కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
![](https://static.wixstatic.com/media/acb93b_787da75d038f4159be480a567b289b7b~mv2.jpg/v1/fill/w_147,h_98,al_c,q_80,usm_0.66_1.00_0.01,blur_2,enc_auto/acb93b_787da75d038f4159be480a567b289b7b~mv2.jpg)
'Ventade Nida Episode 17' New Telugu Web
Series Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
ఎస్సై శ్రీకాంత్ కి జరిగిన సంఘటనలు వివరిస్తాడు సుమంత్.
శ్రీకాంత్ - విశాల్ నంబర్ కి కాల్ చేసినా, వికాస్ నంబర్ కి కాల్ చేసినా గోవర్ధన్ అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
హాస్పిటల్ లో కరెంట్ పోవడంతో పాటు వింత శబ్దాలు వినిపిస్తాయి శ్రీకాంత్ కి.
ఇక చదవండి…
సీఐ కిషోర్ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుల్స్ గుడిసె వద్దకు వెళతారు. వాళ్లు వెళ్ళేటప్పటికి ఆ అగంతకుడు గుడిసె తలుపు బలంగా తడుతున్నాడు.
“ఆ డాక్టర్లను బయటకు నెట్టేయండి. మిగతా వాళ్ళను వదిలేస్తాను” అని కేకలు పెడుతున్నాడు.
ఇంతలో అలికిడి కావడంతో వెనక్కి తిరిగాడు.
తనను సమీపిస్తున్న కానిస్టేబుల్స్ ని చూసి “దగ్గరకు రాకండి. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి” అన్నాడు.
గుడిసె లోపల ఉన్న కానిస్టేబుల్, షణ్ముగంతో “బయట మా వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు. నేను కూడా వెళ్లి అతన్ని పట్టుకోవడంలో మా వాళ్లకు హెల్ప్ చేస్తాను. నేను బయటకు వెళ్ళగానే తిరిగి తలుపు వేసుకో” అన్నాడు.
“ఇలా ఎంతసేపని భయపడుతూ కూర్చుంటాం? పదండి.. నేను కూడా వస్తాను” అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుడిసె తలుపు తెరిచాడు షణ్ముగం.
వెంటనే కానిస్టేబుల్ తో పాటు తను కూడా బయటకు దూకాడు. పరిస్థితి గమనించిన ఆ అగంతకుడు తనను సమీపిస్తున్న ఒక కానిస్టేబుల్ ను పక్కకు నెట్టి, తోటలోకి పరుగుతీశాడు.
తన పక్కనుంచి పరిగెడుతున్న ఆ అగంతకుడిని చూసిన సీఐ కిషోర్, తన శక్తిని కూడదీసుకుని అతని వెనకే పరుగెత్తాడు. వేగంగా పరిగెడుతున్న ఆ అగంతకుడు బురద నేలలో కాలు జారడంతో బోర్లా పడిపోయాడు. నేల మీద నుంచి పొడుచుకొని వచ్చినట్లు ఉన్న ఒక రాయికి అతని తల బలంగా తగిలి స్పృహ కోల్పోయాడు. ఈలోగా అందరూ అక్కడికి చేరుకున్నారు.
“రాయి తలకు తగిలి బలంగా గాయం అయినట్లు ఉంది” అన్నాడు కిశోర్.
“అది మామూలు రాయి కాదు. ఈ తోటలో ఉన్న గంగమ్మ తల్లి స్వరూపం. తప్పుడు పనులు చెయ్యాలనుకునే వాళ్ళను, ఈ తల్లి ఇంతకుముందు కూడా దండించింది” అన్నాడు షణ్ముగం.
సీఐ కిషోర్ అతని దగ్గరకు వెళ్లి నాడిని పరీక్షించి, అతను ప్రాణాలతోనే ఉన్నట్లు గ్రహించాడు. నెత్తురు కారుతున్న అతని తలకు కట్టు కట్టాడు.
ఏ సి పి ప్రతాప్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు.
“అతను ప్రాణాలతో ఉండటం మనకు ముఖ్యం. అతని ద్వారా ఈ కేసులో చాలా వివరాలు తెలుసుకోవచ్చు. నిన్ను గాయపరిచినా, అతని తలకు కట్టుకట్టి మంచి పని చేశావు. నిన్ను అభినందిస్తున్నాను. వెంటనే విజయవాడ ఏసిపి కి చెప్పి, అక్కడికి అంబులెన్స్ పంపే ఏర్పాటు చేస్తాను. ఇక ఆ డాక్టర్ దంపతులకు ప్రొటెక్షన్ ఇచ్చి హైదరాబాద్ కు పంపు” అని చెప్పాడు ఏసీపీ ప్రతాప్.
మరి కొంత సేపటికే ఆ తోట దగ్గరికి అంబులెన్స్ వచ్చింది. ఆ అగంతకుడిని అందులోకి ఎక్కించి, వెనకే తన వాహనంలోబయలుదేరాడు సిఐ కిషోర్. శ్యామల రావు, సావిత్రి లను ఒక కానిస్టేబుల్ ని తోడు ఇచ్చి హైదరాబాద్ కి పంపాడు.
