top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Love Challenge Episode 21' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్



గత ఎపిసోడ్ లో…

పూర్నేష్ ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుండడంతో చికాకు పడతాడు జీవన్.

రిత్విక్ సలహా పై , మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా ప్లేయర్స్ చేసిన డిమాండ్ ని హిడెన్ కెమరాతో రికార్డ్ చేస్తాడు.

దాంతో వాళ్ళు దారిలోకి వస్తారు.

సెమీస్ లో గెలిస్తే వన్ వీక్ టూర్ ప్లాన్ చేస్తానంటుంది ఆద్య.

ఇక చదవండి…

ఎదురు చూస్తున్న ఆదివారం రానే వచ్చింది.

ఆ రోజే సెమీస్.

అందరూ ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.

చక్రధరం, రాఘవేంద్ర, గురుమూర్తి ఆ రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ వాళ్ళ ఇంట్లో పూజలు చేశారు.

రిత్విక్ అండ్ టీం కాలేజ్ కి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

9 గంటలకల్లా అందరూ కాలేజ్ కి చేరుకున్నారు.

సెమీస్ లో వీళ్ళతో తల పడబోయే నెహ్రూ కాలేజ్ టీం వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అంపైరింగ్ కోసం మాజీ రంజీ ప్లేయర్స్ ఇద్దరు వచ్చారు.

లోకల్ న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళు ఈ మ్యాచ్ ని లైవ్ కవరేజ్ ఇవ్వడానికి వచ్చారు.

నేషనల్ టీం నుండి రిటైర్ ఐన ఇద్దరు హైదరాబాదీ ప్లేయర్స్ కామెంటరీ ఇవ్వడానికి వచ్చారు.

పెద్ద స్టేడియాన్ని తలపించే రీతిలో నిత్యా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. మ్యాచ్ చూడటానికి వచ్చిన వేలాది మందికి స్నాక్స్, టీ, కాఫీలు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు రిత్విక్, జీవన్ లు.

సరిగ్గా 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది.

టాస్ గెలిచిన రిత్విక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రిత్విక్, మరో ప్లేయర్ వచ్చారు. ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ఉండడంతో స్కోరు పది ఓవర్లలో ఎనభై పరుగులకు చేరింది.

మరో ఓవర్ గడిచాక రిత్విక్ తో ఆడుతున్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు.

ఆ తరువాత వచ్చిన ఇద్దరు ప్లేయర్స్ పెద్దగా పరుగులు చేయకపోగా చాలా బాల్స్ వృధా చేశారు. కనీసం సింగిల్ తీసి రిత్విక్ కి బ్యాటింగ్ ఇవ్వలేకపోయారు.

వాస్తవానికి వాళ్లు కూడా మంచి ప్లేయర్స్. కానీ అవతలి టీం లోని ఫాస్ట్ బౌలర్ వేసే బంతులను సరిగ్గా ఆడలేక పోయారు. వాళ్ళిద్దరూ అవుట్ అయ్యే సరికి జట్టు స్కోరు ముప్పై ఓవర్లలో మూడు వికెట్లకు నూట నలభై పరుగులు.

అప్పటికి రిత్విక్ స్కోర్ యాభై బంతుల్లో ఎనభై పరుగులు.

అప్పుడు జీవన్ క్రీజులోకి వచ్చాడు.


నెహ్రూ టీం బౌలర్స్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేస్తున్నారు. అందువల్ల పరుగులు రాబట్టడం కష్టమైంది. రిత్విక్, జీవన్ లు మంచి సంయమనంతో ఆడుతున్నారు. కష్టమైన బంతుల్ని డిఫెండ్ చేసుకుంటూ, అవకాశం వచ్చినప్పుడు బంతిని బౌండరీ లైన్ దాటిస్తున్నారు. దాంతో నలభై ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు రెండువందల పది పరుగులకు చేరుకుంది.

రిత్విక్ నూట పది పరుగులతో జీవన్ నలభై పరుగులతో క్రీజులో ఉన్నారు మరో ఐదు ఓవర్ లు ఆచితూచి ఆడుతూ నలభై ఐదు ఓవర్ లకు స్కోరును రెండు వందల డెబ్బై పరుగులకు చేర్చారు.

ఆ తర్వాత ఇద్దరూ విజృంభించి ఆడటం మొదలుపెట్టారు.

