాలకాన్ని చూచాడు.
"అమ్మా!.. ఎందుకు ఏడుస్తున్నావు?"
కావేరి ఏడుస్తూ తాను చదివిన డైరీని దుర్గారావుకు ఇచ్చి తన గదికి వెళ్ళిపోయింది.
దుర్గారావు తన గదికి వెళ్ళి ఆ డైరీని సాంతం చదివాడు. చెల్లెలి మీద అతనికి వున్న మమకారం కారణంగా మనస్సున ఎంతో ఆవేదన.. కళ్ళల్లో కన్నీరు.
భీమారావు తన గదికి వెళుతూ ఎప్పుడూ తలుపులు తెరవని దుర్గ గది తలుపు తెరిచి వుండటాన్ని గమనించి గదిలోనికి తొంగి చూచాడు. దుర్గారావు ముఖంలోని ఆవేదనను గ్రహించాడు. మెల్లగా కుమారుడిని సమీపించాడు.
"దుర్గా!.. ఎందుకు ఏడుస్తున్నావ్?"
దుర్గారావు ఏడుస్తూనే తన చెల్లెలి చావుకు కారణం విజయ్ శర్మ అని చెప్పి డైరీలో సింధూ వ్రాసిన చివరి పంక్తులకు తండ్రికి చూపించాడు.
భీమారావు చదివాడు.
’మూడు వత్సరాల ఆశ ముసలిదైపోయింది..
ముసలిదైన ఆశ మరణాన్ని కోరింది..
తనువు కోరుతూ వుంది శాంతిని..
మనస్సు కోరుతూ వుంది ప్రశాంతిని.. ’
వారి నయనాలు చింతనిప్పుల్లా మారాయి. మనస్సున తీవ్రవేదన.
"దుర్గా!.. " బిగ్గరగా అరిచాడు. వారి చేతిలోని డైరీ జారి క్రిందపడింది. ఆ అరుపును విని కావేరి ఆ గదివైపుకు పరుగెత్తింది. గదిలో ప్రవేశించి భర్త తనయులను చూచింది.
"దుర్గా!.. "
"నాన్నా!.. "
"నా కూతురు చావుకు కారణమైన వాడు.. వాడు ఎవడైనా సరే ప్రాణాలతో వుండకూడదు. నీవు వెళ్ళి వాడిని చంపి వచ్చి నీ ముఖాన్ని నాకు చూపు" ఆవేశంగా చెప్పి తన గదిలోనికి వేగంగా వెళ్ళిపోయాడు భీమారావు. విచారవదనంతో కావేరి వారిని అనుసరించింది.
ఆ సన్నివేశాలనన్నింటినీ పనిమనిషి తాయారు ప్రక్కగా నిలబడి గమనించింది. ప్రక్కింటి పనిమనిషికి, తన భర్తకు చెప్పింది. ఆ వార్త శబ్దతరంగాలుగా మారి పలు చెవులకు సోకి ప్రిన్సిపాల్ మహమ్మద్ గారి చెవికి చేరింది.
విజయ్, కాశ్యప్ లంటే వారికి ఎంతో ప్రేమ, అభిమానం. వార్త తెలిసింది సాయంత్రం ఆరున్నరకు, వారు ఇంట్లో వున్న సమయంలో. వెంటనే వారు మురళీమోహన్ గారి ఇంటికి వచ్చారు. వారిని చూచిన మురళీమోహన్ గారు.
"రండి సార్!.. రండి.. " సగౌరవంగా ఆహ్వానించాడు.
"కూర్చోండి సార్!.. "
ప్రిన్సిపాల్ మహమ్మద్ కూర్చున్నారు.
"సార్!"
"చెప్పండి సార్!.. "
"ఒక చేదు వార్తను గంట క్రిందట విన్నాను. దాన్ని గురించి మీకు చెప్పాలని వచ్చాను" విచారంగా చెప్పాడు మహమ్మద్ సార్.
"ఏమిటి సార్ అది?" ఆత్రంగా అడిగాడు మురళీమోహన్.
"విజయ్ ఎక్కడ వున్నాడు సార్!.. "
"వాళ్ళ వూళ్ళో!"
"నేను విన్న విషయం, భీమారావు కుమార్తె సింధూ, విజయ్ని ప్రేమించిందట. విజయ్ కాదు కూడదన్నాడట. అకారణం జీవితం మ్మీద విరక్తితో నిద్రమాత్రలు మ్రింగి సింధూ చనిపోయిందట. ఆమె మరణానికి కారణం విజయేనని అందరూ అనుకొంటున్నారట. సింధూ ఈ విషయాన్ని తన డైరీలో వ్రాసిందట.”