***
సిఐ కిషోర్ తో మాట్లాడిన తరువాత తరువాత ప్రతాప్, విజయవాడ ఏసిపి కి కాల్ చేశాడు. విషయం వివరించి అంబులెన్స్ పంపే ఏర్పాటు చేయమన్నాడు.
అలాగేనన్నాడు ఆయన.
తరువాత, “మీరు చెప్పిన సుమంత్ అనే అబ్బాయి ఆచూకీ దొరికింది. అతనికి బైక్ యాక్సిడెంట్ జరిగి విజయవాడలో అడ్మిట్ అయి ఉన్నాడు. ప్రస్తుతం బాగానే కోలుకున్నాడు. అతని పేరెంట్స్ కి అతని ఆచూకీ తెలిసింది. ఇక్కడ హాస్పిటల్ లో కూడా అతని పైన హత్య ప్రయత్నం జరిగింది. అతన్ని బయటకు తీసుకుని వెళ్లి కారు కిందకు తోయాలని ప్రయత్నించారు” అని చెప్పాడు ఆయన.
ఫోన్ పెట్టేసిన ప్రతాప్, వికాస్ తో మాట్లాడుతూ “మీ భార్య మీద హత్య ప్రయత్నం చేసిన వ్యక్తి మామిడి తోట దగ్గర దొరికాడు. అయితే అతను తీవ్రంగా గాయపడి ఉండడంతో విజయవాడ కు తీసుకొని వెళ్తున్నారు. మరో ముఖ్యమైన విషయం. మీ తమ్ముడి స్నేహితుడు సుమంత్ బైక్ యాక్సిడెంట్ జరిగి విజయవాడలో ఒక హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడు. ప్రస్తుతం అతను మాట్లాడగలుగుతున్నాడు” అని, సుమంత్ అడ్మిట్ అయిన హాస్పిటల్ పేరు చెప్పాడు.
వికాస్ వెంటనే విశాల్ కి కాల్ చేసాడు.
"అన్నయ్యా! వదినకు ఎలా ఉంది?" ఆతృతగా అడిగాడు విశాల్.
"డెలివరీ సవ్యంగా జరిగింది. మీ వదిన, బాబు క్షేమంగా ఉన్నారు" అన్నాడు వికాస్.
"మంచి గుడ్ న్యూస్ చెప్పావు అన్నయ్యా. కంగ్రాట్స్" అన్నాడు విశాల్.
"అంతకంటే మంచి గుడ్ న్యూస్ ఇంకొకటి వుంది. నీ ఫ్రెండ్ సుమంత్ ఆచూకీ దొరికింది. అతనికి యాక్సిడెంట్ జరిగి, విజయవాడలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ప్రస్తుతం కోలుకున్నాడు" అంటూ ఆ హాస్పిటల్ పేరు చెప్పాడు వికాస్.
ఆనందంతో కాసేపు నోటమాట రాలేదు విశాల్ కి.
“అన్నయ్యా! ఎంత మంచి వార్త చెప్పావు.. నేను వెంటనే సుమంత్ ని కలుస్తాను” అన్నాడు విశాల్.
“మరో వార్త. ఇక్కడ హాస్పిటల్లో మీ వదిన మీద అటాక్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తి పోలీసులకు దొరికాడు. అతడు బాగా గాయపడి ఉండటంతో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఆ వ్యక్తి నుండి ప్రమాదం తప్పినట్లే. ఇక నువ్వు సుమంత్ ని కలిస్తే, అతన్ని ఎవరు చంపాలని చూస్తున్నారో నీతో ఖచ్చితంగా చెబుతాడు” అన్నాడు వికాస్.
ఫోన్ పెట్టేసిన విశాల్ వెంటనే తన ప్రాణ మిత్రుడి కోసం విజయవాడ కు బయలుదేరాడు
***
ఎస్సై శ్రీకాంత్ నుండి ఫోన్ అందుకున్న కృష్ణాపురం గ్రామ సర్పంచి వెంటనే పాతిక మంది యువకులను తీసుకొని చలపతిరావు ఇంటికి వెళ్ళాడు.
తలుపు తీసిన చలపతిరావు తమ సర్పంచిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు.
సర్పంచి, చలపతిరావు తో మాట్లాడుతూ “మీ బావ గారి మీద దాడి చేస్తానని గోవర్ధన్ అనే వ్యక్తి ఎస్ ఐ శ్రీకాంత్ తో చాలెంజ్ చేశాడట. ఆయన ప్రొటెక్షన్ కోసం కొందరు పోలీసుల్ని ఇక్కడికి పంపిస్తున్నాడు. ఈలోగా మీ ఇంటికి కాపలా ఉంచమన్నాడు” అని చెప్పాడు.