దాదాపు ప్రతి బంతినీ ఫోర్ లేదా సిక్స్ గా బాదుతున్నారు. చివరి ఐదు ఓవర్లలో అరవై పరుగులు రావడంతో స్కోర్ మూడు వందల ముప్పై తో ముగిసింది.

రిత్విక్ 130 పరుగులతో జీవన్ 90 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

331 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెహ్రూ కాలేజ్ టీం, ఓపెనర్లు రాణించడంతో మొదటి 10 ఓవర్లలో 70 పరుగులు చేశారు. ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ ను భగ్నం చేయడానికి రిత్విక్ స్పిన్ బౌలర్ ను రంగంలోకి దించాడు. అతని వ్యూహం ఫలించి, ఓపెనర్లు ఇద్దరూ ఒకే ఓవర్ లో అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ, కొద్ది పరుగులకే అవుట్ అయిపోయారు. నెహ్రూ కాలేజ్ టీం బ్యాటింగ్ సగం ముగిసేసరికి, గెలుపు నిత్యా కాలేజ్ వాళ్ళదేనని తెలిసిపోయింది. స్టూడెంట్స్ కేకలు, విజిల్స్ తో ఆ గ్రౌండ్ అంతా మారు మోగిపోయింది. అతి కష్టం మీద నెహ్రూ జట్టు వాళ్ళు 200 పరుగులు చేసి, ఆలౌట్ అయ్యారు.

నిత్య కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఆడ మగ భేదం లేకుండా ఆనందంతో కేరింతలు కొట్టారు. కొంతమంది స్టూడెంట్స్ గ్రౌండ్ లోకి దూసుకువచ్చి ప్లేయర్స్ ని అభినందించారు. రాఘవేంద్ర, ప్రిన్సిపాల్ పాంచజన్యం, సామ్రాజ్యం మేడం, గ్రౌండ్ లోకి వచ్చి ఆటగాళ్లను అభినందించారు. నిత్యా మేడం, ఆద్య, దీప్య, శాన్వి ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ కూడా రిత్విక్, జీవన్ లతో పాటు, అందరినీ అభినందించారు.

రిత్విక్, నెహ్రూ టీం కెప్టెన్ దగ్గరికి వెళ్లి, "మా కాలేజ్ కి వచ్చి మ్యాచ్ ఆడినందుకు మీ టీం మొత్తానికి స్టార్ హోటల్లో ట్రీట్ ఏర్పాటు చేశాం. దయచేసి కాదనకుండా యాక్సెప్ట్ చేయండి. నేను స్వయంగా హాజరు కాలేకపోయినా మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు" అని రిక్వెస్ట్ చేశాడు.

జీవన్ వైస్ కెప్టెన్ ను దగ్గరకు పిలిచి, "మీరు ముగ్గురూ నిజాయితీగా ఆడారు. మీ కోసం ఖరీదైన గిఫ్ట్స్ మీ ఇంటికి చేరుస్తాను. కాదనకండి. ప్లీజ్" అని చెప్పాడు.

రాఘవేంద్ర- రిత్విక్, జీవన్ లను దగ్గరకు పిలిచి, "ఈరోజు సాయంత్రం మీ టీం మొత్తానికి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో విందు ఏర్పాటు చేస్తాను. అందరూ తప్పకుండా రావాలి" అన్నాడు.

రిత్విక్ మాట్లాడుతూ "సిటీలో లీడింగ్ ఫైవ్ స్టార్ హోటల్ మాదే కదా! కాబట్టి అక్కడే అరేంజ్ చేయవచ్చు కదా. ఓడిపోయిన నెహ్రూ టీం వాళ్ళను కూడా అక్కడికే రమ్మంటాను " అన్నాడు.

ఆద్య మాట్లాడుతూ "బిల్ ఖచ్చితంగా తీసుకుంటానంటే అక్కడే అరేంజ్ చేసుకుందాం. కానీ ట్రీట్ ముగిశాక తీసుకోనంటూ పేచీ పెట్టకూడదు" అంది.

"మా ఇద్దరి బిల్ మీరే పే చేయండి. మిగతా ప్లేయర్స్ బిల్ జట్టు కెప్టెన్ గా నేనే భరిస్తాను. నెహ్రూ టీం వాళ్ళ బిల్ కూడా నాదే" అన్నాడు రిత్విక్.

"అదిగో..అప్పుడే వాదన మొదలు పెట్టారు" అంది ఆద్య.