"అలాగాన సార్!.. "
"అవును. భీమారావు దుర్గారావుల వలన విజయ్కి చాలా ప్రమాదం. వాళ్ళు నరమాంస భక్షకులు. పగ, ప్రతీకార వాంఛ తప్ప వారికి యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం లేదు. ఈ విషయాన్ని మీరు విజయ్కి తెలియజేసి అతన్ని దూరంగా ఎక్కడికైనా పంపించడం మంచిది సార్!" అనునయంగా చెప్పాడు ప్రిన్సిపాల్ మహమ్మద్ సార్.
"అతనికి భీమారావు, దుర్గారావుల నిర్ణయం ఎలా తెలుస్తుంది సార్!"
"నేను వెంటనే గ్రామానికి వెళ్ళి రామశర్మ గారికి విజయ్కి చెప్పి వస్తాను సార్!"
"ఆ కరెక్ట్. ముందు మీరు ఆ పని చేయండి వారిని జాగ్రత్తగా వుండమని చెప్పండి. "
"అలాగే సార్. థాంక్యూ!"
"సరే సార్. మీరూ జాగ్రత్త. ఇకనే వెళతాను" ప్రిన్సిపాల్ మహమ్మద్ తన స్కూటీలో ఇంటికి వెళ్ళిపోయారు.
మురళీమోహన్ రామశర్మ గారి గ్రామానికి వెళ్ళాడు. ప్రిన్సిపాల్ మహమ్మద్ గారు తనకు చెప్పిన విషయాన్ని వారికి చెప్పాడు.
"రామూ!.. వెంటనే విజయ్ని ఒంగోలుకు మా అన్న దగ్గరికి పంపండి. "
రామశర్మ విజయ్శర్మను పిలిచాడు. మురళీమోహన్ తనకు చెప్పిన విషయాన్ని విజయ్కి చెప్పాడు.
ఆ వూరికి హైవే మూడు కిలోమీటర్లు. సమయం సాయంత్రం మురళీ మోహన్ విజయ్ను తన కార్లో ఎక్కించుకొని హైవేలో దింపి తాను నెల్లూరు బయలుదేరాడు.
రోడ్డులో నిలబడివున్న విజయ్ మనస్సు కీడును శంకిస్తూ వుంది.
’ఇప్పుడు దుర్గారావు అతని అనుచరులూ వస్తే వారిని నేను ఎదుర్కొనగలనా! అది నాకు సాధ్యమా! బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో’ విజయ్ విచారంగా నలువైపులా చూచాడు.
ఆరోజు అమావాస్య కారు చీకటి క్రమ్ముకొంది. నెల్లూరి వైపు నుండి ఒక వాహనం రావడం గమనించాడు. ‘అది బస్సు అయ్యుంటే బాగుణ్ణు’ అనుకొన్నాడు విజయ్.
ఆ వాహనం ముందు వస్తూ ఉంది. హెడ్ లైట్లు సైజును చూచి అది బస్సు కాదనుకొన్నాడు.
దుర్గారావు అనుచరుడు కాలేజీ అటెండర్ రామకోటి వద్ద విజయ్ వూరి పేరు, నాన్నగారి పేరును కనుక్కొని దుర్గారావుకు చెప్పాడు. జిల్లా నగరానికి ఆ గ్రామానికి పదమూడు కిలోమీటర్లు.
నలుగురు సహచరులు ఆయుధాలతో దుర్గారావు ఆవేశంగా ఐదు గంటలకు బయలుదేరాడు.
జీప్ విజయ్ను సమీపించింది.
"అన్నా!.. ఎడంచేతి పక్కన వున్న కంకరరోడ్డు మీదికి తిప్పన్నా!" జీప్లో వున్న వారిలో ఒకరి సూచన.
జీప్ను దుర్గారావు నడుపుతున్నాడు. అతని ప్రక్కన ఒక స్థూలకాయుడు. వెనుకసీట్లో ముగ్గురు.
జీప్కు విజయ్కు మధ్య దూరం పదిహేను అడుగులు.
విజయ్ జీప్ను నడుపుతున్నది దుర్గారావు అని గ్రహించాడు. హైవేకి రైట్సైడ్ పంట పొలాలు, చేలుగట్లు. దాదాపు రెండు కిలోమిటర్ల దూరంలో వాగు. వాగుకు ఆవలివైపు రైల్వేట్రాక్, ఫ్లాట్ ఫామ్ చిన్న స్టేషన్.
దుర్గను గుర్తుపట్టిన విజయ్, పంట పొలాల గట్టువైపుకు రోడ్ క్రాస్ చేసి పరుగెత్తాడు. దుర్గారావు విజయ్ను గుర్తించాడు. జీప్ను ఆపి దిగాడు.