చలపతి రావు మాట్లాడుతూ “ఇది పాత కాలం ఇల్లు కదా! అందువల్ల స్నానాల గది, ఇంటి పెరట్లో ఉంది. స్నానానికి బయటకు వచ్చినప్పుడు మా బావగారిని అటాక్ చేయడానికి, ఒకవేళ ఆ వ్యక్తి అక్కడ ఏమైనా పొంచి ఉన్నాడేమో ఒకసారి చూద్దాం” అన్నాడు.
సర్పంచి వెంటనే పది మందిని ఇంటి వెనక వైపు ప్రహరీ గోడ దూకి లోపలికి రమ్మని చెప్పాడు. తను మరొక పది మందిని తీసుకొని పెరటి తలుపు తెరిచి బయటకు వెళ్లాడు.
చలపతిరావు ఊహించినట్లే శంకర శాస్త్రి కోసం అక్కడ కాపుకాసి ఉన్న ఆ అగంతకుడు, తనను చుట్టుముట్టిన గ్రామస్థులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ నలుగురు గ్రామస్తులు అతన్ని కదలకుండా పట్టుకున్నారు. అతని చేతుల్ని వెనక్కి విరిచి తాళ్లతో బంధించారు.
తమకు డ్రైవర్ గా వచ్చింది అతనేనని గుర్తించాడు శంకరశాస్త్రి. ఇంతలో ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. తన చేతికి ఉన్న కట్లను అవలీలగా తెంచుకున్నాడు ఆ వ్యక్తి. అతని ఒంట్లో కి ఏదో అదనపు శక్తి వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
అతన్ని ఏదో దుష్టశక్తి ఆవహించినట్లు గ్రహించాడు శంకరశాస్త్రి.
ఆంజనేయ దండకం చదువుతూ ఆ వ్యక్తిని సమీపించాడు. అతను వికృతంగా నవ్వుతూ శంకరశాస్త్రి మీదికి దూకబోయాడు. ఇంతలో గ్రామస్థులు చేతికందిన కర్రలు, రాళ్లతో అతని మీదకు దాడి చేశారు. తిరిగి అతన్ని బంధించారు. ఆ దెబ్బలకు అతను అప్పటికే స్పృహ కోల్పోయాడు.
ఇంతలో ఎస్సై శ్రీకాంత్ పంపిన పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
***
తనకు వినిపించిన మాటలకు ఉలిక్కిపడ్డాడు ఎస్సై శ్రీకాంత్. తిరిగి ఏమైనా వినపడతాయేమోనని చెవులు రిక్కించాడు.
కానీ వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతమైనట్లు అనిపించింది అతనికి. ఇంతలో కరెంట్ రావడంతో హాస్పిటల్ సిబ్బంది కిటికీ తలుపులు మూసినట్లు గ్రహించాడు అతను. గాలి శబ్దం వల్లే తనకు ఆ మాటలు వినిపించినట్లు, కిటికీలు మూయగానే ఆగిపోయినట్లు భావించాడు అతను.
సరిగ్గా అప్పుడే అతనికి విజయవాడ ఏసీపీ నుండి కాల్ వచ్చింది.
“మామిడి తోటలో సీఐ కిషోర్ మీద దాడి చేసిన వ్యక్తి దొరికాడు. అతను తీవ్రంగా గాయపడి ఉండడంతో తక్షణ చికిత్స కోసం విజయవాడ కు తరలిస్తున్నారు. నువ్వు ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ కే అతన్ని తీసుకొని వస్తారు. సుమంత్ అతనిని గుర్తించగలడేమో ప్రయత్నించు” అని చెప్పాడు.
శ్రీకాంత్ వెంటనే ఆ విషయాన్ని సుమంత్ కి తెలియజేశాడు.
మరి కొంతసేపటికే కృష్ణాపురం గ్రామానికి శ్రీకాంత్ పంపిన కానిస్టేబుల్ కాల్ చేసాడు. శంకర శాస్త్రి మీద దాడికి యత్నించిన వ్యక్తిని గ్రామస్థులు బంధించినట్టు చెప్పాడు. గ్రామస్థుల దాడిలో అతను గాయపడినట్లు కూడా చెప్పాడు.
అతన్ని తను ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు శ్రీకాంత్.
తరువాత సుమంత్ తో “మీ మామ గారి మీద దాడికి ప్రయత్నించిన వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. అతన్ని కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నాం. అతన్ని గుర్తించడానికి ప్రయత్నించు” అని చెప్పాడు.
తన మీద దాడికి ప్రయత్నించిన అగంతకుడు పట్టుబడడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు శంకరశాస్త్రి. నిర్విఘ్నంగా మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేశాడు. తరువాత చలపతిరావు దంపతులతో కలిసి సుమంత్ ఉన్న హాస్పిటల్ కు బయలుదేరాడు.
ఇంకా వుంది…
వెంటాడే నీడ చివరి భాగం అతి త్వరలో...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
![](https://static.wixstatic.com/media/acb93b_cb7839c45fdc41ed893154361797d24b~mv2.png/v1/fill/w_125,h_94,al_c,q_85,blur_3,enc_auto/acb93b_cb7839c45fdc41ed893154361797d24b~mv2.png)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).