"మీ ఇద్దరి వాదన తెగదు కాబట్టి ఆ బిల్లు ఏదో నన్ను కట్టనివ్వండి" అన్నాడు జీవన్.

రాఘవేంద్ర మాట్లాడుతూ "మ్యాచ్ జరిగే సమయంలో చేసిన ఏర్పాట్లకు ఎంతో ఖర్చు అయింది. వాస్తవానికి ఆ ఖర్చు మేమే భరించాలి. కానీ స్టూడెంట్స్ లీడర్ నని ఒకరు, లోకల్ ఎంపీ కొడుకు నని ఒకరు ఖర్చు భరించారు. కాబట్టి ఈ ట్రీట్ విషయంలో నైనా మమ్మల్ని ఖర్చుపెట్టనివ్వండి" అన్నాడు.

తరువాత రాఘవేంద్ర అందరు ప్లేయర్స్ ని ఉద్దేశించి "రాత్రి 8 గంటలకు అందరూ అక్కడికి చేరేలా ప్లాన్ చేసుకోండి" అన్నాడు.

జీవన్ "ఈ మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం- గెలిస్తే ఒక టూర్ ఉంటుందని మీరు చెప్పడమే" అని ఆద్యతో అన్నాడు.

"అదేం లేదు. జట్టును గెలిపించాలని అందరూ ఆడారు. అయినా ఆ టూర్ విషయం నేను మరిచి పోలేదు. అక్కడ అందరిలో అనౌన్స్ చేస్తాను. అన్నట్లు అక్కడికి ప్లేయర్స్ తో పాటు, మీ ముఖ్యమైన స్నేహితులను కూడా రమ్మని చెప్పండి" అంది.

ఆ రోజు రాత్రి 8 గంటలు అయ్యేసరికి అందరూ ఆ హోటల్ దగ్గరికి చేరుకున్నారు.

రిత్విక్ ఆ హోటల్లో లో ఒక ఫంక్షన్ హాల్ ను రిజర్వ్ చేసి ఉంచాడు.

రాఘవేంద్ర గారు వస్తున్న వాళ్ళని సాదరంగా పలకరించి లోపలికి ఆహ్వానిస్తున్నారు.

ఇంతలో ఆ హోటల్ మేనేజర్ రిత్విక్ వద్దకు వచ్చి "మీడియా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. ఆద్య గారు రమ్మని చెప్పారని అంటున్నారు. మీరు ఒకసారి ఆమెను కనుక్కోండి" అన్నాడు.

ఆద్య వాళ్లను ఎందుకు రమ్మందో రిత్విక్ కి అర్థం కాలేదు. ఆమె దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు.

ఆద్య మాట్లాడుతూ "లవ్ చాలెంజ్ గురించి అందరికీ తెలిసిపోయింది. దీని గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్ చేయకుండా నేనే మీడియాకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పిన టూర్ గురించి, ఈ ఛాలెంజ్ లో మీరు పోటీ పడడానికి నేను ఇవ్వబోయే టాస్క్ గురించి మీడియాలో ఓపెన్ గా చెబుతాను. ఒక అమ్మాయి కోసం ఇద్దరు ముగ్గురు అబ్బాయిల మధ్య పోటీ ఏర్పడడం కొత్త కాదు. అందుకోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చెయ్యడం కూడా మామూలే. కానీ ఇప్పుడు జరిగే పోటీ కేవలం విజేతలను ఎంపిక చేయడానికి మాత్రమే కాకుండా సమాజానికి ఒక ఉపయోగం ఉండేలా ప్లాన్ చేశాను. డిన్నర్ ముగిశాక అందరి సమక్షంలో దాన్ని వివరిస్తాను." అంది.

ఆమె ఎలాంటి టాస్క్ ఇస్తుందోనని రిత్విక్, జీవన్ లు ఆలోచిస్తున్నారు. ఎలాంటి టాస్క్ అయినా ఎదుర్కోవాలని నిశ్చయించు కున్నారు. డిన్నర్ ముగిసింది.

రిత్విక్ ఆదేశాలతో అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా సీట్స్ ఏర్పాటు చేశారు హోటల్ సిబ్బంది. ఆద్య చేతికి ఒక వైర్లెస్ మైక్ అందించాడు రిత్విక్.

ఆద్య మాట్లాడటం ప్రారంభించింది.

"మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్, మన కాలేజీ వాళ్ళు స్వయంగా గత పది సంవత్సరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నారు. మన కాలేజీ జట్టు ఎప్పుడూ కప్ గెలవకపోయినా పోటీల నిర్వహణ ఆపలేదు. మొట్టమొదటిసారిగా మన జుట్టును సెమీస్ లో గెలిపించి ఫైనల్స్ కు చేరిన క్రికెట్ టీం లో ఉన్న అందరికీ ఈ కాలేజ్ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. ఇదే స్ఫూర్తిని చూపిస్తూ ఫైనల్ లో గెలిచి, మన కాలేజ్, చదువులోనే కాక స్పోర్ట్స్ లో కూడా నెంబర్ వన్ అని తెలిసేలా చేయండి.

ఇక ఛాలెంజ్ లో ఇస్తున్న టాస్క్ గురించి..

మా నాన్నగారి సొంత ఊరు సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణాపురం గ్రామం.

అది చాలా చిన్న వూరు. మారుమూల గ్రామం కాబట్టి అధికారుల కళ్ళల్లో పడలేదు. ఓట్లు తక్కువ కాబట్టి నాయకుల దృష్టిని ఆకర్షించ లేదు. ప్రభుత్వ సహకారం ఆశించకుండానే మా ఊర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మా నాన్నగారు.

హై స్కూల్, హాస్పిటల్ ఏర్పాటుకు స్వంత స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు.

ఇప్పుడు ఈ లవ్ ఛాలెంజ్ కి ఆ గ్రామాన్ని కేంద్రంగా ఎంపిక చేసాను" చెప్పడం ఆపింది ఆద్య.

అందరూ ఆసక్తిగా ఆమె ఇవ్వబోయే టాస్క్ కోసం ఎదురు చూస్తున్నారు.

“ఈ లవ్ ఛాలెంజ్ చివరి రోజు ఆ గ్రామంలో మోడల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. అందులో గెలిచిన వాళ్లే ఈ చాలెంజ్ విజేతలు. ఈ రోజుల్లో డబ్బు, మద్యం వాడకుండా ఏ ఎన్నికలూ జరగడం లేదు. చదువుకున్న వారు సైతం ప్రలోభాలకు లోబడుతున్నారు. కాబట్టి ప్రచారం కోసం డబ్బును, పరపతిని వాడుకోకుండా కేవలం తమ గురించి ప్రజలకు తెలియపరిచి, వాళ్ల అభిమానం పొంది, ఓట్లు సంపాదించుకోవాల్సి ఉంటుంది. పోటీలో వీళ్లకు ఉన్న గడువు నెల రోజులే. క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ నెక్స్ట్ సండే ఉంటుంది. ఈ వారం రోజులు వీళ్లకు వృధా కాకుండా, అక్కడే ప్రాక్టీస్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాము. ప్లేయర్స్ అందరికీ భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము.."


ఆమె చెబుతున్న మాటలకు అడ్డం వస్తూ ఒక టీవీ చానల్ రిపోర్టర్ "డబ్బు, పరపతి వాడకూడదంటున్నారు. మరి ఆ గ్రామస్తులు ఎందుకు ఓట్ చేస్తారు? ఎందుకు చెయ్యాలసలు? ఎన్నికయిన వారికి ఏ పదవీ రాదు, ఇవి కేవలం ఉత్తుత్తి ఎన్నికలు కాబట్టి.

‘ఎన్నికలకు ముందుగానీ, వెనకగానీ ఏ లాభం లేకుండా ఓట్ చెయ్యడం ఎందుకు?’ అని అనుకుంటారు కదా! మామూలుగా జరిగే ఎన్నికల్లోనే 60 శాతం మాత్రమే పోలింగ్ జరుగుతుంది. రిగ్గింగ్ తో మరో పది శాతం జరుగుతుంది. ఆ పోలైన ఓట్లు కూడా డబ్బు ఆశ చూపి, మద్యం ఆశ చూపి, వాళ్లను ఓటు వేసేలా చేస్తున్నారు. ఏమీ ఖర్చు పెట్టకుండా ఆ గ్రామస్తులు ఓటింగ్ కి రారు కదా" అన్నాడు.

"మీ ప్రశ్నను ముందుగానే ఉహించి సమాధానం రెడీగా ఉంచుకున్నాను" అంటూ చెప్పడం ప్రారంభించింది ఆద్య.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


41 views0 comments
bottom of page