"రేయ్ దిగండిరా!" చేల గట్టుమీద స్టేషన్ వైపుకు పరుగెడుతున్నాడే, వాడేరా విజయ్, పరుగెత్తండి, వాణ్ణి పట్టుకోండి" అరిచాడు దుర్గారావు.
పొడుగాటి కత్తులతో నలుగురూ విజయ్ని వెంబడించారు.
ఆ గెనిమ (దారి) నేరుగా వాగువరకూ వుంది. నదిలో దిగి, అవతలి ఒడ్డుకు చేరితే రైల్వే ప్లాట్ ఫామ్. రెండూ ట్రాక్సీ, ప్లాట్ ఫాం స్టేషన్ (చిన్నది) వున్నాయి.
ఆ ప్రాంతం బాగా తెలిసి వున్నందున విజయ్ వేగంగా పరుగిడసాగాడు. నలుగురు సాయుధులు దుర్గారావు అతన్ని వెంబడించారు.
విజయ్ వాగును సమీపించాడు. ఆ ఐదుగురిలో ముందు పరుగిడేవాడు వేగాన్ని పెంచి విజయ్ను సమీపించాడు. కొద్ది క్షణాల్లో తన చేతిని విసిరి విజయ్ చొక్కా వెనుక భాగపు కాలర్ను పట్టుకొన్నాడు. విజయ్ వాడి చేతిని విదిలించి పరుగిడసాగాడు. అతను విజయ్ని సమీపించి తన కాలితో తన్నాడు. విజయ్ ముందుకు పడిపోయాడు. భయంతో వెంటనే లేవలేకపోయాడు. అతన్ని నేల కూల్చిన అతను తన చేతిలోని కత్తిని విజయ్ వీపుకు ఆనించాడు.
ఇంతలో మిగతా నలుగురు అక్కడికి చేరారు. విజయ్ని పట్టుకొన్నారు. భయంతో వణికిపోయాడు విజయ్.
"రేయ్!.. వీడిని చంపవద్దురా! ఒక కాలును తెగెయ్యండి.. ఏ పనికీ పనికి రాకుండా ఒంటి కాలితో బ్రతికినన్నాళ్ళు ఏడుస్తూ బతకాలి. నరకండిరా!" అని అరిచాడు దుర్గారావు.
ముగ్గురిలో ఒకడు వెనుక భుజాలను, ఇద్దరు రెండు చేతులను గట్టిగా పట్టుకొన్నారు.
స్థూలకాయుడు తన చేతిలోని బారుకత్తితో విజయ్శర్మ ఎడమ కాలును మోకాలు పైభాగం వరకు నరికాడు.
"అమ్మా!.. " విజయ్శర్మ ఆర్తనాదం. ఒక్క కాలుతో నిలబడలేక తెగిన కాలునుండి కారే రక్తం నొప్పితో కళ్ళు తిరిగి విజయ్ నేలకూలాడు. ప్యాసింజర్ ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది. ఆరుగురు కంపార్టుమెంటు నుండి దిగి వాగులో దిగారు. దాని వెడల్పు యాభై అడుగులు. వారి సవ్వడిని విని దుర్గారావు, ఆ నలుగురూ జీప్ వైపుకు పరుగెత్తారు. ఆ స్థూలకాయుడు తన చేతిలోని విజయ్ కాలిని శక్తికొలదీ దూరంగా వాగులో పడేలా విసిరేశాడు.
విజయ్ స్పృహను కోల్పోయాడు.
రైలు దిగిన ఆరుగురూ వాగును దాటి ఈవలి ఒడ్డుకు వచ్చారు. రక్తపు మడుగులో ఒక్క కాలుతో స్పృహ లేకుండా పడివున్న విజయ్శర్మను చూచారు. ఆత్రంగా అతన్ని సమీపించారు. వారు విజయ్ను గుర్తించారు.
"బాబూ!.. బాబూ!.. " అని అరిచారు.
విజయ్ నుండీ ఎలాంటి జవాబు లేదు.
వారు విజయ్ కాలికి ఒకరిపై పంచను తడిపి కట్టు కట్టారు. భూజాన వేసుకొని ఒక్కొక్కరు కొంత కొంత దూరం మోసుకొని గ్రామాన్ని చేరి, రామశర్మ ఇంటికి వచ్చి..
"సామీ!.. సామీ!.. " వాకిట ముందునుంచి అరిచారు.
అప్పుడే రాత్రి భోజనం ముగించి చేయి కడుక్కొంటున్న రామశర్మ వేగంగా బయటికి వచ్చాడు.
"సామీ!.. ఎవరో! ఏం కారణమో విజయ బాబు కాలును తెగనరికి పారిపోయారు. రైలు దిగివస్తూ వున్న మేము స్పృహ లేని బాబును చూచాము. ఎత్తుకొని వచ్చాము. " ఆ ఆరుగురిలో పెద్ద వ్యక్తి శాంతయ్య చెప్పాడు.
రామశర్మకు నెత్తిన పిడుగు పడినట్లయింది.
"మాధవీ!" బిగ్గరగా అరిచాడు.
ఆ అరుపు విన్న మాధవి, భాస్కర్ శర్మలు బయటికి ఆత్రంగా వచ్చారు.
రామశర్మ వరండాలో మంచం వాల్చాడు. వారు విజయ్ను మంచంలో పడుకోబెట్టారు. "సామీ!.. సయ్యద్ భాయిని (వైద్యుడు) పంపుతాం. సామీ బాబును జాగ్రత్తగా చూచుకోండి. రేపు వస్తాం" వారందరూ వెళ్ళిపోయారు.
విజయ్ స్థితిని చూచి రామశర్మ, మాధవి, గోపాల్ శర్మ భోరున ఏడ్వసాగారు.
విషయాన్ని విన్న వెంటనే సయ్యద్ తన మందుల సంచితో పరుగెత్తుకొంటూ రామశర్మ ఇంటికి వచ్చాడు. ఏడుస్తూ ఆ ముగ్గురినీ వూరడించాడు.
విజయ్ నాడిని, గుండెను, శ్వాసను పరీక్షించాడు. ఏదో రెండు రకాల పొడులను ఒక అరగ్లాసు నీళ్ళల్లో కలిపి విజయ్కు తాగించాడు. సయ్యద్ రాక, అతని చికిత్సను చూచిన రామశర్మ, మాధవి, గోపాల్ శర్మలకు కొంత వూరట కలిగింది.
"సయ్యద్!.. " దీనంగా పలుకరించాడు రామశర్మ.
"ఏం స్వామీ!.. "
"విజయ్కు ఏమీ ప్రమాదం లేదు కదా!.. "
సయ్యద్ కొన్ని క్షణాలు మౌనంగా కళ్ళు మూసుకొన్నాడు. వారు ’విజయ్కు స్వస్థతను ప్రసాదిందు అల్లా!’ అని ఆ క్షణంలో జగత్ రక్షకుని కోరారు. మెల్లగా కళ్ళు తెరిచి, విజయ్ పల్స్ ను ఒకసారి పరీక్షగా చూచి..
"ప్రాణభయం లేదు స్వామీ!.. భయపడకండి. నేను చేయవలసింది నేను చేశాను. పైవాడు చూచుకొంటాడు" అనునయంగా చెప్పాడు సయ్యద్.
ఆ రాత్రంతా నలుగురూ విజయ్ మంచం చుట్టురానే కూర్చుని వున్నారు. రామశర్మకు గుండెల్లో నొప్పి ప్రారంభం అయ్యింది. కానీ ఎవరికీ చెప్పలేదు. మూడుగంటల తరువాత మరో డోస్ చూర్ణాలను పాలల్లో కలిపి త్రాగించాడు సయ్యద్.
రెండవ డోస్ తాగిన గంటకు విజయ్లో చలనం కలిగింది.
"అమ్మా!.. " అన్నాడు.
సయ్యద్ ముఖంలో ఆనందం.
మరో డోస్ త్రాగించాడు. విజయ్ ప్రశాంతంగా నిద్రపోసాగాడు. అతిభారంగా జరిగిన అమావాస్య రాత్రి ముగిసింది. తూర్పు దిక్కున అరుణకాంతులు.
"స్వామీ!.. బిట్రగుంట రైల్వే హాస్పిటల్లో మా పెదనాన్న కొడుకు హుస్సేన్ డాక్టర్. మనం బాబును అక్కడికి తీసుకొని వెళదాం. నేను మా పక్కింటి రంగన్న కొడుకు టాక్సీని తీసుకొని అరగంటలో వస్తాను. మీరు సిద్ధంగా వుండండి" ఇంటికి వెళ్ళిపోయాడు సయ్యద్.
రామశర్మ, మాధవి, గోపాల్ శర్మలు విచారంతో విజయ్, మంచం ప్రక్కనే వున్నారు. అరగంట లోపలే సయ్యద్ టాక్సీలో వచ్చాడు. విజయ్, రామశర్మ, సయ్యద్లు టాక్సీలో బిట్రగుంటకు బయలుదేరారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments